అధ్యాయం 1: అర్జునవిషాద యోగం
- ధృతరాష్ట్రుడు పలికెను – ఓ సంజయా! యుద్ధసన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండు పుత్రులును ఏమి చేసిరి? (1.1)
- సంజయుడు పల్కెను – ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవసైన్యమును చూచి, ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను. (1.2)
- ఓ ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడును, ద్రుపదపుత్రుడును అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. (1.3)
- ఈ సేనలో ధనుర్ధారులైన గొప్పయోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథియైన ద్రుపదమహారాజు భీమార్జునసమానులు. ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు (భీమార్జునసమానులు). పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపదియొక్క ఐదుగురు పుత్రులును కలరు. వీరందరును మహారథులు. (శౌర్యమున భీమార్జునసమానులు). (1.4-6)
- ఓ బ్రాహ్మణోత్తమా! మన పక్షముననున్న ప్రధానయోధులను గూడ గమనింపుడు. మీ యెఱుకకై మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను. (1.7)
- మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. ఇంకను పెక్కుమంది శూరులును, వీరులును మన సైన్యమునందు కలరు. వీరందరును యుద్ధవిశారదులు. నానాశస్త్రాస్త్రధారులు. నాకొరకు తమ ప్రాణముల నొడ్డియైనను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నవారు. (1.8-9)
- భీష్మపితామహునిచే సురక్షితమై, అపరిమితముగానున్న మనసైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. (1.10)
- కనుక మీరందరును మీమీ స్థానములలో సుస్థిరముగా నిలిచి, అన్నివైపులనుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండుడు. (1.11)
- కురువృద్ధుడును, ప్రతాపశాలియును ఐన భీష్మ పితామహుడు (దుర్యోధనుని ఈ మాటలు విని) అతనిని సంతోషపఱచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమొనర్చి, తన శంఖమును పూరించెను. (1.12)
- మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. (1.13)
- తదనంతరము శ్వేతాశ్వములను పూన్చిన మహారథముపై ఆసీనులైయున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి. (1.14)
- శ్రీకృష్ణుడు ‘పాంచజన్యము’ ను, అర్జునుడు ‘దేవదత్త(శంఖ)ము’ ను పూరించిరి. అరివీరభయంకరుడైన భీముడు “పౌండ్రము” అను మహాశంఖమును పూరించెను. కుంతీపుత్రుడును, రాజును ఐన యుధిష్ఠిరుడు ‘అనంతవిజయము’ అను శంఖమును, నకులసహదేవులు ‘సుఘోష’ ‘మణిపుష్పకము’లను శంఖములను పూరించిరి. ఓ రాజా! మహాధనుర్ధారియైన కాశీరాజు, మహారథుడైన “శిఖండి”యు, ధృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన ‘సాత్యకి’యు, (తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి.) ద్రౌపదియొక్క ఐదుగురు పుత్రులును, భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. (1.15-18)
- పాండవపక్షమహాయోధుల శంఖనినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలములయ్యెను. (1.19)
- (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులైయున్న ధార్తరాష్ట్రులను చూచి, కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి (శ్రీకృష్ణునితో ఈ క్రిందివిధముగాననెను). (1.20)
- ఓ ధృతరాష్ట్రా! అర్జునుడు శ్రీకృష్ణునితో“ఓ అచ్యుత! నా రథమును ఉభయసేనలమధ్య నిలుపుము.” అని పలికెను. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరిని బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసియున్నదో గమనించునంత వరకును రథమును నిలిపియుంచుము. (1.21-22)
- “దుర్బుద్ధియైన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చియున్న రాజులను అందరిని ఒకపరి పరికించెదను.” (1.23)
- సంజయుడు పలికెను – ఓ ధృతరాష్ట్రా! అర్జునుని కోరికమేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును ఉభయసేనల మధ్య నిలిపెను. భీష్మద్రోణులకును, ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా (ఉభయసేనల మధ్య రథమును నిలిపి ) శ్రీకృష్ణుడు అర్జునునితో “పార్థా! ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరిని పరికింపుము” అని నుడివెను. (1.24-25)
- పిమ్మట పార్థుడు (అక్కడ ఉభయసేనలయందును) చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాతముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను (చూచెను). (1.26)
- (తరువాత)పిల్లనిచ్చిన మామలను (మరియు) ఉభయసేనలయందును ఉన్న ఆత్మీయులను చూచెను. సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరిని చూచి, కుంతీపుత్రుడైన అర్జునుడు (పలికెను). (1.27)
- ఓ కృష్ణా ! సమరోత్సాహముతో రణరంగమున నిలిచి యున్న ఈ స్వజన సమూహమును జూచి (పలికెను).(అర్జునుడు ఇట్లు పలికెను) నా అవయవములు శిథిలములగుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది శరీరమునందు వణుకు, గగుర్పాటు కలుగుచున్నవి. గాండీవము చేతినుండి జారిపోవుచున్నది. చర్మము తపించిపోవుచున్నది. మనస్సు భ్రమకు గురియైనట్లు అనిపించుచున్నది. కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను. (1.28-30)
- ఓ కేశవా! పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజనసమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. (1.31)
- ఓ కృష్ణా! నాకు విజయము గాని, రాజ్యము గాని, సుఖములు గాని అక్కరయే లేదు. గోవిందా! ఈ రాజ్యము వలనగాని, ఈ భోగములవలన గాని, ఈ జీవితమువలన గాని ప్రయోజనమేమి? (1.32)
- మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను సుఖములను కోరుకొనుచున్నామో, వారే ధనప్రాణములయెడ ఆశలు వదలుకొని యుద్ధమునకు సన్నద్ధులై వచ్చియున్నారు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు మనుమలు, మేనమామలు, మామలు, బావమఱదులు, ఇతర బంధువులు మొదలగువారు అందరును ఇచ్చటికి చేరియున్నారు. (1.33-34)
- ఓ మధుసూదనా! ముల్లోకాధిపత్యముకొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండలవిషయమై చెప్పనేల? అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనిననూ నేను మాత్రము వారిని చంపనే చంపను. (1.35)
- ఓ జనార్దనా! ఈ ధార్తరాష్ట్రులను చంపి, మనము బావుకొనునది ఏమి? (మనము మూట కట్టుకొనునది యేమి?) ఈ ఆతతాయులను చంపుటవలన మనకు పాపమే కలుగును. (1.36)
- కనుక ఓ మాధవా! మనబంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును? (1.37)
- లోభకారణముగ భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహమువలన సంభవించు పాపములను (చూడలేక పోచుంటిరి). ఓ జనార్దనా! కులనాశనమువలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏల ఆలోచింపరాదు? (1.38-39)
- కులక్షయమువలన సనాతనములైన కులధర్మము లన్నియును నశించును. ధర్మము అంతరించి పోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. ఓ కృష్ణా! అధర్మము (పాపము) పెచ్చుపెరిగి పోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితలగుదురు. ఓ వార్ష్ణేయా! స్త్రీలు దూషితలు ఐనచో వర్ణసాంకర్యము ఏర్పడును. వర్ణసాంకర్యము కులఘాతకులను, కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు (శ్రాద్ధతర్పణములు) లోపించినందువలన వారి పితరులును అధోగతి పాలయ్యెదరు. (1.40-42)
- వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషములవలన కులఘాతకులయొక్క సనాతన కులధర్మములు, జాతిధర్మములు నష్టమగును. ఓ జనార్దనా! కులధర్మములు నశించినవారికి నిరవధికముగా (కలకాలము) నరకప్రాప్తి తప్పదని ప్రతీతి. (1.43-44)
- అయ్యో! మనము బుద్ధిమంతులమై యుండియు రాజ్యసుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోరపాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము – ఇది యెంత దారుణము? (1.45)
- శస్త్రరహితుడనై, ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను, అది నాకు మిక్కిలి క్షేమకరమే యగును. (1.46)
- సంజయుడు పలికెను – అర్జునుడు ఈ విధముగా పలికి శోకసంవిగ్న మానసుడై, యుద్ధభూమియందు ధనుర్బాణములను త్యజించి, రథము వెనుకభాగమున చతికిలబడెను. (1.47)
అధ్యాయం 2: సాంఖ్య యోగం
- సంజయుడు పలికెను: ఆ విధంగా అత్యంత జాలితో నిండినవాడై, దుఃఖంతో కన్నీళ్లు కారుస్తున్న కళ్ళతో విషాదంలో మునిగి ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఈ మాటలు అన్నాడు. (2.1)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ అర్జునా ! క్లిష్టమైన ఈ సమయంలో నీకు ఈ మోహం ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆర్య లక్షణం కాదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా, అపకీర్తి పాలుజేస్తుంది. (2.2)
- ఓ అర్జునా! ఈ యొక్క పిరికితనమునకు లోనుకావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము. (2.3)
- అర్జునుడు పలికెను: ఓ మధుసూదనా! పూజింపదగిన భీష్ముడిని, ద్రోణాచార్యుడిని నేను రణరంగంలో బాణాలతో ఎలా ఎదిరించగలను? ఓ శత్రు సంహారకా! వారు నాకు అత్యంత గౌరవనీయులు కదా! (2.4)
- మహానుభావులైన గురువులను చంపి, రక్తం చిందిన ఈ లోక భోగాలను అనుభవించడం కంటే, ఈ లోకంలో భిక్షం ఎత్తుకుని జీవించడం మేలు అనిపిస్తోంది. (2.5)
- మనకు విజయం లభిస్తుందో లేక వారే మనల్ని జయిస్తారో… ఏది శ్రేయస్కరమో మనకు తెలియదు. వారిని సంహరించిన తరువాత కూడా, మనకు జీవించాలని అనిపించదు. అయినా, వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి, మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. (2.6)
- నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము. (2.7)
- నా ఇంద్రియములను శుష్కింప చేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా, ఈ శోకమును తొలగించుకోలేను. (2.8)
- సంజయుడు పలికెను: శత్రువులను పీడించే గుడాకేశుడైన అర్జునుడు శ్రీకృష్ణుడితో ‘నేను యుద్ధం చేయను’ అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. (2.9)
- ఓ ధృతరాష్ట్రా! అప్పుడు రెండు సైన్యాల మధ్య విషాదంలో ఉన్న అర్జునుడిని చూసి, శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఈ మాటలు అన్నాడు. (2.10)
- శ్రీకృష్ణభగవానుడు పలికెను: అర్జునా! శోకించకూడని వారి కోసం నువ్వు శోకిస్తున్నావు, పైగా పండితుడిలా మాటలు మాట్లాడుతున్నావు. జ్ఞానులైన వారు ప్రాణాలు పోయిన వారి గురించి కానీ, ప్రాణాలు ఉన్న వారి గురించి కానీ దుఃఖించరు. (2.11)
- నేను గానీ, నువ్వు గానీ, ఇక్కడ ఉన్న రాజులు గానీ గతంలో లేని కాలం లేదు. అలాగే భవిష్యత్తులో మనం ఉండబోని కాలం కూడా ఉండదు. (2.12)
- దేహధారికి (జీవుడికి) ఈ దేహంలో బాల్యం, యౌవనం, ముసలితనం ఎలా వస్తాయో… మరణం తర్వాత మరో దేహాన్ని పొందడం కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ధీరత్వం ఉన్నవారు దీనిని చూసి మోహానికి లోనవరు. (2.13)
- ఓ కుంతీ పుత్రా! శీతోష్ణాలు (చలి-వేడి), సుఖదుఃఖాలు అనేవి ఇంద్రియాలు విషయాలతో కలవడం వల్ల కలుగుతాయి. అవి వచ్చిపోయేవి, అనిత్యమైనవి. ఓ భారత! వాటిని ఓర్పుతో సహించడం నేర్చుకో. (2.14)
- ఓ పురుష శ్రేష్ఠా! సుఖదుఃఖాలను సమానంగా భావించే ఏ ధీరుడైతే వీటివల్ల చలించడో, అట్టివాడే అమరత్వానికి (మోక్షానికి) అర్హుడు అవుతాడు. (2.15)
- అసత్తు (ఉనికి లేనిది/నశించేది) అయిన దానికి ఉనికి లేదు. సత్తు (శాశ్వతమైనది) అయిన దానికి వినాశనం లేదు. ఈ రెండింటి మధ్య గల భేదాన్ని తత్త్వదర్శులు (జ్ఞానులు) దర్శించారు. (2.16)
- ఈ జగమంతా దేని చేత వ్యాపించబడి ఉందో, అది వినాశనం లేనిదని తెలుసుకో. నాశనం లేని ఆ ఆత్మను ఎవరూ ధ్వంసం చేయలేరు. (2.17)
- ఈ భౌతిక దేహాలు నశించేవి. కానీ వీటిలో ఉండే ఆత్మ నిత్యమైనది, నాశనం లేనిది మరియు ప్రమాణాలకు అందనిది. కాబట్టి ఓ భారత! యుద్ధం చేయి. (2.18)
- ఆత్మ చంపుతుందని అనుకునేవాడు, ఆత్మ చంపబడుతుందని భావించేవాడు – వీరిద్దరికీ ఆత్మ గురించి తెలియదు. ఎందుకంటే ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేత చంపబడదు. (2.19)
- ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. అది ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకపోవడం, లేదా భవిష్యత్తులో పుట్టడం అనేది ఉండదు. అది పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరం చంపబడినప్పటికీ ఆత్మ చంపబడదు. (2.20)
- ఓ పార్థా! ఆత్మ వినాశనం లేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, మార్పు లేనిదని తెలుసుకున్న జ్ఞాని ఎవరిని చంపుతాడు? ఎవరిని చంపమని ప్రేరేపిస్తాడు? (2.21)
- మనిషి పాతబడిన వస్త్రాలను వదిలివేసి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తాడో, ఆత్మ కూడా పాతబడిన శరీరాలను వదిలివేసి కొత్త శరీరాలను ధరిస్తుంది. (2.22)
- ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు. (2.23)
- ఈ ఆత్మ ఛేదించబడనిది, దహించబడనిది, తడుపబడనిది మరియు ఆరనిది. ఇది నిత్యమైనది, అంతటా వ్యాపించి ఉన్నది, స్థిరమైనది, చలించనిది మరియు సనాతనమైనది. (2.24)
- ఈ ఆత్మ ఇంద్రియాలకు గోచరం కానిది, మనస్సుకు అందనిది మరియు ఎటువంటి మార్పులకు లోనుకాదు. దీనిని ఈ విధంగా తెలుసుకున్న తర్వాత నువ్వు శోకించడం తగదు. (2.25)
- ఒకవేళ నువ్వు ఆత్మ నిరంతరం పుడుతూ ఉంటుందని, మరణిస్తూ ఉంటుందని భావించినా సరే, ఓ మహాబాహో! నువ్వు ఈ విధంగా దుఃఖించవలసిన అవసరం లేదు. (2.26)
- పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు, మరణించినవాడు మరల పుట్టక తప్పదు. కాబట్టి అనివార్యమైన ఈ విషయం గురించి నువ్వు శోకించవద్దు. (2.27)
- ప్రాణులన్నీ పుట్టక ముందు కంటికి కనిపించవు, మరణించిన తర్వాత కూడా కనిపించవు. కేవలం మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తాయి. ఓ భారత! అటువంటప్పుడు దుఃఖం దేనికి? (2.28)
- ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు, మరొకడు ఆశ్చర్యంగా దీని గురించి చెబుతాడు, వేరొకడు దీని గురించి ఆశ్చర్యంగా వింటాడు. విన్నప్పటికీ దీనిని ఎవరూ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. (2.29)
- ఓ భారత! అందరి శరీరాలలో ఉన్న ఈ ఆత్మ ఎన్నటికీ చంపబడదు. కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నువ్వు దుఃఖించవలసిన పని లేదు. (2.30)
- నీ స్వధర్మాన్ని ఆలోచించినా సరే, నువ్వు భయపడటం లేదా చలించడం తగదు. ఎందుకంటే, ధర్మం కోసం చేసే యుద్ధం కంటే మించిన శ్రేయస్సు క్షత్రియుడికి మరొకటి లేదు. (2.31)
- ఓ పార్థా! అప్రయత్నంగా లభించినది, తెరచి ఉన్న స్వర్గద్వారం వంటిది అయిన ఇటువంటి యుద్ధం లభించడం అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే సాధ్యమవుతుంది. (2.32)
- ఒకవేళ నువ్వు ధర్మబద్ధమైన ఈ యుద్ధాన్ని చేయకపోతే, నీ స్వధర్మాన్ని మరియు కీర్తిని కోల్పోవడమే కాకుండా పాపాన్ని కూడా మూటగట్టుకుంటావు. (2.33)
- లోకంలోని వారందరూ నీ అపకీర్తిని శాశ్వతంగా చెప్పుకుంటారు. గౌరవప్రదంగా బతికే మనిషికి అపకీర్తి అనేది మరణం కంటే భయంకరమైనది. (2.34)
- ఇప్పటివరకు నిన్ను గొప్పగా గౌరవించిన మహారథులు, నువ్వు భయపడి యుద్ధం నుండి తప్పుకున్నావని భావిస్తారు. దానివల్ల నీవు వారి దృష్టిలో అత్యంత అల్పుడవైపోతావు. (2.35)
- నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ, అనరాని మాటలు ఎన్నో అంటారు. అంతకంటే మించిన దుఃఖం మరొకటి ఏముంటుంది? (2.36)
- అర్జునా! యుద్ధంలో చనిపోతే స్వర్గాన్ని పొందుతావు, గెలిస్తే భూమండలాన్ని పరిపాలిస్తావు. కాబట్టి యుద్ధం చేయాలనే నిశ్చయంతో నిలబడు. (2.37)
- సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాజయాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధపడు. ఇలా చేయడం వల్ల నీకు ఎటువంటి పాపం అంటదు. (2.38)
- పార్థా! ఇప్పటివరకు నీకు ‘సాంఖ్య యోగం’ (ఆత్మ జ్ఞానం) గురించి వివరించాను. ఇప్పుడు ‘కర్మ యోగం’ గురించి విను. ఈ బుద్ధితో (జ్ఞానంతో) కర్మ చేస్తే నువ్వు కర్మ బంధనాల నుండి విముక్తుడవుతావు. (2.39)
- ఈ కర్మ యోగ మార్గంలో ప్రయత్నం వృథా కాదు (ప్రారంభించినది మధ్యలో ఆగినా నష్టం ఉండదు), దీనివల్ల ఎటువంటి దోషం కలగదు. ఈ ధర్మాన్ని కొంచెం పాటించినా అది మనిషిని గొప్ప భయం (జన్మ మృత్యు భయం) నుండి రక్షిస్తుంది. (2.40)
- ఓ కురునందనా! ఈ మార్గంలో నిశ్చయంతో కూడిన బుద్ధి ఒక్కటే ఉంటుంది. కానీ నిలకడలేని వారి బుద్ధులు అనేక శాఖలుగా విడిపోయి అనంతంగా ఉంటాయి. (2.41)
- వివేకం లేని వారు, వేదాలలోని కర్మకాండల మీద మాత్రమే ఆసక్తి చూపే వారు, స్వర్గమే పరమావధి అని నమ్మేవారు ఆకర్షణీయమైన మాటలు మాట్లాడుతుంటారు. వారు భోగైశ్వర్యాల కోసమే రకరకాల కర్మలను చేస్తూ, పునర్జన్మకు కారణమవుతుంటారు. భోగాల మీద, ఐశ్వర్యం మీద అమితమైన ఆసక్తి ఉండి, అట్టి ఆకర్షణీయమైన మాటలకు లోనైన వారి మనస్సులో నిశ్చయాత్మకమైన బుద్ధి (పరమాత్మ మీద ఏకాగ్రత) కలగదు. (2.42-44)
- వేదాలు మూడు గుణాల గురించి వివరిస్తాయి. అర్జునా! నువ్వు ఆ మూడు గుణాలకు అతీతుడవు కావాలి. సుఖదుఃఖాలనే ద్వంద్వాలకు దూరంగా ఉండు. యోగక్షేమాల చింత వదిలి, ఎల్లప్పుడూ ఆత్మనిష్ఠుడవై ఉండు. (2.45)
- అంతటా నీరు నిండి ఉన్నప్పుడు ఒక చిన్న బావి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో, పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకున్న జ్ఞానికి అన్ని వేదాల వల్ల కలిగే ప్రయోజనం కూడా అంతే ఉంటుంది (అంటే జ్ఞాని వేదాల పరిధిని మించిపోతాడు). (2.46)
- నీ అధికారం కేవలం కర్మ చేయడానికే పరిమితం, దాని ఫలితాల మీద ఎప్పుడూ నీకు అధికారం లేదు. నీవే కర్మ ఫలములకు కారణం అని ఎప్పుడూ అనుకోకు, అలాగని కర్మలు చేయకుండా ఉండటం మీద కూడా నీకు ఆసక్తి కలగకూడదు. (2.47)
- ఓ ధనంజయా! ఆసక్తిని వదిలిపెట్టి, జయాపజయాలను సమానంగా భావిస్తూ యోగ నిష్ఠతో కర్మలు చేయి. ఇటువంటి ‘సమత్వ భావన’నే యోగం అంటారు. (2.48)
- ఓ ధనంజయా! ఫలాపేక్షతో చేసే కర్మ కంటే, బుద్ధియోగం (నిష్కామ కర్మ) ఎంతో శ్రేష్ఠమైనది. కాబట్టి బుద్ధినే శరణు వేడు (నిష్కామ బుద్ధితో కర్మ చేయి). ఫలితాన్ని ఆశించి కర్మలు చేసేవారు దీనులు (అభాగ్యులు). (2.49)
- సమబుద్ధి కలిగినవాడు ఈ లోకంలోనే పుణ్యపాపాలు రెండింటినీ వదిలివేస్తాడు (వాటికి అతీతుడవుతాడు). కాబట్టి యోగాన్ని ఆశ్రయించు. కర్మలను నైపుణ్యంతో (బంధం అంటకుండా) చేయడమే యోగం. (2.50)
- నిష్కామ బుద్ధి కలిగిన జ్ఞానులు కర్మ వల్ల కలిగే ఫలితాన్ని వదిలివేసి, జన్మబంధాల నుండి విముక్తులై, ఎటువంటి దుఃఖం లేని పరమపదాన్ని (మోక్షాన్ని) పొందుతారు. (2.51)
- ఎప్పుడైతే నీ బుద్ధి మోహమనే మాలిన్యాన్ని దాటిపోతుందో, అప్పుడు నువ్వు ఇదివరకు విన్న వాటి గురించి, ఇకముందు వినబోయే (లౌకిక భోగాల) వాటి గురించి వైరాగ్యాన్ని పొందుతావు. (2.52)
- రకరకాల మాటల (వేదాల్లోని కర్మకాండల) వల్ల విచలితమైన నీ బుద్ధి, ఎప్పుడు పరమాత్మ యందు నిశ్చలంగా, స్థిరంగా నిలుస్తుందో, అప్పుడు నువ్వు యోగాన్ని (పరమాత్మతో అనుసంధానాన్ని) పొందుతావు. (2.53)
- అర్జునుడు పలికెను: ఓ కేశవా! సమాధి స్థితిలో ఉన్న స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి? స్థిరమైన బుద్ధి కలవాడు ఎలా మాట్లాడతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు? (2.54)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ పార్థా! మనస్సులోని కోరికలన్నింటినీ వదిలివేసి, తనలో తాను (ఆత్మలోనే) తృప్తిని పొందేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. (2.55)
- దుఃఖం కలిగినప్పుడు కలత చెందని మనస్సు, సుఖం కలిగినప్పుడు స్పృహ (అమితమైన ఆశ) లేని మనస్సు కలిగి ఉండి.. రాగం (అనురాగం), భయం, క్రోధం (కోపం) వదిలేసిన మునిని స్థితప్రజ్ఞుడు అంటారు. (2.56)
- దేని మీదైనా సరే మితిమీరిన మమకారం లేకుండా, శుభం కలిగినప్పుడు పొంగిపోకుండా, అశుభం కలిగినప్పుడు ద్వేషించకుండా ఉండేవాని బుద్ధి స్థిరమైనది. (2.57)
- తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా, ఎవడైతే తన ఇంద్రియాలను విషయాల (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల) నుండి పూర్తిగా మళ్ళించగలడో, అతని బుద్ధి స్థిరమైనది. (2.58)
- ఇంద్రియాలకు ఆహారాన్ని (విషయాలను) అందించని మనిషికి విషయ వాంఛలు తగ్గుతాయి కానీ, వాటిపై ఉన్న రుచి (ఆసక్తి) అలాగే ఉంటుంది. కానీ పరమాత్మను దర్శించిన జ్ఞానికి ఆ సూక్ష్మమైన ఆసక్తి కూడా నశిస్తుంది. (2.59)
- ఓ కౌంతేయా! ఇంద్రియాలు చాలా బలమైనవి. అవి వివేకవంతుడైన మనిషి మనస్సును కూడా బలాత్కారంగా విషయాల వైపుకు లాక్కెళ్తాయి. (2.60)
- ఆ ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుకుని, నన్నే పరమావధిగా నమ్మి (మత్పరః), యోగనిష్ఠతో ఉండాలి. ఎవని ఇంద్రియాలు తన స్వాధీనంలో ఉంటాయో, అతని బుద్ధి స్థిరమైనది. (2.61)
- విషయ వాంఛల గురించి అతిగా ఆలోచించే మనిషికి వాటిపై ఆసక్తి (సంగము) పుడుతుంది. ఆ ఆసక్తి నుండి కోరిక (కామము) పుడుతుంది. ఆ కోరిక తీరనప్పుడు కోపం (క్రోధము) కలుగుతుంది. కోపం వల్ల అవివేకం (సమ్మోహం) కలుగుతుంది. ఆ అవివేకం వల్ల జ్ఞాపకశక్తి నశిస్తుంది (స్మృతి విభ్రమము). జ్ఞాపకశక్తి నశించడం వల్ల బుద్ధి (విచక్షణ) నశిస్తుంది. బుద్ధి నశించిన మనిషి పూర్తిగా పతనమైపోతాడు. (2.62-63)
- కానీ, తన మనస్సును అదుపులో ఉంచుకున్న సాధకుడు, రాగద్వేషాల నుండి విముక్తులైన ఇంద్రియాలతో విషయాలను అనుభవిస్తున్నప్పటికీ పరమ శాంతిని (ప్రసాదాన్ని) పొందుతాడు. (2.64)
- అట్టి నిర్మలమైన స్థితి లభించినప్పుడు మనిషికి గల సమస్త దుఃఖాలు నశిస్తాయి. ప్రశాంతమైన చిత్తం కలవాని బుద్ధి త్వరగా పరమాత్మ యందు స్థిరపడుతుంది. (2.65)
- యోగనిష్ఠ (ఏకాగ్రత) లేనివానికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. బుద్ధి లేనివానికి భావన (ధ్యానించే గుణం) ఉండదు. అటువంటి భావన లేనివానికి శాంతి ఉండదు. శాంతి లేనివానికి సుఖం ఎక్కడి నుండి వస్తుంది? (2.66)
- గాలి నీటిలో ఉన్న పడవను దారి మళ్ళించినట్లుగా, విషయాలలో తిరుగుతున్న ఇంద్రియాల వెంట మనస్సు పరిగెడితే, అది మనిషి యొక్క బుద్ధిని హరించివేస్తుంది. (2.67)
- కాబట్టి ఓ మహాబాహో! ఎవరి ఇంద్రియాలైతే విషయ వాంఛల నుండి అన్ని వైపులా మళ్ళించబడి నిగ్రహించబడతాయో, అతని బుద్ధి స్థిరమైనది. (2.68)
- ప్రాణులన్నింటికీ ఏది రాత్రియో (ఆత్మజ్ఞానం), దాని యందు సంయమి (యోగి) మేల్కొని ఉంటాడు. ఏ కాలంలో ప్రాణులన్నీ మేల్కొని ఉంటాయో (ప్రాపంచిక సుఖాలు), అది సత్యాన్ని చూసే మునికి రాత్రి వంటిది. (2.69)
- నదులన్నీ వచ్చి చేరుతున్నప్పటికీ సముద్రం ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో, అలాగే కోరికలన్నీ తనలోకి ప్రవేశించినప్పటికీ ఎవడైతే చలించకుండా నిశ్చలంగా ఉంటాడో, అతడే శాంతిని పొందుతాడు. కోరికల వెంట పడేవాడు శాంతిని పొందలేడు. (2.70)
- సమస్త కోరికలను వదిలివేసి, మమకారం, అహంకారం లేకుండా, ఏ ఆశా లేకుండా తిరిగే మనిషి పరమ శాంతిని పొందుతాడు. (2.71)
- ఓ పార్థా! దీనినే ‘బ్రాహ్మీ స్థితి’ (బ్రహ్మమును పొందిన స్థితి) అంటారు. దీనిని పొందినవాడు ఎన్నటికీ మోహంలో పడడు. జీవిత చరమకాలంలోనైనా ఈ స్థితిలో స్థిరపడితే, అతడు బ్రహ్మ నిర్వాణాన్ని (మోక్షాన్ని) పొందుతాడు. (2.72)
అధ్యాయం 3: కర్మ యోగం
- అర్జునుడు పలికెను: ఓ జనార్దనా! కర్మ కంటే జ్ఞానమే శ్రేష్ఠమని నీ అభిప్రాయమైతే, మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధ కర్మలో ఎందుకు ప్రేరేపిస్తున్నావు కేశవా? (3.1)
- నీవు చెప్పే పరస్పర విరుద్ధమైన మాటల వల్ల (ఒకసారి జ్ఞానం, ఒకసారి కర్మ) నా బుద్ధి భ్రమకు లోనవుతోంది. కాబట్టి నేను శ్రేయస్సు పొందేందుకు నిశ్చయమైన ఒకే ఒక మార్గాన్ని నాకు చెప్పు. (3.2)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ నిష్పాపుడవైన అర్జునా! ఈ లోకంలో రెండు రకాల మార్గాలు ఉన్నాయని నేను ముందే చెప్పాను. ఒకటి సాంఖ్యులకు (జ్ఞానులకు) ‘జ్ఞాన యోగం’, రెండవది యోగులకు ‘కర్మ యోగం’. (3.3)
- కర్మలను ప్రారంభించకుండా ఉండటం వల్ల మాత్రమే ఎవరికీ నిష్కర్మ స్థితి (మోక్షం) లభించదు. అలాగే కేవలం కర్మలను వదిలివేసినంత మాత్రాన (సన్న్యాసం వల్ల) సిద్ధి లభించదు. (3.4)
- ఏ ఒక్కడూ కూడా ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ఎందుకంటే ప్రకృతి సిద్ధమైన మూడు గుణాల చేత ప్రతి ఒక్కడూ ఏదో ఒక కర్మ చేసేలా ప్రేరేపించబడతాడు. (3.5)
- కర్మేంద్రియాలను (చేతులు, కాళ్ళు మొదలైనవి) అదుపులో ఉంచుకుని, మనస్సులో మాత్రం విషయ సుఖాలను స్మరించేవాడు మూఢాత్ముడు. వాడు ‘మిథ్యాచారుడు’ (కపట వేషధారి) అని పిలవబడతాడు. (3.6)
- ఓ అర్జునా! ఎవరైతే తన మనస్సుతో ఇంద్రియాలను నియంత్రించి, ఫలాపేక్ష లేకుండా కర్మేంద్రియాల ద్వారా కర్మ యోగాన్ని ఆచరిస్తారో, వారే శ్రేష్ఠులు. (3.7)
- నీవు శాస్త్ర సమ్మతమైన కర్మలను చేయి. కర్మ చేయకుండా ఉండటం కంటే కర్మ చేయడమే మేలు. కర్మ చేయకపోతే నీ శరీర నిర్వహణ కూడా సాగదు. (3.8)
- యజ్ఞం (భగవత్ ప్రీతి) కోసం చేసే కర్మ తప్ప, మిగిలిన కర్మలన్నీ మనిషిని బంధిస్తాయి. కాబట్టి ఓ కౌంతేయా! ఆసక్తిని వదిలి భగవంతుని కోసమే కర్మలను ఆచరించు. (3.9)
- సృష్టి ఆదిలో ప్రజాపతి (బ్రహ్మ) యజ్ఞంతో పాటు ప్రజలను సృష్టించి ఇలా అన్నాడు: ‘ఈ యజ్ఞం ద్వారా మీరు అభివృద్ధి చెందండి. ఇది మీకు కోరిన కోర్కెలను తీర్చే కామధేనువు అవుతుంది’. (3.10)
- ఈ యజ్ఞం ద్వారా మీరు దేవతలను తృప్తి పరచండి, ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇలా ఒకరినొకరు ఆదరించుకోవడం వల్ల మీరు పరమ శ్రేయస్సును పొందుతారు. (3.11)
- యజ్ఞం చేత తృప్తి చెందిన దేవతలు మీకు కావలసిన భోగాలను ఇస్తారు. వారు ఇచ్చిన వాటిని వారికి (యజ్ఞ రూపంలో) తిరిగి ఇవ్వకుండా అనుభవించేవాడు దొంగతో సమానం. (3.12)
- యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన దానిని భుజించే సత్పురుషులు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు. కానీ ఎవరైతే కేవలం తమ కోసమే వండుకుని తింటారో, వారు పాపాన్నే భుజిస్తున్నారు. (3.13)
- ఆహారం వల్ల ప్రాణులు పుడుతున్నాయి, వర్షం వల్ల ఆహారం లభిస్తుంది, యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది, అట్టి యజ్ఞం కర్మ వల్ల సాధ్యమవుతుంది. కర్మ వేదం నుండి పుట్టిందని, వేదం పరమాత్మ (అక్షర పురుషుని) నుండి పుట్టిందని తెలుసుకో. కాబట్టి సర్వగతమైన ఆ పరమాత్మ నిరంతరం యజ్ఞం నందే ప్రతిష్ఠితమై ఉన్నాడు. (3.14-15)
- ఓ పార్థా! ఈ విధంగా ప్రకృతిలో ప్రవర్తింపజేయబడిన ఈ కర్మ చక్రాన్ని (యజ్ఞ చక్రాన్ని) అనుసరించనివాడు, ఇంద్రియ సుఖాల యందే ఆసక్తి కలిగినవాడు, పాపభూయిష్టమైన జీవితాన్ని గడుపుతున్నవాడు అవుతాడు. అటువంటి వాని జన్మ వ్యర్థం. (3.16)
- అయితే, ఎవడైతే కేవలం ఆత్మ యందే ప్రీతి కలిగి ఉంటాడో, ఆత్మ జ్ఞానంతోనే తృప్తి చెందుతాడో, తనలో తానే సంతృప్తిని పొందుతాడో… అటువంటి మనిషికి ఇక చేయవలసిన కర్తవ్యమేదీ ఉండదు (అతడు కర్మలకు అతీతుడు). (3.17)
- అటువంటి మహాత్ముడికి ఈ లోకంలో కర్మ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం గానీ, కర్మ చేయకపోవడం వల్ల వచ్చే నష్టం గానీ ఏమీ ఉండదు. అతడు తన అవసరాల కోసం ఏ ప్రాణి మీద కూడా ఆధారపడడు. (3.18)
- కాబట్టి, నీవు ఆసక్తిని వదిలి నిరంతరం చేయవలసిన కర్మలను ఆచరించు. ఎందుకంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసే మనిషి పరమాత్మను పొందుతాడు. (3.19)
- జనక మహారాజు వంటి వారు కూడా నిష్కామ కర్మల ద్వారానే పరమ సిద్ధిని పొందారు. కనీసం లోక కల్యాణం (లోక సంగ్రహం) కోసమైనా సరే నీవు కర్మలు చేయాలి. (3.20)
- ఉత్తముడైన వాడు (పెద్దలు/నాయకులు) దేనిని ఆచరిస్తాడో, మిగిలిన సామాన్య జనం కూడా దాన్నే అనుసరిస్తారు. అతను దేనిని ప్రమాణంగా (ఆదర్శంగా) చూపిస్తాడో, లోకమంతా దాన్నే పాటిస్తుంది. (3.21)
- ఓ పార్థా! మూడు లోకాల్లో నేను చేయవలసిన పని అంటూ ఏదీ లేదు. నాకు లభించనిది గానీ, నేను పొందవలసినది గానీ ఏదీ లేదు. అయినప్పటికీ నేను నిరంతరం కర్మలు చేస్తూనే ఉన్నాను. (3.22)
- ఒకవేళ నేను అలసత్వం లేకుండా కర్మలు చేయకపోతే, మనుష్యులందరూ అన్ని విధాలా నా మార్గాన్నే అనుసరిస్తారు (అంటే వారు కూడా కర్మలు చేయడం మానేస్తారు). (3.23)
- నేను కర్మలు చేయకపోతే ఈ లోకాలన్నీ నశించిపోతాయి. నేను వర్ణసంకరానికి కారకుడినవుతాను మరియు ఈ ప్రజలందరి నాశనానికి నేనే బాధ్యుడినవుతాను. (3.24)
- ఓ భారత! అజ్ఞానులు కర్మల యందు ఆసక్తితో (ఫలాపేక్షతో) ఎలా చేస్తారో, జ్ఞాని అయినవాడు ఆసక్తి లేకుండా లోకకల్యాణం కోసం అలాగే కర్మలు చేయాలి. (3.25)
- కర్మల యందు ఆసక్తి ఉన్న అజ్ఞానుల బుద్ధిని జ్ఞాని అయినవాడు గందరగోళ పరచకూడదు (కర్మలు మానేయమని చెప్పకూడదు). బదులుగా, తానూ యోగయుక్తుడై కర్మలు చేస్తూ, వారిని కూడా కర్మల యందు నిమగ్నం చేయాలి. (3.26)
- అన్ని కర్మలు ప్రకృతి సిద్ధమైన గుణాల చేతనే చేయబడుతున్నాయి. కానీ అహంకారంతో మునిగిపోయిన మూర్ఖుడు ‘నేనే చేస్తున్నాను’ అని భ్రమపడతాడు. (3.27)
- ఓ మహాబాహో! గుణాల విభజనను, కర్మల విభజనను తెలిసిన తత్త్వజ్ఞాని… ‘గుణాలు (ఇంద్రియాలు) గుణాల (విషయాల) యందే ప్రవర్తిస్తున్నాయి’ అని తెలుసుకుని, వాటి యందు ఆసక్తి పెంచుకోడు. (3.28)
- ప్రకృతి గుణాల వల్ల మోహానికి గురైన వారు ఆ గుణాలలో, కర్మలలో మునిగిపోతారు. అటువంటి అల్పజ్ఞానులను పూర్ణజ్ఞాని అయినవాడు విడనాడకూడదు లేదా కలత పెట్టకూడదు. (3.29)
- కాబట్టి నీవు ఆధ్యాత్మిక బుద్ధితో సమస్త కర్మలను నాకే అర్పించి, ఎటువంటి ఆశలు లేకుండా, మమకారం లేకుండా, మనోవ్యాధిని వదిలి యుద్ధం చేయి. (3.30)
- ఎవరైతే అసూయ లేకుండా, పూర్తి శ్రద్ధతో నా యొక్క ఈ సిద్ధాంతాన్ని (నిష్కామ కర్మను) అనుసరిస్తారో, వారు కూడా కర్మ బంధనాల నుండి విముక్తులవుతారు. (3.31)
- కానీ, నా సిద్ధాంతం పట్ల అసూయ కలిగి, దీనిని అనుసరించని వారు సమస్త జ్ఞానం లేని మూర్ఖులని, వినాశనానికి చేరువైన అజ్ఞానులని తెలుసుకో. (3.32)
- జ్ఞాని సైతం తన ప్రకృతికి (పూర్వ సంస్కారాలకు) అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. ప్రాణులన్నీ తమ స్వభావాన్నే అనుసరిస్తాయి. అటువంటప్పుడు బలవంతంగా నిగ్రహించడం వల్ల ఏమి ప్రయోజనం? (3.33)
- ప్రతి ఇంద్రియానికి దాని విషయాల పట్ల (శబ్ద, స్పర్శాదులు) రాగద్వేషాలు (ఇష్టాఇష్టాలు) సహజంగానే ఉంటాయి. మనిషి ఆ రెండింటికీ వశుడు కాకూడదు. ఎందుకంటే అవి మోక్ష మార్గంలో వెళ్ళేవాడికి శత్రువులు. (3.34)
- చక్కగా ఆచరించిన పరధర్మం కంటే, గుణము లేకపోయినా తన స్వధర్మాన్ని ఆచరించడమే శ్రేయస్కరం. స్వధర్మాన్ని ఆచరిస్తూ మరణించినా మేలే కానీ, పరధర్మం భయంకరమైనది. (3.35)
- అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! మరి మనిషి తనకి ఇష్టం లేకపోయినా, ఎవరో బలవంతంగా ప్రేరేపించినట్లుగా ఎందుకు పాప కర్మలు చేస్తున్నాడు? (3.36)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ అర్జునా! రజోగుణం నుండి పుట్టిన ఈ ‘కామమే’ (కోరిక) దానికి కారణం. అది తీరనప్పుడు ‘క్రోధంగా’ (కోపం) మారుతుంది. ఇది ఎంత తిన్నా తృప్తి చెందనిది (మహాశనః), మహా పాపానికి ప్రేరేపించేది. దీనినే నీవు శత్రువుగా గుర్తించు. (3.37)
- పొగ చేత అగ్ని, మురికి చేత అద్దం, మావి (గర్భసంచి) చేత పిండం ఏ విధంగా కప్పబడి ఉంటాయో, అలాగే ఈ కోరిక చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది. (3.38)
- ఓ కౌంతేయా! జ్ఞానులకు నిత్య శత్రువు, ఎన్నటికీ తృప్తి చెందని అగ్ని వంటి ఈ కామం (కోరిక) చేత మనిషి యొక్క వివేకం కప్పబడి ఉంది. (3.39)
- ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి – ఇవే ఈ కామానికి నివాస స్థానాలు. వీటి ద్వారానే అది జ్ఞానాన్ని కప్పివేసి జీవుడిని మోహింపజేస్తుంది. (3.40)
- కాబట్టి ఓ భరతశ్రేష్ఠా! నీవు మొదట ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, జ్ఞాన విజ్ఞానాలను నశింపజేసే ఈ పాపాత్ముడైన ‘కామాన్ని’ సంహరించు. (3.41)
- శరీరము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, ఆ బుద్ధి కంటే గొప్పది ఆత్మ (పరమాత్మ). (3.42)
- ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ పరమైనదని తెలుసుకుని, నిశ్చలమైన మనస్సుతో నిన్ను నీవు నియంత్రించుకుంటూ… ఓ మహాబాహో! జయించడానికి కష్టమైన ఈ ‘కామము’ అనే శత్రువును చంపుము. (3.43)
అధ్యాయం 4: జ్ఞాన యోగం
- శ్రీకృష్ణభగవానుడు పలికెను: నాశనం లేని ఈ యోగాన్ని నేను మొదట సూర్యుడికి చెప్పాను. సూర్యుడు తన కుమారుడైన మనువుకు చెప్పాడు. మనువు తన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజుకు చెప్పాడు. (4.1)
- ఓ అర్జునా! ఇలా పరంపరగా వచ్చిన ఈ యోగాన్ని పూర్వం రాజర్షులు తెలుసుకున్నారు. కానీ కాలక్రమేణా ఆ యోగం ఈ లోకంలో నశించిపోయింది. (4.2)
- నీవు నా భక్తుడవు మరియు ప్రియ మిత్రుడవు కాబట్టి, అత్యంత రహస్యమైన, ఉత్తమమైన ఆ పురాతన యోగాన్నే ఇప్పుడు నీకు తిరిగి ఉపదేశిస్తున్నాను. (4.3)
- అర్జునుడు పలికెను: కృష్ణా! సూర్యుడు ఎప్పుడో పుట్టాడు, నీవు ఇప్పుడే పుట్టావు. మరి ఈ యోగాన్ని నీవే మొదట సూర్యుడికి చెప్పావన్న మాటను నేను ఎలా నమ్మాలి? (4.4)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ అర్జునా! నాకు, నీకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. వాటన్నింటినీ నేను గుర్తుంచుకోగలను, కానీ నీవు గుర్తుంచుకోలేవు. (4.5)
- నేను పుట్టుక లేనివాడిని, నాశనం లేనివాడిని మరియు సర్వ ప్రాణులకు ఈశ్వరుడిని అయినప్పటికీ.. నా ప్రకృతిని (మాయను) ఆధారం చేసుకుని, నా ఆత్మమాయతో నేనే స్వయంగా అవతరిస్తాను. (4.6)
- ఓ భరతవంశీయుడా! ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెచ్చుమీరుతుందో.. అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను (అవతరిస్తాను). (4.7)
- సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి మరియు ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. (4.8)
- ఓ అర్జునా! నా దివ్యమైన జన్మను, కర్మను ఎవరైతే యదార్థంగా తెలుసుకుంటారో, వారు దేహాన్ని విడిచిన తర్వాత మళ్ళీ జన్మించరు; నన్నే చేరుకుంటారు. (4.9)
- రాగం (ఆశ), భయం, క్రోధం వీడినవారై.. నన్నే ఆశ్రయించి, నా యందే మనస్సు నిలిపిన ఎందరో మహానుభావులు ‘జ్ఞానతపస్సు’ చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొందారు. (4.10)
- ఓ అర్జునా! నన్ను ఎవరు ఏ విధంగా (ఏ భావంతో) ఆశ్రయిస్తారో, వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను. మనుషులందరూ అన్ని విధాలా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. (4.11)
- ఈ లోకంలో కర్మ ఫలితాలను కోరుకునేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే మనుష్య లోకంలో కర్మల వల్ల కలిగే ఫలితాలు చాలా త్వరగా లభిస్తాయి. (4.12)
- గుణములను, కర్మలను బట్టి నాలుగు వర్ణములను నేనే సృష్టించాను. ఆ వ్యవస్థకు కర్తను నేనే అయినప్పటికీ, నన్ను ‘అకర్త’గా (పనుల ఫలితాలకు అంటనివానిగా) మరియు వినాశనం లేనివానిగా తెలుసుకో. (4.13)
- నాకు కర్మలు అంటవు, నాకు కర్మ ఫలితాల మీద కోరిక లేదు. నన్ను ఈ విధంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో, వారు కూడా తాము చేసే కర్మల బంధనాల్లో చిక్కుకోరు. (4.14)
- మోక్షాన్ని కోరిన పూర్వీకులు కూడా ఈ రహస్యాన్ని తెలుసుకునే కర్మలు చేశారు. కాబట్టి నీవు కూడా నీ పూర్వీకులు అనుసరించిన ఆ నిష్కామ కర్మ మార్గాన్నే అనుసరించు. (4.15)
- ఏది కర్మ (చేయదగిన పని)? ఏది అకర్మ (చేయకూడనిది లేదా పని చేయని స్థితి)? అనే విషయంలో విద్వాంసులు, జ్ఞానులు కూడా మోహానికి (అయోమయానికి) లోనవుతుంటారు. కాబట్టి, ఏది తెలుసుకోవడం వల్ల నీవు సంసారమనే అశుభం నుండి (బంధనాల నుండి) విముక్తుడవుతావో, అటువంటి ‘కర్మ తత్త్వాన్ని’ నీకు వివరిస్తాను. (4.16)
- కర్మ (చేయదగిన పని), వికర్మ (చేయకూడని పని), అకర్మ (ఫలాపేక్ష లేని పని) – వీటి మధ్య వ్యత్యాసం తెలుసుకోవడం చాలా కష్టం. కర్మ గతి ఎంతో లోతైనది. (4.17)
- కర్మలో అకర్మను (పని చేస్తున్నా ఫలితాన్ని ఆశించని స్థితి), అకర్మలో కర్మను (పని చేయకుండా ఉన్నా లోపల అశాంతిగా ఉండటం వంటి స్థితి) ఎవడైతే చూడగలడో, అతడే మనుష్యులలో బుద్ధిమంతుడు. అతడే యోగి మరియు అన్ని పనులు సంపూర్ణంగా చేసినవాడు. (4.18)
- ఎవరి ప్రయత్నాలైనా కోరికలు, సంకల్పాలు లేకుండా ఉంటాయో.. అట్టివాని కర్మలు జ్ఞానమనే అగ్నిలో దహించబడతాయి. అట్టివానిని జ్ఞానులు ‘పండితుడు’ అని పిలుస్తారు. (4.19)
- కర్మ ఫలితంపై ఆసక్తిని వదిలేసి, దేనిపైనా ఆధారపడకుండా ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేవాడు.. కర్మలలో నిరంతరం నిమగ్నమై ఉన్నా, అతడు ఏమీ చేయనివానితో (అకర్తతో) సమానం. (4.20)
- ఎటువంటి ఆశలు లేనివాడు, జయించబడిన మనస్సు మరియు దేహము కలవాడు, మమకారాన్ని (నాది అనే భావాన్ని) పూర్తిగా వదిలేసినవాడు.. కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే కర్మలు చేస్తూ ఉంటే, అతడికి ఎటువంటి పాపము అంటదు. (4.21)
- ప్రయత్నం చేయగా దానంతట అది లభించిన దానితో తృప్తి చెందేవాడు, సుఖదుఃఖాలు, శీతోష్ణాలు వంటి ద్వంద్వాలకు అతీతుడైనవాడు, అసూయ లేనివాడు, విజయం లభించినా లభించకపోయినా సమానంగా ఉండగలిగేవాడు.. కర్మలు చేస్తున్నా వాటి బంధనాల్లో చిక్కుకోడు. (4.22)
- ఆసక్తి లేనివాడు, ముక్తుడైనవాడు, జ్ఞానమునందు స్థిరమైన మనస్సు కలవాడు.. భగవత్ ప్రీతి కోసం (యజ్ఞం కోసం) చేసే కర్మలు పూర్తిగా లీనమైపోతాయి (అంటే అవి పునర్జన్మను ఇచ్చే కర్మఫలాలుగా మారవు). (4.23)
- అర్పించే పాత్ర బ్రహ్మము, అర్పించే పదార్థము (హవిస్సు) బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేసే కర్త బ్రహ్మము. ఇలా ప్రతి కర్మలోనూ బ్రహ్మమునే (పరమాత్మనే) చూస్తూ చేసేవాడు బ్రహ్మమునే పొందుతాడు. (4.24)
- కొందరు యోగులు దేవతలను ఆరాధించడం ద్వారా దైవ యజ్ఞాన్ని చేస్తారు. మరికొందరు పరబ్రహ్మ అనే అగ్నిలో తమ ఆత్మనే అర్పించి జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు. (4.25)
- మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియనిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. (4.26)
- ఇంకొందరు తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటిని, ప్రాణ క్రియలను జ్ఞానంతో వెలిగే ఆత్మ నిగ్రహమనే యోగాగ్నిలో సమర్పిస్తారు. (4.27)
- కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు, మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు, మరికొందరు, కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ వేద శాస్త్రాలని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు. (4.28)
- మరికొందరు సాధకులు అపాన వాయువులో ప్రాణ వాయువును, ప్రాణ వాయువులో అపాన వాయువును హోమం చేస్తారు. అంటే, శ్వాసను లోపలికి తీసుకోవడం (పూరకం), బయటకు వదలడం (రేచకం) ద్వారా ప్రాణాయామం చేస్తారు. ఇంకా కొందరు ప్రాణ-అపాన గతులను రెండింటినీ స్తంభింపజేసి (కుంభకం), ప్రాణాయామమే పరమావధిగా జీవిస్తారు. ఇది కూడా ఒక రకమైన యజ్ఞమే. (4.29)
- మరికొందరు ఆహారాన్ని నియంత్రించి (మితాహారులుగా ఉండి), తమ ఇంద్రియ శక్తులను (ప్రాణాలను) ప్రాణమునందే హోమం చేస్తారు. పైన చెప్పిన వివిధ రకాల యజ్ఞాలను చేసేవారందరూ ‘యజ్ఞవిదులు’ (యజ్ఞ తత్త్వాన్ని తెలిసినవారు). వీరందరూ యజ్ఞం ద్వారా తమ పాపాలను (కల్మషములను) కడిగివేసుకున్న పుణ్యాత్ములు. (4.30)
- యజ్ఞం చేయగా మిగిలిన అమృతాన్ని (పవిత్రమైన ప్రసాదాన్ని) స్వీకరించేవారు సనాతన బ్రహ్మమును పొందుతారు. ఓ కురుశ్రేష్ఠా! ఈ లోకంలో యజ్ఞం చేయనివాడికి (త్యాగ గుణం లేనివాడికి) ఇహలోక సుఖమే లేదు, ఇక పరలోక సుఖం ఎక్కడిది? (4.31)
- వేదములలో ఇలాంటి అనేక యజ్ఞాలు వివరించబడ్డాయి. ఇవన్నీ కర్మల ద్వారానే (శరీర, మనో, వాక్కుల ద్వారా) సాధ్యమని తెలుసుకో. ఇలా తెలుసుకోవడం వల్ల నీవు సంసార బంధం నుండి విముక్తుడవుతావు. (4.32)
- ఓ అర్జునా! ద్రవ్యంతో చేసే యజ్ఞం కంటే (వస్తువులను అర్పించడం కంటే) జ్ఞాన యజ్ఞమే చాలా గొప్పది. ఎందుకంటే సమస్త కర్మల యొక్క అంతిమ లక్ష్యం జ్ఞానాన్ని పొందడమే. జ్ఞానం లభించాక కర్మలన్నీ అందులోనే ముగుస్తాయి. (4.33)
- ఆ జ్ఞానాన్ని నీవు ఎలా పొందాలో తెలుసా? తత్త్వదర్శులైన జ్ఞానులను (గురువులను) ఆశ్రయించి, వారికి వినయంతో నమస్కరించి, నీ సందేహాలను ప్రశ్నించి మరియు వారిని సేవించడం ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకో. అప్పుడు ఆ జ్ఞానులు నీకు పరమ సత్యాన్ని ఉపదేశిస్తారు. (4.34)
- ఓ పాండవా! ఈ తత్త్వ జ్ఞానాన్ని పొందిన తర్వాత నీవు మళ్ళీ ఇటువంటి మోహానికి (అజ్ఞానానికి) లోనుకావు. ఆ జ్ఞానం ద్వారా సమస్త ప్రాణులను నీ ఆత్మలోనూ, ఆపై నాలోనూ (పరమాత్మలో) చూడగలుగుతావు. (4.35)
- ఒకవేళ నీవు పాపులందరిలోకెల్లా మహాపాపివి అయినప్పటికీ, ఈ ‘జ్ఞానమనే నావ’ సహాయంతో పాపసముద్రాన్ని సులభంగా దాటగలవు. (4.36)
- ఓ అర్జునా! ప్రజ్వరిల్లుతున్న అగ్ని కట్టెలను ఎలా భస్మం చేస్తుందో, అలాగే ‘జ్ఞానమనే అగ్ని’ సమస్త కర్మలను (వాటి ఫలితాలను) భస్మం చేస్తుంది. (4.37)
- ఈ లోకంలో జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది మరియొకటి లేదు. నిష్కామ కర్మయోగం ద్వారా సిద్ధుడైనవాడు, కాలక్రమేణా ఆ జ్ఞానాన్ని తన హృదయంలోనే స్వయంగా పొందుతాడు. (4.38)
- శ్రద్ధ కలిగినవాడు, పరమాత్మ యందే నిమగ్నమైనవాడు, ఇంద్రియాలను జయించినవాడు జ్ఞానాన్ని పొందుతాడు. అట్టి జ్ఞానాన్ని పొందిన వెంటనే అతడు పరమ శాంతిని పొందుతాడు. (4.39)
- జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, ఎప్పుడూ అనుమానించేవాడు నాశనమైపోతాడు. సంశయం ఉన్నవానికి ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలోనూ ఉండదు. (4.40)
- ఓ ధనంజయా! ఎవరైతే యోగం ద్వారా కర్మలను భగవంతుడికి అర్పించారో, జ్ఞానం ద్వారా సంశయాలను తొలగించుకున్నారో, అట్టి ఆత్మజ్ఞానిని కర్మలు బంధించవు. (4.41)
- కాబట్టి ఓ భారత! నీ హృదయంలో ఉన్న అజ్ఞానం వల్ల కలిగిన ఈ సంశయాన్ని ‘జ్ఞానమనే కత్తి’ తో ఛేదించి, యోగ ధర్మాన్ని ఆశ్రయించి.. యుద్ధానికి సిద్ధమవ్వు. (4.42)
అధ్యాయం 5: కర్మసన్యాస యోగం
- అర్జునుడు పలికెను: కృష్ణా! ఒకసారి కర్మలను వదిలిపెట్టమని (సంన్యాసం), మరోసారి కర్మలను చేయమని (యోగం) చెబుతున్నావు. ఈ రెండింటిలో ఏది నాకు నిశ్చయంగా శ్రేయస్సో (మేలో) అది ఒక్కటి నాకు వివరించు. (5.1)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: కర్మ సంన్యాసం (పనులను వదలడం), కర్మ యోగం (ఫలాపేక్ష లేకుండా పనులు చేయడం) – ఈ రెండూ మోక్షాన్ని ఇచ్చేవే. కానీ, కర్మలను వదిలేయడం కంటే కర్మలను యోగబుద్ధితో చేయడం (కర్మయోగం) మిన్న. (5.2)
- ఎవరైతే దేనినీ ద్వేషించరో, దేనినీ కోరుకోరో, సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలకు అతీతులో.. అట్టివారే నిజమైన నిత్య సంన్యాసులు. వారు సులభంగా బంధనాల నుండి విముక్తులవుతారు. (5.3)
- సాంఖ్య యోగం (జ్ఞాన మార్గం) మరియు కర్మ యోగం వేర్వేరు అని అజ్ఞానులు అంటారు కానీ పండితులు కాదు. ఏ ఒక్క దానిని సరిగ్గా అనుసరించినా రెండింటి ఫలితం లభిస్తుంది. (5.4)
- జ్ఞానులు పొందే స్థానాన్నే యోగులు కూడా పొందుతారు. జ్ఞానాన్ని, కర్మను ఒకటిగా చూసేవాడే సరైన జ్ఞాని. (5.5)
- కర్మయోగం లేకుండా సంన్యాసాన్ని సాధించడం దుఃఖకరం. కానీ నిష్కామ కర్మలో నిమగ్నమైన ముని అతి త్వరగా పరబ్రహ్మమును చేరుకుంటాడు. (5.6)
- నిష్కామ కర్మ చేసే యోగి, పరిశుద్ధమైన మనస్సు కలవాడు, ఇంద్రియాలను జయించినవాడు మరియు సర్వ ప్రాణులలో తన ఆత్మనే చూసేవాడు.. పనులు చేస్తున్నా కర్మలతనిని అంటవు. (5.7)
- చూస్తున్నా, వింటున్నా, తాకుతున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాస తీసుకుంటున్నా, మాట్లాడుతున్నా.. ఇవన్నీ కేవలం ఇంద్రియాలు వాటి విషయాలలో ప్రవర్తిస్తున్నాయని భావిస్తూ.. ‘నేను ఏమీ చేయడం లేదు’ అని తత్త్వజ్ఞాని అనుకుంటాడు. (5.8-9)
- తాను చేసే పనులన్నింటినీ పరమాత్మకు అర్పించి, ఆసక్తిని వదిలేసి కర్మలు చేసేవాడికి పాపం అంటదు. అది ఎలా అంటే.. తామర ఆకు మీద నీటి చుక్క ఉన్నా దానికి అంటనట్లుగా, అతడు లోకంలో ఉన్నా బంధాలకు చిక్కడు. (5.10)
- యోగులు అహంకారాన్ని, ఆసక్తిని వదిలిపెట్టి.. కేవలం ఆత్మశుద్ధి కోసం తమ దేహం, మనస్సు, బుద్ధి మరియు ఇంద్రియాలతో కర్మలు చేస్తారు. (5.11)
- ఫలాపేక్షను వదిలేసిన యోగి పరమ శాంతిని పొందుతాడు. కానీ, కోరికలతో ఫలితం మీద ఆసక్తి పెంచుకున్న అజ్ఞాని కర్మ బంధాలలో చిక్కుకుపోతాడు. (5.12)
- జితేంద్రియుడైన జ్ఞాని అన్ని కర్మలను మనస్సుతో వదిలేసి (కర్తృత్వ భావన వీడి), తొమ్మిది ద్వారాలున్న ఈ దేహమనే పురంలో తనేమీ చేయకుండా, చేయించకుండా సుఖంగా ఉంటాడు. (5.13)
- లోకంలోని మనుషుల కర్తృత్వాన్ని (నేను చేస్తున్నాను అనే భావం), వారి కర్మలను, కర్మఫల సంబంధాన్ని భగవంతుడు సృష్టించడు. ఇదంతా వారి వారి స్వభావం (ప్రకృతి/వాసనలు) బట్టే జరుగుతుంది. (5.14)
- పరమాత్మ ఎవరి పాపాన్ని గానీ, పుణ్యాన్ని గానీ స్వీకరించడు. కానీ, జ్ఞానం అనేది అజ్ఞానముచేత కప్పబడి ఉండటం వల్ల ప్రాణులందరూ మోహానికి (భ్రమకు) లోనవుతున్నారు. (5.15)
- ఎవరి అజ్ఞానమైతే ఆత్మజ్ఞానం చేత నశిస్తుందో, వారిలోని ఆ జ్ఞానం సూర్యుడిలా ప్రకాశించి పరమాత్మ తత్త్వాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. (5.16)
- ఎవరి బుద్ధి పరమాత్మ యందే లగ్నమై ఉంటుందో, ఎవరి ఆత్మ ఆయనతోనే ఐక్యమై ఉంటుందో, ఎవరి నిష్ఠ ఆయనపైనే ఉంటుందో.. అట్టి జ్ఞానులు తమ పాపాలను జ్ఞానంతో కడిగివేసుకుని, తిరిగి జన్మించని ఉన్నత స్థితిని (ముక్తిని) పొందుతారు. (5.17)
- విద్యావినయాలు కలిగిన బ్రాహ్మణునియందు, ఆవునందు, ఏనుగునందు, కుక్కనందు, చండాలునియందు.. పండితులు (జ్ఞానులు) అందరిలోనూ ఉన్న పరమాత్మను ఒక్కటిగానే చూస్తారు. (5.18)
- ఎవరి మనస్సు సమత్వంలో స్థిరంగా ఉంటుందో, వారు ఈ జన్మలోనే జనన మరణ సంసారాన్ని జయించినట్లే. ఎందుకంటే బ్రహ్మము నిర్దోషమైనది, అందరిలోనూ సమానంగా ఉండేది; కాబట్టి వారు బ్రహ్మమునందే స్థితులై ఉంటారు. (5.19)
- ప్రియమైనది (సుఖం) కలిగినప్పుడు పొంగిపోకుండా, అప్రియమైనది (దుఃఖం) కలిగినప్పుడు కుంగిపోకుండా ఉండాలి. ఇటువంటి స్థిర బుద్ధి కలవాడు, భ్రమలు లేనివాడు బ్రహ్మవేత్త అనిపించుకుంటాడు. (5.20)
- బాహ్య విషయాల మీద ఆసక్తి లేనివాడు తన ఆత్మలోనే సుఖాన్ని పొందుతాడు. పరమాత్మతో అనుసంధానమైన అతడు నాశనం లేని అక్షయ సుఖాన్ని అనుభవిస్తాడు. (5.21)
- ఓ అర్జునా! ఇంద్రియాల ద్వారా కలిగే భోగాలన్నీ దుఃఖానికే కారణమవుతాయి. అవి పుట్టుక, నాశనం ఉన్నవి (తాత్కాలికమైనవి). అందుకే జ్ఞాని వాటిలో రమించడు (సంతోషాన్ని వెతుక్కోడు). (5.22)
- ఈ శరీరాన్ని వదిలేలోపే (మరణానికి ముందే), కామ క్రోధాల వల్ల కలిగే వేగాన్ని ఎవడైతే అదుపు చేయగలడో.. అతడే నిజమైన యోగి మరియు ఆనందమయుడైన పురుషుడు. (5.23)
- ఎవడైతే తన లోపలే సుఖాన్ని, తన లోపలే ఆనందాన్ని మరియు తన లోపలే జ్ఞానకాంతిని పొందుతాడో.. అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు. (5.24)
- పాపాలు నశించినవారు, సందేహాలు తొలగినవారు, మనస్సును నిగ్రహించినవారు మరియు సమస్త ప్రాణుల హితము కోరేవారు అయిన ఋషులు బ్రహ్మనిర్వాణాన్ని పొందుతారు. (5.25)
- కామ క్రోధాలను వీడినవారు, చిత్తాన్ని వశపరచుకున్నవారు మరియు ఆత్మతత్త్వాన్ని ఎరిగిన మహాత్ములకు అన్నివేళలా, అన్నిచోట్లా బ్రహ్మనిర్వాణం (పరమ శాంతి) సిద్ధించి ఉంటుంది. (5.26)
- బాహ్య విషయాల (శబ్ద, స్పర్శాదుల) ఆలోచనలను బయటే నిలిపివేసి, చూపును రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి (భ్రువోః మధ్యే), ముక్కు రంధ్రాలలో సంచరించే ప్రాణ, అపాన వాయువులను సమానం చేసి, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని అదుపులో ఉంచుకుని, భయ-క్రోధ-ఆశలను వీడి మోక్షమే లక్ష్యంగా ఉన్న ముని ఎల్లప్పుడూ ముక్తుడే (విముక్తుడే). (5.27-28)
- సమస్త యజ్ఞాలకు, తపస్సులకు ఫలాన్ని అనుభవించే ప్రభువును నేనే అని, సర్వ లోకములకు మహేశ్వరుడిని నేనే అని మరియు సమస్త ప్రాణులకు ప్రియ మిత్రుడిని నేనే అని తెలుసుకున్న మానవుడు పరమ శాంతిని పొందుతాడు. (5.29)
అధ్యాయం 6: ఆత్మసంయమ యోగం
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: కర్మ ఫలితాన్ని ఆశ్రయించకుండా (కోరకుండా), ఏది తన కర్తవ్యమో (చేయవలసిన పని) అట్టి కర్మను ఎవడైతే చేస్తాడో.. అతడే సంన్యాసి మరియు అతడే యోగి. కేవలం యజ్ఞాగ్నిని వదిలేసినవాడు (నిరగ్నిః) కానీ, పనులు మానేసినవాడు (అక్రియః) కానీ సంన్యాసి/యోగి కాలేడు. (6.1)
- దేనిని ‘సంన్యాసం’ అని పిలుస్తారో, దానినే ‘యోగం’ అని కూడా తెలుసుకో ఓ పాండవా! ఎందుకంటే, లౌకిక కోరికలను వదులుకోనివాడు ఎవడూ యోగి కాలేడు. (6.2)
- యోగ స్థితిని అధిరోహించాలనుకునే మునికి నిష్కామ కర్మ సాధనంగా చెప్పబడింది. అదే యోగ స్థితిని పొందిన వానికి ప్రశాంతత సాధనంగా చెప్పబడింది. (6.3)
- ఎప్పుడైతే మనిషి ఇంద్రియ విషయాల యందు మరియు కర్మల యందు ఆసక్తిని కలిగి ఉండడో.. అట్టి అన్ని సంకల్పాలను వదిలేసినవాడిని ‘యోగారూఢుడు’ అని అంటారు. (6.4)
- తనను తాను ఉద్ధరించుకోవాలి, తనను తాను తక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే మనకు మనమే మిత్రుడము మరియు మనకు మనమే శత్రువులము. (6.5)
- మనస్సుని జయించినవారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వారికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. (6.6)
- మనస్సుని జయించిన యోగులు – శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానాపమానములు – ఈ ద్వందములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు. (6.7)
- జ్ఞానవిజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తినొందిన యోగులు, ఇంద్రియములను జయించిన వారై, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు – మట్టి, రాళ్ళు, మరియు బంగారము – వీటన్నిటిని ఒకే దృష్టితో చూస్తారు. (6.8)
- మేలుకోరేవారు, మిత్రులు, శత్రువులు, తటస్థులు, మధ్యస్థులు, ద్వేషించదగినవారు, బంధువులు, సాధువులు మరియు పాపాత్ముల పట్ల సమానమైన బుద్ధిని కలిగి ఉండేవాడే అందరిలోనూ శ్రేష్ఠుడు. (6.9)
- యోగి ఎల్లప్పుడూ ఒంటరిగా, ఏకాంత ప్రదేశంలో ఉంటూ.. మనస్సును, దేహాన్ని అదుపులో ఉంచుకుని, ఎటువంటి ఆశలు లేనివాడై, ఏ వస్తువుల మీద మమకారం లేకుండా తన మనస్సును పరమాత్మ యందు నిలపాలి. (6.10)
- పరిశుభ్రమైన ప్రదేశంలో, తనకు అనుకూలమైన స్థిరమైన ఆసనాన్ని ఏర్పరుచుకోవాలి. అది మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ పల్లంగా ఉండకూడదు. దానిపై క్రమంగా కుశలు, జింక చర్మము, వస్త్రము ఒకదానిపై ఒకటి అమర్చుకోవాలి. ఆ ఆసనంపై కూర్చుని, మనస్సును ఏకాగ్రం చేసి, చిత్తమును మరియు ఇంద్రియాల క్రియలను అదుపులో ఉంచుకుని.. తన ఆత్మశుద్ధి కోసం యోగ సాధన చేయాలి. (6.11-12)
- శరీరమును, మెడను, మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటూఇటూ తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి. ఈ విధంగా, ప్రశాంతతతో, భయరహితంగా, మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో, సావధానుడైన యోగి, నేనే పరమ లక్ష్యంగా, నా పై ధ్యానం చేయాలి. (6.13-14)
- ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపిఉంచుతూ, క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నా యందు ఉన్నట్టి మోక్షమే అంతిమంగా గల పరమ శాంతిని పొందుతాడు. (6.15)
- ఓ అర్జునా! అతిగా తినేవాడికి, అస్సలు తిననివాడికి, అతిగా నిద్రపోయేవాడికి మరియు అస్సలు నిద్రపోకుండా ఎప్పుడూ మేల్కొని ఉండేవారికి యోగము సిద్ధించదు. (6.16)
- కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు. (6.17)
- నిగ్రహించబడిన మనస్సు ఆత్మయందే స్థిరంగా ఉంచి, సమస్త కోరికల యందు నిరాశక్తుడై ఉండే వారినే యోగస్థితిలో ఉన్నారని అంటారు. (6.18)
- గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు, ఆత్మ ధ్యానంలో స్థిరముగా ఉండును. (6.19)
- యోగ సాధన ద్వారా నిరోధించబడిన చిత్తము ఎక్కడైతే ప్రశాంతతను పొందుతుందో, ఎక్కడైతే తన శుద్ధమైన బుద్ధి చేత ఆత్మను దర్శిస్తూ తనలోనే తాను తృప్తిని పొందుతాడో…ఇంద్రియాలకు అందక కేవలం పరిశుద్ధమైన బుద్ధికే అందే అనంతమైన సుఖాన్ని ఎక్కడైతే పొందుతాడో, అట్టి స్థితిలో స్థిరంగా ఉన్న యోగి పరమ సత్యం నుండి ఎన్నటికీ చలించడు. ఏ స్థితిని పొందిన తర్వాత అంతకంటే గొప్ప లాభం మరొకటి లేదని భావిస్తాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు గొప్పదైన దుఃఖం కూడా అతడిని చలింపజేయదో…దుఃఖంతో కూడిన సంసార సంబంధం నుండి విడదీయబడిన దానినే ‘యోగం’ అని తెలుసుకో. అట్టి యోగాన్ని విసుగు చెందని మనస్సుతో, నిశ్చయమైన పట్టుదలతో సాధించాలి. (6.20-23)
- సంకల్పాల వల్ల పుట్టిన కోరికలన్నింటినీ పూర్తిగా వదిలివేసి, మనస్సు ద్వారానే ఇంద్రియ సమూహాన్ని అన్ని వైపుల నుండి నియంత్రించాలి. ధైర్యంతో కూడిన బుద్ధితో మెల్లమెల్లగా ఉపశాంతిని పొందాలి. మనస్సును ఆత్మయందే నిలిపి, ఆ సమయంలో వేరే దేనినీ ఆలోచించకూడదు. (6.24-25)
- చంచలమైనది, అస్థిరమైనది అయిన మనస్సు ఎక్కడికెక్కడికి పారిపోతుందో , అక్కడి నుండి తిరిగి తెచ్చి నిరంతరం ఆత్మ మీదనే కేంద్రీకరించాలి. (6.26)
- ప్రశాంతమైన మనస్సు కలవాడు, రజోగుణం అణిగిపోయినవాడు, పాప రహితుడు మరియు బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఉత్తమమైన సుఖం లభిస్తుంది. (6.27)
- ఈ విధంగా ఎల్లప్పుడూ తనను తాను పరమాత్మతో అనుసంధానం చేసే పాపరహితుడైన యోగి, బ్రహ్మానుభూతి చేత కలిగే అనంతమైన సుఖాన్ని సులభంగా పొందుతాడు. (6.28)
- యోగముతో కూడిన మనస్సు కలవాడు, అంతటా సమదృష్టి కలవాడు… తనను అన్ని ప్రాణులలోనూ, అన్ని ప్రాణులను తనలోనూ చూస్తాడు. (6.29)
- ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, నేను వారికి దూరమవను, వారు నాకు దూరం కారు. (6.30)
- అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అభేద భావంతో ఎవరు భజిస్తారో, అట్టి యోగి ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా యందే ఉంటాడు. (6.31)
- సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ, మరియు ఇతరుల సుఖాలకు, దుఃఖాలకు, అవి తనకే అయినట్టు స్పందించేవారిని, పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను. (6.32)
- అర్జునుడు పలికెను: ఓ మధుసూదనా, నీవు చెప్పిన ఈ యోగ విధానము, ఈ చంచలమైన మనస్సు వలన, నాకు ఆచరింపశక్యముకానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది. (6.33)
- ఓ కృష్ణా, ఈ మనస్సు చాలా చంచలమైనది, ఇంద్రియాలను కలచివేసేది, బలమైనది, మరియు మొండిది. దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది. (6.34)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ మహాబాహో! మనస్సును అదుపు చేయడం కష్టమే అన్నది నిస్సందేహం. కానీ, ఓ కౌంతేయా! అభ్యాసము మరియు వైరాగ్యము చేత అది నిగ్రహించబడుతుంది. (6.35)
- మనస్సు అదుపులో లేనివానికి యోగము కష్టతరమైనది. కానీ, మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారు, మరియు సరియైన పద్దతిలో పరిశ్రమ చేసేవారు, యోగములో పరిపూర్ణత సాధించవచ్చు అని నా అభిప్రాయము. (6.36)
- అర్జునుడు పలికెను: ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా, చంచలమైన మనస్సు కారణంచే, తగినంతగా పరిశ్రమించక, యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేక పోయిన యోగి యొక్క గతి ఏమిటి? (6.37)
- ఓ మహాబాహో! యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటినీ కోల్పోయి, విడిపోయి చెదిరిన మేఘం వలె నశించిపోతాడా? (6.38)
- ఓ కృష్ణా! నా ఈ సందేహాన్ని పూర్తిగా తొలగించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను. ఈ సందేహాన్ని నివృత్తి చేయగలవాడు నీకంటే వేరొకడు ఎవరూ లేరు. (6.39)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ పార్థా, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవానికి ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ వినాశనం లేదు. మంచిని చేసేవాడు ఎన్నటికీ దుర్గతిని పొందడు. (6.40)
- యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందే లోకాలను పొంది, అక్కడ చాలా ఏళ్ళ పాటు సుఖంగా ఉండి.. ఆ తర్వాత పవిత్రమైన ఆలోచనలు గల, ఐశ్వర్యవంతులైన వారి ఇంట్లో జన్మిస్తాడు. (6.41)
- లేదా బుద్ధిమంతులైన యోగుల కుటుంబంలోనే జన్మిస్తాడు. లోకంలో ఇటువంటి జన్మ లభించడం అత్యంత దుర్లభమైనది. (6.42)
- ఓ కురునందనా! ఇటువంటి జన్మ పొందిన తరువాత, వారు తమ పూర్వ జన్మకు సంబంధించిన బుద్ధి సంస్కారాలను తిరిగి మేల్కొలిపి, యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు. (6.43)
- వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా, పూర్వ జన్మల సాధనా బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్శించబడుతారు. ఇటువంటి సాధకులు సహజంగానే, వేదములలో చెప్పబడిన కర్మ కాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు. (6.44)
- ప్రయత్నంతో సాధన చేసే యోగి, పాపాలను కడిగివేసుకుని, అనేక జన్మల తర్వాత సిద్ధిని పొంది, చివరకు పరమ గతిని పొందుతాడు. (6.45)
- యోగ సాధకుడు తపస్సు చేసేవారికంటే, శాస్త్ర జ్ఞానం కలవారికంటే మరియు ఫలాపేక్షతో కర్మలు చేసేవారికంటే శ్రేష్ఠుడు. కాబట్టి ఓ అర్జునా! నీవు యోగివి కావాలి. (6.46)
- అందరి యోగులలో కెల్లా, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు ధృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో, వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. (6.47)
అధ్యాయం 7: విజ్ఞాన యోగం
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ పార్థా! నా యందు ఆసక్తి కలిగిన మనస్సుతో, నన్నే ఆశ్రయించి, యోగ సాధన చేస్తూ.. నన్ను సంపూర్ణంగా ఎటువంటి సంశయం లేకుండా ఎలా తెలుసుకోవచ్చో, దానిని విను. (7.1)
- నేను నీకు అనుభవంతో కూడిన ఈ జ్ఞానాన్ని పూర్తిగా వివరిస్తాను. దీనిని తెలుసుకున్న తర్వాత, ఈ లోకంలో నీవు తెలుసుకోవలసింది ఇంక ఏదీ మిగిలి ఉండదు. (7.2)
- వేలకొద్దీ మనుష్యులలో ఎవరో ఒక్కడు మాత్రమే సిద్ధి (ఆత్మజ్ఞానం) కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా, ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థంగా తెలుసుకోగలుగుతారు. (7.3)
- భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము – ఈ ఎనిమిది విధాలుగా నా ప్రకృతి విభజించబడింది. (7.4)
- ఓ మహాబాహో! పైన చెప్పినది అపరా ప్రకృతి. దీనికంటే భిన్నమైనది మరియు శ్రేష్ఠమైనది అయిన నా ‘జీవ రూప’ ప్రకృతిని తెలుసుకో. దాని ద్వారానే ఈ జగత్తు అంతా ధరించబడి ఉంది. (7.5)
- సమస్త ప్రాణులన్నీ ఈ రెండు ప్రకృతుల నుండే పుడుతున్నాయని తెలుసుకో. ఈ మొత్తం జగత్తు సృష్టికి మరియు ప్రళయానికి నేనే మూలకారణం. (7.6)
- ఓ ధనంజయా! నాకంటే శ్రేష్ఠతరమైన కారణం ఈ విశ్వంలో ఏదీ లేదు. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి. (7.7)
- ఓ కౌంతేయా! నీటిలో రుచిని నేనే. చంద్రసూర్యులలోని కాంతిని నేనే. వేదాలలోని ఓంకారమును నేనే. ఆకాశంలోని శబ్దమును మరియు మనుష్యులలోని పౌరుషమును నేనే. (7.8)
- భూమియందు పవిత్రమైన సుగంధమును నేనే. అగ్నియందు తేజస్సును నేనే. సమస్త ప్రాణులయందు ప్రాణశక్తిని మరియు తపస్సు చేసేవారిలో తపస్సును నేనే. (7.9)
- ఓ పార్థా! సమస్త ప్రాణులకు నాశనం లేని సనాతనమైన బీజమును నేనే అని తెలుసుకో. బుద్ధిమంతులలోని బుద్ధిని మరియు పరాక్రమవంతులలోని తేజస్సును నేనే. (7.10)
- ఓ భరతశ్రేష్ఠా! బలవంతులలో కోరికలు మరియు అనురాగం లేని శుద్ధమైన బలమును నేనే. అలాగే ప్రాణులలో ధర్మానికి విరుద్ధం కాని కోరికను నేనే. (7.11)
- సత్త్వ, రజో, తమో గుణాల వల్ల కలిగే భావాలన్నీ నా నుండే పుడుతున్నాయని తెలుసుకో. అయితే, అవి నా అధీనంలో ఉన్నాయే కానీ, నేను వాటికి లోబడి లేను. (7.12)
- ఈ మూడు గుణాల ప్రభావంతో ఈ జగత్తు అంతా మోహానికి లోనై ఉంది. అందుకే ఈ గుణాలకు అతీతుడైన, నాశనం లేని నన్ను అది గుర్తించలేకపోతోంది. (7.13)
- మూడు గుణాలతో కూడిన నా ఈ దైవీ మాయను దాటడం చాలా కష్టం. కానీ, ఎవరైతే నన్నే అనన్య భావంతో ఆశ్రయిస్తారో, వారు మాత్రమే ఈ మాయను సులభంగా దాటగలరు. (7.14)
- పాపకృత్యాలు చేసేవారు, వివేకం లేని మూఢులు, నరాధములు నన్ను ఆశ్రయించరు. ఎందుకంటే మాయ వల్ల వారి జ్ఞానం హరించబడింది. వారు అసుర స్వభావాన్ని ఆశ్రయించి ఉంటారు. (7.15)
- ఓ భరతశ్రేష్ఠా! నాలుగు రకములైన పుణ్యాత్ములు నన్ను భజిస్తారు — ఆపదలో ఉన్నవాడు, సత్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలం కలవాడు, సంపదను కోరుకునేవాడు మరియు నన్ను యదార్థంగా తెలుసుకున్న జ్ఞాని. (7.16)
- ఆ నలుగురిలో ఎల్లప్పుడూ నా యందే మనస్సు నిలిపే, అనన్య భక్తి కలిగిన జ్ఞాని శ్రేష్ఠుడు. ఎందుకంటే జ్ఞానికి నేను అత్యంత ప్రియుడను, ఆ జ్ఞాని నాకు అత్యంత ప్రియుడు. (7.17)
- ఆ నలుగురు భక్తులూ గొప్పవారే. కానీ స్థిరమైన మనస్సుతో నన్నే పరమ గతిగా భావించే జ్ఞాని మాత్రం నా స్వరూపమే అని నా అభిప్రాయం. (7.18)
- అనేక జన్మల సాధన తర్వాత జ్ఞాని, అంతా నేనే అని తెలుసుకుని నన్ను ఆశ్రయిస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు. (7.19)
- వివిధ రకాల కోరికల చేత జ్ఞానాన్ని కోల్పోయిన వారు, తమ స్వభావానికి లోబడి, ఆయా నియమాలను పాటిస్తూ అన్య దేవతలను ఆశ్రయిస్తారు. (7.20)
- ఏ ఏ భక్తుడు ఏ ఏ దేవతా రూపాన్ని శ్రద్ధతో పూజించాలని కోరుకుంటాడో, ఆయా దేవతల యందు అతడికి ఉండే శ్రద్ధను నేనే స్థిరపరుస్తాను. (7.21)
- అతడు ఆ స్థిరమైన శ్రద్ధతో ఆ దేవతను ఆరాధిస్తాడు. దాని ఫలితంగా తాను కోరుకున్న కోరికలను పొందుతాడు. అయితే, నిజానికి ఆ ఫలితాలను ఇచ్చేది నేనే. (7.22)
- అల్ప బుద్ధి కలవారు పొందే ఆ ఫలితాలు తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు ఆయా దేవతలను చేరుకుంటారు. నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు. (7.23)
- బుద్ధి లేనివారు నా యొక్క నాశనం లేని, శ్రేష్ఠమైన పరమ తత్త్వాన్ని తెలియక, నిరాకార అవ్యక్తమైన నన్ను సామాన్య మానవుడిలా పుట్టినవానిగా భావిస్తారు. (7.24)
- నేను నా యోగమాయచేత కప్పబడి ఉండటం వల్ల అందరికీ కనిపించను. ఈ అజ్ఞాన లోకము పుట్టుక లేనివాడిని, మార్పు లేనివాడిని అయిన నన్ను గుర్తించలేకపోతోంది. (7.25)
- నాకు భూత, వర్తమాన, భవిష్యత్తు లోని సమస్త ప్రాణులు అన్నీ తెలుసు; కానీ నేను ఎవరికీ తెలియను. (7.26)
- ఓ భారత! రాగద్వేషాల వల్ల పుట్టిన సుఖదుఃఖాల వంటి ద్వంద్వాల మోహంలో చిక్కుకుని, ప్రాణులన్నీ పుట్టినప్పుడే సమ్మోహాన్ని పొందుతున్నాయి. (7.27)
- పుణ్య కార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో, వారు ఈ ద్వంద్వ మోహాల నుండి విముక్తులై నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు. (7.28)
- ముసలితనం, మరణం నుండి ముక్తిని పొందడానికి నన్ను ఆశ్రయించి ప్రయత్నించే వారు, ఆ పరబ్రహ్మమును, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానమును మరియు సమస్త కర్మల రహస్యాలను తెలుసుకోగలుగుతారు. (7.29)
- అధిభూత, అధిదైవ మరియు అధియజ్ఞ స్వరూపుడనైన నన్ను ఎవరు తెలుసుకుంటారో, అట్టి స్థిరమైన మనస్సు గలవారు మరణ కాలంలో కూడా నన్ను స్మరిస్తూ నా యందే స్థితమై ఉంటారు. (7.30)
అధ్యాయం 8: అక్షరపరబ్రహ్మ యోగం
- అర్జునుడు పలికెను: ఓ పురుషోత్తమా! ఆ బ్రహ్మము అంటే ఏమిటి? అధ్యాత్మము అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతము అని దేనిని అంటారు? మరియు అధిదైవము అని దేనిని పిలుస్తారు? ఓ మధుసూదనా! ఈ దేహంలో అధియజ్ఞుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? మరియు మనస్సును నిగ్రహించిన వారు మరణ కాలంలో నిన్ను ఎలా తెలుసుకోగలరు? (8.1-8.2)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: “నాశనం లేని పరమ తత్త్వమే బ్రహ్మము. జీవుడిలోని ఆత్మ తత్త్వమునే అధ్యాత్మము అంటారు. ప్రాణుల పుట్టుకకు, అభివృద్ధికి కారణమైన త్యాగపూర్వకమైన సృష్టి కార్యమే కర్మ.” (8.3)
- ఓ దేహధారులలో శ్రేష్ఠుడవైన అర్జునా! నశించే స్వభావం కల జడ పదార్థాలన్నీ అధిభూతము. సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వ రూపమునే అధిదైవము. ఈ దేహంలో అంతర్యామిగా ఉండి యజ్ఞఫలాలను ఇచ్చే అధియజ్ఞుడు నేనే. (8.4)
- మరణ సమయంలో నన్నే స్మరిస్తూ తన శరీరాన్ని వదిలి వెళ్ళేవాడు, నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. (8.5)
- ఓ కౌంతేయా! మనిషి మరణ సమయంలో దేనినైతే స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో, జీవితాంతం దేనిని ధ్యానిస్తూ ఉంటాడో, చనిపోయాక ఆ భావాన్నే పొందుతాడు. (8.6)
- కాబట్టి, అన్ని వేళలా నన్నే స్మరించు మరియు నీ కర్తవ్యమైన యుద్ధాన్ని చేయు. నీ మనస్సును, బుద్ధిని నా యందే అర్పించినట్లయితే, నిశ్చయంగా నన్నే చేరుకుంటావు. (8.7)
- ఓ పార్థా! అభ్యాసయోగంతో కూడి, వేరే ఆలోచనలు లేకుండా నిరంతరం ధ్యానించేవాడు, దివ్యుడైన పరమ పురుషుడిని చేరుకుంటాడు. (8.8)
- సర్వజ్ఞుడిని, పురాతనమైన వాడిని, ప్రపంచాన్ని శాసించేవాడిని, అణువుకంటే సూక్ష్మమైన వాడిని, అందరినీ పోషించేవాడిని, ఊహాతీతమైన రూపం కలవాడిని, సూర్యుని వలె ప్రకాశించేవాడిని మరియు చీకటికి అవతల ఉన్నవాడిని ఎవడైతే స్మరిస్తాడో, మరణ సమయంలో నిశ్చలమైన మనస్సుతో, భక్తితో మరియు యోగబలంతో, తన ప్రాణాన్ని రెండు కనుబొమ్మల మధ్యకు చక్కగా చేర్చి ధ్యానించేవాడు, ఆ దివ్యుడైన పరమ పురుషుడిని చేరుకుంటాడు. (8.9-8.10)
- వేద పండితులు దేనిని అక్షరము అని అంటారో, ఆసక్తి లేని మునులు దేనిలో ప్రవేశిస్తారో, దేనిని కోరుతూ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తారో, అట్టి పరమ పదాన్ని నీకు క్లుప్తంగా వివరిస్తాను. (8.11)
- ఇంద్రియ ద్వారాలన్నింటినీ అదుపు చేసి, మనస్సును హృదయంలో నిలిపి, తన ప్రాణాన్ని శిరస్సు నందు (సహస్రారంలో) ఉంచి, యోగధారణలో స్థిరంగా ఉండాలి. ఓం అనే ఈ ఏకాక్షర బ్రహ్మమును ఉచ్చరిస్తూ, నన్ను స్మరిస్తూ దేహాన్ని వదిలి వెళ్ళేవాడు పరమ గతిని పొందుతాడు. (8.12-8.13)
- ఓ పార్థా! వేరే ఆలోచనలు లేకుండా ఎల్లప్పుడూ నన్నే స్మరించే నిత్యయుక్తుడైన యోగికి, నేను చాలా సులభంగా లభిస్తాను. (8.14)
- నన్ను చేరుకొని అత్యున్నతమైన పరిపూర్ణతను పొందిన మహాత్ములకు, దుఃఖాలకు నిలయమైన, అశాశ్వతమైన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు. (8.15)
- ఓ అర్జునా! బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాలు తిరిగి జన్మలు ఇచ్చేవే. కానీ ఓ కౌంతేయా! నన్ను చేరుకున్న వారికి మాత్రం మళ్ళీ పునర్జన్మ ఉండదు. (8.16)
- బ్రహ్మదేవుని ఒక పగలు వెయ్యి మహాయుగాల కాలపరిమితి కలదని, అలాగే ఆయన రాత్రి కూడా వెయ్యి మహాయుగాల కాలమని ఎవరు తెలుసుకుంటారో, అట్టివారే కాలతత్త్వాన్ని ఎరిగినవారు. (8.17)
- బ్రహ్మదేవుని పగలు ప్రారంభం కాగానే, అవ్యక్తం నుండి చరాచర ప్రాణులన్నీ పుడుతున్నాయి. రాత్రి కాగానే, మళ్ళీ ఆ అవ్యక్తమునందే లీనమవుతున్నాయి. (8.18)
- ఓ పార్థా! ఈ ప్రాణి సమూహమంతా ప్రకృతికి వశమై, పగలు రాగానే పుడుతూ, రాత్రి రాగానే లయమైపోతూ ఉంటుంది. (8.19)
- కానీ, ఆ అవ్యక్త ప్రకృతి కంటే భిన్నమైనది మరియు శ్రేష్ఠమైనది అయిన మరొక సనాతన అవ్యక్త తత్త్వము ఉంది. సమస్త భూతములు నశించినప్పటికీ, ఆ తత్త్వము నశించదు. (8.20)
- ఆ యొక్క అవ్యక్త అక్షరమే సర్వోన్నత లక్ష్యము. దేనిని పొందిన తర్వాత తిరిగి ఈ సంసారానికి రారో, అదే నా పరమ ధామము. (8.21)
- ఓ పార్థా! సమస్త ప్రాణులు ఎవరి యందు ఉన్నాయో, ఎవరి చేత ఈ జగత్తు అంతా వ్యాపించి ఉందో, అట్టి పరమ పురుషుడు అనన్యమైన భక్తి చేత మాత్రమే లభిస్తాడు. (8.22)
- ఓ భరతశ్రేష్ఠా! ఏ ఏ మార్గాలలో వెళ్ళిన యోగులు తిరిగి రారో మరియు తిరిగి వస్తారో, అట్టి కాలమార్గాల గురించి నీకు వివరిస్తాను. (8.23)
- అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము మరియు ఆరు నెలల ఉత్తరాయణ పుణ్యకాలము.. ఈ దేవతలే మార్గదర్శకులుగా వెళ్ళే బ్రహ్మజ్ఞానులు పరబ్రహ్మమును పొందుతారు. (8.24)
- ధూమము, రాత్రి, కృష్ణపక్షము మరియు ఆరు నెలల దక్షిణాయన కాలము.. ఈ మార్గంలో వెళ్ళే యోగి చంద్రలోక జ్యోతిని పొంది, తిరిగి సంసారానికి వస్తాడు. (8.25)
- లోకంలో శుక్ల గతి, కృష్ణ గతి అనే ఈ రెండు మార్గాలు శాశ్వతమైనవిగా భావించబడ్డాయి. మొదటి మార్గం ద్వారా వెళ్ళేవాడు తిరిగి రాడు, రెండవ మార్గం ద్వారా వెళ్ళేవాడు తిరిగి వస్తాడు. (8.26)
- ఓ పార్థా! ఈ రెండు మార్గాల రహస్యాన్ని తెలిసిన యోగి ఎన్నడూ మోహానికి లోనుకాడు. కావున, అన్ని వేళలా నీవు యోగమునందే స్థిరంగా ఉండుము. (8.27)
- వేద పఠనం వల్ల, యజ్ఞాల వల్ల, తపస్సు వల్ల మరియు దానాల వల్ల ఏ ఏ పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడ్డాయో.. ఈ రహస్యాన్ని తెలుసుకున్న యోగి వాటన్నింటినీ మించిపోయి, పురాతనమైన పరమ పదమును పొందుతాడు. (8.28)
అధ్యాయం 9: రాజవిద్యారాజగుహ్య యోగం
- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! నీవు దోషదృష్టిలేని భక్తుడవు. కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మఱల విశిదముగ చెప్పుచున్నాను. దీనిని తెలిసికొని నీవు ఈ దుఃఖరూపసంసారమునుండి ముక్తుడవు కాగలవు. (9.1)
- ఈ విజ్ఞానసహితజ్ఞానము (నిర్గుణ సగుణ పరమాత్మతత్త్వజ్ఞానము) అన్ని విద్యలకును తలమానికము. సమస్త గోప్యవిషయములకును శిరోభూషణము, అతి పవిత్రము. ఉత్తమోత్తమము. ప్రత్యక్షఫలదాయకము. ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. (9.2)
- ఓ పరంతపా! ఈ ధర్మమార్గమునందు విశ్వాసములేని పురుషులు నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూపసంసారచక్రమున పరిభ్రమించుచుందురు. (9.3)
- నిరాకారపరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలె పరిపూర్ణమైయున్నది. ప్రాణులన్నియును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములైయున్నవి. కాని వాస్తవముగా నేను వాటియందు స్థితుడనుకాను. (9.4)
- ఈ ప్రాణులన్నియును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములన్నింటిని సృష్టించునదియు, పోషించునదియు నేనేయైనను యథార్థముగా నా ఆత్మ వాటియందు స్థితమై యుండదు. (9.5)
- ఆకాశమునుండి ఉత్పన్నమై సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమైయుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు (ప్రాణులు) అన్నియును నాయందే స్థితమై యుండును అని ఎఱుంగుము. (9.6)
- ఓ కౌంతేయా! కల్పాంతమునందు భూతములన్నియును నా ప్రకృతినే చేరును. అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాదియందు నేను మఱల వాటిని సృజించుచుందును. (9.7)
- తమతమ స్వభావవశమున పరతంత్రమైయున్న భూతసముదాయమును నాప్రకృతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. (9.8)
- ఓ అర్జునా! ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తిరహితుడనై, ఉదాసీనునివలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. (9.9)
- ఓ అర్జునా! అధిష్ఠాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచరజగత్తును సృష్టించుచున్నది. ఈ కారణమువలననే సంసారచక్రము పరిభ్రమించుచున్నది. (9.10)
- నా పరమభావమును ఎఱుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను (ప్రభువును) ఐన నన్ను లోకకల్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్యమానవునిగా భావించి, తక్కువగా ఊహింతురు. (9.11)
- వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులుగల అజ్ఞానులు రాక్షసీ-ఆసురీ – మోహినీ స్వభావములను ఆశ్రయింతురు. (9.12)
- కాని ఓ పార్థా! దైవీప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూలకారణముగను, అవ్యయునిగను (అక్షరస్వరూపునిగను) తెలిసికొని, నిశ్చలమనస్కులై నిరంతరము నన్నే భజింతురు. (9.13)
- ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్యబృందముతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదేపదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు. (9.14)
- మఱికొందరు జ్ఞానయోగులు నిర్గుణనిరాకారబ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞనముద్వారా అభేదభావముతో ఉపాసించుచుందురు. మఱికొందరు అనంతరూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావముతో ఆరాధించుచుందురు. (9.15)
- నేనే క్రతువును. నేనే యజ్ఞమును, స్వధయును నేనే, ఓషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూపక్రియయును నేనే. (9.16)
- ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మలఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయును నేనే. తెలిసికొనదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. ఋక్సామయజుర్వేదములను నేనే. (9.17)
- పరమగతియైన పరమధామమును, జగత్తును భరించి, పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే, అందఱికిని నివాసస్థానమును, శరణుపొందదగినవాడను నేనే, ప్రత్యుపకారమును ఆశింపక హితమొనర్చువాడను, అందఱి ఉత్పత్తిప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వతకారణమును నేనే. (9.18)
- ఓ అర్జునా! సూర్యుని రూపంలో నేను వేడిని ఇస్తున్నాను. సముద్రములనుండి నీటిని గ్రహించి, వర్షరూపమున మఱల వదలెదను. అమృతమును, మృత్యువును గూడ నేనే. సత్తును (శాశ్వతమైన ఆత్మను) అసత్తును (నశ్వరమైన సమస్త వస్తుజాలమును) గూడ నేనే. (9.19)
- ఋగ్యజుస్సామవెవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును, పాప రహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి, స్వర్గ ప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చట దేవతల దివ్యభోగములను అనుభవింతురు. (9.20)
- ఆ విశాలస్వర్గమునందు భోగములను అనుభవించి, పుణ్యములు అయిపోగానే (క్షీణింపగానే) మఱల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయవిహిత సకామకర్మలను ఆశ్రయించువారు, భోగములను ఆసించుచూ స్వర్గమర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమునకు వచ్చెదరు. (9.21)
- పరమేశ్వరుడనైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతనచేయుచు, నిష్కామ భావముతో సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. (అప్రాప్త వస్తుప్రాప్తిని ‘యోగము’ అనియందురు. ప్రాప్తించిన వస్తురక్షణమును ‘క్షేమము’ అని యందురు.) (9.22)
- ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని వారిపూజలు అవిధిపూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి. (9.23)
- ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్త్వమును ఎఱుంగరు. కావున పతనమగుదురు. అనగా పునర్జన్మను పొందుదురు. (9.24)
- దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. (9.25)
- నిర్మలబుద్ధితో, నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమునుగాని, పుష్పమునుగాని, ఫలమునుగాని, జలమునుగాని, నేను ప్రత్యక్షముగా (స్వయముగా) ప్రీతితో ఆరగింతును. (9.26)
- ఓ కౌంతేయా! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. (9.27)
- ఈ విధముగా సన్న్యాసయోగమునందు స్థిరచిత్తుడవై. అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూపకర్మబంధములనుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే చేరగలవు. (9.28)
- నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారియందు ప్రత్యక్షముగా ఉందును. (9.29)
- మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో ఆతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మఱియొకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. (9.30)
- కౌంతేయా! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును. శాశ్వతమైన పరమశాంతిని పొందును. ‘నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు’ అను విషయమును నిశ్చయముగా ఎఱుంగుము. (9.31)
- ఓ అర్జునా! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాదిపాపయోనిజులును నన్ను శరణుపొంది పరమగతినే పొందుదురు. (9.32)
- ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులును, రాజర్షులును, భక్తులును నన్ను శరణుపొందినచో వారు పరమపదమునుచేరుదురని చెప్పవలసిన పనియేలేదు. ఈ మానవశరీరము క్షణభంగురము. సుఖరహితము. ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది – నిరంతరము నన్నే భజింపుము. (9.33)
- నా యందే నీ మనస్సును లగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజింపుము. నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి, మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. (9.34)
అధ్యాయం 10: విభూతి యోగం
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ మహాబాహో! నాపై అమితమైన ప్రేమ గల నీ మేలు కోరి నేను చెప్పబోయే అత్యున్నతమైన మాటలను మళ్ళీ ఒకసారి వినుము. (10.1)
- నా పుట్టుకను దేవతలు కానీ, మహర్షులు కానీ ఎవరూ ఎరుగరు. ఎందుకంటే, దేవతలకు మరియు మహర్షులకు అన్ని విధాలా ఆది కారణం నేనే. (10.2)
- ఎవరైతే నన్ను పుట్టుక లేనివానిగా, ఆది లేనివానిగా మరియు సర్వలోకాలకు అధిపతిగా గుర్తిస్తారో, మనుష్యులలో అట్టి జ్ఞాని మోహము లేనివాడై సమస్త పాపాల నుండి విముక్తి పొందుతాడు. (10.3)
- బుద్ధి, జ్ఞానం, నిలకడ, క్షమ, సత్యం, ఇంద్రియ నిగ్రహం (దమః), మనో నిగ్రహం (శమః), సుఖదుఃఖాలు, పుట్టుక-గిట్టుకలు, భయం-అభయం, అహింస, సమత్వం, తృప్తి, తపస్సు, దానం, కీర్తి-అపకీర్తి – ప్రాణులలో కలిగే ఇటువంటి రకరకాల భావాలన్నీ నా నుండే కలుగుతున్నాయి. (10.4-10.5)
- సప్తర్షులు, వారి కంటే ముందున్న నలుగురు బ్రహ్మమానస పుత్రులు (సనకసనందనాదులు) మరియు మనువులు.. వీరంతా నా సంకల్పం వల్లే నా నుండి పుట్టారు. లోకంలోని ప్రజలంతా వీరి సంతానమే. (10.6)
- నా యొక్క విభూతులను, యోగ శక్తిని ఎవరైతే యదార్థంగా తెలుసుకుంటారో.. వారు అచంచలమైన భక్తి యోగంతో నన్ను చేరుకుంటారు. ఇందులో సందేహం లేదు. (10.7)
- సమస్త సృష్టికి మూలం నేనే. అంతా నా వల్లే నడుస్తోంది. ఇలా తెలుసుకున్న జ్ఞానులు అత్యంత అనురాగంతో, శ్రద్ధతో నన్ను భజిస్తారు. (10.8)
- నా యందే మనస్సు నిలిపిన వారు, నాకే తమ ప్రాణాలను అర్పించిన వారు.. ఒకరికొకరు నా గురించి బోధించుకుంటూ, నిరంతరం నా లీలలను చెప్పుకుంటూ.. ఎల్లప్పుడూ సంతృప్తిని, ఆనందాన్ని పొందుతారు. (10.9)
- మనస్సు ఎల్లప్పుడూ నా యందే లగ్నమై, అత్యంత ప్రేమతో నన్ను భజించే వారికి.. నన్ను చేరుకోవడానికి కావలసిన జ్ఞానమును నేనే ప్రసాదిస్తాను. (10.10)
- వారిపై గల కరుణతో, వారి అంతఃకరణలో ఉండి.. అజ్ఞానం వల్ల కలిగే చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞానదీపంతో నేను నశింపజేస్తాను. (10.11)
- అర్జునుడు పలికెను: నీవు పరబ్రహ్మవు, పరమ ధామమువు మరియు పరమ పవిత్రుడవు. నిన్ను శాశ్వతుడైన దివ్య పురుషుడిగా, ఆదిదేవుడిగా, పుట్టుక లేనివానిగా, సర్వవ్యాపిగా ఋషులందరూ కొనియాడారు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు నీవు స్వయంగా నాకు అదే చెబుతున్నావు. (10.12-10.13)
- ఓ కేశవా! నీవు నాకు చెప్పినదంతా సత్యమని నేను నమ్ముతున్నాను. ఓ భగవంతుడా! నీ ఆవిర్భావాన్ని దేవతలు కానీ, దానవులు కానీ ఎవరూ ఎరుగరు. (10.14)
- ఓ పురుషోత్తమా! ప్రాణులను సృష్టించేవాడా, ప్రాణులకు అధిపతివైనవాడా, దేవతలకు దేవుడవైనవాడా, విశ్వపాలకా! నిన్ను నీవు మాత్రమే నీ జ్ఞానంతో తెలుసుకోగలవు. (10.15)
- నీవు ఏ ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకాలన్నింటినీ వ్యాపించి ఉన్నావో.. అట్టి నీ విభూతుల గురించి నాకు పూర్తిగా వివరించవలసిందిగా కోరుతున్నాను. (10.16)
- ఓ యోగీశ్వరా! నిన్ను నిరంతరం ధ్యానిస్తూ నేను ఎలా తెలుసుకోగలను? ఓ భగవంతుడా! ఏ ఏ వస్తువులలో లేదా భావాలలో నిన్ను నేను స్మరించాలి? (10.17)
- ఓ జనార్దనా! నీ యోగ శక్తిని, విభూతులను గురించి నాకు మళ్ళీ వివరంగా తెలుపుము. నీ అమృతప్రాయమైన మాటలను వింటుంటే నాకు తృప్తి కలగడం లేదు (అంటే ఇంకా వినాలని ఉంది). (10.18)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ కురుశ్రేష్ఠా! నా దివ్యమైన విభూతులలో ముఖ్యమైన వాటిని నీకు వివరిస్తాను. ఎందుకంటే నా విభూతుల వివరణకి అంతమే లేదు. (10.19)
- ఓ గుడాకేశా! సమస్త ప్రాణుల హృదయాలలో నివసించే ఆత్మను నేనే. ప్రాణులందరికీ ఆది, మధ్యము మరియు అంతము నేనే. (10.20)
- ద్వాదశ ఆదిత్యులలో నేను విష్ణువును. కాంతినిచ్చే జ్యోతులలో కిరణాలు కలిగిన సూర్యుడిని. మరుత్తులలో నేను మరీచిని. నక్షత్రాలలో నేను చంద్రుడిని. (10.21)
- వేదాలలో నేను సామవేదాన్ని. దేవతలలో నేను ఇంద్రుడిని. ఐదు ఇంద్రియాలలో నేను మనస్సును. ప్రాణులలో నేను చైతన్యమును. (10.22)
- ఏకాదశ రుద్రులలో నేను శంకరుడిని. యక్ష రాక్షసులలో నేను కుబేరుడిని. అష్ట వసువులలో నేను అగ్నిని. శిఖరాలు గల పర్వతాలలో నేను మేరు పర్వతాన్ని. (10.23)
- ఓ పార్థా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే అని తెలుసుకో. సేనాధిపతులలో నేను కుమారస్వామిని. జలాశయాలలో నేను సముద్రాన్ని. (10.24)
- మహర్షులలో నేను భృగు మహర్షిని. మాటలలో ఏకాక్షరమైన ఓంకారమును. యజ్ఞాలన్నింటిలో నేను జపయజ్ఞాన్ని. కదలని వస్తువులలో నేను హిమాలయ పర్వతాన్ని. (10.25)
- వృక్షాలన్నింటిలో నేను రావిచెట్టును. దేవర్షులలో నేను నారదుడిని. గంధర్వులలో నేను చిత్రరథుడిని. సిద్ధులలో నేను కపిలమునిని. (10.26)
- గుర్రాలలో అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు పుట్టిన ఉచ్చైఃశ్రవమును. ఏనుగులలో ఐరావతాన్ని. మనుష్యులలో రాజును నేనే అని తెలుసుకో. (10.27)
- ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని. ఆవులలో నేను కామధేనువును. సంతానాన్ని కలిగించే మన్మథుడిని నేనే. సర్పాలలో నేను వాసుకిని. (10.28)
- నాగులలో నేను శేషనాగును. జలచరాలకు అధిపతియైన వరుణుడిని. పితృదేవతలలో నేను అర్యముడిని. శిక్షించేవారిలో నేను యమధర్మరాజును. (10.29)
- దైత్యులలో నేను ప్రహ్లాదుడిని. లెక్కించేవాటిలో నేను కాలాన్ని. జంతువులలో నేను సింహాన్ని. పక్షులలో నేను గరుత్మంతుడిని. (10.30)
- పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును; శస్త్రధారులలో రాముడను. జలచరాలలో మొసలిని, మరియు ప్రవహించే నదులలో గంగా నదిని. (10.31)
- ఓ అర్జునా! సృష్టికి ఆది, అంతము మరియు మధ్యము నేనే. విద్యలన్నింటిలో మోక్షాన్నిచ్చే అధ్యాత్మ విద్యను. తర్కించేవారిలో సత్యాన్ని నిర్ణయించే వాదాన్ని నేనే. (10.32)
- అక్షరాలలో మొదటిదైన ‘అ’ కారమును. సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని. నాశనం లేని కాలాన్ని నేనే. సర్వవ్యాపియైన పోషకుడిని నేనే. (10.33)
- అందరినీ హరించే మృత్యువును నేనే. ఇకముందు పుట్టబోయే వారికి కారణాన్ని నేనే. స్త్రీలలో కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, మేధస్సు, ధైర్యం మరియు క్షమ అనే గుణాలు నేనే. (10.34)
- సామవేద మంత్రాలలో బృహత్సామను. ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును. నెలలలో మార్గశీర్ష మాసాన్ని. ఋతువులలో పూలు వికసించే వసంత ఋతువును. (10.35)
- వంచించేవారిలో జూదాన్ని. తేజస్సు గలవారిలో తేజస్సును. విజేతలలో విజయాన్ని. ప్రయత్నించేవారిలో నిశ్చయాన్ని. సాత్విక గుణం గలవారిలో సత్త్వ గుణాన్ని నేనే. (10.36)
- వృష్ణి వంశీయులలో వాసుదేవుడిని. పాండవులలో అర్జునుడిని. మునులలో వేదవ్యాసుడిని. కవులలో శుక్రాచార్యుడిని. (10.37)
- శిక్షించేవారిలో దండనను. విజయాన్ని కోరేవారిలో నీతిని. రహస్యాలలో మౌనాన్ని. జ్ఞానులలో జ్ఞానాన్ని నేనే. (10.38)
- ఓ అర్జునా! సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఈ చరాచర సృష్టిలో నా ప్రమేయం లేకుండా ఏ వస్తువు కూడా ఉండదు. (10.39)
- ఓ పరంతప! నా దివ్య విభూతులకు అంతం లేదు. నేను నీకు వివరించినది నా అనంతమైన విభూతులలో ఒక చిన్న భాగం మాత్రమే. (10.40)
- ఐశ్వర్యంతో కూడినవి, శోభాయమానమైనవి, శక్తివంతమైనవి ఏ ఏ వస్తువులు ఉన్నాయో.. అవన్నీ నా తేజస్సులోని ఒక చిన్న అంశం నుండి పుట్టినవేనని తెలుసుకో. (10.41)
- ఓ అర్జునా! ఈ వివరాలన్నీ నీకెందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ అనంతమైన జగత్తునంతటిని నేను నాలోని ఒక చిన్న అంశతో ధరించి, దీనికంతటికీ ఆధారమై ఉన్నాను. (10.42)
అధ్యాయం 11: విశ్వరూపసందర్శన యోగం
- అర్జునుడు పలికెను- ఓ కృష్ణా! నన్ను అనుగ్రహింపదలచి పరమగోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దానివలన నా అజ్ఞానము (మోహము) తొలగిపోయినది. (11.1)
- ఓ కమలాక్షా! ఓ కృష్ణా! సమస్తప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు వింటిని. (11.2)
- ఓ పరమేశ్వరా! నీవు చెప్పినదంతయు సత్యమే. అందు సందేహమునకు తావులేదు. కాని, ఓ పురుషోత్తమా! జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. (11.3)
- ఓ యోగేశ్వరా! ఓ ప్రభూ! నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో, శాశ్వతమైన నీ దివ్యస్వరూపమును నాకు చూపింపుము. (11.4)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! అసంఖ్యాకములైన, బహువిధములైన, పెక్కువర్ణములు, ఆకృతులు గల నా అలౌకికరూపములను చూడుము. (11.5)
- ఓ అర్జునా! ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశరుద్రులను, అశ్వినీ కుమారులను, మరుద్గగణములను నాయందు చూడుము. అంతేగాక ఇంకను మునుపెన్నడును చూచి యెరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. (11.6)
- ఓ అర్జునా! నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమైయున్న సమస్తచరాచర జగత్తును చూడుము. అంతేగాక, ఇంకను నీవు చూడదలచుకొనిన వాటినన్నింటినీ చూడుము. (11.7)
- కాని, ఈ ప్రాకృత (చర్మ) చక్షువులతో నా ఈ రూపమును నీవు నిజముగా (నిస్సందేహముగా) చూడజాలవు. కనుక, నీకు దివ్య (అలౌకిక) దృష్టిని ప్రసాదించుచున్నాను. ఆ దివ్యదృష్టితో నా ఈశ్వరీయ (దివ్య) యోగశక్తిని చూడుము. (11.8)
- సంజయుడు పలికెను- ఓ రాజా! మహాయోగేశ్వరుడును, పాపములను హరించువాడును ఐన భగవానుడు ఈ విధముగా పలికి, అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమదివ్యస్వరూపమును అర్జునునకు చూపెను. (11.9)
- అనేకములైన ముఖములతో, నేత్రములతో, పెక్కు అద్భుత దృశ్యములను కలిగిన, అనేకములగు దివ్యాభరణములను ధరించిన, అనేకములైన దివ్యాయుధములను చేపట్టినటువంటి (ఆ దేవదేవుని విరాడ్రూపమును అర్జునుడు దర్శించెను). దివ్యములైన మాలలను వస్త్రములను ధరించిన, దివ్యములైన చందన పరిమళములను దశ దిశల గుబాళింప చేయుచున్న, సర్వాశ్చర్యకరమైన, అనంతమైన, సర్వత్ర ముఖ శోభలను విరిజిమ్ముచున్న ఆ దేవదేవుని విరాడ్రూపమును (అర్జునుడు దర్శించెను). (11.10-11.11)
- ఆకాశమున వేలకొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో, వచ్చు కాంతి పుంజములను ఆ విరాట్ – రూపతేజస్సులకు సాటిరావు. (11.12)
- ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేర్వేరుగా ఒకే చోట కేంద్రీకృతమైయున్నట్లు చూచెను. (11.13)
- అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును జూచి, అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకితగాత్రుడయ్యెను. తేజోమయమైన ఈ విశ్వ (విరాట్) రూపమునకు భక్తిశ్రద్ధలతో సాష్టాంగప్రణామములాచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. (11.14)
- అర్జునుడు పలికెను – ఓ దేవాదిదేవా! నీ విరాట్ – రూపమునందు సకల దేవతలను, నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్యసర్పములను చూచుచున్నాను. (11.15)
- ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగ విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్త్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను. (11.16)
- హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యునివలెను వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము దుర్నిరీక్ష్యమై యున్నది. (11.17)
- పరమ – అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే, కనుక అందరికిని తెలిసికొనదగినవాడవు. ఈజగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. సనాతనపురుషుడవు, అని నా విశ్వాసము. (11.18)
- నీవు ఆదిమధ్యాంతరహితుడవు. అపరిమితశక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు. అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సుతో ఈ జగత్తును సంతప్తమొనర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. (11.19)
- ఓ మహాత్మా! దివినుండి భువివఱకుగల అంతరిక్షమునందంతటను, అన్ని దిశలలోను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అద్భుతమైన నీ భయంకరరూపమును చూచి, ముల్లోకములును గడగడలాడుచున్నవి. (11.20)
- ఇదిగో, ఆ దేవతలెల్లరును నీలో ప్రవేశించుచున్నారు. కొందఱు భయపడినవారై అంజలి ఘటించి, నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులును, సిద్ధులును స్వస్తివచనములతోడను, ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. (11.21)
- ఏకాదశరుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, సాధ్యులును, విశ్వేదేవతలును, అశ్వినీకుమారులును, మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వయక్షాసురసిద్ధసముదాయములును సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. (11.22)
- హే మహాబాహో! అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువు(తొడ)లను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి, అందఱును భయకంపితులగుచున్నారు. నేనుకూడా భయముతో వణకిపోవుచున్నాను. (11.23)
- ఏలనన, హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేకవర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాలనేత్రములతో, విస్తరించినముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన, నా ధైర్యము సడలినది. శాంతి దూరమైనది. (11.24)
- ఓ జగన్నివాసా! కరాళదంష్ట్రలతో (భయంకరములైన కోరలతో) ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్నిజ్వాలలవలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నెమ్మది (శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్ము. (11.25)
- ఇదిగో! (ఇచ్చట చేరియున్న) ఈ ధృతరాష్ట్రపుత్రులు (దుర్యోధనాదులు) ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధానయోధులు అందఱును భయంకరములైన కోరలతోగూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులుదీయుచు ప్రవేశించుచున్నారు. కొందఱి తలలు కోరల మధ్యబడి నుగ్గునుగ్గైపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు. (11.26-27)
- అనేకములైన నదీనదములప్రవాహములన్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్ఠులైన సమరయోధులు (నరలోకవీరులు) కూడ జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు. (11.28)
- మిడుతలన్నియును మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి, తమ నాశనముకొఱకు అందు ప్రవేశించి, నశించునట్లు ఈ వీరులందఱును తమనాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ వక్త్రములయందు ప్రవేశించుచున్నారు. (11.29)
- హే విష్ణో! ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను కబళించుచు, అన్నివైపులనుండి మాటిమాటికిని ఆస్వాదించుచున్నావు. నీ ఉగ్రతేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి. (11.30)
- ఓ పరమాత్మా! నీకు నా నమస్కారములు – ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎఱుంగలేకున్నాను. (11.31)
- శ్రీ భగవానుడు పలికెను – నేను లోకములన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్ననూ ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగులరు. (మిగిలియుండరు). (11.32)
- కనుక ఓ సవ్యసాచీ! లెమ్ము, కీర్తి గాంచుము. శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందఱును నాచేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవుకమ్ము. (11.33)
- ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ (సైంధవ), కర్ణాది యుద్ధ వీరులందఱిని నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము. (11.34)
- సంజయుడు పలికెను – ఓ రాజా! శ్రీ కృష్ణపరమాత్మ యొక్క ఈ మాటలను విని, అర్జునుడు వణకుచు, చేతులు జోడించి నమస్కరించెను, మఱల మిక్కిలి భయముతో ప్రణమిల్లి, గద్గదస్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. (11.35)
- అర్జునుడు పలికెను – ఓ అంతర్యామీ! కేశవా! నీనామగుణప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగణములవారెల్లరును ప్రణమిల్లుచున్నారు. (11.36)
- ఓ మహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు – కనుక వారు (సిద్ధాదులందఱును) నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంతా! ఓ దేవేశా! ఓ జగన్నివాసా! సత్ – అసత్ లు నీవే. వాటికంటెను పరమైన అక్షరస్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘనపరబ్రహ్మవు నీవే. (11.37)
- ఓ అనంతరూపా! నీవు ఆదిదేవుడవు, సనాతనపురుషుడవు, ఈజగత్తునకు పరమాశ్రయుడవు. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు. పరంధాముడవు, ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమైయున్నది. (11.38)
- నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతియైన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకువేలకొలది నమస్కారములు. మఱల మఱల నమస్కారములు. ఇంకను నమస్కారములు. (11.39)
- అనంతసామర్థ్యముగలవాడా! నీకు ఎదురుగా ఉండియు, వెనుకనుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా! నీకు అన్నివైపులనుండియు నమస్కారములు. ఏలనన అనంతపరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు. అన్ని రూపములును నీవియే. (11.40)
- నీ మహిమను ఎఱుగక నిన్ను నా సఖునిగా భావించి, చనువుచేగాని, పొరపాటువలనగాని, ఓ కృష్ణా! ఓ యాదవా! ఓ మిత్రా! అనుచు తొందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుతా! విహారశయ్యాసనభోజనాది సమయములయందు ఏకాంతమునగాని, అన్యసఖుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి, నేను నిన్ను కించపఱచి యుండవచ్చును. ఓ అప్రమేయస్వరూపా! నా అపరాధములన్నింటిని క్షమింపుమని వేడుకొనుచున్నాను. (11.41-11.42)
- ఓ అనుపమప్రభావా! ఈ సమస్త చరాచరజగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు. గురుడవు. సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకములయందును నీతో సమానుడెవ్వడును లేడు. ఇంక నీకంటె అధికుడెట్లుండును? (11.43)
- కనుక ఓ ప్రభూ! నాశరీరమును నీపాదములకడనిడి, సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు ఐన నీవు నాయందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా! కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపుము. (11.44)
- మునుపు ఎన్నడునుచూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి, మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నామనస్సు కలవరపాటు పొందినది. కనుక దేవేశా! చతుర్భుజయుక్తుడవై విష్ణురూపముతోడనే నాకు దర్శనమిమ్ము. జగన్నివాసా! ప్రసన్నుడవు కమ్ము. (11.45)
- కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహూ! విరాడ్రూపా! నీ చతుర్భుజరూపమును నాకు చూపుము. (11.46)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! నీపైగల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ – రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది. అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకుముందు మఱి యెవ్వరును చూచియుండలేదు. (11.47)
- ఓ అర్జునా! వేదాధ్యయనములచేగాని, యజ్ఞాచరణములచేగాని, దానములచేగాని, తీవ్రతపశ్చర్యలచేగాని తదితర పుణ్యకర్మలచేగాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపము నీకుదప్ప మఱియెవ్వరికిని చూడశక్యము గాదు. (11.48)
- ఈ విధమైన నా ఈ భయంకరరూపమును చూచి, నీవు ఎట్టి వ్యథకును, మోహమునకును గురికావలదు. భయమును వీడి ప్రసన్నచిత్తుడవై శంఖచక్ర గదాపద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజరూపమును మరల చూడుము. (11.49)
- సంజయుడు పలికెను – వాసుదేవుడు ఈ విధముగా పలికి, అర్జునునకు తన చతుర్భుజరూపమును దర్శనమిచ్చెను. అనంతరము శ్రీ కృష్ణపరమాత్మ సౌమ్యమూర్తియైన తన కృష్ణరూపమును స్వీకరించి, భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. (11.50)
- అర్జునుడు పలికెను – ఓ జనార్దనా! మీ అతి సౌమ్యమైన మానవాకృతిని (శ్యామసుందర రూపమును) చూచి, ఇప్పుడు నా మనస్సు కుదుటబడినది నేను నా స్వాభావిక (సహజ) స్థితిని పొందితిని. (11.51)
- శ్రీ భగవానుడు పలికెను – నీవు చూచిన నా ఈ చతుర్భుజరూపముయొక్క దర్శనభాగ్యము అన్యులకు అత్యంతదుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరు చుందురు. (11.52)
- నీవు గాంచిన నా చతుర్భుజరూపమును దర్శించుటకు వేద పఠనములచేగాని, తపశ్చర్యలచేగాని, దానములచేగాని, యజ్ఞకర్మల చేగాని శక్యము కాదు. (11.53)
- కాని ఓ పరంతపా! అర్జునా! ఇట్టి నా చతుర్భుజరూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్త్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావస్థితినందుటకును కేవలము అనన్యభక్తిద్వారా మాత్రమే సాధ్యమగును. (11.54)
- అర్జునా! కర్తవ్యకర్మలను అన్నింటిని నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తిశ్రద్ధలుగలవాడును, ప్రాపంచిక విషయములయందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణియందును ఏమాత్రము వైరభావము లేనివాడును ఐన అనన్య (పరమ) భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. (11.55)
అధ్యాయం 12: భక్తి యోగం
- అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణరూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘననిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండువిధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విదులెవరు? (12.1)
- శ్రీ భగవానుడు ఇట్లనెను – పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణరూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు – అని నా అభిప్రాయము. (12.2)
- కాని ఏ పురుషులు అనిర్వచనీయమైన స్వరూపముగలవాడును, నిరాకారుడును , సర్వవ్యాపియైనవాడును, మనస్సుకు బుద్ధికి గోచరము గానివాడును, సర్వదా ఒకే స్థితిలో ఉండువాడును, నిశ్చలుడును, నిత్యుడును, శాశ్వతుడైన సచ్చిదానందఘనబ్రహ్మను ఏకీభావముతో ఉపాసింతురో…(ఏ పురుషులు) ఇంద్రియ సముదాయమును పూర్తిగా వశపఱచుకొని, అన్నిటియందును సమభావముగలవారై, సకల ప్రాణులకును హితముచేయగోరువారుగా ఉంటారో, వారు (యోగులు) నన్నే పొందుదురు. (12.3-4)
- కాని సచ్చిదానందఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తచిత్తులైనవారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతోగూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్తపరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. (12.5)
- కాని మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటిని నాయందే అర్పించి, సగుణపరమేశ్వరరూపమునే అనన్యభక్తియోగముతో సతతము చింతన చేయుచు భజించుచుందురో……… ఓ అర్జునా నాయందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగనే మృత్యురూపసంసారసాగరము నుండి ఉద్ధరించెదను. (12.6-7)
- నాయందే మనస్సు నిలుపుము. నాయందే బుద్ధిని లగ్నముచేయుము. పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏ మాత్రమూ సందేహమునకు తావులేదు. (12.8)
- మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడవు కానిచో అర్జునా! అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. (12.9)
- అభ్యాసముచేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుటద్వారాకూడ నన్నే పొందెదవు. (12.10)
- మత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని, సకల కర్మఫలములను త్యజింపుము. (12.11)
- తత్త్వము నెఱుంగకయే చేయు అభ్యాసముకంటెను జ్ఞానము శ్రేష్ఠము. కేవలము పరోక్ష జ్ఞానము కంటెను అనగా అనుభవరహితమైన జ్ఞానముకంటెను (శాస్త్ర పాండిత్యముకంటెను) పరమేశ్వరస్వరూపధ్యానము శ్రేష్ఠము. ధ్యానము కంటెను కర్మఫలత్యాగము మిక్కిలి శ్రేష్ఠమైనది. ఏలనన త్యాగమువలన వెంటనే పరమశాంతి లభించును. (12.12)
- ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణులయందును అవ్యాజమైనప్రేమ, కరుణ కలవాడును, మమతాహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను, దుఃఖము ప్రాప్తించినను, సమభావము కలిగియుండువాడును, క్షమాగుణము కలవాడును (అపరాధికిని అభయమును ఇచ్చువాడును)……సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడైయుండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకొనినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును, అయి నాయందే మనోబుద్దులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. (12.13-14)
- లోకమున ఎవరికిని ఉద్వేగము (క్షోభ) కలిగింపనివాడును, ఎవరివలనను తాను ఉద్వేజితుడు కానివాడును (ఉద్వేగమునకు గురికానివాడును), హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. (12.15)
- ఏమాత్రమూ కాంక్షలేనివాడు, శరీరేంద్రియమనస్సులయందు శుచియై యున్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చలింపనివాడును, సమస్తకర్మల యందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. (12.16)
- ఇష్టవస్తుప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికినీ శోకింపనివాడును, దేనినీ ఆసింపనివాడును, శుభాశుభకర్మలను త్యజించినవాడును, ఐన భక్తుడు నాకు ప్రియుడు. (12.17)
- శత్రువులయెడను, మిత్రులయెడను సమభావముతో మెలగువాడును, మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ఆసక్తిరహితుడును…. నిందాస్తుతులకు చలింపనివాడును, మననశీలుడును, శరీరనిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును, నివాసస్థానములయందు మమతాసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. (12.18-19)
- ఉపర్యుక్తధర్మ్యామృతమును సేవించుచు (పైనపేర్కొనభడిన ఉత్తమ గుణములను కలిగియుండి), నిష్కామభక్తిశ్రద్దలతో మత్పరాయణులైన భక్తులు నాకత్యంత ప్రియులు. (12.20)
అధ్యాయం 13: క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం
- అర్జునుడు పలికెను: ఓ కేశవా! ప్రకృతిని, పురుషుని, క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుని, జ్ఞానాన్ని, మరియు జ్ఞానము యొక్క లక్ష్యాన్ని నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. (13.1)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ కౌంతేయ! ఈ శరీరమును ‘క్షేత్రము’ అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎఱింగిన వానిని ‘క్షేత్రజ్ఞుడు’ అని తత్త్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. (13.2)
- ఓ అర్జునా! అన్ని క్షేత్రములయందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలిసికొనుము. క్షేత్ర క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికారసహిత (త్రిగుణాత్మకమైన) ప్రకృతి మరియు నిర్వికారపురుషులు తత్త్వములనుగూర్చి తెలుసుకోనుటయే ‘జ్ఞానము’ అని నా అభిప్రాయము. (13.3)
- క్షేత్రమనగానేమి? అది యెట్లుండును? దాని వికారములు (భావములు) ఏవి? ఆ వికారములు దేనినుండి ఏర్పడినవి? అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు? అతని ప్రభావమేమి? ఆ వివరములను అన్నింటిని సంక్షిప్తముగా తెలిపెదను వినుము. (13.4)
- క్షేత్ర, క్షేత్రజ్ఞులతత్త్వములనుగూర్చి ఋషులెల్లరును బహువిధములుగా వివరించిరి. వివిధవేదమంత్రములను వేర్వేరుగా తెల్పినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములుగూడ నిశ్చయాత్మకముగ సహేతుకముగా తేటతెల్లము గావించినవి. (13.5)
- పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూలప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియగ్రాహ్యవిషయములు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు). ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూలశరీరము, చైతన్యము ధృతి అను వికారములతో గూడిన ‘క్షేత్రస్వరూపము’ సంక్షిప్తముగా పేర్కొనబడినది. (13.6-7)
- తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, క్షమించుగుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతరశుద్ధి, అంతఃకరణస్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము. ఇంద్రియార్థములయందు వైరాగ్యము (ఇహపరలోక భోగములన్నింటియందును ఆసక్తి లేకుండుట), అహంకార రాహిత్యము, జన్మ, మృత్యు, జరా (ముసలితనము) రోగాదులయందు దుఃఖదోషములను పదేపదే దర్శించుట. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగువానియందు మమతాసక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తుప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకును లోనుగాకుండుట, ఎల్లప్పుడును సమభావముతోనుండుట. పరమేశ్వరుడనైన నాయందు అనన్యయోగముద్వారా అవ్యభిచారిణీభక్తి కలిగియుండుట, ఏకాంత పవిత్రప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులైన జనులయెడ ఆసక్తిలేకుండుట. ఆధ్యాత్మికజ్ఞానమునందు నిత్యస్థితుడై యుండుట, తత్త్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడేయని యెఱుంగుట – ఇవియన్నియును (అమానిత్వము మొదలుకొని తత్త్వజ్ఞానార్థదర్శనము వఱకుగల ఇవియన్నియును) జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము. (13.8-12)
- అనాదియైన (సనాతనుడైన) పరబ్రహ్మయే తెలిసికొనదగినవాడు. అతనిని తెలిసికొనుటవలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు(సత్ + అసత్ లకు) అతీతుడు. ఆ పరమాత్మనుగూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. (13.13)
- ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్ర స్థితములై యున్నవి. అతడు సర్వమును ఆవరించియున్నాడు. (13.14)
- అతడు ఇంద్రియగ్రాహ్య విషయములను అన్నింటిని ఎఱిగినవాడు. కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తిరహితుడైనను సమస్తజగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడయ్యును (గుణాతీతుడయ్యును) ప్రకృతి సంబంధమువలన గుణానుభవములను కలిగియుండువాడు. చరాచరభూతములన్నింటికిని బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ (పరమాణు) రూపుడైనందున తెలిసికొనశక్యముకానివాడు, అతిదూరముగాను, అతి సమీపముగను స్థితుడై ఉండువాడును అతడే. పరమాత్మ ఆకాశమువలె విభజించుటకు వీలులేని ఒకేరూపమున పరిపూర్ణుడైయున్నను, సమస్తచరాచరప్రాణులరూపమలలో వేరువేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్తయైన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. ఆ పరబ్రహ్మ అన్నిజ్యోతులకును జ్యోతి (పరంజ్యోతి) మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగినవాడును, తత్త్వజ్ఞానముద్వారా ప్రాప్యుడను అతడే. సర్వ ప్రాణుల హృదయములయందు విశేషముగా ఉండువాడును అతడే. (13.15-18)
- ఇంతవఱకును క్షేత్రమును గూర్చియు, జ్ఞానమును గూర్చియు, జ్ఞేయమును (తెలిసికొనదగిన పరమాత్మ స్వరూపమును) గుఱించియు సంక్షిప్తముగా వివరించితిని. ఈ తత్త్వమును సమగ్రముగా తెలుసికొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందును. (13.19)
- ప్రకృతి, పురుషుడు – అను ఈ రెండును అనాదియైన (సనాతనమైన) వనియు, రాగద్వేషాదివికారములును, త్రిగుణాత్మకములైన పదార్థములన్నియును ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు ఎఱుంగుము. (13.20)
- కార్యకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖదుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. (13.21)
- పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతినుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణసాంగత్యమే జీవాత్మయొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును. (13.22)
- ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షీభూతుడగుటవలన ‘ఉపద్రష్ట’ యనియు, యథార్థసమ్మతినిచ్చువాడగుట వలన ‘అనుమంత’ అనియు, అన్నింటిని ధరించి, పోషించువాడు అగుటవలన ‘భర్త’ అనియు, జీవరూపములో ‘భోక్త’ అనియు, బ్రహ్మాదులకును స్వామి యగుటవలన ‘మహేశ్వరుడు’ అనియు, శుద్ధసచ్చిదానందఘనస్వరూపుడగుట వలన ‘పరమాత్మ’ అనియు పిలవబడుచున్నాడు. (13.23)
- ఈ విధముగా పురుషుని తత్త్వమును, గుణసహితమైన ప్రకృతి తత్త్వమును తెలిసికొనినవాడు అన్ని విధములగు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికిని పునర్జన్మను పొందడు. (13.24)
- కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగముద్వారా తమ హృదయముల యందు చూతురు. మఱికొందరు (జ్ఞాన) యోగముద్వారాను, మఱికొందఱు కర్మయోగముద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు. (13.25)
- కానీ ఈ సాధనమార్గములనుగూర్చి ఎఱుగని మందబుద్ధులు తత్త్వజ్ఞానముగల ఇతరులనుండి విని, తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణపరాయణులును మృత్యురూపసంసార సాగరమునుండి నిస్సందేహముగా బయటపడుదురు. (13.26)
- ఓ అర్జునా! ఈ స్థావరజంగమప్రాణులన్నియును క్షేత్ర – క్షేత్రజ్ఞ సంయోగము వలనే ఉత్పన్నమగునని ఎఱుంగుము. (13.27)
- నశ్వరములైన చరాచర భూతముల (ప్రాణుల) యందు సమముగా స్థితుడైయున్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. (13.28)
- సమస్తప్రాణులయందును సమభావముతోనుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడుకాడు – అనగా తనను తాను నాశము చేసికొనువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందును. (13.29)
- సకలకర్మలు అన్నివిధములుగా ప్రకృతిద్వారానే జరుగుచున్నవనియు, ఆత్మ అకర్త అనియు ఎఱింగినవాడు వాస్తవముగ చూచువాడు. (13.30)
- వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నియును ఒకే పరమాత్మయందు స్థితమై యున్నవనియు, అట్లే అవి యన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నట్లుగా, ఎఱింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానందఘనపరబ్రహ్మను చేరును. (13.31)
- ఓ అర్జునా! నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికిని అనాది (సనాతనుడు) అగుటవలనను, నిర్గుణుడు అగుటవలనను ఎట్టి కర్మలకును కర్తకాడు. కనుక కర్మలతనిని ఏమాత్రమును అంటవు. (13.32)
- సర్వత్ర (ఇతరమహాభూతములయందు) వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మ మగుటవలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థిరమైయున్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములు దానికంటవు. (13.33)
- అర్జునా! ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమొనర్చున్నట్లు, ఒకే ఆత్మ సర్వప్రాణుల యందును స్థితమై, వాటినన్నింటిని ప్రకాశింప (చైతన్యవంతములుగా) జేయుచున్నది. (13.34)
- ఈ విధముగా క్షేత్ర – క్షేత్రజ్ఞులమధ్యగలఅంతరమును, కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎఱింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. (13.35)
అధ్యాయం 14: గుణత్రయ విభాగ యోగం
- శ్రీ భగవానుడు పలికెను – జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరల తెల్పబోవుచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలిసికొనిన మునులు సంసార బంధములనుండి విముక్తులై పరమ సిద్ధిని పొందిరి. (14.1)
- ఈ జ్ఞానమును ఆశ్రయించినవారు నాస్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులుసృష్ట్యాదియందు మఱల జన్మింపరు, ప్రళయకాలమున వ్యథనొందరు. (14.2)
- ఓ అర్జునా! నామహద్బ్రహ్మరూపమైన మూలప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము. దానియందు చేతనసముదాయరూపమైన బీజమును ఉంచెదను(స్థాపన చేసెదను). ఆ జడచేతనసంయోగమువలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. (14.3)
- ఓ అర్జునా! నానాయోనులయందు జన్మించు ప్రాణులను తనగర్భమున ధరించు మూలప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపనచేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి. నేనే జనకుడను. (14.4)
- ఓ అర్జునా! ప్రకృతినుండి ఉత్పన్నములైన సత్త్వరజస్తమోగుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించును. (14.5)
- ఓ పాపరహితుడా! ఈమూడింటిలో సత్త్వగుణము నిర్మలమైనది. కనుక ప్రకాశకమైనది. వికారరహితమైనది. కాని అది సుఖసాంగత్యమువలనజ్ఞానాభిమానము వలన మనుజుని బంధించును. (14.6)
- ఓ అర్జునా! రజోగుణము రాగాత్మకము. అదికామము, ఆసక్తులనుండిఉత్పన్నమగునని యెఱుంగుము. అది జీవాత్మను కర్మలయెుక్కయు, కర్మఫలములయెుక్కయు సాంగత్యముతో బంధించును. (14.7)
- అర్జునా! తమోగుణం సకలదేహాభిమానులను మోహితులనుగా చేయును. అజ్ఞానమువలన జనించును. అది జీవాత్మను ప్రమాదాలస్యనిద్రాదులతో బంధించును. (14.8)
- ఓ అర్జునా! సత్త్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును. రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును. తమోగుణం జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచివేయును. (14.9)
- ఓ అర్జునా! రజస్తమోగుణములనణచి సత్త్వగుణము వృద్ధిచెందును. సత్త్వతమోగుణములనణచి రజోగుణము వృద్ధిచెందును. అట్లే సత్త్వరజోగుణములనణచి తమోగుణము వృద్ధియగును. (14.10)
- శరీరేంద్రియములయందును, అంతఃకరణము నందును చైతన్యము, వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్త్వగుణము వృద్ధిచెందినదని తలంపవలెను. (14.11)
- ఓ అర్జునా! రజోగుణము వృద్ధియైనప్పుడు లోభము, ప్రవృత్తి, (ప్రాపంచిక విషయములయందు ఆసక్తి) స్వార్థబుద్ధితో సకామభావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములయందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. (14.12)
- ఓ అర్జునా! తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును, ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్యకర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపజేయు వ్యర్థచేష్టలు, నిద్రాదివృత్తులు మెుదలగునవి ఉత్పన్నములగుచుండును. (14.13)
- సత్వగుణము వృద్ధిచెందినపుడు మనుజుడు మరణించినచో, అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరెడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందును. (14.14)
- రజోగుణము వృద్ధిచెందినపుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధిచెందినప్పుడు మృతిచెందిన మానవుడు పశుపక్షికీటకాది నీచయోనులలో జన్మించుచుండును. (14.15)
- శ్రేష్ఠములైన కర్మలను ఆచరించుటవలన సాత్త్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మలఫలములు కలుగును. రాజసకర్మలకు ఫలము దుఃఖము. తామసకర్మలకు ఫలము అజ్ఞానము. (14.16)
- సత్త్వగుణమువలన జ్ఞానమూ, రజోగుణమువలన లోభమూ, తమోగుణము వలన ప్రమాద మోహాదులూ, అజ్ఞానమూ, తప్పక ఉత్పన్నము లగుచుండును. (14.17)
- సత్త్వగుణస్థితులు స్వర్గాది – ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్థితులైన (రాజస)పురుషులు మధ్య (మానవ) లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రాప్రమాదాలస్యాదులయందు స్థితులైనవారు అధోగతిని అనగా కీట, పశుపక్ష్యాది యోనులను, నరకములను పొందుదురు. (14.18)
- ద్రష్టయైనవాడు గుణములే గుణములయందు వర్తించుచున్నవనియూ, త్రిగుణములు తప్ప వేఱుగా కర్తలు లేరనియూ తెలిసికొని, త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపుడనైన నా తత్త్వమును తెలిసికొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును. (14.19)
- దేహోత్పత్తికి కారణరూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ, మృత్యు, జరా(వార్ధక్య), దుఃఖములనుండి విముక్తుడై, పరమానందమును పొందును. (14.20)
- అర్జునుడు పలికెను – ఓ ప్రభూ! ఈ మూడు గుణములకును అతీతుడైనవాని లక్షణములెవ్వి? అతని లోకవ్యవహారరీతి యెట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? (14.21)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ పాండవా! సత్త్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణకార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము, తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు – అనగా వాటిని గూర్చివిచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు అనగా ఎల్లప్పుడును ఒకే స్థితిలోనుండును. త్రిగుణములకును, వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చలింపక, త్రిగుణాతీతుడు, ఉదాసీనుని వలె(సాక్షివలె) ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించు చున్నవని తలంచును. అతడు సచ్చిదానందఘన పరమాత్మయందు ఏకీభావస్థితుడై యుండును. ఈ స్థితినుండి ఎన్నడును చలింపడు. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై యుండును. సుఖదుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారములయందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటి యందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకుగాని, నిందాస్తుతులకు గాని తొణకడు. అనగా రెండింటి యందును సమస్థితిలోనే యుండును. మానావమానములయందును, మిత్రులయందును, శత్రువులయందును సమభావముతో ప్రవర్తించు వాడును, విధ్యుక్తకర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతు డనబడును. (14.22-25)
- అనన్య (నిర్మలమైన) భక్తియోగముద్వారా నన్నే నిరంతరము భజించువాడును,ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైనవాడును అగు పురుషుడు సచ్చిదానందఘనపరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. (14.26)
- ఏలనన అట్టి శాశ్వతపరబ్రహ్మకును, అమృతత్వ మునకును, సనాతన ధర్మమునకును, అఖండా నందమునకును నేనే ఆధారము. (14.27)
అధ్యాయం 15: పురుషోత్తమ ప్రాప్తి యోగం
- శ్రీ భగవానుడు పలికెను – ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్యశాఖగా(కాండముగా), వేదములే పర్ణములు(ఆకులు)గా గల ఈ సంసారరూప-అశ్వత్థవృక్షము నాశరహితమైనది(శాశ్వతమైనది). ఈ సంసార వృక్షతత్త్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎఱిగిన వాడు. (15.1)
- ఈ సంసారవృక్షమును త్రిగుణములనెడిజలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధిపొందు శాఖలే దేవమనుష్యతిర్యగ్యోనులలో జన్మించుప్రాణులు, చిగుళ్లే విషయభోగములు. ఈ శాఖలు, చిగుళ్ళు సర్వత్ర వ్యాపించియున్నవి. మనుజులను కర్మాను సారముగా బంధించు అహంకార మమకార వాసనలనెడి వేర్లు, ఊడలు అన్నిలోకములలోను క్రింద, పైన వ్యాపించి ఉన్నవి. (15.2)
- ఈ సంసారవృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణంపబడిన రీతిగా లభ్యముగాదు. ఏలనన ఇది ఆదియు, అంతము, సరియైన స్థితియు లేనిది. కనుక అహంకారమమకారవాసనారూపములైన ధృఢమైన వేర్లు, ఊడలు గల ఈ సంసారరూప అశ్వత్థవృక్షమును నిశితమైన వైరాగ్యమనెడి శస్త్రముతో ఖండించి. అనంతరము ఆ పరమపదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగ అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరునినుండియే ఈ పురాతన సంసారవృక్షపరంపర విస్తరించియున్నది. అట్టి ఆదిపురుషుడైననారాయణునే శరణుపొంది, దృఢనిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన, నిధిధ్యాసాదులు చేయవలెను. (15.3-4)
- దురభిమానమును, మోహమును త్యజించినవారును, ఆసక్తియను దోషమును జయించినవారును, ప్రాపంచికవాంఛలనుండి పూర్తిగా మఱలినవారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైనవారును, సుఖదుఃఖాదిద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. (15.5)
- స్వయంప్రకాశస్వరూపమైన నాపరంధామమును సూర్యుడుగాని, చంద్రుడుగాని , అగ్నిగాని ప్రకాశింప జేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మఱల ఈ జగత్తున ప్రవేశింపరు. అనగా జన్మింపరు. (15.6)
- ప్రాణి లోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతియందు స్థితములైన మనస్సు, ఇంద్రియములను, శబ్దాదివిషయములద్వారా తనవైపు ఆకర్షించును. (15.7)
- వాయువు వాసనలను ఒకచోటినుండి మఱియొక చోటికి తీసికొని పోయినట్లుగా దేహాదులకు స్వామియైన జీవాత్మ ఒక శరీరమును త్యజించునపుడు, మనస్సు ఇంద్రియములను గ్రహించి, వాటితో గూడ మఱొక శరీరమును పొందును. అనగా దానిలో ప్రవేశించును. (15.8)
- ఈ జీవాత్మ త్వక్ఛక్షుశ్ర్శోత్రజిహ్వాఘ్రాణములు అనెడి పంచేంద్రియములను, మనస్సును ఆశ్రయించి, శబ్దాదివిషయములను అనుభవించును. (15.9)
- జీవాత్మ శరీరమును త్యజించునప్పుడును, శరీరమునందు స్థితుడై యున్నప్పుడును, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలిసికొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమజ్ఞాననేత్రములవలన స్వస్వరూపమును తెలిసికొన గల్గుదురు. (15.10) (See BG 9.11, BG 4.9)
- అంతఃకరణశుద్ధిగల యోగులు తమహృదయముల యందున్న ఈ ఆత్మతత్త్వమును ప్రయత్నశీలురై తెలిసికొనగలరు. కాని, అంతఃకరణశుద్ధిలేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు, ఈ ఆత్మను తెలిసికొన జాలరు. (15.11)
- సమస్తజగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్నితేజస్సును నాతేజస్సేయని యెఱుంగుము. (15.12)
- పృథ్వియందు ప్రవేశించి, నేను నా శక్తిద్వారా సకల భూతములను ధరించి, పోషించుచున్నాను. రసస్వరూపుడనై – అనగా అమృతమయముడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికిని పుష్టిని చేకూర్చుచున్నాను. (15.13)
- నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో సర్వప్రాణుల శరీరముల యందుండి నాలుగువిధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును. (15.14)
- సమస్తప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్న వాడను నేనే. నానుండియే స్మృతి, జ్ఞానము, అపోహనము (సందేహమును తొలగించుట) కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను గూడ నేనే. (15.15)
- ఈ జగత్తునందు క్షరుడు (నశ్వరుడు), అక్షరుడు (వినాశరహితుడు) అని పురుషులు రెండు విధములుగా గలరు. సకలప్రాణులశరీరములు నశ్వరములు. జీవాత్మ నాశరహితుడు. (15.16)
- పై ఇద్దరికంటెను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకములయందును ప్రవేశించి అందఱిని భరించి పోషించుచున్నాడు. (15.17)
- ఏలనన, నశ్వరమగు జడవర్గము (క్షేత్రము) కంటెను నేను సర్వథా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈజగత్తునందును, వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధి కెక్కితిని. (15.18)
- ఓ అర్జునా! జ్ఞానియైనవాడు ఈ విధముగా నన్ను తత్త్వతః పురుషోత్తమునిగా ఎఱుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. (15.19)
- ఓ పుణ్యపురుషా! ఓ అర్జునా! అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్త్వమును తెలిసికొనిన మనుష్యుడు జ్ఞానియై కృతార్థుడు కాగలడు. (15.20)
అధ్యాయం 16: దైవాసుర సంపద విభాగ యోగం
- శ్రీ భగవానుడు పలికెను – నిర్భయత్వము, అంతఃకరణశుద్ధి, తత్త్వజ్ఞానప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్వికదానము, ఇంద్రియనిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రములపఠన, పాఠనములు మఱియు భగవంతుని నామగుణకీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకొనుట, శరీరేంద్రియాంతఃకరణముల సరళత్వము (ఆర్జవము). అహింస (మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరికిని ఏ విధముగను కష్టమును కల్గింపకుండుట), సత్యము (యథార్థమైన, ప్రియమైన భాషణము), అక్రోధము (తనకు అపకారము చేయువారిపైనకూడ కోపము లేకుండుట), త్యాగము (కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట), శాంతి (చిత్తచాంచల్యము లేకుండుట), అపైశునము (ఎవరినీ నిందింపకుండుట), దయ (అన్ని ప్రాణులయెడ నిర్హేతుక కృప), అలోలుప్త్యము (ఇంద్రియవిషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట), మార్దవము (కోమలత్వము), శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట (సిగ్గుపడుట), అచాపలము (వ్యర్ధచేష్టలు చేయకుండుట). ఓ అర్జునా! తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము (బాహ్యశుద్ధి), అద్రోహము (ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట), అమానిత్వము (తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట) మొదలగునవి యన్నియును దైవీసంపదగలవాని లక్షణములు. (16.1-3)
- ఓ పార్థా! దంభము (కపటము), దర్పము (మొండితనము), అభిమానము, క్రోధము, పారుష్యము, (మాటలయందును, చేష్టలయందును కఠినత్వము), అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావముగలవాని లక్షణములు. (16.4)
- ఓ అర్జునా! దైవీసంపద ముక్తిదాయకము. ఆసురీసంపద బంధహేతువు. నీవు దైవీసంపదతో పుట్టినవాడవు. కనుక శోకింపకుము. (16.5)
- ఓ అర్జునా! ఈ లోకముననున్న మానవులు రెండువిధములుగా ఉందురు. దైవలక్షణములు గలవారు కొందఱు. ఆసురలక్షణములు గలవారు మఱికొందఱు. దైవ లక్షణములు విస్తృతముగా తెల్పబడినవి. ఇప్పుడు ఆసురలక్షణములుగలవారిని గూర్చి వివరముగా తెల్పెదను వినుము. (16.6)
- ఆసురస్వభావముగలవారు ప్రవృత్తినివృత్తులను (కర్తవ్యాకర్తవ్యములను) ఎఱుగరు. కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వముగాని, శ్రేష్ఠమైన ప్రవర్తనగాని, సత్యభాషణముగాని ఉండనే ఉండవు. (16.7)
- ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనెడివాడు లేనేలేడనియు, కామప్రేరితులైన స్త్రీపురుషులసంయోగ కారణముగ జీవులు సహజముగనే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసురలక్షణములు గలవారు భావింతురు. (16.8)
- అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదముచేయుభౌతికవాదులు ఆత్మనుగూర్చి తలంపరు. (ఆత్మయొక్క అస్తిత్వమును విశ్వసింపరు) వారు మందబుద్ధులు. వారు అందఱికిని అపకారముచేయుక్రూరులు. వారి శక్తిసామర్థ్యములు ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును. (16.9)
- దంభము, దురభిమానము, మదములతోగూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి, తమవాంఛలను ఏదో విధముగ తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞానకారణముగ మిథ్యాసిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్రవిరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. (16.10)
- మరణించువఱకును వారు అంతులేనిచింతలలోనే మునిగిపోవుచుందురు. విషయభోగానుభవముల యందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. వారు ఆశాపాశపరంపరలచే ఎల్లప్పుడును బంధింపబడుచుందురు. కామక్రోధపరాయణులై ప్రవర్తింతురు. విషయభోగముల నిమిత్తమై, అన్యాయ మార్గములద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు. (16.11-12)
- “నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ అభీష్టవస్తువును పొందితిని. ఇంకను నా మనోరథము లన్నింటిని సాధించుకొనగలను. ఇప్పటికే నాకడ ఎంతో ధనము ఉన్నది. మున్ముందు ఇంకను ఎంతోధనమును సంపాదింపగలను” అని వారు తలంచుచుందురు. నేను ఈ శత్రువును వధించితిని. ఇతర శత్రువులనుగూడ వధింపగలను. నేనే సర్వాధిపతిని. సమస్త సుఖ భోగములను అనుభవింపగలవాడను నేనే. సిద్ధులన్నియు నా గుప్పిటనే యున్నవి. నేనే గొప్ప బలవంతుడను, సుఖిని. “నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను. నాతో సమానుడు మరియొకడులేడు. నేను యజ్ఞములను చేయగలను. దానములు ఇయ్యగలను. యథేచ్ఛముగా వినోదింపగలను.” – అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై…చిత్తభ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని, ఆసురలక్షణములు గలవారు విషయభోగములయందే మిక్కిలి ఆసక్తులై ఘోరనరకముల యందు పడిపోవుచుందురు. (16.13-16)
- వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు, గర్వోన్మత్తులై, ధనదురహంకారములతో కన్నుమిన్నుగానక ప్రమత్తులై, శాస్త్రవిరుద్ధముగా ఆడంబరప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞముల నాచరించుదురు. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై, ఇతరులను నిందించుచు తమ శరీరములయందును, ఇతరుల శరీరముల యందును, అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు. (16.17-18)
- అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటిమాటికిని ఈ సంసారమునందు ఆసురీయోనులలోనే నేను పడవేయుచుందును. (16.19)
- ఓ అర్జునా! ఈ ఆసురీప్రకృతిగల మూఢులు, నన్ను పొందకయే, ప్రతిజన్మయందును ఆసురీయోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైనగతిని పొందుదురు. అనగా ఘోరమైన నరకములయందు పడెదరు. (16.20)
- కామక్రోధలోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మ నాశమునకు కారణములు అనగా మనుజుని అధోగతిపాలుచేయునవి. కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. (16.21)
- ఓ అర్జునా! ఈ మూడునరకద్వారములనుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును. అందువలన పరమగతిని పొందును. అనగా నన్నే పొందును. (16.22)
- శాస్త్రవిధిని త్యజించి, యథేచ్ఛగా (విశృంఖలముగా) ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోకసుఖములు లభింపవు. పరమగతియు ప్రాప్తింపదు. (16.23)
- కావున కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్తకర్మలను గూర్చి బాగుగా తెలిసికొని, అట్టి కర్మలను ఆచరింపుము. (16.24)
అధ్యాయం 17: శ్రద్ధాత్రయ విభాగ యోగం
- అర్జునుడు పలికెను – ఓ కృష్ణా! శాస్త్రవిధిని త్యజించి, భక్తిశ్రద్ధలతో యజ్ఞములను గాని, దైవపూజలనుగాని కొందఱు చేయుచుందురు. వారినిష్ఠ (వారి విధానము) సాత్త్వికమా? రాజసమా? తామసమా? (17.1)
- శ్రీ భగవానుడు పలికెను – శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్త్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా ఉండును. వాటిని గూర్చి వివరించెదను. వినుము. (17.2)
- ఓ అర్జునా! మనుష్యులందఱి శ్రద్ధయు వారి అంతః కరణరీతులకు తగినట్లు ఉండును. ప్రతివ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధఉండనే ఉండును. అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానినిబట్టి అతడెట్టి శ్రద్ధ కలిగియున్నదియు తెలిసికొనవచ్చును. (17.3)
- వారిలో సాత్త్వికులు దేవతలను, రాజసులు యక్ష రాక్షసులను, తామసులు ప్రేతభూతగణములను పూజించెదరు. (17.4)
- దంభము, అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు ఐనవారు, శాస్త్రవిరుద్ధముగా మనఃకల్పితమైన ఘోరతపస్సులను ఆచరించుచు (ఉందురు). (17.5)
- శరీరములయందున్న జీవులను, మరియుఅంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృశింప జేయువారు అజ్ఞానులైన ఆసురస్వభావము గలవారని యెఱుంగుము. (17.6)
- మనుష్యుల స్వభావములను అనుసరించి, వారికి ఇష్టములైన ఆహారములు గూడ మూడు విధములుగా ఉండును. అట్లే ఆయామనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములుగూడా మూడేసి విధములుగానే ఉండును. వాటినిగూర్చి వేర్వేఱుగా విశదపరచెదను వినుము. (17.7)
- ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగువానిని అభివృద్ధి పఱచునవియు, పాలు, చక్కెర మొదలగు రసపదార్థములును, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధపదార్థములును, ఓజస్సును అభివృద్ధి పఱచు స్థిరపదార్థములును, సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములును సాత్త్వికులకు ఇష్టమైనవి. (17.8)
- చేదు, పులుపు, ఉప్పు, కారము, రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కల్గించునవి, అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజసస్వభావము గలవారికి ఇష్టములగును. (17.9)
- అర్ధపక్వములైన పదార్థములు (సరిగా ఉడకనివి, పండనివి) రసహీనములు, దుర్గంధయుక్తములు (చెడువాసన గలవి) పాసిపోయినపదార్థములు, ఎంగిలివస్తువులు, అపవిత్రపదార్థములు మొదలగునవి తామసస్వభావము గలవారికి ఇష్టమైనవి. (17.10)
- శాస్త్రోక్తమైనదియు, ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొన బడినదియు, ప్రతిఫలాపేక్ష లేకుండ చేయబడునదియు ఐన యజ్ఞము ‘సాత్త్వికయజ్ఞము’ అనబడును. (17.11)
- కాని, ఓ అర్జునా! సరియైన నిష్టలేకుండ ఆడంబరము కొఱకు ఆచరింపబడునదియు, ప్రతిఫలాపేక్షతో చేయబడునదియు అగు యజ్ఞము ‘రాజసయజ్ఞము’ అని ఎఱుంగుము. (17.12)
- శాస్త్రవిధిననుసరింపనిదియు, అన్నదాన రహిత మైనదియు, మంత్ర హీనమైనదియు, దక్షిణలు లేనిదియు, శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము ‘తామసయజ్ఞము’ అనబడును. (17.13)
- దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, పవిత్రత(శౌచము) నిరాడంబరత్వము, అహింస అనునవి శారీరక తపస్సులు. (17.14)
- ఉద్వేగమును కలిగింపనిదియు, ప్రియమైనదియు, హితమును గూర్చునదియు, యథార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్రపఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవి యన్నియును వాక్కునకు సంబంధించిన తపస్సులు. (17.15)
- మనఃప్రసన్నత, శాంతస్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణశుద్ధి మొదలగునవి యన్నియును మానసికతపస్సులు. (17.16)
- పూర్వోక్తములైన (శారీరిక, వాచిక, మానసిక) తపస్సులను ఫలాకాంక్షలేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని ‘సాత్త్విక తపస్సులు’ అని యందురు. (17.17)
- ఇతరులనుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొఱకును, స్వాభావికముగాగాని, కల్పితముగా గాని చేయబడునవియు, అనిశ్చితఫలములను గాని, క్షణికఫలములనుగాని ఇచ్చునవియు ఐన తపస్సులను ‘రాజసతపస్సులు’ అని యందురు. (17.18)
- మొండిపట్టుదలతో మనోవాక్కాయములకు బాధకలిగించునవియు, ఇతరులకు కీడు కల్గించుటకై చేయబడునవియు, ఐన తపస్సులను ‘తామసతపస్సులు’ అనియందురు. (17.19)
- ‘దానము చేయుటయే కర్తవ్యము’ అనుభావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాదికాలముల యందును, ఆకలిదప్పులతో బాధపడువారు, అంగవైకల్యముగలవారు, రోగులు మొదలగువారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైనవారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థభావముతో చేయబడు దానము ‘సాత్త్వికదానము’అనబడును. (17.20)
- కాని ప్రత్యుపకారమును ఆశించిగాని, ప్రతిఫలాపేక్షతో గాని వివిధములగు ఒత్తిడులకు లోనైగాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును ‘రాజసదానము’ అనియందురు. (17.21)
- సద్భావము లేకుండా, దానము పుచ్చుకొనువారి యెడల గౌరవాదరములను చూపక, తృణీకార భావములతో ఛీకొట్టుచు, అయోగ్యులకును, అపాత్రులకును చేయబడు దానమూ, దేశకాలో చితము కాని దానమూ, ‘తామసదానము’ అని యనబడును. (17.22)
- ఓమ్, తత్, సత్ అని మూడు విధములగు పేర్లు సచ్చిదానందఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మనుండియే సృష్ట్యాదియందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగినది. (17.23)
- కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ‘ఓమ్’ అను పరమాత్మనామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. (17.24)
- మోక్షకాంక్షగలవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనను లేకుండ లోకహితార్థమై యజ్ఞదానతపశ్చర్యలను ‘ఇదియంతయును పరమాత్మదే’ అను భావముతో ‘తత్’ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. (17.25)
- ఓ పార్థా! ‘సత్’ అను పరమాత్మనామము సత్యభావమునందును, శ్రేష్ఠభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్ఠుడు అను భావము నందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమకర్మాచరణము నందును ‘సత్’ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. (17.26)
- యజ్ఞదానతపఃక్రియలయందలి నిష్ఠ, ఆస్తిక, భావమును ‘సత్’ అనియందురు. పరమాత్మను ఉద్దేశించి, చేయబడు నిశ్చయాత్మక కర్మలనుగూడ ‘సత్’ అని యందురు. (17.27)
- ఓ అర్జునా! శ్రద్ధ (విశ్వాసము) లేకుండ చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మ లన్నియును, ‘అసత్’ అని చెప్పబడును. దానివలన జీవించియుండగా గాని మరణించిన పిదపగాని ఎట్టి ప్రయోజనమూ కలుగదు. (17.28)
అధ్యాయం 18: మోక్ష సన్యాస యోగం
- అర్జునుడు పలికెను – ఓ మహాబాహూ!అంతర్యామీ! వాసుదేవా! సన్న్యాసతత్త్వమును, త్యాగతత్త్వమును వేర్వేరుగా తెలిసికొనగోరెదను. (18.1)
- శ్రీ భగవానుడు పలికెను – కామ్యకర్మల త్యాగమునే సన్న్యాసమని కొందరు పండితులు తలంతురు. కాని విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు. (18.2)
- కొందరు విద్వాంసులు కర్మలన్నియును దోషయుక్తములేగావున వాటిని త్యజింపవలెనని యందురు. కానీ యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందురు. (18.3)
- ఓ పురుషశ్రేష్ఠా! అర్జునా! సన్యాసము, త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమునుగూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్త్వికము, రాజసము, తామసము అని మూడువిధములుగా చెప్పబడినది. (18.4)
- యజ్ఞదానతపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞదానతపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమొనర్చును. (18.5)
- కావున ఓ పార్థా! ” ఈ యజ్ఞదాన తపోరూపకర్మలను మరియు కర్తవ్యకర్మలను అన్నింటిని ఫలాసక్తులను త్యజించి, అవశ్యమాచరింపవలెను” అనునది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయము. (18.6)
- (నిషిద్ధ కర్మల, కామ్యకర్మలఆచరణను త్యాగముచేయుట సముచితమే.) కాని శాస్త్ర విహిత కార్మాచరణమును త్యజించుట ఉచితముగాదు. కావున మోహవశమున దానిని త్యజించుట ‘తామస త్యాగము’ అనబడును. (18.7)
- కర్మలన్నియును దుఃఖకారకములే యని భావించి, శారీరికక్లేశమునకు భయపడి, కర్తవ్యకర్మలను త్యజించుటను రాజసత్యాగము అని యందురు. అట్టి త్యాగమువలన ఎట్టి ఫలమూ లభింపదు. (18.8)
- ఓ అర్జునా! శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటియందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్త్వికత్యాగము అని భావింపబడును. (18.9)
- అకుశలకర్మలను, నిషిద్ధ కర్మలను, కామ్యకర్మలను ద్వేషింపనివాడు, కుశలకర్మలయందు (నిత్య నైమిత్తిక పవిత్ర కర్మలయందు) ఆసక్తి కలిగియుండనివాడు, శుద్ధసత్త్వగుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు ఐనవాడు నిజమైన త్యాగి. (18.10)
- ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అశక్యము. కావున కర్మలను గాక కర్మఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. (18.11)
- కర్మ ఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి, చెడు, మిశ్రము అని మూడు విధములగు ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలయును. కాని కర్మఫలత్యాగమొనర్చిన కర్మయోగులు తమ కర్మల ఫలములను ఏ కాలమునందైనను, ఏ విధముగను అనుభవింపవలసిన పనియుండదు. (18.12)
- ఓ మహాబాహూ! సర్వ కర్మల సిద్ధికి ఐదు హేతువులు గలవని కర్మలను అంతముచేయు ఉపాయములను తెలుపు సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనుట జరిగినది. వాటిని నానుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. (18.13)
- కర్మల సిద్ధియందు అధిష్ఠానము, కర్త, వివిధములైన కరణములు( సాధనములు) నానావిధ చేష్టలు, దైవము అను ఐదును హేతువులు. (18.14)
- మానవుడు శరీరము, వాక్కు, మనస్సులతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన యేకర్మలైనను ఈ యైదు హేతువులతో ఒప్పుచుండును. (18.15)
- అట్లైనప్పటికిని (సర్వ కర్మలకును ఐదు హేతువులే మూలమైనప్పటికిని) విపరీతబుద్ధికారణమున ఏ మనుష్యుడు కేవలుడు (నిరంజనుడు), శుద్ధస్వరూపుడైన ఆత్మను సమస్తకర్మలకు కర్తగా భావించునో, అట్టి మలినబుద్ధిగల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. (18.16)
- అంతఃకరణమునందు కర్తృత్వభావము లేనివానిబుద్ధి ప్రాపంచికపదార్థములయందును, కర్మలయందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటిని హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపములును అంటవు. (18.17)
- జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి మూడు విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మసంగ్రహములు మూడు విధములు. (18.18)
- గుణముల సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో మూడేసి విధములుగా పేర్కొనబడినది. వానిని గూర్చి విశదపరచెదను, వినుము. (18.19)
- వేర్వేరుగా కన్పించు సమస్తప్రాణులయందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభవాముతో స్థితుడైయునట్లు జ్ఞానియైన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్త్విక జ్ఞానముగా తెలుసికొనుము. (18.20)
- సమస్తప్రాణులయందును నానావిధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించువారి జ్ఞానమును రాజసము అని యెరుంగుము. (18.21)
- ప్రకృతి కార్యమైనా శరీరమునే (శరీరమునకు సంబంధించిన భౌతికవస్తువులనే) సమస్తముగా భావించి, దానియందే ఆసక్తిని కల్గించునట్టిదియు, తాత్త్వికముగా అర్థరహితమైనదియు, హేతబద్ధము కానిదియు, తుచ్ఛమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అనియందురు. (18.22)
- కర్తృత్వాభిమానము గాని, ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మను సాత్వికకర్మయని యందురు. (18.23)
- భోగలాలసుడైన పురుషునిచేతను, అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజసకర్మ అనియందురు. (18.24)
- పరిణామము (మంచిచెడ్డలు) హాని, హింస, సామర్థ్యములను చూచుకొనక కేవలము మూర్ఖత్వముచే (అజ్ఞానముచే )ఆరంభింపబడు కర్మలను తామసకర్మలు అనియందురు. (18.25)
- ఆసక్తిని త్యజించినవాడు, అహంకారరహితముగా భాషించువాడు, ధైర్యోత్సాహములు గలవాడును సిద్ధి – అసిద్ధులయెడ హర్షశోకాదివికారములకు లోనుకానివాడును అగు పురుషుడు సాత్వికకర్త యనబడును. (18.26)
- ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్ష శోకములకు లోనగువాడు రాజసకర్తగా భావింపబడును. (18.27)
- జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు (మొండివాడు), ధూర్తుడు, అకారణముగ ఇతరులవృత్తులకు విఘాతము కల్గించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతోకాలము గడుపుచుండువాడు (దీర్ఘ సూత్రి) – ఇట్టి లక్షణములు గలవానిని తామసకర్త అని యందురు. (18.28)
- ఓ ధనంజయా! ఇప్పుడు నీవు బుద్ధి, ధృతులను గూడ గుణ భేదములననుసరించి మూడు విధములుగా, విభాగ పూర్వకముగా సంపూర్ణముగా నానుండి వినుము. (18.29)
- ప్రవృత్తిమార్గమును, నివృత్తిమార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలిసికొనుబుద్ధిని సాత్వికమైన బుద్ధియందురు. (18.30)
- ఓ పార్థా! ధర్మాధర్మములయొక్కయు, కార్యాకార్యములయొక్కయు (కర్తవ్యా కర్తవ్యముల యొక్కయు), యదార్థ తత్త్వములను తెలియజాలని బుద్ధిని “రాజస బుద్ధి ” అనియందురు. (18.31)
- ఓ అర్జునా! తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మ ముగును, అట్లే ఇతర పదార్థములను( విషయములను) తద్విపరీతముగను భావించు బుద్ధిని ‘తామస బుద్ధి’ అనియందురు. (18.32)
- ఓ పార్థా! ఇటునటు చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగముద్వారా మనఃప్రాణేంద్రియ క్రియలను ధారణచేయు శక్తిని ‘సాత్త్వికధృతి’ యందురు. (18.33)
- కాని, ఓ పార్థా! అర్జునా! కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థకామ విషయములను ధారణచేయు శక్తిని ‘రాజసధృతి’ అనియందురు. (18.34)
- పార్థా! నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడువక, దుర్మతియైన మనుష్యుడు వాటినే సతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని, ‘తామసధృతి’ అనియందురు. (18.35)
- ఓ భరతశ్రేష్ఠా! మూడు విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజనధ్యానసేవాదుల నొనర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో …..(18.36)
- …ప్రారంభమునందు విషతుల్యముగా (దుఃఖకరముగా) గోచరించినప్పటికిని పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో, అట్టి సుఖమును ‘సాత్త్వికసుఖము’ అనియందురు. (18.37)
- విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మెుదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగ అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును ‘రాజససుఖము’ అందురు. (18.38)
- నిద్ర, సోమరితనము, ప్రమాదము( వెూహము)ల వలన ఉత్పన్నమగు సుఖమును తామససుఖము అనియందురు. ఇట్టి సుఖము భోగసమయమునందును, పరిణామమునందును ఆత్మను వెూహింపజేయుచుండును. (18.39)
- పృథివియందు గాని, ఆకాశమునందుగాని, దేవతలయందుగాని, మఱేయితర లోకములయందుగాని, ప్రకృతినుండి ఉత్పన్నములైన ఈ మూడు గుణములు లేకుండ ఏ ప్రాణియు ఉండదు. (18.40)
- ఓ పరంతపా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలనూ, అట్లే శూద్రుల కర్మలునూ వారివారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడియున్నవి. (18.41)
- అంత:కరణనిగ్రహము( శమము ), ఇంద్రియములను వశమునందుంచుకొనుట (దమము), ధర్మ ములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరులఅపరాధములను క్షమించుట, ఋజుమార్గ జీవనము, ( మనశ్శరీరేంద్రియముల సరళత్వము) వేద శాస్త్రముల యందును ఈశ్వరునియందును పరలోకాదులయందును, విశ్వాసమును కలిగియుండుట, వేదశాస్త్రములఅధ్యయనము, అధ్యాపనము, పరతత్త్వాసుభవము – ఇవి యన్నియును బ్రాహ్మణులస్వాభావిక కర్మలు. (18.42)
- శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపకుండుట, దానములనిచ్చుట, స్వామి భావముతో ప్రజలను ధర్మ పరాయణులనుగా చేయుచు పరిపాలించుట మొదలగునవి యన్నియును క్షత్రియులస్వాభావికకర్మలు. (18.43)
- వ్యవసాయము, గోరక్షణము, క్రయవిక్రయరూప సత్యవ్యవహారము ఇవి యన్నియును వైశ్యులస్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణములవారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. (18.44)
- తమతమ స్వాభావికకర్మల యందు తత్పరులైనవారు భగవత్ప్రాప్తిరూప పరమసిద్ధిని నిస్సందేహమగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. (18.45)
- సమస్త ప్రాణులప్రాదుర్భావము పరమేశ్వరునినుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించియున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావికకర్మాలద్వారా పూజించి, మానవుడు పరమసిద్ధిని పొందును. (18.46)
- బాగుగా ఆచరింపబడిన పరధర్మముకంటెను గణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్ఠమైనది. స్వభావమును అనుసరించి ( స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి ) కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములును ఏ మాత్రము అంటనే అంటవు. (18.47)
- ఓ కౌంతేయా! (అర్జునా! ) దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన! అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నియను ఏదేని ఒక దోషముతో కూడియే యుండును. (18.48)
- ఓ అర్జునా! ప్రాపంచికవిషయములన్నింటియందు ఆసక్తి లేని వాడును, స్ప్రుహారహితుడును, అంతఃకరణమును జయించినవాడును అగు పురుషుడు సాంఖ్య యోగము ద్వారా పరమశ్రేష్ఠమైన నైష్కర్మ్యసిద్ధిని పొందును. (18.49)
- ఓ కౌంతేయా! జ్ఞానయోగము యొక్క పరానిష్ఠయైన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్ద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తి నందు రీతిని సంగ్రహాముగా తెల్పెదను వినుము. (18.50)
- విశుద్ధమైన బుద్ధిగలవాడై, శబ్దాదివిషయములను త్యజించి, సాత్త్వికధారణాశక్తిద్వారా అంతఃకరణేంద్రియముల సంయమము కలిగి (యువ్నవాడు)…తేలికయైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, (శబ్దాదివిషయములను త్యజించి) పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, (రాగద్వేషములను సర్వథా త్యజించి )దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు …..అహంకారమును, బలమును, దర్పమును, కామక్రోధములను, పరిగ్రహమును వదలిపెట్టి, నిరంతరము ధ్యానయోగ పరాయణుడై యుండువాడు, మమతా రహితుడు, శాంతియుతుడు ఐన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మము నందు అభిన్నభావముతో స్థితుడగుటకు పాత్రుడగును. (18.51-18.53)
- సచ్చిదానంద ఘనపరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్నమస్కుడైన యోగి దేనికిని శోకింపడు. దేనినీ కాంక్షింపడు. సమస్తప్రాణులయందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. (18.54)
- బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో? ఎంతటివాడనో? యథాతథముగ నా తత్త్వమును తెలిసికొనును. అట్లు భక్తితో నా తత్త్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. (18.55)
- సమస్తకర్మలయందును కర్తృత్వ భావమును వీడి, ఆయాకర్మల ఫలరూపమైన సమస్తభోగములను త్యజించి, నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటిని సర్వదాచేయుచును నాయనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును. (18.56)
- సర్వకర్మలను నిండుమనస్సుతో నాకే అర్పించి, సమబుద్ధి రుపయోగమును అవలంబించి, మత్పరాయణుడవై సతతము చిత్తమును నాయందే నిల్పుము. (18.57)
- పైన తెలుపబడిన విధముగా నాయందు చిత్తమును నిల్పినచో, నా యనుగ్రహమువలన సమస్తసంకటముల నుండియు అనాయాసముగా బయట పడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన బెట్టినచో నష్టముల పాలగుదువు. అనగా పరమార్థ పథమునుండి భ్రష్టుడవగుదువు. (18.58)
- అహంకారవశమున “నేను ఈ యుద్ధమును చేయను” అని నీవు నిశ్చయించు కొనుట వృథా. ఏలనన నీ స్వభావమే యుద్ధముచేయుటకు నిన్ను పురికొల్పును. (18.59)
- ఓ కౌంతేయా! మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను గూడ నీ పురాకృత స్వాభావిక కర్మలచే (సంస్కారములచే) బంధింపబడి, త తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు. (18.60)
- అర్జునా! శరీరరూపయంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి, వారిని భ్రమింపజేయుచున్నాడు. (18.61)
- ఓ భారతా! (అర్జునా!) అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదమును పొందగలవు. (18.62)
- ఈ విధముగా అత్యంతరహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి, నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. (18.63)
- సమస్తగోప్యవిషయములయందును పరమగోప్యమైన నావచనములను మఱొక్కసారి వినుము. నీవు నాకు అత్యంతప్రియుడవు అగుటవలన నీకు మిక్కిలి హితమును గూర్చు వచనములను మఱల చెప్పుచున్నాను. (18.64)
- ఓ అర్జునా! నీవు నాయందే మనస్సును నిలుపుము. నా భక్తుడవు కమ్ము. నన్నే సేవింపుము. నాకు ప్రణమిల్లుము. ఇట్టు చేయుటవలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞా పూర్వకముగా నేను చెప్పుచున్నమాట. ఏలనన నీవు నాకత్యంత ప్రియుడవు. (18.65)
- సర్వ ధర్మములను అనగా సమస్తకర్తవ్యకర్మలను నాకు సమర్పింపుము. సర్వ శక్తిమంతుడను, సర్వధారుడను, పరమేశ్వరుడను ఐన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపములనుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకుము. (18.66)
- తపస్సంపన్నుడు కానివానికిని, భక్తిరహితునకును, వినవలెనను కుతూహలము లేనివానికిని నీవు ఈ గీతారూపపరహస్యోపదేశమును ఎన్నడును తెల్పరాదు. అట్టే నాయందు దోషదృష్టి గలవానికి ఎన్నడునూ ఈ ఉపదేశమును తెలపరాదు. (18.67)
- నా యందు పరమభక్తి గలిగి, ఈ పరమగోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపఱచువాడు నన్నే పొందును. ఇందేమాత్రమూ సందేహము లేదు. (18.68)
- నాకు ప్రీతిని గూర్చునట్టి కర్మల నాచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడును లేడు. అంతేగాక అతనివలె గాని, అతనిని మించిగాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరియెుకడెవ్వడును భవిష్యత్తులోను ఉండబోడు. (18.69)
- ధర్మయుక్తమైన మనసంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞముద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. (18.70)
- శ్రద్ధాదరములుగలవాడును, దోషదృష్టి (దోషములెన్ను స్వభావము) లేనివాడును ఐన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుటవలనగూడ పాపవిముక్తుడై, పుణ్యకర్మలను ఆచరించువారుపొందు ఉత్తమలోకములను పొందును. (18.71)
- ఓపార్థా! ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? ఓ ధనంజయా! అజ్ఞానజనితమైన నీ వెూహము పూర్తిగా నశించినదా? (18.72)
- అర్జునుడు పలికెను – ఓ అచ్యుతా! నీ కృపచే నా వెూహము పూర్తిగా తొలిగినది. స్మృతిని పొందితిని. ఇప్పుడు సంశయ రహితుడైతిని. కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. (18.73)
- సంజయుడు పలికెను – ఈ విధముగా శ్రీ వాసుదేవునకును మహాత్ముడైన అర్జునకును మధ్య జరిగిన సంవాదమును వింటివి. అది అద్భుతమైనది. తనువును పులకింపజేయునది. (18.74)
- వేదవ్యాసునికృపవలన దివ్యదృష్టిని పొందినవాడనై, పరమగోప్యమైన ఈ యోగమును ( గీతను) యోగేశ్వరుడైన శ్రీ కృష్ణభగవానుడు( స్వయముగ)అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. (18.75)
- ఓ రాజా! (ధృతరాష్ట్రా!) శ్రీ కృష్ణభగవానునకును అర్జునకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదేపదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను. (18.76)
- ఓ రాజా! అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వమైన ఐన ఆ శ్రీహరిరూపమును పదేపదే స్మరించుచు, నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మఱలమఱల హర్షోల్లాసములతో పులకితగాత్రుడనగుచున్నాను. (18.77)
- ఓ రాజా! యోగేశ్వరుడైన శ్రీ కృష్ణభగవానుడును, గాండీవధనుర్ధారియైన అర్జునుడును ఉండుచోట సంపదలును, సర్వ విజయములును, సకలైశ్వర్యములును, సుస్థిరమైన నీతియు. (18.78)