- సంజయుడు పలికెను – ఈవిధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకులపాటును, శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను. (2.1)
- శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను – ఓ అర్జునా ! తగని సమయములో ఈ వెూహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడునదియు కాదు, స్వర్గమును ఇచ్చునదియు కాదు, కీర్తిని కలిగించునదియు కాదు. (2.2)
- కావున ఓ అర్జునా! పిరికితనమునకు లోనుకావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా ! తుచ్ఛమైన ఈ హృదయదౌర్భల్యమును వీడి, యుద్ధమునకై నడుము బిగింపుము. (2.3)
- అర్జునుడు పలికెను – ఓ మధుసూదనా! పూజ్యులైన భీష్మపితామహుని, ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ అరిసూదనా ! ఈ ఇరువురును నాకు పూజ్యులు. (2.4)
- మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొనియైనను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలనన ఈ గురుజనులను చంపినను, రక్తసిక్తములైన రాజ్యసంపదలను, భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి యుండును కదా! (2.5)
- ఈ యుద్ధముచేయుట శ్రేష్ఠమా? లేక చేయకుండుట శ్రేష్ఠమా? అనునది ఎఱుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా? లేక మనలను వారు జయింతురా? అను విషయమునుగూడ ఎఱుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచట మనలను ఎదిరించు(పోరాడుటకు) నిలిచి యున్నారు.వారిని చంపి, జీవించుటకును మనము ఇష్టపడము. (2.6)
- కార్పణ్యదోషము(పిరికితనము)నకులోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మములవిచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించు కొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను. శరణాగతుడను, ఉపదేశింపుము. (2.7)
- ఈ శోకము నా ఇంద్రియములను దహించివేయుచున్నది. సిరిసంపదలతో గూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారునుపాయమును గాంచలేకున్నాను. (2.8)
- సంజయుడు పలికెను – ఓ రాజా! ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామియైన శ్రీకృష్ణనితో గుడాకేశుడైన అర్జునుడు, “ నేను యుద్ధము చేయనే చేయను” అని స్పష్టముగా నుడివి, మౌనము వహించెను. (2.9)
- ఓ ధృతరాష్ట్రా ! ఉభయసేనల మధ్య శోకసంతప్తుడైన అర్జునుని జూచి, శ్రీకృష్టడు మందహాసముతో ఇట్లు పలికెను. (2.10)
- శ్రీభగవానుడు పలికెను – ఓ అర్జునా! శోకింపదగని వారికొఱకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని(జ్ఞాని) వలె మాట్లాడుచున్నావు. పండితులైనవారు ప్రాణములు పోయిన వారిని గూర్చిగాని, ప్రాణములుపోని వారిని గుఱించిగాని శోకింపరు. (2.11)
- నీవుగాని, నేనుగాని, ఈ రాజులుగాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడ మనము ఉండము అనుమాటయే లేదు. ( అన్ని కాలములలోను మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము. అది అన్ని కాలములయందును ఉండును. శరీరపతనముతో అది నశించునది కాదు. ) (2.12)
- జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మఱియెుక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైనవాడు ఈ విషయమున వెూహితుడు కాడు. (2.13)
- ఓ కౌంతేయా! విషయేంద్రియసంయోగము వలన శీతోష్ణములు సుఖదుఃఖములు కలుగుచున్నవి.అవి ఉత్పత్తి వినాశశీలములు. అనిత్యములు. కనుక భారతా! వాటిని సహింపుము.( పట్టించుకొనకుము) (2.14)
- ఏలనన ఓ పురుషశ్రేష్ఠా! ధీరుడైనవాడు సుఖదుఃఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే వెూక్షమును పొందుటకు అర్హుడు. (2.15)
- అసత్తు అనుదానికి ( అనిత్యమైనదానికి) ఉనికియే లేదు. సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధముగ ఈ రెండింటియెుక్క వాస్తవస్వరూపములను తత్త్వజ్ఞానియైనవాడే ఎఱుంగును. (2.16)
- నాశరహితమైన ఆ సత్యము( పరమాత్మ తత్త్వము) జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని యెరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరును నశింపజేయజాలరు. (2.17)
- ఈ శరీరములు అన్నియును నశించునవియే. కాని జీవాత్మ నాశరహితము, అప్రమేయము( అనిర్వచనీయుము).నిత్యము. కనుక ( ఈ విషయమును ఎఱింగి) ఓ భరతవంశీ! అర్జునా! నీవు యుద్ధము చేయుము. (2.18)
- ఆత్మ ఇతురులను చంపునని భావించువాడును, అది (ఆత్మ) ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దఱును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతను చంపబడదు. (2.19)
- ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు. పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది( ఉత్పత్తి, అస్తిత్వము,వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆఱును భావవికారములు) ఇది జన్మ లేనిది. నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. (2.20)
- ఓ పార్థా ! ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జననమరణములు లేనిదనియు, మార్పులేనిదనియు తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును? ఎవరిని ఎట్లు చంపును? (2.21)
- మానవుడు జీర్ణవస్త్రములను త్యజించి, నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాతశరీరములను వీడి నూతనశరీరములను పొందును. (2.22)
- ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడపజాలదు. వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. (2.23)
- ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము. సర్వవ్యాపి, చలింపనిది(అచలము) స్థాణువు( స్థిరమైనది) సనాతనము. (శాశ్వతము). (2.24)
- ఈ ఆత్మ అవ్యక్తమైనది. ( ఇంద్రియగోచరముగానిది) అచింత్యము (మనస్సునకును అందనిది.) వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలిసికొనుము. కనుక ఓ అర్జునా! నీవు దేనికై శోకింపదగదు. (2.25)
- ఓ అర్జునా! ఈ ఆత్మకు జననమరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికిని దీనికై నీవు శోకింపదగదు. (2.26)
- ఏలనన పుట్టినవానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు. (2.27)
- ఓ అర్జునా! ప్రాణులన్నియును పుట్టుకకుముందు అవ్యక్తములు (ఇంద్రియ గోచరములు గావు)- మరణానంతరము గూడా అవి అవ్యక్తములే- ఈ జననమరణముల మధ్యకాలము నందు మాత్రమే అవి ప్రకటితములు ( ఇంద్రియ గోచరములు) అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. (2.28)
- ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని (ఈ ఆత్మను ) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్త్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేఱొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడ కొందరు దీనినిగూర్చి ఏమియు ఎఱుగరు. (2.29)
- ఓ అర్జునా! ప్రతిదేహమునందును ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలుకానిది. కనుక ఏ ప్రాణిని గూర్చియైనను నీవు శోకింపదగదు. (2.30)
- అంతేగాక స్వధర్మమునుబట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలనన క్షత్రియునుకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మఱియొకటి ఏదియును లేదు. (2.31)
- ఓ పార్థా! యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెఱచిన ద్వారము వంటిది. (2.32)
- ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మమునుండి పాఱిపోయినవాడవు అగుదువు. దానివలన కీర్తిని కోల్పోవుదువు. పైగా నీవు పాపము చేసినవాడవగుదువు. (2.33)
- లోకులెల్లరును బహుకాలమువఱకును నీ అపకీర్తినిగూర్చి చిలువలు పలువలుగా చెప్పికొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణముకంటెను బాధాకరమైనది. (2.34)
- ఈ మహారథులదృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధవిముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యెదవు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధమునుండి పారిపోయినట్లు వీరు భావింతురు. (2.35)
- నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటె విచారకరమైన విషయమేముండును? (2.36)
- ఓ అర్జునా! రణరంగమున మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. (2.37)
- జయాపజయములను, లాభనష్టములను, సుఖదుఃఖములను సమానముగా భావించి, యుద్ధసన్నద్దుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. (2.38)
- ఓ పార్థా! ఈ (సమత్వ) బుద్ధిని ఇంతవఱకును జ్ఞానయోగ దృష్టితో తెల్పితిని. ఇప్పుడు దానినే కర్మయోగదృక్పథముతో వివరించెదను, వినుము దానిని ఆకళింపుచేసికుని, ఆచరించినచో కర్మబంధములనుండి నీవుముక్తుడవయ్యెదవు. (2.39)
- ఈ (నిష్కామ) కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికిని బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే యుండవు. పైగా ఈ (నిష్కామ) కర్మయోగమును ఏ కొంచెము సాధనచేసినను అది జన్మమృత్యురూప మహాభాయమునుండి కాపాడును. (2.40)
- ఓ అర్జునా! ఈ (నిష్కామ) కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే యుండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై, ఒకదారీ తెన్నూ లేక కోరికలవెంట నలువైపులా పరుగులు తీయుచూ అనంతములుగానుండును. (2.41)
- ఓ అర్జునా! వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమున్కలై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేద వాక్యములయొక్క బాహ్యార్థములయందే ప్రీతివహింతురు. వాటి అంతరార్థములజోలికేపోరు. స్వర్గమునకు మించిదినదేదియును లేదనియు, అదియే పరమప్రాప్యమనియు వారు (వివేకహీనులు) భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందలి ఆసక్తితో వివిద సకామ కర్మలను ప్రోత్సహించుచు , ప్రీతిని గూర్చు ఇచ్చకపుపల్కులు పలికెదరు. ఆ ఇచ్చకపుమాటల ఉచ్చులలో బడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానులబుద్ధులు భగవంతుడు లక్ష్యముగాగల సమాధియందు స్థిరముగా ఉండవు. (2.42-44)
- ఓ అర్జునా! వేదములు సత్త్వరజస్తమోగుణములకార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల యెడలను వాటి సాధనలయందును ఆసక్తిని త్యజింపుము. హర్షశో కాదిద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొఱకై ఆ ఆరాటపదవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము. (2.45)
- అన్నివైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయములవలన ఎంత ప్రయోజనమో, పరమాత్మప్రాప్తినంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదములవలన అంతియే ప్రయోజనము. (2.46)
- ర్తవ్యకర్మమునాచరించుటయందే నీకు అధికారముగలదు. ఎన్నటికినీ దాని ఫలములయందులేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్షరహితుడవై కర్తవ్యబుద్ధితో కర్మలనాచరింపుము. (2.47)
- ఓ ధనంజయా! యోగస్థితుడవై ఆసక్తిని వీడి, సిద్ది-అసిద్దుల యెడ సమత్వ భావమును కలిగియుండి, కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు. (2.48)
- ఈ సమత్వబుద్ధియోగముకంటెను సకామకర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయా! నీవు సమత్వబుద్ధియోగమునే ఆశ్రయింపుము – ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంతదీనులు, కృపణులు. (2.49)
- సమత్వ బుద్ధియుక్తుడైనవాడు పుణ్య పాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వబుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము. అనగాకర్మబంధములనుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము. (2.50)
- ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణబంధములనుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమ పదమును పొందుదురు. (2.51)
- మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటబడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. (2.52)
- నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన ( అయోమయమునకు గురియైన) నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య ( శాశ్వత) సంయోగము ఏర్పడును. (2.53)
- అర్జునుడు పలికెను – ఓ కేశవా! సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు భాషించును? ఎట్లు కూర్చొనును? ఎట్లు నడుచును? (2.54)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా ఆత్మ యందు సంతుష్టుడైనవానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందినవానిని స్థితప్రజ్ఞుడని యందురు. (2.55)
- దుఃఖములకు క్రుంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడును ఐనట్టి మనన శీలుడు(ముని) స్థితప్రజ్ఞుడన బడును. (2.56)
- దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితు లయందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోను గాని వాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. (2.57)
- తాబేలు తనఅంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా, ఇంద్రియములను ఇంద్రియార్థముల (విషయాదుల) నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. (2.58)
- ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహంపనివానినుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును. కాని వాటి పై ఆసక్తి మిగిలిముండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందు వలన వానినుండి ఆ ఆసక్తిగూడ తొలగిపోవును. (2.59)
- ఓ అర్జునా! ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగి పోనంతవఱకును అవి అతని మనస్సును ఇంద్రియార్థములవైపు బలవంతముగా లాగికొనిపోవుచునే యుండును. (2.60)
- కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశమునందుంచుకొని, సమాహిత చిత్తుడై ( చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై) మత్పరాయణుడై, ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలనన ఇంద్రియములను వశము నందుంచుకొనువాని బుద్ధి స్థిరముగానుండును. (2.61)
- విషయచింతన చేయు పురుషునకు ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆవిషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధినాశమువలన మనుష్యుడు తన స్థితినుండి పతనమగును. (2.62-63)
- అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. (2.64)
- మనః ప్రసన్నతను పొందిన వెంటనే అతనిదుఃఖములన్నియును నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగియొక్క బుద్ధి అన్నివిషయములనుండి వైదొలగి, పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. (2.65)
- ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చియాత్మకబుద్ధి ఉండదు. అట్టి అయుక్తమనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్మాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును? (2.66)
- నీటిపై తేలుచున్న నావను గాలినెట్టివేయును. అట్లే ఇంద్రియార్థములయందు సంచరించు ఇంద్రయములలో, మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను, ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనుజునిబుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించి వేయును. (2.67)
- కనుక ఓ అర్జునా! ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్నివిధిములుగ పూర్తిగా నిగ్రహించిన పురుషునియొక్క బుద్ధి స్థిరముగానుండును. (2.68)
- నిత్యజ్ఞానస్వరూప పరమానందప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. అది ఇతర ప్రాణులన్నింటికిని రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నియు మేల్కోని యుండును. అది పరమాత్మతత్త్వమునెఱిగిన మునికి ( మననశీలునకు) రాత్రితో సమానము. (2.69)
- సమస్తదిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగనే అందులో లీనమగును. అట్లే సమస్తభోగములును స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. (2.70)
- కోరికలన్నింటిని త్యజించి, మమతా- అహంకార, స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. (2.71)
- ఓ అర్జునా! బ్రాహ్మీస్థితి యనగా ఇదియే. (ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషునిస్థితి.) ఈ బ్రాహ్మీస్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితియందు స్థిరముగానున్ననాడు బ్రహ్మానందమును పొందును. (2.72)