నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ।
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ॥ 5
నిర్మాన మోహాః, జితసంగదోషాః, అధ్యాత్మ నిత్యాః, వినివృత్తకామాః,
ద్వంద్వైః, విముక్తాః, సుఖదుఃఖసంజ్ఞైః, గచ్ఛంతి, అమూఢాః, పదమ్, అవ్యయమ్, తత్.
నిర్మాన మోహాః = అహంకారం, అవివేకం – ఈ రెండూ లేనివారూ; జిత సంగ దోషాః = ఆసక్తియనే దోషాన్ని జయించినవారూ; అధ్యాత్మ నిత్యాః = పరమాత్మ జ్ఞాననిష్ఠులూ; వినివృత్త కామాః = నిష్కాములూ; సుఖ దుఃఖ సంజ్ఞైః, ద్వంద్వైః = సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుండి; విముక్తాః = విడివడిన వారూ అయిన; అమూఢాః = జ్ఞానులు; అవ్యయమ్ = అక్షయమైన; తత్ = ఆ; పదమ్ = స్థానాన్ని; గచ్ఛంతి = పొందుతున్నారు.
తా ॥ (సాధనాంతరములు ప్రదర్శింపబడుతున్నాయి 🙂 అహంకారం (అభిమానం) అవివేకం (అజ్ఞానం) లేనివారూ, ఆసక్తి అనే దోషాన్ని జయించిన వారూ, పరమార్థజ్ఞాన నిష్ఠులూ, సుఖదుఃఖాలనే ద్వంద్వాలకు అతీతులైన వారూ అయిన జ్ఞానులు ఆ పరమపదాన్ని పొందుతున్నారు.
వ్యాఖ్య:-
మళ్ళీ వెనక్కి రాని (పునరావృత్తి లేని) శాశ్వతమైన మోక్షాన్ని ఎవరు పొందగలరో ఈ శ్లోకంలో స్పష్టంగా వివరించబడింది. ఆరు రకాల మంచి గుణాలు ఉన్నవారు మాత్రమే ఆ అత్యున్నత స్థితిని చేరుకోగలరు. అవి ఏమిటంటే:
(1) గర్వం (అభిమానం) మరియు అజ్ఞానం (అవివేకం) పూర్తిగా లేకపోవడం.
(2) ‘సంగం’ (అనుబంధం) అనే దోషాన్ని జయించడం. (మనం చూసే వస్తువుల మీద లేదా ప్రపంచం మీద ఆసక్తి కలిగి ఉండటాన్ని ‘సంగం’ అంటారు. ఆ ఆసక్తి లేకుండా, వాటికి అంటుకోకుండా ఉండటమే దీనిని జయించడం).
(3) నిరంతరంగా ఆత్మలో (లేదా దేవునిలో) స్థిరంగా ఉండడం చాలా ముఖ్యం. ఇక్కడ “నిత్యంగా” అనే పదాన్ని గమనించాలి — కేవలం కొంతసమయం మాత్రమే దేవుని గురించి ధ్యానం చేయడం చాలదు. నిత్యం ఆ దివ్యభావంలో ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని జ్ఞానం అనే వెలుతురు లేకపోతే, మాయ అనే చీకటి వెంటనే మనసును కప్పేస్తుంది, దీని వల్ల పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక నిష్ఠలో ఉండాలి, మాయకి చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు.
ప్రపంచంలో మూడు రకాల మనుషులు ఉన్నారు:
- ఎల్లప్పుడూ ఆత్మ స్థితిలో ఉండి దేవుని స్మరణలో జీవించే వారు — వీరు ఉత్తములు.
- కొద్ది సేపు దేవుని ధ్యానం చేసి, తర్వాత ప్రపంచ పనుల్లో నిమగ్నమయ్యే వారు — వీరు మధ్యస్థులు. వీరు సాధనతో క్రమంగా తొలి స్థాయికి చేరవచ్చు.
- ఎప్పుడూ ప్రపంచ విషయాల ఆలోచనల్లో మునిగిపోయి, దేవుని స్మరణ క్షణమంతకైన కూడా లేని వారు — వీరు కనిష్ఠులు. ఈ స్థితి తక్కువదిగా, నివారించదగినదిగా చెప్పబడింది.
అందువల్ల వివేకం కలవారు ఈ కనిష్ఠ స్థితిని విడిచి, నిరంతర ఆత్మస్మరణలో నిలవడానికి ప్రయత్నించాలి.
(4) మోక్షాన్ని పొందడానికి నాల్గవ అవసరమైన గుణం — మన కోరికలను పూర్తిగా, వాసనలతో సహా తొలగించడం (వినివృత్తకామాః). ఇక్కడ “నివృత్త” అని కాకుండా “వినివృత్త” అని చెప్పడం ద్వారా, కోరికలు కేవలం తగ్గడం కాకుండా, మూలంతో సహా పూర్తిగా నశించాలి అనే అర్థం వస్తుంది. “అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః” అనే ఈ శ్లోకపాదాన్ని మోక్షం కోరే వారు ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ రెండు పదాల్లోనే మొత్తం ఆధ్యాత్మిక సాధన సారాంశం ఉంది —
- అధ్యాత్మనిత్యా అంటే ఆత్మలో స్థిరంగా ఉండడం (తత్త్వజ్ఞానం).
- వినివృత్తకామాః అంటే కోరికలు, వాసనాలు పూర్తిగా లయమవడం.
మొదటిది “ద్రిక్ స్వరూపస్థితి” — అంటే తన అసలైన సాక్షి స్వరూపంలో నిలుచుట. రెండవది “దృశ్య రాహిత్యం” — అంటే బాహ్య వస్తువుల ప్రభావం లేకపోవడం. ఈ రెండు కలిసి జరిగినప్పుడే సత్యమైన సాధన సంపూర్ణమవుతుంది అని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి.
(5) ఐదవ సాధన — సుఖం, దుఃఖం వంటి ద్వంద్వ భావాల నుండి విముక్తి పొందడం. అంటే సుఖమో దుఃఖమో వచ్చినా మనసు సమంగా ఉంచడం.
(6) ఆరవది “అమూఢత్వం” అనే గుణం. అంటే — అజ్ఞానం లేకుండా ఉండటం. అవిద్య మనకు దగ్గరయే అవకాశం రానీయకుండా, ఎప్పుడూ జ్ఞానంలోనే నిలకడగా ఉండటం.
భగవానుడు చెప్పిన ఈ ఆరు సాధనలను (అభ్యాసాలను) మనస్పూర్తిగా ఆచరించే వారు పొందే అత్యంత ఉన్నతమైన ఫలితం — అవ్యయమైన మోక్షం. “అవ్యయమైనది” అంటే ఎప్పుడూ నశించని, శాశ్వతమైనది.
ఈ ప్రపంచంలోని అన్ని పదవులు, గౌరవాలు, సంపదలు — ఇవన్నీ క్షణభంగురం, నశించేవి. కానీ పరమాత్మ స్థానమేమాత్రం నశించదు. అది ఎప్పటికీ ఉండే శాశ్వత పదవి. అందుకే జ్ఞానులు అదే మనలక్ష్యంగా తీసుకొని ప్రయత్నిస్తారు.
శ్రీ రామకృష్ణ వాణి —
శ్రీరామకృష్ణులు: భగవంతుడు తన మాయచే సర్వాన్ని కప్పి ఉంచాడు. ఒకింత కూడా తెలియనివ్వడు. కామినీకాంచనాలు మాయ. ఈ మాయను తొలగించి చూసిన వారే ఆయనను దర్శించగలరు. నేను ఈ విషయం ఒకరికి విశదపరుస్తూ ఉన్నప్పుడు భగవంతుడు చటుక్కున నాకొక అద్భుత దృశ్యం చూపించాడు. కామార్పుకూర్లోని ఒక కొలను; దాన్లో ఒక వ్యక్తి పాచిని చేత్తో త్రోసివేసి నీళ్లు త్రాగుతున్నాడు. నీళ్లు స్ఫటికంలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ సచ్చిదానంద స్వరూపుడే మాయ అనే పాచితో కప్పబడి ఉన్నట్లు నాకు చూపబడింది. పాచిని తొలగించిన వాడు నీరు త్రాగగలడు.
“శ్రద్ధగా విను! నీకొక అతి గుహ్యమైన విషయం చెబుతాను. ఒకసారి సరుగుడు తోపుకు బయలుకు నిమిత్తం వెళ్ళాను. అప్పుడు ఒక గది తలుపు మూసివున్న దృశ్యం కనిపించింది. గదిలో ఏముందో చూడలేకపోయాను. పేనా కత్తితో తలుపుకు రంధ్రం పెట్ట ప్రయత్నించాను, కాని రంధ్రం పెట్టలేకపోతున్నాను. తొలుస్తూ ఉండగా మట్టి పడి దాన్ని మూసివేయసాగింది. తరువాత ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది.”
ఈ మాటలు చెప్పి శ్రీరామకృష్ణులు మౌనంగా ఉండిపోయారు. మళ్లీ మాట్లాడసాగారు:
“ఇవన్నీ అత్యున్నత స్థితికి చెందిన విషయాలు. ఇలా చూడు. ఎవరో నా నోటిని అణచివేసి మూస్తూ ఉన్నట్లుగా ఉంది. భగవంతుడు యోనిలో వసించడం కళ్లారా చూశాను – కుక్కల మైథున చర్యలో ఆయనను చూశాను.
“భగవంతుని చైతన్యం మూలంగానే ఈ జగత్తు చైతన్యమయమై ఒప్పారుతోంది. చిరు చేపలలో కూడా ఆ చైతన్యమే కదలాడుతూ ఉన్నట్లు కొన్ని సమయాలలో గాంచుతాను.”
ఇంతలో బండి శోభాబజారు కూడలిని చేరుకుంది. శ్రీరామకృష్ణులు మళ్లీ మాట్లాడనారంభించారు:
“వర్షాకాలంలో నేల నీటిలో ఊరివున్నట్లు జగత్తు ఈ చైతన్యంలో ఊరివున్నట్లు కొన్ని సందర్భాలలో చూస్తాను.
“ఇలా ఎన్నో నేను చూసి ఉన్నాను. అయినప్పటికీ నాకు లేశమైనా అహంకారం కలుగదు.”
‘మ’ (నవ్వుతూ): ఔరా! మీకా అహంకారం?
శ్రీరామకృష్ణులు: దేవుని తోడు, నాకు కించిత్తూ అహంకారం కూడా లేదు.
‘మ’ : గ్రీసు దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆతడి పేరు సోక్రటీస్. మానవులలో అతడే మహాజ్ఞాని అని అశరీరవాణి పలికింది. అది విని అతడు దిగ్భ్రాంతుడైనాడు. చాలాసేపు ఏకాంతంలో కూర్చుని దాన్ని గురించి చింతన చేసి దాన్ని అవగాహన చేసుకున్నాడు. తరువాత తన మిత్రులతో, “నాకు ఏమీ తెలియదని మాత్రమే నేను తెలుసుకోగలిగాను. కాని ప్రతి ఒక్కరూ, ‘నేను మహాజ్ఞానిని’ అని భావిస్తున్నారు. నిజానికి అందరూ అజ్ఞానులే’ అని అన్నాడు.
శ్రీరామకృష్ణులు: నాకు ఏం తెలుసునని ఇక్కడకు ఇందరు వస్తున్నారు అని కొన్ని సమయాల్లో నేను అనుకుంటూ ఉంటాను. వైష్ణవచరణ్ గొప్పపండితుడు. ఆతడు నాతో, ‘మీరు చెబుతూ ఉన్నవన్నీ శాస్త్రాలలో ఉన్నాయి. అయినప్పటికీ మీ వద్దకు ఎందుకు వస్తున్నానో తెలుసా? వాటిని మీ ముఖతా వినటానికే’ అనేవాడు.
‘మ’ : మీ పలుకులు అన్నీ శాస్త్రాలతో సరిపోలి ఉన్నాయి. నాడు పానీహాటీలో నవద్వీప్ గోస్వామిగారూ ఇదే చెప్పారు. గీతా గీతా అని పలుమార్లు వల్లిస్తే త్యాగీ త్యాగీ అవుతుందని మీరు చెప్పారు. కాని నిజానికి తాగీ తాగీ అనే వస్తుంది. కాని తాగీ అన్నా త్యాగీ అన్నా ఒకే అర్థం; తగ్ ధాతువు నుండి తాగీ శబ్దం కూడా వస్తుంది అని గోస్వామి చెప్పారు.
శ్రీరామకృష్ణులు: నన్ను పోలిన వ్యక్తిని పండితుడో, సాధునో లేక మరెవరినైనా నువ్వు చూశావా?
‘మ’ : భగవంతుడు మిమ్మల్ని తన స్వహస్తాలతో రూపొందించాడు. ఇతరులను మెషీను ద్వారా సృష్టించాడు.శాసనం మేరకు ఇతరులను ఆయన సృష్టించాడు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ రామ్లాల్ ప్రభృతులతో): ఇతడు ఏం చెబుతున్నాడో విన్నారా? (మరి కాసేపు నవ్వి చివరికి) భగవంతునిపై ఒట్టు, నాలో నలుసంతైనా అహంకారం లేదు. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)