- అర్జునుడు పలికెను: ఓ మహాబాహో! హృషీకేశా! కేశినిషూదనా! ‘సంన్యాసం’ యొక్క తత్త్వాన్ని మరియు ‘త్యాగం’ యొక్క తత్త్వాన్ని వేర్వేరుగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. (18.1)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: కోరికలతో చేసే కర్మలను వదిలివేయడాన్ని ‘సంన్యాసం’ అని పండితులు అంటారు. చేసే అన్ని పనుల యొక్క ఫలితాన్ని వదిలివేయడాన్ని ‘త్యాగం’ అని విజ్ఞులు చెబుతారు. (18.2)
- కొందరు పండితులు “కర్మలన్నీ దోషపూరితమైనవి కాబట్టి వాటిని వదిలేయాలి” అంటారు. మరికొందరు “యజ్ఞం, దానం, తపస్సు వంటి కర్మలను ఎన్నటికీ వదలకూడదు” అని అంటారు. (18.3)
- ఓ భరతశ్రేష్ఠా! త్యాగం విషయంలో నా నిశ్చయాన్ని విను. ఓ పురుషవ్యాఘ్ర! త్యాగం అనేది సత్త్వ, రజ, తమో గుణాల భేదం చేత మూడు రకాలుగా చెప్పబడింది. (18.4)
- యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలను ఎన్నటికీ వదలకూడదు. అవి తప్పక ఆచరించవలసినవి. ఎందుకంటే యజ్ఞ దాన తపస్సులు జ్ఞానులను సైతం పవిత్రులను చేస్తాయి. (18.5)
- అయితే, ఈ పనులను కూడా కర్తృత్వ భావన (నేను చేస్తున్నాను అనే అహంకారం) లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా చేయాలన్నదే నా ఖచ్చితమైన మరియు ఉత్తమమైన అభిప్రాయం. (18.6)
- శాస్త్రరీత్యా నిర్దేశించబడిన కర్తవ్య కర్మలను వదిలివేయడం తగదు. అజ్ఞానం లేదా మోహం వల్ల అటువంటి పనులను మానేస్తే, దానిని ‘తామస త్యాగం’ అంటారు. ఇది మనిషిని అధోగతికి తీసుకెళ్తుంది. (18.7)
- ఏదైనా పని చేయడం కష్టమని, శరీరం శ్రమ పడుతుందని భయపడి కర్తవ్యాన్ని వదిలివేస్తే, అది ‘రాజస త్యాగం’ అవుతుంది. అటువంటి వాడు త్యాగం వల్ల కలిగే ఫలితాన్ని పొందలేడు. (18.8)
- ఓ అర్జునా! “ఈ పని చేయడం నా బాధ్యత” అని భావించి, మమకారాన్ని మరియు కర్మ ఫలితాన్ని వదిలిపెట్టి చేసే త్యాగమే ‘సాత్త్విక త్యాగం’. ఇది శ్రేష్ఠమైనది. (18.9)
- సాత్త్విక గుణంతో నిండినవాడు, స్థిరమైన బుద్ధి గలవాడు, సందేహాలు లేనివాడు అయిన త్యాగి… తనకు నచ్చని పని ఎదురైనప్పుడు ద్వేషించడు, నచ్చిన పని ఎదురైనప్పుడు ఆసక్తి పెంచుకోడు. అతడు రెండింటినీ సమానంగా చూస్తాడు. (18.10)
- దేహాన్ని ధరించిన ఏ మానవుడూ కర్మలను సంపూర్ణంగా వదిలివేయడం సాధ్యం కాదు. కాబట్టి, ఎవరైతే కర్మల యొక్క ఫలితాన్ని వదులుతారో, అతడే నిజమైన త్యాగి అని పిలవబడతాడు. (18.11)
- కర్మ ఫలాలను త్యాగం చేయని వారికి మరణానంతరం మూడు రకాల ఫలితాలు ఉంటాయి: నరకాది దుఃఖాలు, స్వర్గాది సుఖాలు, సుఖదుఃఖాలు కలగలిసిన మానవ జన్మ. కానీ కర్మ ఫలాలను త్యాగం చేసిన సన్న్యాసులకు ఎప్పుడూ ఇటువంటి బంధనాలు ఉండవు. (18.12)
- ఓ మహాబాహో! సాంఖ్య శాస్త్రం ప్రకారం ఏ కర్మ సిద్ధించడానికైనా ఐదు కారణాలు అవసరమని చెప్పబడింది. (18.13)
- శరీరము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము – అనే ఈ ఐదూ సమస్త కర్మలకూ కారణాలు. (18.14)
- మనిషి తన శరీరం, మాట లేదా మనస్సుతో చేసే న్యాయమైన లేదా అన్యాయమైన ఏ పనికైనా ఈ ఐదే కారణాలు. (18.15)
- పనులు జరగడానికి ఐదు కారణాలు ఉండగా, కేవలం తనను తాను మాత్రమే కర్తగా భావించేవాడు మందబుద్ధి. అటువంటి వాడు సత్యాన్ని చూడలేడు. (18.16)
- ఎవడైతే “నేను కర్తను” అనే అహంకారం లేకుండా ఉంటాడో, ఎవడి బుద్ధి కర్మ ఫలాలకు అంటదో.. అటువంటి వాడు లోక రీత్యా యుద్ధం చేసి శత్రువులను చంపినా, అతడు చంపినవాడు కాడు, ఆ కర్మ బంధాల్లో చిక్కుకోడు. (18.17)
- జ్ఞానము (తెలివి), జ్ఞేయము (తెలుసుకోవలసిన విషయం), పరిజ్ఞాత (తెలుసుకునేవాడు) – ఈ మూడూ కర్మకు ప్రేరణనిస్తాయి. అలాగే కరణము (పనిముట్టు), కర్మ (పని), కర్త (చేసేవాడు) – ఈ మూడూ కర్మ యొక్క స్వరూపాన్ని ఏర్పరుస్తాయి. (18.18)
- సాంఖ్య శాస్త్రం ప్రకారం… జ్ఞానము, కర్మ మరియు కర్త – ఈ మూడూ కూడా మూడు గుణాల ప్రభావం వల్ల మూడు రకాలుగా విభజించబడ్డాయి. వాటి గురించి కూడా నేను చెప్పినట్లుగా విను. (18.19)
- వేరువేరుగా కనిపిస్తున్న సమస్త ప్రాణులలో… నాశనం లేని, ఒక్కటే అయిన పరమాత్మ తత్త్వాన్ని ఏ జ్ఞానం ద్వారా అయితే మనిషి చూడగలుగుతాడో, దానిని ‘సాత్త్విక జ్ఞానం’ అని తెలుసుకో. (18.20)
- ఏ జ్ఞానం వల్ల మనిషి ప్రాణులన్నీ ఒకదానికొకటి వేరని, ప్రతి శరీరంలోనూ వేర్వేరు ఆత్మలు ఉన్నాయని చూస్తాడో.. అది ‘రాజస జ్ఞానం’. (18.21)
- కేవలం ఏదో ఒక చిన్న పనికే అతుక్కుపోయి, కారణం లేకుండా, సత్యం తెలియకుండా, అది మాత్రమే సర్వస్వమని భావించే అల్పమైన జ్ఞానం ‘తామస జ్ఞానం’. (18.22)
- శాస్త్రబద్ధమైనది, అహంకారం లేకుండా చేసేది, ఇష్టాఇష్టాలకు అతీతంగా చేసేది మరియు ఫలాపేక్ష లేకుండా చేసే పనిని ‘సాత్త్విక కర్మ’ అంటారు. (18.23)
- కోరికలతో, అహంకారంతో మరియు మిక్కిలి శ్రమతో చేసే పనిని ‘రాజస కర్మ’ అంటారు. (18.24)
- భవిష్యత్తులో కలిగే పర్యవసానాలను, అయ్యే నష్టాన్ని, ఎదుటివారికి కలిగే హింసను మరియు తన సామర్థ్యాన్ని ఆలోచించకుండా, కేవలం మోహంతో మొదలుపెట్టే పనిని ‘తామస కర్మ’ అంటారు. (18.25)
- ఆసక్తి లేనివాడు, అహంకారం లేనివాడు, ధైర్యసాహసాలతో కూడినవాడు, పని సిద్ధించినా సిద్ధించకపోయినా వికారాలకు లోనుకాకుండా ఉండేవాడు ‘సాత్త్విక కర్త’. (18.26)
- అనురాగం కలవాడు, కర్మ ఫలితాలను ఆశించేవాడు, లోభి, హింసా స్వభావం కలవాడు, అపవిత్రుడు, సుఖదుఃఖాలకు త్వరగా చలించేవాడు ‘రాజస కర్త’. (18.27)
- అస్థిరమైన మనస్సు కలవాడు, వివేకం లేనివాడు, మొండివాడు, మోసగాడు, ఇతరులను అవమానించేవాడు, సోమరి, ఎప్పుడూ విచారించేవాడు మరియు పనులను వాయిదా వేసేవాడు ‘తామస కర్త’. (18.28)
- ఓ ధనంజయా! బుద్ధి మరియు ధృతి లో ఉన్న మూడు రకాల భేదాలను విను. (18.29)
- ఏ బుద్ధి అయితే …ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యం, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, ఏది బంధనం, ఏది మోక్షం అని స్పష్టంగా తెలుసుకుంటుందో.. అది ‘సాత్త్విక బుద్ధి’. (18.30)
- ఓ పార్థా! ఏ బుద్ధి అయితే ధర్మానికి-అధర్మానికి మధ్య, చేయవలసిన పనికి-చేయకూడని పనికి మధ్య ఉన్న తేడాను సరిగా గుర్తించలేదో, అది ‘రాజస బుద్ధి’. ఇది గందరగోళంతో కూడి ఉంటుంది. (18.31)
- ఓ పార్థా! అజ్ఞానమనే చీకటితో నిండిన ఏ బుద్ధి అయితే.. అధర్మాన్ని ధర్మమని భావిస్తుందో, అలాగే అన్ని విషయాలను వ్యతిరేకంగా అర్థం చేసుకుంటుందో, అది ‘తామస బుద్ధి’. (18.32)
- ఏకాగ్రతతో కూడిన యోగ సాధన ద్వారా… మనస్సు, ప్రాణము, ఇంద్రియాల క్రియలను అదుపులో ఉంచి, సరైన మార్గంలో నడిపించే నిశ్చయ శక్తిని ‘సాత్త్విక ధృతి’ అంటారు. (18.33)
- ఓ అర్జునా! ఫలాన్ని ఆశించి, ఆసక్తితో ధర్మ, అర్థ, కామాలను (లౌకిక ప్రయోజనాలను) మాత్రమే పట్టుకుని ఉండటానికి ఉపయోగపడే నిశ్చయ శక్తి ‘రాజస ధృతి’. (18.34)
- దుర్బుద్ధి గలవాడు దేనినైతే ఆశ్రయించి.. నిద్ర, భయం, శోకం, విషాదం మరియు గర్వాన్ని వదలడో, అటువంటి మొండితనాన్ని ‘తామస ధృతి’ అంటారు. (18.35)
- ఇక ఇప్పుడు నా నుండి వినుము, ఓ అర్జునా, దేహముయందున్న జీవాత్మ రమించే మూడు విధముల సుఖముల గురించి, మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించి. (18.36)
- మొదట విషం వలె కష్టంగా అనిపించినా, ఫలితంలో అమృతం వలె ఉండే సుఖమే సాత్త్వికమైనది. ఆత్మజ్ఞానం వల్ల కలిగే ప్రశాంతతే ఈ సుఖానికి మూలం. (18.37)
- ఇంద్రియాలు విషయాలతో కలవడం వల్ల కలిగే సుఖం రాజసమైనది. ఇది మొదట అమృతం వలె తీయగా అనిపించినా, చివరకు విషం వలె దుఃఖాన్ని మిగులుస్తుంది. (18.38)
- మొదటి నుండి చివరి వరకు ఆత్మను మోహానికి గురిచేసేది, నిద్ర, బద్ధకం, అజాగ్రత్త నుండి పుట్టే సుఖం ‘తామస సుఖం’. (18.39)
- ఈ భూమి మీద గానీ, స్వర్గంలో దేవతలలో గానీ… ప్రకృతి నుండి పుట్టిన ఈ మూడు గుణాల (సత్వ, రజ, తమస్సు) ప్రభావం లేని ప్రాణి ఏదీ లేదు. (18.40)
- ఓ పరంతపా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలనూ, అట్లే శూద్రుల కర్మలునూ వారివారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడియున్నవి. (18.41)
- అంత:కరణనిగ్రహము( శమము ), ఇంద్రియములను వశమునందుంచుకొనుట (దమము), ధర్మ ములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరులఅపరాధములను క్షమించుట, ఋజుమార్గ జీవనము, ( మనశ్శరీరేంద్రియముల సరళత్వము) వేద శాస్త్రముల యందును ఈశ్వరునియందును పరలోకాదులయందును, విశ్వాసమును కలిగియుండుట, వేదశాస్త్రములఅధ్యయనము, అధ్యాపనము, పరతత్త్వాసుభవము – ఇవి యన్నియును బ్రాహ్మణులస్వాభావిక కర్మలు. (18.42)
- శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపకుండుట, దానములనిచ్చుట, స్వామి భావముతో ప్రజలను ధర్మ పరాయణులనుగా చేయుచు పరిపాలించుట మొదలగునవి యన్నియును క్షత్రియులస్వాభావికకర్మలు. (18.43)
- వ్యవసాయము, గోరక్షణము, క్రయవిక్రయరూప సత్యవ్యవహారము ఇవి యన్నియును వైశ్యులస్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణములవారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. (18.44)
- తమతమ స్వాభావికకర్మల యందు తత్పరులైనవారు భగవత్ప్రాప్తిరూప పరమసిద్ధిని నిస్సందేహమగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. (18.45)
- సమస్త ప్రాణులప్రాదుర్భావము పరమేశ్వరునినుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించియున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావికకర్మాలద్వారా పూజించి, మానవుడు పరమసిద్ధిని పొందును. (18.46)
- బాగుగా ఆచరింపబడిన పరధర్మముకంటెను గణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్ఠమైనది. స్వభావమును అనుసరించి ( స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి ) కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములును ఏ మాత్రము అంటనే అంటవు. (18.47)
- ఓ కౌంతేయా! (అర్జునా! ) దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన! అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నియను ఏదేని ఒక దోషముతో కూడియే యుండును. (18.48)
- ఓ అర్జునా! ప్రాపంచికవిషయములన్నింటియందు ఆసక్తి లేని వాడును, స్ప్రుహారహితుడును, అంతఃకరణమును జయించినవాడును అగు పురుషుడు సాంఖ్య యోగము ద్వారా పరమశ్రేష్ఠమైన నైష్కర్మ్యసిద్ధిని పొందును. (18.49)
- ఓ కౌంతేయా! జ్ఞానయోగము యొక్క పరానిష్ఠయైన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్ద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తి నందు రీతిని సంగ్రహాముగా తెల్పెదను వినుము. (18.50)
- విశుద్ధమైన బుద్ధిగలవాడై, శబ్దాదివిషయములను త్యజించి, సాత్త్వికధారణాశక్తిద్వారా అంతఃకరణేంద్రియముల సంయమము కలిగి (యువ్నవాడు)…తేలికయైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, (శబ్దాదివిషయములను త్యజించి) పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, (రాగద్వేషములను సర్వథా త్యజించి )దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు …..అహంకారమును, బలమును, దర్పమును, కామక్రోధములను, పరిగ్రహమును వదలిపెట్టి, నిరంతరము ధ్యానయోగ పరాయణుడై యుండువాడు, మమతా రహితుడు, శాంతియుతుడు ఐన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మము నందు అభిన్నభావముతో స్థితుడగుటకు పాత్రుడగును. (18.51-18.53)
- సచ్చిదానంద ఘనపరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్నమస్కుడైన యోగి దేనికిని శోకింపడు. దేనినీ కాంక్షింపడు. సమస్తప్రాణులయందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. (18.54)
- బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో? ఎంతటివాడనో? యథాతథముగ నా తత్త్వమును తెలిసికొనును. అట్లు భక్తితో నా తత్త్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. (18.55)
- సమస్తకర్మలయందును కర్తృత్వ భావమును వీడి, ఆయాకర్మల ఫలరూపమైన సమస్తభోగములను త్యజించి, నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటిని సర్వదాచేయుచును నాయనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును. (18.56)
- సర్వకర్మలను నిండుమనస్సుతో నాకే అర్పించి, సమబుద్ధి రుపయోగమును అవలంబించి, మత్పరాయణుడవై సతతము చిత్తమును నాయందే నిల్పుము. (18.57)
- పైన తెలుపబడిన విధముగా నాయందు చిత్తమును నిల్పినచో, నా యనుగ్రహమువలన సమస్తసంకటముల నుండియు అనాయాసముగా బయట పడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన బెట్టినచో నష్టముల పాలగుదువు. అనగా పరమార్థ పథమునుండి భ్రష్టుడవగుదువు. (18.58)
- అహంకారవశమున “నేను ఈ యుద్ధమును చేయను” అని నీవు నిశ్చయించు కొనుట వృథా. ఏలనన నీ స్వభావమే యుద్ధముచేయుటకు నిన్ను పురికొల్పును. (18.59)
- ఓ కౌంతేయా! మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను గూడ నీ పురాకృత స్వాభావిక కర్మలచే (సంస్కారములచే) బంధింపబడి, త తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు. (18.60)
- అర్జునా! శరీరరూపయంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి, వారిని భ్రమింపజేయుచున్నాడు. (18.61)
- ఓ భారతా! (అర్జునా!) అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదమును పొందగలవు. (18.62)
- ఈ విధముగా అత్యంతరహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి, నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. (18.63)
- సమస్తగోప్యవిషయములయందును పరమగోప్యమైన నావచనములను మఱొక్కసారి వినుము. నీవు నాకు అత్యంతప్రియుడవు అగుటవలన నీకు మిక్కిలి హితమును గూర్చు వచనములను మఱల చెప్పుచున్నాను. (18.64)
- ఓ అర్జునా! నీవు నాయందే మనస్సును నిలుపుము. నా భక్తుడవు కమ్ము. నన్నే సేవింపుము. నాకు ప్రణమిల్లుము. ఇట్టు చేయుటవలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞా పూర్వకముగా నేను చెప్పుచున్నమాట. ఏలనన నీవు నాకత్యంత ప్రియుడవు. (18.65)
- సర్వ ధర్మములను అనగా సమస్తకర్తవ్యకర్మలను నాకు సమర్పింపుము. సర్వ శక్తిమంతుడను, సర్వధారుడను, పరమేశ్వరుడను ఐన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపములనుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకుము. (18.66)
- తపస్సంపన్నుడు కానివానికిని, భక్తిరహితునకును, వినవలెనను కుతూహలము లేనివానికిని నీవు ఈ గీతారూపపరహస్యోపదేశమును ఎన్నడును తెల్పరాదు. అట్టే నాయందు దోషదృష్టి గలవానికి ఎన్నడునూ ఈ ఉపదేశమును తెలపరాదు. (18.67)
- నా యందు పరమభక్తి గలిగి, ఈ పరమగోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపఱచువాడు నన్నే పొందును. ఇందేమాత్రమూ సందేహము లేదు. (18.68)
- నాకు ప్రీతిని గూర్చునట్టి కర్మల నాచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడును లేడు. అంతేగాక అతనివలె గాని, అతనిని మించిగాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరియెుకడెవ్వడును భవిష్యత్తులోను ఉండబోడు. (18.69)
- ధర్మయుక్తమైన మనసంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞముద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. (18.70)
- శ్రద్ధాదరములుగలవాడును, దోషదృష్టి (దోషములెన్ను స్వభావము) లేనివాడును ఐన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుటవలనగూడ పాపవిముక్తుడై, పుణ్యకర్మలను ఆచరించువారుపొందు ఉత్తమలోకములను పొందును. (18.71)
- ఓపార్థా! ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? ఓ ధనంజయా! అజ్ఞానజనితమైన నీ వెూహము పూర్తిగా నశించినదా? (18.72)
- అర్జునుడు పలికెను – ఓ అచ్యుతా! నీ కృపచే నా వెూహము పూర్తిగా తొలిగినది. స్మృతిని పొందితిని. ఇప్పుడు సంశయ రహితుడైతిని. కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. (18.73)
- సంజయుడు పలికెను – ఈ విధముగా శ్రీ వాసుదేవునకును మహాత్ముడైన అర్జునకును మధ్య జరిగిన సంవాదమును వింటివి. అది అద్భుతమైనది. తనువును పులకింపజేయునది. (18.74)
- వేదవ్యాసునికృపవలన దివ్యదృష్టిని పొందినవాడనై, పరమగోప్యమైన ఈ యోగమును ( గీతను) యోగేశ్వరుడైన శ్రీ కృష్ణభగవానుడు( స్వయముగ)అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. (18.75)
- ఓ రాజా! (ధృతరాష్ట్రా!) శ్రీ కృష్ణభగవానునకును అర్జునకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదేపదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను. (18.76)
- ఓ రాజా! అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వమైన ఐన ఆ శ్రీహరిరూపమును పదేపదే స్మరించుచు, నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మఱలమఱల హర్షోల్లాసములతో పులకితగాత్రుడనగుచున్నాను. (18.77)
- ఓ రాజా! యోగేశ్వరుడైన శ్రీ కృష్ణభగవానుడును, గాండీవధనుర్ధారియైన అర్జునుడును ఉండుచోట సంపదలును, సర్వ విజయములును, సకలైశ్వర్యములును, సుస్థిరమైన నీతియు. (18.78)