- అర్జునుడు పలికెను – ఓ మహాబాహూ!అంతర్యామీ! వాసుదేవా! సన్న్యాసతత్త్వమును, త్యాగతత్త్వమును వేర్వేరుగా తెలిసికొనగోరెదను. (18.1)
- శ్రీ భగవానుడు పలికెను – కామ్యకర్మల త్యాగమునే సన్న్యాసమని కొందరు పండితులు తలంతురు. కాని విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు. (18.2)
- కొందరు విద్వాంసులు కర్మలన్నియును దోషయుక్తములేగావున వాటిని త్యజింపవలెనని యందురు. కానీ యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందురు. (18.3)
- ఓ పురుషశ్రేష్ఠా! అర్జునా! సన్యాసము, త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమునుగూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్త్వికము, రాజసము, తామసము అని మూడువిధములుగా చెప్పబడినది. (18.4)
- యజ్ఞదానతపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞదానతపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమొనర్చును. (18.5)
- కావున ఓ పార్థా! ” ఈ యజ్ఞదాన తపోరూపకర్మలను మరియు కర్తవ్యకర్మలను అన్నింటిని ఫలాసక్తులను త్యజించి, అవశ్యమాచరింపవలెను” అనునది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయము. (18.6)
- (నిషిద్ధ కర్మల, కామ్యకర్మలఆచరణను త్యాగముచేయుట సముచితమే.) కాని శాస్త్ర విహిత కార్మాచరణమును త్యజించుట ఉచితముగాదు. కావున మోహవశమున దానిని త్యజించుట ‘తామస త్యాగము’ అనబడును. (18.7)
- కర్మలన్నియును దుఃఖకారకములే యని భావించి, శారీరికక్లేశమునకు భయపడి, కర్తవ్యకర్మలను త్యజించుటను రాజసత్యాగము అని యందురు. అట్టి త్యాగమువలన ఎట్టి ఫలమూ లభింపదు. (18.8)
- ఓ అర్జునా! శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటియందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్త్వికత్యాగము అని భావింపబడును. (18.9)
- అకుశలకర్మలను, నిషిద్ధ కర్మలను, కామ్యకర్మలను ద్వేషింపనివాడు, కుశలకర్మలయందు (నిత్య నైమిత్తిక పవిత్ర కర్మలయందు) ఆసక్తి కలిగియుండనివాడు, శుద్ధసత్త్వగుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు ఐనవాడు నిజమైన త్యాగి. (18.10)
- ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అశక్యము. కావున కర్మలను గాక కర్మఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. (18.11)
- కర్మ ఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి, చెడు, మిశ్రము అని మూడు విధములగు ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలయును. కాని కర్మఫలత్యాగమొనర్చిన కర్మయోగులు తమ కర్మల ఫలములను ఏ కాలమునందైనను, ఏ విధముగను అనుభవింపవలసిన పనియుండదు. (18.12)
- ఓ మహాబాహూ! సర్వ కర్మల సిద్ధికి ఐదు హేతువులు గలవని కర్మలను అంతముచేయు ఉపాయములను తెలుపు సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనుట జరిగినది. వాటిని నానుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. (18.13)
- కర్మల సిద్ధియందు అధిష్ఠానము, కర్త, వివిధములైన కరణములు( సాధనములు) నానావిధ చేష్టలు, దైవము అను ఐదును హేతువులు. (18.14)
- మానవుడు శరీరము, వాక్కు, మనస్సులతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన యేకర్మలైనను ఈ యైదు హేతువులతో ఒప్పుచుండును. (18.15)
- అట్లైనప్పటికిని (సర్వ కర్మలకును ఐదు హేతువులే మూలమైనప్పటికిని) విపరీతబుద్ధికారణమున ఏ మనుష్యుడు కేవలుడు (నిరంజనుడు), శుద్ధస్వరూపుడైన ఆత్మను సమస్తకర్మలకు కర్తగా భావించునో, అట్టి మలినబుద్ధిగల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. (18.16)
- అంతఃకరణమునందు కర్తృత్వభావము లేనివానిబుద్ధి ప్రాపంచికపదార్థములయందును, కర్మలయందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటిని హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపములును అంటవు. (18.17)
- జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి మూడు విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మసంగ్రహములు మూడు విధములు. (18.18)
- గుణముల సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో మూడేసి విధములుగా పేర్కొనబడినది. వానిని గూర్చి విశదపరచెదను, వినుము. (18.19)
- వేర్వేరుగా కన్పించు సమస్తప్రాణులయందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభవాముతో స్థితుడైయునట్లు జ్ఞానియైన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్త్విక జ్ఞానముగా తెలుసికొనుము. (18.20)
- సమస్తప్రాణులయందును నానావిధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించువారి జ్ఞానమును రాజసము అని యెరుంగుము. (18.21)
- ప్రకృతి కార్యమైనా శరీరమునే (శరీరమునకు సంబంధించిన భౌతికవస్తువులనే) సమస్తముగా భావించి, దానియందే ఆసక్తిని కల్గించునట్టిదియు, తాత్త్వికముగా అర్థరహితమైనదియు, హేతబద్ధము కానిదియు, తుచ్ఛమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అనియందురు. (18.22)
- కర్తృత్వాభిమానము గాని, ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మను సాత్వికకర్మయని యందురు. (18.23)
- భోగలాలసుడైన పురుషునిచేతను, అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజసకర్మ అనియందురు. (18.24)
- పరిణామము (మంచిచెడ్డలు) హాని, హింస, సామర్థ్యములను చూచుకొనక కేవలము మూర్ఖత్వముచే (అజ్ఞానముచే )ఆరంభింపబడు కర్మలను తామసకర్మలు అనియందురు. (18.25)
- ఆసక్తిని త్యజించినవాడు, అహంకారరహితముగా భాషించువాడు, ధైర్యోత్సాహములు గలవాడును సిద్ధి – అసిద్ధులయెడ హర్షశోకాదివికారములకు లోనుకానివాడును అగు పురుషుడు సాత్వికకర్త యనబడును. (18.26)
- ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్ష శోకములకు లోనగువాడు రాజసకర్తగా భావింపబడును. (18.27)
- జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు (మొండివాడు), ధూర్తుడు, అకారణముగ ఇతరులవృత్తులకు విఘాతము కల్గించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతోకాలము గడుపుచుండువాడు (దీర్ఘ సూత్రి) – ఇట్టి లక్షణములు గలవానిని తామసకర్త అని యందురు. (18.28)
- ఓ ధనంజయా! ఇప్పుడు నీవు బుద్ధి, ధృతులను గూడ గుణ భేదములననుసరించి మూడు విధములుగా, విభాగ పూర్వకముగా సంపూర్ణముగా నానుండి వినుము. (18.29)
- ప్రవృత్తిమార్గమును, నివృత్తిమార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలిసికొనుబుద్ధిని సాత్వికమైన బుద్ధియందురు. (18.30)
- ఓ పార్థా! ధర్మాధర్మములయొక్కయు, కార్యాకార్యములయొక్కయు (కర్తవ్యా కర్తవ్యముల యొక్కయు), యదార్థ తత్త్వములను తెలియజాలని బుద్ధిని “రాజస బుద్ధి ” అనియందురు. (18.31)
- ఓ అర్జునా! తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మ ముగును, అట్లే ఇతర పదార్థములను( విషయములను) తద్విపరీతముగను భావించు బుద్ధిని ‘తామస బుద్ధి’ అనియందురు. (18.32)
- ఓ పార్థా! ఇటునటు చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగముద్వారా మనఃప్రాణేంద్రియ క్రియలను ధారణచేయు శక్తిని ‘సాత్త్వికధృతి’ యందురు. (18.33)
- కాని, ఓ పార్థా! అర్జునా! కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థకామ విషయములను ధారణచేయు శక్తిని ‘రాజసధృతి’ అనియందురు. (18.34)
- పార్థా! నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడువక, దుర్మతియైన మనుష్యుడు వాటినే సతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని, ‘తామసధృతి’ అనియందురు. (18.35)
- ఓ భరతశ్రేష్ఠా! మూడు విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజనధ్యానసేవాదుల నొనర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో …..(18.36)
- …ప్రారంభమునందు విషతుల్యముగా (దుఃఖకరముగా) గోచరించినప్పటికిని పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో, అట్టి సుఖమును ‘సాత్త్వికసుఖము’ అనియందురు. (18.37)
- విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మెుదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగ అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును ‘రాజససుఖము’ అందురు. (18.38)
- నిద్ర, సోమరితనము, ప్రమాదము( వెూహము)ల వలన ఉత్పన్నమగు సుఖమును తామససుఖము అనియందురు. ఇట్టి సుఖము భోగసమయమునందును, పరిణామమునందును ఆత్మను వెూహింపజేయుచుండును. (18.39)
- పృథివియందు గాని, ఆకాశమునందుగాని, దేవతలయందుగాని, మఱేయితర లోకములయందుగాని, ప్రకృతినుండి ఉత్పన్నములైన ఈ మూడు గుణములు లేకుండ ఏ ప్రాణియు ఉండదు. (18.40)
- ఓ పరంతపా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలనూ, అట్లే శూద్రుల కర్మలునూ వారివారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడియున్నవి. (18.41)
- అంత:కరణనిగ్రహము( శమము ), ఇంద్రియములను వశమునందుంచుకొనుట (దమము), ధర్మ ములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరులఅపరాధములను క్షమించుట, ఋజుమార్గ జీవనము, ( మనశ్శరీరేంద్రియముల సరళత్వము) వేద శాస్త్రముల యందును ఈశ్వరునియందును పరలోకాదులయందును, విశ్వాసమును కలిగియుండుట, వేదశాస్త్రములఅధ్యయనము, అధ్యాపనము, పరతత్త్వాసుభవము – ఇవి యన్నియును బ్రాహ్మణులస్వాభావిక కర్మలు. (18.42)
- శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపకుండుట, దానములనిచ్చుట, స్వామి భావముతో ప్రజలను ధర్మ పరాయణులనుగా చేయుచు పరిపాలించుట మొదలగునవి యన్నియును క్షత్రియులస్వాభావికకర్మలు. (18.43)
- వ్యవసాయము, గోరక్షణము, క్రయవిక్రయరూప సత్యవ్యవహారము ఇవి యన్నియును వైశ్యులస్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణములవారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. (18.44)
- తమతమ స్వాభావికకర్మల యందు తత్పరులైనవారు భగవత్ప్రాప్తిరూప పరమసిద్ధిని నిస్సందేహమగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. (18.45)
- సమస్త ప్రాణులప్రాదుర్భావము పరమేశ్వరునినుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించియున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావికకర్మాలద్వారా పూజించి, మానవుడు పరమసిద్ధిని పొందును. (18.46)
- బాగుగా ఆచరింపబడిన పరధర్మముకంటెను గణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్ఠమైనది. స్వభావమును అనుసరించి ( స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి ) కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములును ఏ మాత్రము అంటనే అంటవు. (18.47)
- ఓ కౌంతేయా! (అర్జునా! ) దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన! అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నియను ఏదేని ఒక దోషముతో కూడియే యుండును. (18.48)
- ఓ అర్జునా! ప్రాపంచికవిషయములన్నింటియందు ఆసక్తి లేని వాడును, స్ప్రుహారహితుడును, అంతఃకరణమును జయించినవాడును అగు పురుషుడు సాంఖ్య యోగము ద్వారా పరమశ్రేష్ఠమైన నైష్కర్మ్యసిద్ధిని పొందును. (18.49)
- ఓ కౌంతేయా! జ్ఞానయోగము యొక్క పరానిష్ఠయైన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్ద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తి నందు రీతిని సంగ్రహాముగా తెల్పెదను వినుము. (18.50)
- విశుద్ధమైన బుద్ధిగలవాడై, శబ్దాదివిషయములను త్యజించి, సాత్త్వికధారణాశక్తిద్వారా అంతఃకరణేంద్రియముల సంయమము కలిగి (యువ్నవాడు)…తేలికయైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, (శబ్దాదివిషయములను త్యజించి) పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, (రాగద్వేషములను సర్వథా త్యజించి )దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు …..అహంకారమును, బలమును, దర్పమును, కామక్రోధములను, పరిగ్రహమును వదలిపెట్టి, నిరంతరము ధ్యానయోగ పరాయణుడై యుండువాడు, మమతా రహితుడు, శాంతియుతుడు ఐన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మము నందు అభిన్నభావముతో స్థితుడగుటకు పాత్రుడగును. (18.51-18.53)
- సచ్చిదానంద ఘనపరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్నమస్కుడైన యోగి దేనికిని శోకింపడు. దేనినీ కాంక్షింపడు. సమస్తప్రాణులయందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. (18.54)
- బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో? ఎంతటివాడనో? యథాతథముగ నా తత్త్వమును తెలిసికొనును. అట్లు భక్తితో నా తత్త్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. (18.55)
- సమస్తకర్మలయందును కర్తృత్వ భావమును వీడి, ఆయాకర్మల ఫలరూపమైన సమస్తభోగములను త్యజించి, నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటిని సర్వదాచేయుచును నాయనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును. (18.56)
- సర్వకర్మలను నిండుమనస్సుతో నాకే అర్పించి, సమబుద్ధి రుపయోగమును అవలంబించి, మత్పరాయణుడవై సతతము చిత్తమును నాయందే నిల్పుము. (18.57)
- పైన తెలుపబడిన విధముగా నాయందు చిత్తమును నిల్పినచో, నా యనుగ్రహమువలన సమస్తసంకటముల నుండియు అనాయాసముగా బయట పడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన బెట్టినచో నష్టముల పాలగుదువు. అనగా పరమార్థ పథమునుండి భ్రష్టుడవగుదువు. (18.58)
- అహంకారవశమున “నేను ఈ యుద్ధమును చేయను” అని నీవు నిశ్చయించు కొనుట వృథా. ఏలనన నీ స్వభావమే యుద్ధముచేయుటకు నిన్ను పురికొల్పును. (18.59)
- ఓ కౌంతేయా! మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను గూడ నీ పురాకృత స్వాభావిక కర్మలచే (సంస్కారములచే) బంధింపబడి, త తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు. (18.60)
- అర్జునా! శరీరరూపయంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి, వారిని భ్రమింపజేయుచున్నాడు. (18.61)
- ఓ భారతా! (అర్జునా!) అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదమును పొందగలవు. (18.62)
- ఈ విధముగా అత్యంతరహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి, నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. (18.63)
- సమస్తగోప్యవిషయములయందును పరమగోప్యమైన నావచనములను మఱొక్కసారి వినుము. నీవు నాకు అత్యంతప్రియుడవు అగుటవలన నీకు మిక్కిలి హితమును గూర్చు వచనములను మఱల చెప్పుచున్నాను. (18.64)
- ఓ అర్జునా! నీవు నాయందే మనస్సును నిలుపుము. నా భక్తుడవు కమ్ము. నన్నే సేవింపుము. నాకు ప్రణమిల్లుము. ఇట్టు చేయుటవలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞా పూర్వకముగా నేను చెప్పుచున్నమాట. ఏలనన నీవు నాకత్యంత ప్రియుడవు. (18.65)
- సర్వ ధర్మములను అనగా సమస్తకర్తవ్యకర్మలను నాకు సమర్పింపుము. సర్వ శక్తిమంతుడను, సర్వధారుడను, పరమేశ్వరుడను ఐన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపములనుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకుము. (18.66)
- తపస్సంపన్నుడు కానివానికిని, భక్తిరహితునకును, వినవలెనను కుతూహలము లేనివానికిని నీవు ఈ గీతారూపపరహస్యోపదేశమును ఎన్నడును తెల్పరాదు. అట్టే నాయందు దోషదృష్టి గలవానికి ఎన్నడునూ ఈ ఉపదేశమును తెలపరాదు. (18.67)
- నా యందు పరమభక్తి గలిగి, ఈ పరమగోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపఱచువాడు నన్నే పొందును. ఇందేమాత్రమూ సందేహము లేదు. (18.68)
- నాకు ప్రీతిని గూర్చునట్టి కర్మల నాచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడును లేడు. అంతేగాక అతనివలె గాని, అతనిని మించిగాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరియెుకడెవ్వడును భవిష్యత్తులోను ఉండబోడు. (18.69)
- ధర్మయుక్తమైన మనసంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞముద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. (18.70)
- శ్రద్ధాదరములుగలవాడును, దోషదృష్టి (దోషములెన్ను స్వభావము) లేనివాడును ఐన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుటవలనగూడ పాపవిముక్తుడై, పుణ్యకర్మలను ఆచరించువారుపొందు ఉత్తమలోకములను పొందును. (18.71)
- ఓపార్థా! ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? ఓ ధనంజయా! అజ్ఞానజనితమైన నీ వెూహము పూర్తిగా నశించినదా? (18.72)
- అర్జునుడు పలికెను – ఓ అచ్యుతా! నీ కృపచే నా వెూహము పూర్తిగా తొలిగినది. స్మృతిని పొందితిని. ఇప్పుడు సంశయ రహితుడైతిని. కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. (18.73)
- సంజయుడు పలికెను – ఈ విధముగా శ్రీ వాసుదేవునకును మహాత్ముడైన అర్జునకును మధ్య జరిగిన సంవాదమును వింటివి. అది అద్భుతమైనది. తనువును పులకింపజేయునది. (18.74)
- వేదవ్యాసునికృపవలన దివ్యదృష్టిని పొందినవాడనై, పరమగోప్యమైన ఈ యోగమును ( గీతను) యోగేశ్వరుడైన శ్రీ కృష్ణభగవానుడు( స్వయముగ)అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. (18.75)
- ఓ రాజా! (ధృతరాష్ట్రా!) శ్రీ కృష్ణభగవానునకును అర్జునకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదేపదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను. (18.76)
- ఓ రాజా! అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వమైన ఐన ఆ శ్రీహరిరూపమును పదేపదే స్మరించుచు, నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మఱలమఱల హర్షోల్లాసములతో పులకితగాత్రుడనగుచున్నాను. (18.77)
- ఓ రాజా! యోగేశ్వరుడైన శ్రీ కృష్ణభగవానుడును, గాండీవధనుర్ధారియైన అర్జునుడును ఉండుచోట సంపదలును, సర్వ విజయములును, సకలైశ్వర్యములును, సుస్థిరమైన నీతియు. (18.78)