ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా ॥ 6
ఏతత్ యోనీని, భూతాని, సర్వాణి, ఇతి, ఉపధారయ,
అహమ్, కృత్స్నస్య, జగతః, ప్రభవః, ప్రలయః, తథా.
సర్వాణి భూతాని = చేతనాచేతనాలైన సమస్త భూతాలనూ; ఏతత్ యోనీని = ఉభయవిధాలైన ఈ ప్రకృతి నుండి కలిగినవి; ఇతి = అని; ఉపధారయ = తెలుసుకో; (కనుక) అహమ్ = నేను; కృత్స్నస్యజగతః = సమస్త జగత్తుకు; ప్రభవః = ఉత్పత్తి స్థానాన్ని; తథా = అదే విధంగా; ప్రలయః = ప్రళయకారణాన్ని.
తా ॥ (పర-అపర ప్రకృతులను వర్ణించి వాటి ద్వారా తన సృష్టి కారణాన్ని వర్ణిస్తున్నాడు:) ఈ నా ఉభయ విధ ప్రకృతి నుండి జడ-చేతనాత్మకాలైన (క్షేత్రక్షేత్రజ్ఞ రూపమైన) సర్వభూతాలు జనిస్తున్నాయి –అని గ్రహించు. (జడ ప్రకృతి దేహరూపంలో పరిణతమై క్షేత్రం అవుతోంది. నా అంశయైన చేతనప్రకృతి భోక్తృరూపంలో దేహంలో ప్రవిష్టమై, స్వకర్మ చేత దేహాన్ని ధరిస్తూ జీవుడు అని అనబడుతోంది. ఈ రెండు ప్రకృతులూ నా నుండి కలిగినవే. కనుక -) నేను సప్రకృతికమైన సమస్త జగత్తుకు సృష్టి ప్రళయాలకు కారణభూతుణ్ణి.
వ్యాఖ్య:
ప్రాణం లేదా ఆత్మ (చేతన) మరియు శరీరం (ప్రకృతి)… ఈ రెండూ కలిస్తేనే ప్రాణులు పుడుతున్నాయి. ఈ ప్రకృతికి, ఆత్మకు పూర్తిగా భిన్నమైనవాడు పరమాత్మ. ఆయన ఈ ‘ప్రకృతి’ అనే పరికరాన్ని (Tool) అడ్డుపెట్టుకుని… ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాడు, నడిపిస్తాడు, చివరికి లయం చేస్తాడు. ఉదాహరణకు తోలుబొమ్మలాటలో సూత్రధారి ఎలాగైతే వెనక ఉండి దారాలతో బొమ్మలను ఆడిస్తాడో… దేవుడు కూడా ప్రకృతి ద్వారా ఈ ‘జగన్నాటకాన్ని’ (World Drama) ఆడిస్తున్నాడు. అందుకే ఆయనే ఈ ప్రపంచానికి అసలు కారణం. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. పైన చెప్పింది మామూలు జనాలకు అర్థం కావడానికి. కానీ లోతుగా ఆలోచిస్తే (అద్వైత దృష్టిలో చూస్తే)… నిజానికి పరమాత్మ ‘నిర్వికారుడు’. అంటే ఆయనకు ఎలాంటి మార్పులు ఉండవు.
- ఆయన ఏ పనీ చేయడు (Creator కాదు).
- ఎవరి చేతా ఏ పనీ చేయించడు (Manager కాదు).
- ఆయన కేవలం ‘సాక్షి’ (Witness) గా మాత్రమే ఉంటాడు.
సూర్యుడు ఉన్నాడు కాబట్టే లోకంలో పనులన్నీ జరుగుతాయి. కానీ సూర్యుడు దిగి వచ్చి ఎవరితోనూ పని చేయించడు కదా! ఆయన సాక్షిగా ఉంటాడు, పనులు వాటంతట అవే జరుగుతాయి. దేవుడు కూడా అంతే.
శ్రీ రామకృష్ణ వాణి —
శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధి మగ్నులయ్యారు. కాసేపటి తరువాత బాహ్యస్పృహనొంది మళ్ళీ ‘మ’ తో మాట్లాడసాగారు.
శ్రీరామకృష్ణులు: నా మనోస్థితి మారుతోంది. ప్రసాదం స్వీకరించలేక పోతున్నాను. సత్యం, మిథ్య రెండూ ఒక్కటవుతున్నాయి. ఇంకా నేనేం చూశానో తెలుసా? భగవద్రూపం – భగవతీదేవి రూపం! ఆమె గర్భంలో ఒక బిడ్డ ఉన్నది. ఆమె ఆ బిడ్డను కని, మరుక్షణమే మ్రింగివేయసాగింది. అది ఎంతమేరకు లోపలకు వెళుతోందో అంత మేరకు శూన్యమైపోతోంది. సర్వమూ శూన్యమేనని నాకు వెల్లడైంది. అమ్మ, ‘మాయ! మంత్రం! రండి, రండి, ! చూడండి!’ అంటున్నట్లుగా తోచింది.
ఐంద్రజాలకుడే సత్యం, ఇంద్రజాలం అంతా మాయ అన్న శ్రీరామకృష్ణుల ఉపదేశం ‘మ’ కు గుర్తువచ్చింది. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)