- అర్జునుడు పలికెను: ఓ పురుషోత్తమా! ఆ బ్రహ్మము అంటే ఏమిటి? అధ్యాత్మము అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతము అని దేనిని అంటారు? మరియు అధిదైవము అని దేనిని పిలుస్తారు? ఓ మధుసూదనా! ఈ దేహంలో అధియజ్ఞుడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? మరియు మనస్సును నిగ్రహించిన వారు మరణ కాలంలో నిన్ను ఎలా తెలుసుకోగలరు? (8.1-8.2)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: “నాశనం లేని పరమ తత్త్వమే బ్రహ్మము. జీవుడిలోని ఆత్మ తత్త్వమునే అధ్యాత్మము అంటారు. ప్రాణుల పుట్టుకకు, అభివృద్ధికి కారణమైన త్యాగపూర్వకమైన సృష్టి కార్యమే కర్మ.” (8.3)
- ఓ దేహధారులలో శ్రేష్ఠుడవైన అర్జునా! నశించే స్వభావం కల జడ పదార్థాలన్నీ అధిభూతము. సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వ రూపమునే అధిదైవము. ఈ దేహంలో అంతర్యామిగా ఉండి యజ్ఞఫలాలను ఇచ్చే అధియజ్ఞుడు నేనే. (8.4)
- మరణ సమయంలో నన్నే స్మరిస్తూ తన శరీరాన్ని వదిలి వెళ్ళేవాడు, నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. (8.5)
- ఓ కౌంతేయా! మనిషి మరణ సమయంలో దేనినైతే స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో, జీవితాంతం దేనిని ధ్యానిస్తూ ఉంటాడో, చనిపోయాక ఆ భావాన్నే పొందుతాడు. (8.6)
- కాబట్టి, అన్ని వేళలా నన్నే స్మరించు మరియు నీ కర్తవ్యమైన యుద్ధాన్ని చేయు. నీ మనస్సును, బుద్ధిని నా యందే అర్పించినట్లయితే, నిశ్చయంగా నన్నే చేరుకుంటావు. (8.7)
- ఓ పార్థా! అభ్యాసయోగంతో కూడి, వేరే ఆలోచనలు లేకుండా నిరంతరం ధ్యానించేవాడు, దివ్యుడైన పరమ పురుషుడిని చేరుకుంటాడు. (8.8)
- సర్వజ్ఞుడిని, పురాతనమైన వాడిని, ప్రపంచాన్ని శాసించేవాడిని, అణువుకంటే సూక్ష్మమైన వాడిని, అందరినీ పోషించేవాడిని, ఊహాతీతమైన రూపం కలవాడిని, సూర్యుని వలె ప్రకాశించేవాడిని మరియు చీకటికి అవతల ఉన్నవాడిని ఎవడైతే స్మరిస్తాడో, మరణ సమయంలో నిశ్చలమైన మనస్సుతో, భక్తితో మరియు యోగబలంతో, తన ప్రాణాన్ని రెండు కనుబొమ్మల మధ్యకు చక్కగా చేర్చి ధ్యానించేవాడు, ఆ దివ్యుడైన పరమ పురుషుడిని చేరుకుంటాడు. (8.9-8.10)
- వేద పండితులు దేనిని అక్షరము అని అంటారో, ఆసక్తి లేని మునులు దేనిలో ప్రవేశిస్తారో, దేనిని కోరుతూ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తారో, అట్టి పరమ పదాన్ని నీకు క్లుప్తంగా వివరిస్తాను. (8.11)
- ఇంద్రియ ద్వారాలన్నింటినీ అదుపు చేసి, మనస్సును హృదయంలో నిలిపి, తన ప్రాణాన్ని శిరస్సు నందు (సహస్రారంలో) ఉంచి, యోగధారణలో స్థిరంగా ఉండాలి. ఓం అనే ఈ ఏకాక్షర బ్రహ్మమును ఉచ్చరిస్తూ, నన్ను స్మరిస్తూ దేహాన్ని వదిలి వెళ్ళేవాడు పరమ గతిని పొందుతాడు. (8.12-8.13)
- ఓ పార్థా! వేరే ఆలోచనలు లేకుండా ఎల్లప్పుడూ నన్నే స్మరించే నిత్యయుక్తుడైన యోగికి, నేను చాలా సులభంగా లభిస్తాను. (8.14)
- నన్ను చేరుకొని అత్యున్నతమైన పరిపూర్ణతను పొందిన మహాత్ములకు, దుఃఖాలకు నిలయమైన, అశాశ్వతమైన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు. (8.15)
- ఓ అర్జునా! బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాలు తిరిగి జన్మలు ఇచ్చేవే. కానీ ఓ కౌంతేయా! నన్ను చేరుకున్న వారికి మాత్రం మళ్ళీ పునర్జన్మ ఉండదు. (8.16)
- బ్రహ్మదేవుని ఒక పగలు వెయ్యి మహాయుగాల కాలపరిమితి కలదని, అలాగే ఆయన రాత్రి కూడా వెయ్యి మహాయుగాల కాలమని ఎవరు తెలుసుకుంటారో, అట్టివారే కాలతత్త్వాన్ని ఎరిగినవారు. (8.17)
- బ్రహ్మదేవుని పగలు ప్రారంభం కాగానే, అవ్యక్తం నుండి చరాచర ప్రాణులన్నీ పుడుతున్నాయి. రాత్రి కాగానే, మళ్ళీ ఆ అవ్యక్తమునందే లీనమవుతున్నాయి. (8.18)
- ఓ పార్థా! ఈ ప్రాణి సమూహమంతా ప్రకృతికి వశమై, పగలు రాగానే పుడుతూ, రాత్రి రాగానే లయమైపోతూ ఉంటుంది. (8.19)
- కానీ, ఆ అవ్యక్త ప్రకృతి కంటే భిన్నమైనది మరియు శ్రేష్ఠమైనది అయిన మరొక సనాతన అవ్యక్త తత్త్వము ఉంది. సమస్త భూతములు నశించినప్పటికీ, ఆ తత్త్వము నశించదు. (8.20)
- ఆ యొక్క అవ్యక్త అక్షరమే సర్వోన్నత లక్ష్యము. దేనిని పొందిన తర్వాత తిరిగి ఈ సంసారానికి రారో, అదే నా పరమ ధామము. (8.21)
- ఓ పార్థా! సమస్త ప్రాణులు ఎవరి యందు ఉన్నాయో, ఎవరి చేత ఈ జగత్తు అంతా వ్యాపించి ఉందో, అట్టి పరమ పురుషుడు అనన్యమైన భక్తి చేత మాత్రమే లభిస్తాడు. (8.22)
- ఓ భరతశ్రేష్ఠా! ఏ ఏ మార్గాలలో వెళ్ళిన యోగులు తిరిగి రారో మరియు తిరిగి వస్తారో, అట్టి కాలమార్గాల గురించి నీకు వివరిస్తాను. (8.23)
- అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము మరియు ఆరు నెలల ఉత్తరాయణ పుణ్యకాలము.. ఈ దేవతలే మార్గదర్శకులుగా వెళ్ళే బ్రహ్మజ్ఞానులు పరబ్రహ్మమును పొందుతారు. (8.24)
- ధూమము, రాత్రి, కృష్ణపక్షము మరియు ఆరు నెలల దక్షిణాయన కాలము.. ఈ మార్గంలో వెళ్ళే యోగి చంద్రలోక జ్యోతిని పొంది, తిరిగి సంసారానికి వస్తాడు. (8.25)
- లోకంలో శుక్ల గతి, కృష్ణ గతి అనే ఈ రెండు మార్గాలు శాశ్వతమైనవిగా భావించబడ్డాయి. మొదటి మార్గం ద్వారా వెళ్ళేవాడు తిరిగి రాడు, రెండవ మార్గం ద్వారా వెళ్ళేవాడు తిరిగి వస్తాడు. (8.26)
- ఓ పార్థా! ఈ రెండు మార్గాల రహస్యాన్ని తెలిసిన యోగి ఎన్నడూ మోహానికి లోనుకాడు. కావున, అన్ని వేళలా నీవు యోగమునందే స్థిరంగా ఉండుము. (8.27)
- వేద పఠనం వల్ల, యజ్ఞాల వల్ల, తపస్సు వల్ల మరియు దానాల వల్ల ఏ ఏ పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడ్డాయో.. ఈ రహస్యాన్ని తెలుసుకున్న యోగి వాటన్నింటినీ మించిపోయి, పురాతనమైన పరమ పదమును పొందుతాడు. (8.28)