అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ।
పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ ॥ 11
అవజానంతి, మామ్, మూఢాః, మానుషీమ్, తనుమ్, ఆశ్రితమ్,
పరమ్, భావమ్, అజానంతః, మమ, భూత మహా ఈశ్వరమ్.
భూత మహా ఈశ్వరమ్ = సర్వభూతే శ్వరుడనైన; మమ = నా; పరంభావమ్ = పరమతత్త్వాన్ని; అజానంతః = ఎరుగకుండా; మూఢాః = మూఢులు; మానుషీం తనుమ్ = మానవదేహాన్ని; ఆశ్రితమ్ = ధరించిన; మామ్ = నన్ను; అవజానంతి = అవజ్ఞను చూపుతున్నారు.
తా ॥ నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడనూ, సర్వాత్మ స్వరూపుడనూ, సర్వేశ్వరుడనూ; అయినప్పటికీ (భక్తానుగ్రహార్థం శుద్ధసత్త్వమయమైన) మనుష్య దేహాన్ని ధరిస్తున్నాను. నా పరమస్వరూపాన్ని ఎరుగని మూఢులు నన్ను తిరస్కరిస్తున్నారు.
వ్యాఖ్య:-
పరమాత్మ సకల జీవరాశులకూ ప్రభువు, పాలకుడు. ధర్మాన్ని కాపాడటానికి, లోకాన్ని రక్షించడానికి ఆయన అప్పుడప్పుడు మనిషి రూపంలో ఈ భూమి మీదకు వస్తుంటాడు (అవతరిస్తాడు). అలా సాక్షాత్తు భగవంతుడే మనిషి శరీరం ధరించి మన మధ్యకు వచ్చినప్పుడు, మూర్ఖులు ఆయన్ని గుర్తించలేరు. “ఇతను కూడా మనలాంటి సామాన్య మనిషే కదా” అనుకొని ఆయన్ని అవమానిస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. ఆయనలోని అసలైన దైవశక్తిని వారు అర్థం చేసుకోలేరు. అందుకే కృష్ణుడు వారిని ‘మూఢులు’ (తెలివిలేనివారు) అని పిలిచారు. ఎందుకంటే, కాస్త బుద్ధి ఉన్నవారెవరూ దేవుడిని ద్వేషించరు కదా!
కొంతమంది డబ్బు, అధికారం చూసుకుని గర్వంతో కళ్లు మూసుకుపోతారు. మహాత్ములను, సాధువులను ఎగతాళి చేస్తారు. శిశుపాలుడు, దుర్యోధనుడు లాంటి వాళ్ళు ఈ కోవకే చెందుతారు. అందుకే వాళ్ళు చివరికి నాశనమయ్యారు. భక్తి మార్గంలో ఉన్నవారికి కూడా జీవితంలో ఒక్కోసారి అవమానాలు, నిందలు ఎదురవ్వచ్చు. అప్పుడు చాలా ఓర్పుగా ఉండాలి. ఒకవేళ మనలో నిజంగా తప్పు ఉంటే సరిదిద్దుకోవాలి. తప్పు లేకపోతే, ఆ నిందలకు భయపడకుండా ధైర్యంగా ఉండాలి.
“సాక్షాత్తు శ్రీకృష్ణుడినే ఈ లోకం నిందించింది, ఇక సామాన్యులమైన మనం ఎంత?” అని సరిపెట్టుకోవాలి. కొందరి స్వభావమే ఇతరులను నిందించడం అని గ్రహించి, మనశ్శాంతిని కోల్పోకూడదు. ఎవరినీ ద్వేషించకూడదు. ఎవరైనా దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే, ఆ మాటలను పట్టించుకోకండి. ఆ నాస్తికుల మాటలు నమ్మకుండా, మీ భక్తిని ఇంకా పెంచుకోండి. మీ ప్రవర్తన ద్వారానే వారికి బుద్ధి వచ్చేలా జీవించండి.
శ్రీ రామకృష్ణ వాణి —
ఈశాన్ (డాక్టరుతో): అహంకారం కారణంగానే మనకు విశ్వాసం తక్కువగా ఉంటుంది. భూశుండి అనే కాకి మొదట్లో శ్రీరాముణ్ణి అవతార పురుషుడిగా అంగీకరించేది కాదని రామాయణంలో చెప్పబడింది. ఒకసారి అది రాముడి ఆగ్రహానికి గురయింది. ఆ ఆగ్రహంనుండి తప్పించుకోవడానికి ఇది చంద్రలోకం, దేవలోకం, కైలాసం మొదలైన లోకాలన్నీ పరిభ్రమించింది. కాని అది రాముడి చేతినుండి తప్పించుకోజాలనని గ్రహించింది. అప్పుడు వచ్చి రాముడి పాదాల వద్ద శరణు వేడింది. రాముడు దాన్ని చేతిలోకి తీసుకొని మ్రింగివేశాడు. తరువాత చూసేసరికి భూశుండి చెట్టుమీద తన గూటిలోనే కూర్చుని ఉంది. ఆ విధంగా దాని అహంకారం అణగిపోయాకనే, అది ‘రాముడు చూడడానికి సామాన్య వ్యక్తిలాగానే కనిపిస్తాడు కాని అతడి ఉదరంలోనే ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు. సముద్రాలు, పర్వతాలు, జీవ జంతువులు, చెట్లు – సమస్త బ్రహ్మాండమూ ఉన్నట్లు’ గ్రహించింది.
శ్రీరామకృష్ణులు (డాక్టరుతో): భగవంతుడు స్వరాట్, మళ్ళీ ఆయనే విరాట్ అని అర్థం చేసుకోవడం కూడా కష్టమే. నిత్యం, లీలలు రెండూ ఆయనకు చెందినవే. భగవంతుడు మానవరూపం ధరించలేదని మన అల్పబుద్ధితో ఎలా నొక్కి చెప్పగలం? మన అల్పబుద్ధితో ఈ విషయాలనన్నిటినీ అవగతం చేసుకోగలమా ఏమిటి? ఒక సేరు పాత్రలో నాలుగు సేర్లు పాలు పడతాయా ఏమిటి?
“అందుకే భగవత్సాక్షాత్కారం పొందిన సాధువుల, మహాత్ముల పలుకులలో విశ్వాసం ఉంచాలి. వకీలు వ్యాజ్యాలలో నిమగ్నమై ఉన్నట్లు సాధువు భగవచ్చింతనలోనే నిమగ్నమై ఉంటాడు. భూశుండి కాకి కథ మీద నీకు విశ్వాసం కలుగుతోందా? (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)
అందరూ అర్థం చేసుకోలేరు
కానీ శ్రీ శారదాదేవి దివ్యత్వాన్ని అందరూ అర్థం చేసుకోలేకపోయారు. మాతృదేవితోనే ఒకరు, “అమ్మా! మేము మిమ్మల్ని దేవిగా చూడలేకపోతున్నామే!” అని అన్నారు. అందుకు మాతృదేవి, “నాయనా! అందరూ దానిని గ్రహించగలరా? కొలను మెట్లమీద ఒక రత్నం పడివుంది. స్నానానికి వెళ్లే ప్రతి వ్యక్తి పాదమూ దానిమీద పడింది. అందరూ దానిని మామూలు రాయిగా భావించి పాదాలను తోము కోవడానికే వాడుకున్నారు. చివరకు ఒక రత్నాల వ్యాపారి వచ్చినప్పుడు ఆ రాయిని చూడగానే రత్నం అని తెలుసుకుంటాడు” అన్నారు. దాని నిజాన్ని తెలుసుకున్న వారికీ, తెలుసుకోనివారికీ కూడా అది ఉపయోగపడింది. ఉపయోగ పడిన తీరులోనే భేదమంతా! అదేలా ఎవరికి దివ్యనేత్రాలుంటాయో వారు మాత్రమే దివ్యత్వాన్ని చూడగలరు. కానీ మాతృదేవి తమ దివ్యత్వాన్ని గురించి తెలుసుకున్న వారికీ, తెలుసుకోనివారికీ సొంతంగానే ఉన్నారు. కానీ ఇరుతరఫుల వారు పొందిన ఫలితంలోనే భేదముంది. (Chandogya Upanishad 1.1.10) (Source: శ్రీ శారదాదేవి చరితామృతం)
సాధారణ మనుషులు ఆ రత్నాన్ని ఎలాగైతే కాలికి రాసుకునే రాయిగా భావించారో, అలాగే భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు అజ్ఞానులు ఆయనను సాధారణ మనిషిగానే భావిస్తారు.
యోగీన్–మా మాతృదేవికి అతిసన్నిహితురాలే అయినప్పటికీ ఆమెలో ఒక సందర్భంలో మాతృదేవి దివ్యత్వం గురించి సంశయం తలెత్తింది. ఆమె ఇలా అనుకొంది. “మూర్తీభవించిన పరిత్యాగమే శ్రీరామకృష్ణులు. కాని మాతృదేవి తన తమ్ముడు, మరదళ్ళ, మేనగోడళ్ళ వ్యాపకంలో తలమునకలవుతూ ఉన్నారు.” ఇలా అనుకొన్న కొద్ది రోజుల తరువాత ఒక రోజు యోగీన్–మా గంగాతీరంలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక దర్శనంలో శ్రీరామకృష్ణులు కనిపించి ఆమె సంశయ నివృత్తిని ఇలా చేశారు. గంగాజలాలలో మృతదేహాలు సైతం కొట్టుకొని రావడమూ, అయినప్పటికీ గంగను అనేకులు పూజిస్తూ ఉండడమూ చూపి, ‘గంగను ఏదన్నా అపవిత్రం చెయ్యగలదా? ఆమెను (మాతృదేవిని) కూడా అదే విధంగా పరిగణించు. ఎన్నడూ ఆమెను సంశయించవద్దు. ఇదీ (తాము అని అర్థం), ఆమె అభిన్నం’ అని చెప్పారు. (మూలం: సర్వ దేవదేవీ స్వరూపుడు శ్రీరామకృష్ణ)
బాంకురా అనే ఊళ్లోని రామకృష్ణ మఠానికి స్వామి హరిప్రేమానంద మాతృదేవితోపాటు వెళ్లారు. అక్కడ ఒక రోజు సాయంత్రం ఆయనకు కలిగిన అద్భుత అనుభవాన్ని ఆయన ముఖతా విందాం.
“ఆ సాయం సమయం మరచిపోలేనిది. మాతృదేవి ఒక బల్లమీద కూర్చొని ఉన్నారు. నెల, తేది అవన్నీ నాకు జ్ఞాపకం లేదు. నేను మాతృదేవి పాదపద్మాల మ్రోల కూర్చొని, పాదపద్మాలను ఒత్తుతున్నాను. ఆ పాదాలు బాగా ముడతలతో శుష్కించిపోయాయి. ఆ పాదాలను చూడగానే నా మనస్సులో, “మాతృదేవి నిజంగా జగన్మాతేనా? దేవి పాదాలు ఇంత కళావిహీనంగా, నరాలు కనబడేటట్లు శుష్కించి ఉంటాయా?’ అనే సందేహం కలిగింది. కానీ బయటకు వ్యక్తం చేయ లేదు. పాదపద్మాలను ఒత్తుతూనేవున్నారు.
“అప్పుడు మెల్లమెల్లగా దృశ్యంలో మార్పు వచ్చింది. ఆ పాదాలు వృద్ధు రాలైన స్త్రీ శుష్కించిన పాదాలలా కాకుండా ఒక యువతి పాదాలుగా గోచరిం చాయి. అందమయిన పాదాలు, వాటిపై పారాణి, అర్ధచంద్రుని లాంటి గోళ్లు – యివన్నీ ప్రక్కనే ఉన్న దీపం వెలుతురులో స్పష్టంగా కనబడ్డాయి. ఆ పాదపద్మా లలో బంగారు గొలుసులు, వజ్ర వైడూర్యాలు పొదిగిన నూపురము ప్రకాశిం చాయి. ఈ పాదాలెవరివి? నేను ఎవరి పాదాలను పట్టుకొనివున్నానని దిగ్భ్రమ చెందాను.
“కళ్లను ఒకసారి నులుముకొని చూశాను. సందేహమేలేదు. నోటమాటలు రావడం లేదు. పాదాల మీద కేంద్రీకృతమైన దృష్టిని పైకి మళ్లించాను. బంగారు కాంతులతో మెరిసిపోతూ జగద్ధాత్రీదేవి ఆసీనురాలైవుంది – మూడు నేత్రాలు, ఆయుధాలు ధరించిన నాలుగు చేతులు, అనేక ఆభరణాలు. వజ్రవైడూర్యాలు పొదిగిన కిరీటం ఆమె నుండి ఉత్పన్నమయిన ప్రకాశం నాలుగు దిశలనూ నింపివేస్తూవుంది. ఇంతకు మంచి చూడలేని స్థితికి వచ్చిన నేను భావోద్వేగంతో, ‘అమ్మా, అమ్మా’ అంటూనే బాహ్యస్మృతిని కోల్పోయాను.
“ఎంతసేపు ఆ స్థితిలో ఉన్నానో నాకు తెలియదు. మళ్లీ బాహ్యస్మృతి కలిగే టప్పటికి మాతృదేవి నా వీపు నిమురుతూ, ‘హరీ, ఓ హరీ! నీకేమయింది? లే, లే’ అంటున్నారు. నేను లేచాను. మాతృదేవి – వయస్సు మళ్లిన, శుష్కించిన అదే మాతృదేవి – అక్కడ నిశ్చలంగా కూర్చొనివున్నారు.” (మూలం: శ్రీ శారదాదేవి చరితామృతం)
చిత్రకూటంలో సంత్ తులసీదాస్ గారికి జరిగిన ఈ అద్భుత సంఘటన భక్తి సంప్రదాయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఘట్టాలలో ఒకటి. భగవంతుడు భౌతిక ప్రపంచంలోకి దిగివచ్చినప్పుడు ఆయనను గుర్తించడం ఎంత కష్టమో ఈ సంఘటన స్పష్టంగా వివరిస్తుంది.
రామ్ఘాట్ వద్ద జరిగిన సంఘటన
సంప్రదాయం ప్రకారం, అయోధ్యను విడిచిపెట్టిన తర్వాత, సంత్ తులసీదాస్ చిత్రకూటంలో – ముఖ్యంగా మందాకినీ నది ఒడ్డున ఉన్న రామ్ఘాట్ వద్ద స్థిరపడ్డారు. శ్రీరాముని దర్శనం కోసం తపిస్తూ ఆయన తన రోజులను ప్రగాఢ భక్తిలో గడిపేవారు.
ఒకరోజు ఉదయం, తులసీదాస్ ఘాట్ మీద కూర్చొని తన దైనందిన పూజ కోసం గంధం (చందనం) అరుగుదీస్తుండగా, గుర్రాలపై ఇద్దరు అత్యంత అందమైన యువకులు ఆయన వద్దకు వచ్చారు. వారిలో ఒకరు నల్లని వర్ణంలో, మరొకరు తెల్లని వర్ణంలో ఉన్నారు. ఆ బాలురు తులసీదాస్ గారిని కొంచెం గంధం అడిగారు.
ఆ బాలుర భౌతిక సౌందర్యానికి తులసీదాస్ పూర్తిగా మంత్రముగ్ధులయ్యారు. ఆయన ప్రాపంచిక స్పృహ కోల్పోయి, స్వచ్ఛమైన ప్రేమతో వారిని అలానే చూస్తూ ఉండిపోయారు, కానీ వారు శ్రీరాముడు, లక్ష్మణుడు అని ఆయన గుర్తించలేకపోయారు. తన జీవితకాలం అంతా ఎవరి కోసం వెతికారో ఆ భగవంతుడిని ఆయన నేరుగా చూస్తున్నప్పటికీ, ఆయన కళ్ళు మాత్రం ఇద్దరు మనోహరమైన యువరాజులను మాత్రమే చూశాయి.
తులసీదాస్కు శ్రీరాముని దర్శనం చేయిస్తానని మాట ఇచ్చిన హనుమంతుడు, చిలుక రూపంలో సమీపంలో ఉన్న ఒక చెట్టుపై నుండి ఇదంతా గమనిస్తున్నాడు. తులసీదాస్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దర్శనాన్ని కోల్పోబోతున్నారని గ్రహించిన హనుమంతుడు, ఆయన ధ్యానాన్ని భగ్నం చేయడానికి ఇప్పుడు అజరామరమైన ఒక దోహాను (పద్యం) పఠించాడు:
చిత్రకూట్ కే ఘాట్ పర్, భయీ సంతన్ కీ భీడ్.
తులసీదాస్ చందన్ ఘిసే, తిలక్ దేత్ రఘుబీర్.
(అనువాదం: చిత్రకూటపు ఘాట్ల వద్ద సాధువుల సమూహం మధ్య, తులసీదాస్ గంధం అరుగుదీస్తుండగా, సాక్షాత్తూ శ్రీరాముడే ఆయనకు తిలకం దిద్దుతున్నాడు.)ఈ మాటలు వినగానే, మాయతెర తొలగిపోయింది. తన ముందు ఉన్నది ఎవరో గ్రహించిన తులసీదాస్ శరీర స్పృహను కోల్పోయారు. అప్పుడు శ్రీరాముడు ఆ గంధాన్ని తీసుకుని తన నుదుటిపై పెట్టుకుని, ఆపై ప్రేమతో ఆశ్చర్యంలో ఉన్న తన భక్తుని నుదుటిపై కూడా రాసి అదృశ్యమయ్యాడు.
ఇక్కడి ప్రధాన సూత్రం యోగమాయ – భగవంతుడు భౌతిక ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు ఆయనను కప్పి ఉంచే దైవిక మాయ. అనంతమైన, సంపూర్ణమైన దైవత్వం ఒక పరిమిత మానవ అవతారంగా కుదించబడినప్పుడు, సాధారణ భౌతిక దృష్టి దానిని గుర్తించలేదని గీత వివరిస్తుంది. చిత్రకూటంలో జరిగిన సంఘటన ఈ శ్లోకానికి ఎలా ప్రాణం పోస్తుందో ఇక్కడ చూద్దాం:
- మానవ రూపం అనే తెర (మానుషీం తనుమాశ్రితమ్): కృష్ణుడు చెప్పినట్లుగానే, మానవ రూపం భగవంతుడిని దాచిపెడుతుంది. శ్రీరాముడు గుర్రంపై వచ్చిన ఒక సాధారణ (చాలా అందమైనప్పటికీ) రాకుమారుని వలె కనిపించాడు. అదనపు చేతులు, ప్రకాశించే తేజస్సు లేదా దివ్యాస్త్రాలు లేవు. విశ్వానికి సృష్టికర్త అయిన భగవంతుడు కేవలం కొంచెం గంధం అడిగాడు.
- భౌతిక ఇంద్రియాల పరిమితి: తులసీదాస్ లాంటి గొప్ప ఆధ్యాత్మిక సాధువు కూడా ఆరంభంలో ఆ మానవ రూపాన్ని చూసి గందరగోళానికి గురయ్యారు. ఒక గొప్ప భక్తుడే తాత్కాలికంగా భగవంతుడిని గుర్తించలేకపోతే, ఒక సాధారణ మనిషిలా కనిపిస్తూ, తింటూ, నడుస్తున్నాడన్న కారణంతో భగవంతుడి ఉనికినే పూర్తిగా తిరస్కరించే సాధారణ ప్రాపంచిక వ్యక్తులను కృష్ణుడు ఉపయోగించిన ‘మూఢా‘ (మూర్ఖులు) అనే పదం ఖచ్చితంగా వివరిస్తుంది.
- కృప ఆవశ్యకత (గురువు పాత్ర): భగవద్గీతలో, అర్జునుడు తన మానవ రూపం ఆవల ఉన్న తత్వాన్ని చూడగలిగేలా కృష్ణుడు తన పరమ స్వభావాన్ని వివరించాడు. చిత్రకూటంలో, హనుమంతుడు గురువుగా వ్యవహరించాడు. హనుమంతుడి జోక్యం లేకపోతే, ఆ మానవ వేషం ఖచ్చితంగా పనిచేసేది మరియు తులసీదాస్ తన ముందు ఉన్నది ఎవరో తెలుసుకోలేకపోయేవారు.