అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ॥ 20
అహమ్, ఆత్మా, గుడాకేశ, సర్వభూత ఆశయస్థితః,
అహమ్, ఆదిః, చ, మధ్యమ్, చ, భూతానామ్, అంతః, ఏవ, చ.
గుడాకేశ = అర్జునా; అహమ్ = నేను; సర్వభూత ఆశయస్థితః = ప్రాణులందరి హృదయాలలో వెలయు; ఆత్మా = ప్రత్యక్ చైతన్యాన్ని; అహమ్ ఏవ చ = మరియు, నేనే; భూతానామ్ = భూతాల; ఆదిః చ = ఉత్పత్తిని; మధ్యం చ = స్థితిని; అంతః = అంతమును కూడా.
తా ॥ గుడాకేశా! నేను ప్రాణుల హృదయాలలో ప్రకాశించే ప్రత్యగాత్మను, నేనే ప్రాణుల ఉత్పత్తి, స్థితి, ప్రళయ కారణాన్ని కూడా. (ముండకోపనిషత్తు 3-1-7 చూ.)
వ్యాఖ్య:-
చెప్పాల్సిన అసలు విషయాన్ని భగవంతుడు ఒక్క వాక్యంలోనే తేల్చి చెప్పేశారు. (‘అహమాత్మా… స్థితః’). “సమస్త ప్రాణుల హృదయాల్లో వెలిగే ‘అంతరాత్మ’ (ప్రత్యగాత్మ) ను నేనే” అని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పారు. ప్రతి జీవిలోనూ… శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి వాటన్నింటినీ గమనిస్తూ ఒక ‘సాక్షి’ లాగా ఆ అంతరాత్మ ఉంటుంది. దాన్నే ‘జీవాత్మ’ అని కూడా అంటారు. ఆ జీవాత్మ, దేవుడికి (పరమాత్మకు) వేరు కాదని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. అంటే “జీవాత్మే పరమాత్మ” (మనలోని ఆత్మే దేవుడు) అనే గొప్ప సత్యాన్ని ఇక్కడ బోధించారు. దీన్నే ‘అద్వైతం’ అంటారు. కాబట్టి మనిషి పరమాత్మ స్థానాన్ని పొందాలంటే… ముందు తనలోని ఆత్మను తెలుసుకుంటే చాలు. అంటే శరీరం, మనసు అనే పొరల (పంచకోశాల) నుంచి తాను వేరని గ్రహించి… వాటన్నింటినీ గమనిస్తున్న సాక్షిని (అంతరాత్మను) దర్శించుకోవాలి. ఆ అంతరాత్మే పరమాత్మ. ఉపనిషత్తులన్నీ ఇదే సత్యాన్ని బోధిస్తున్నాయి.
ప్రతి జీవిలోనూ భగవంతుడు (ఆత్మ రూపంలో) ఉన్నాడని స్పష్టంగా తెలిసింది కాబట్టి, ఇక ఏ ప్రాణినీ తక్కువగా చూడకూడదు. ప్రతి మనిషి తనలోని ఆత్మను (శరీరాన్ని, మనసును గమనించే సాక్షిని) గుర్తుతెచ్చుకోవాలి. “నేను నాశనమైపోయే ఈ శరీరాన్ని కాదు, నేను శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని” అని గట్టిగా నమ్ముకోవాలి. అలాగే ప్రతి ప్రాణిలోనూ దేవుడు ఉన్నాడని నమ్మి, ఎవరినీ హింసించకూడదు. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. సాటి ప్రాణులకు చేసే సేవను, ఆ దేవుడికి చేసే సేవగానే (మానవ సేవే మాధవ సేవ అని) భావించాలి. ఈ విధంగా అంతటా దేవుడు ఉన్నాడని గుర్తుంచుకుని, ఎలాంటి పాపపు పనులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే, దేవుడు మన హృదయంలోనే ఉంటూ… మనకు అత్యంత దగ్గరగా ఉండి, మనం చేసే ప్రతి పాపమూ, పుణ్యమూ చాలా జాగ్రత్తగా గమనిస్తూనే ఉంటాడు.
ఈ ప్రపంచమంతా దేవుడి మీదే ఆధారపడి ఉంది. దేవుడే మూలం (అధిష్ఠానం). ఈ జగత్తు ఆయనలో కనిపిస్తున్న ఒక రూపం మాత్రమే (అధ్యస్తం). కాబట్టి వాస్తవానికి ఈ ప్రపంచం దేవుడి కంటే వేరు కాదు. అందుకే… సమస్త ప్రాణుల పుట్టుక (ఆది), నడక (మధ్య), అంతం (మరణం) అన్నీ తానే అని భగవంతుడు చెప్పడానికి కారణం ఇదే. అలాగే ‘సర్వభూతాశయస్థితః’ (అందరి హృదయాల్లో ఉండేవాడు) అనే వాక్యంలో ‘సర్వ’ (అందరూ/అన్నీ) అనే పదాన్ని వాడారు. దీన్ని బట్టి ఏ ఒక్క ప్రాణిలోనూ దేవుడు లేకుండా ఉండడని, అందరిలోనూ ఆయన కచ్చితంగా ఉన్నాడని స్పష్టమవుతోంది. కాబట్టి ఇక ఏ మనిషి కూడా దిగులు పడకూడదు, నిరుత్సాహపడకూడదు. “నేను అల్పుడిని, సామాన్యుడిని” అని తక్కువ చేసి అనుకోకూడదు. తన లోపలే దాగి ఉన్న ఆ నాశనం లేని పరమాత్మను దర్శించుకోవడానికి ప్రయత్నించాలి. మనిషికి దిగులు, దుఃఖం ఎందుకు వస్తాయి? “తాను నిజానికి దైవస్వరూపుడు” అనే అసలైన విషయాన్ని మర్చిపోవడం వల్లే వస్తాయి. ఇది మనం గ్రహించాలి. కాబట్టి తన నిజస్వరూపాన్ని (ఆత్మను) మళ్లీ గుర్తుతెచ్చుకుని, గొప్ప ధైర్యాన్ని, ఆనందాన్ని పొందాలి. తద్వారా దుఃఖం లేని స్థితిని, బంధాల నుండి విముక్తిని, శాశ్వతమైన మోక్షాన్ని (కైవల్యాన్ని) సాధించాలి.
‘గుడాకేశ’ (గుడాక + ఈశ) అంటే నిద్రను జయించినవాడు అని అర్థం. ఇది అర్జునుడికి ఉన్న పేరు. తిండి (ఆహారం), నిద్ర అనే ఇద్దరు దొంగలు మనిషి జీవిత కాలాన్ని దోచుకుంటున్నారు (వృథా చేస్తున్నారు). కాబట్టి మోక్షం కావాలనుకునేవాడు (ముముక్షువు) ఆ రెండింటిని తన అదుపులో ఉంచుకోవాలి. ఎంతో నిగ్రహంతో ప్రవర్తించాలి. ఆహారం, నిద్ర… ఈ రెండూ ఎంత అవసరమో అంతే (మితంగా) ఉండేలా అలవాటు చేసుకోవాలి.
సర్వత్రా నేనే
పూర్ణజ్ఞానంలో నెలకొన్న మాతృదేవి జ్ఞానపరమైన అనుభవాలు కోకొల్లలు. మనుష్యులకు మాత్రమే కాకుండా, మృగాలు, పక్షులకు కూడా ఆమె ఆశ్రయంగావున్నారు. అనేక ఇళ్ల నుండి కొట్టి తరమబడిన పిల్లులు మాతృదేవి పాదాలను ఆశ్రయించాయి. కానీ బ్రహ్మచారి జ్ఞాన్కు పిల్లులంటే గిట్టదు. ఆతడితో మాతృదేవి, “ఇదిగో చూడు, దొంగలించడం పిల్లుల నైజం. వాటిని ప్రేమగా చూడడానికి ఎవరున్నారు?” అనేవారు. ఒకసారి మాతృదేవి జయరాంబాటి నుండి కలకత్తాకు వెళ్లేటప్పుడు జ్ఞాన్ను పిలిచి ప్రతి రోజూ ఆ పిల్లులకు ఆహార మిచ్చి చూసుకోమన్నారు. ఎదురుచూచినట్లే జ్ఞాన్ జంకుతూ నిలబడ్డాడు. వెంటనే మాతృదేవి, “నాయనా! పిల్లులను కొట్టకు! ఎందుకంటే వాటిలో కూడా నేనే కదా ఉంటున్నాను” అన్నారు. అంతే! ఇక వాటి మీద చేయి చేయించుకోగలడా ఆతడు! ఆ రోజు నుండి వాటిని ప్రేమతో పోషించాడు. (మూలం: శ్రీ శారదాదేవి చరితామృతం)
—
బాలగణపతి ఒకనాడు ఆడుకొంటున్నప్పుడు ఒక పిల్లిని చూసి దాన్ని దొరకపుచ్చుకొని పిల్లచేష్టగా చక్కగా బడితపూజ చేసి దాన్ని గాయపరిచాడు. పిల్లి ఎలాగో తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతడు శాంతుడై తల్లి పార్వతీదేవిని చూడడానికి వెళ్ళాడు. తల్లి దేహమంతా గాయాలతో రక్తసిక్తమై ఉండడం చూసి బాలగణపతి ఆశ్చర్యపోయాడు. తల్లిని అలాంటి స్థితిలో చూసి ఎంతో బాధపడి, “కారణం ఏమిటి?” అని తల్లిని అడిగాడు. “నాయనా! దీని కంతటికీ కారణం నువ్వే” అని విచారంతో పలికింది దేవి. తల్లిపట్ల అపార భక్తి ప్రేమలున్న గణపతికి తల్లి మాటలు ఆశ్చర్యాన్ని, అంతకంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించాయి. కంట నీరుపెట్టుకొని “అమ్మా! నేను నిన్నెప్పుడు కొట్టాను? లేదా తెలియక నేను చేసిన ఏదైనా దుశ్చర్య ఫలితంగా ఇతరులు నిన్నిలా అవమానించారేమో అంటే అలాంటసంఘటన ఏదీ నాకు జ్ఞాపకం రావడం లేదే?” అన్నాడు.
కుమారుడి పలుకులు విని జగన్మాత ఇలా అన్నది: “నాయనా! ఈ రోజు నువ్వు ఏ ప్రాణినైనా హింసించావేమో కాస్త జ్ఞాపకం తెచ్చుకో.” “అవునమ్మా, ఇంతకు మునుపే ఒక పిల్లిని చావబాది వచ్చాను” అన్నాడు గణపతి. పిల్లి సొంతదారుడు తన తల్లిని అలా గాయపరిచాడేమో అని తలచుకొని బాలగణపతి ఖీన్నుడయ్యాడు. బాలుడలా పశ్చాత్తప్తుడవడం చూసి, ప్రేమపూర్వకంగా అతణ్ణి హృదయానికి హత్తుకొని, అతణ్ణి ఊరడిస్తూ దేవి ఇలా అన్నది: “అలా జరగలేదు, నా ఈ దేహాన్ని ఎవరూ గాయపరచలేదు. కాని పిల్లి ఆదిగాగల ఈ విశ్వంలోని సమస్త ప్రాణికోటిలో నెలకొన్నది నేను కదా! కాబట్టే నువ్వు పిల్లిని గాయపరచిన చిహ్నాలు నా శరీరం మీద కానవస్తున్నాయి. తెలియక నువ్వలా చేశావు కనుక విచారించవద్దు. కాని నేటి నుంచి ఈ సంగతిని ఎప్పుడూ మరిచిపోవద్దు. లోకంలోని స్త్రీలందరూ నా అంశలే, జీవులలోని పురుషులందరూ నీ పితృదేవుల అంశలే. శివశక్తులు తప్ప ఈ జగత్తులో వేరొకటి ఏదీ లేదు.” తల్లి మాటలు బాలగణపతి హృదయంలో ప్రగాఢంగా నాటుకున్నాయి. …..
ఒకానొక సమయంలో పార్వతీ దేవి తను ధరించిన అమూల్యమైన రత్నహారాన్ని చూపిస్తూ కుమారులైన గణేశ కార్తికేయులతో “పధ్నాలుగు లోకాలతో కూడిన ఈ బ్రహ్మాండం చుట్టూ తిరిగి మీరిద్దరిలో ఎవరు ప్రథములుగా వస్తారో వారికి ఈ రత్నహారాన్ని బహూకరిస్తాను” అన్నది. ఇంకేం, అన్నగారి బానపొట్టను, నెమ్మదిగా కదిలే ఎలుక వాహనాన్ని తలచుకొని ఒకింత పరిహాసపూర్వకంగా నవ్వుకుంటూ ‘రత్నహారం నాకే దక్కుతుంది’ అని నిశ్చయించుకొని, తన నెమలి వాహనం అధిరోహించి తక్షణమే కార్తికేయుడు బయలుదేరాడు. అతడు వెళ్ళిపోయిన చాలాసేపటికి నెమ్మదిగా లేచాడు గణేశుడు. లేచి తన జ్ఞాననేత్రంతో శివశక్త్యాత్మకమైన ఈ జగత్తు యావత్తూ తల్లితండ్రులైన శివపార్వతుల శరీరాలలో దర్శిస్తూ, వారికి ప్రణామాలు చేస్తూ వినమ్ర గమన భంగిమలో వారికి ప్రదక్షిణం చేసి, నిశ్చితమనస్కుడై తన ఆసనంలో కూర్చున్నాడు. ఇది జరిగిన చాలాసేపటికి కార్తికేయుడు తిరిగి వచ్చినప్పుడు, రత్నహారం గణేశుడికే చెందుతుందని నిర్దేశించి, వాత్సల్యపూరితురాలై ముద్దు బిడ్డడి మెడలో అలంకరించింది తల్లి పార్వతీదేవి. (మూలం: శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర, సప్రామాణిక జీవిత గాథ)