- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: కర్మ ఫలితాన్ని ఆశ్రయించకుండా (కోరకుండా), ఏది తన కర్తవ్యమో (చేయవలసిన పని) అట్టి కర్మను ఎవడైతే చేస్తాడో.. అతడే సంన్యాసి మరియు అతడే యోగి. కేవలం యజ్ఞాగ్నిని వదిలేసినవాడు (నిరగ్నిః) కానీ, పనులు మానేసినవాడు (అక్రియః) కానీ సంన్యాసి/యోగి కాలేడు. (6.1)
- దేనిని ‘సంన్యాసం’ అని పిలుస్తారో, దానినే ‘యోగం’ అని కూడా తెలుసుకో ఓ పాండవా! ఎందుకంటే, లౌకిక కోరికలను వదులుకోనివాడు ఎవడూ యోగి కాలేడు. (6.2)
- యోగ స్థితిని అధిరోహించాలనుకునే మునికి నిష్కామ కర్మ సాధనంగా చెప్పబడింది. అదే యోగ స్థితిని పొందిన వానికి ప్రశాంతత సాధనంగా చెప్పబడింది. (6.3)
- ఎప్పుడైతే మనిషి ఇంద్రియ విషయాల యందు మరియు కర్మల యందు ఆసక్తిని కలిగి ఉండడో.. అట్టి అన్ని సంకల్పాలను వదిలేసినవాడిని ‘యోగారూఢుడు’ అని అంటారు. (6.4)
- తనను తాను ఉద్ధరించుకోవాలి, తనను తాను తక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే మనకు మనమే మిత్రుడము మరియు మనకు మనమే శత్రువులము. (6.5)
- మనస్సుని జయించినవారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వారికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. (6.6)
- మనస్సుని జయించిన యోగులు – శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానాపమానములు – ఈ ద్వందములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు. (6.7)
- జ్ఞానవిజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తినొందిన యోగులు, ఇంద్రియములను జయించిన వారై, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు – మట్టి, రాళ్ళు, మరియు బంగారము – వీటన్నిటిని ఒకే దృష్టితో చూస్తారు. (6.8)
- మేలుకోరేవారు, మిత్రులు, శత్రువులు, తటస్థులు, మధ్యస్థులు, ద్వేషించదగినవారు, బంధువులు, సాధువులు మరియు పాపాత్ముల పట్ల సమానమైన బుద్ధిని కలిగి ఉండేవాడే అందరిలోనూ శ్రేష్ఠుడు. (6.9)
- యోగి ఎల్లప్పుడూ ఒంటరిగా, ఏకాంత ప్రదేశంలో ఉంటూ.. మనస్సును, దేహాన్ని అదుపులో ఉంచుకుని, ఎటువంటి ఆశలు లేనివాడై, ఏ వస్తువుల మీద మమకారం లేకుండా తన మనస్సును పరమాత్మ యందు నిలపాలి. (6.10)
- పరిశుభ్రమైన ప్రదేశంలో, తనకు అనుకూలమైన స్థిరమైన ఆసనాన్ని ఏర్పరుచుకోవాలి. అది మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ పల్లంగా ఉండకూడదు. దానిపై క్రమంగా కుశలు, జింక చర్మము, వస్త్రము ఒకదానిపై ఒకటి అమర్చుకోవాలి. ఆ ఆసనంపై కూర్చుని, మనస్సును ఏకాగ్రం చేసి, చిత్తమును మరియు ఇంద్రియాల క్రియలను అదుపులో ఉంచుకుని.. తన ఆత్మశుద్ధి కోసం యోగ సాధన చేయాలి. (6.11-12)
- శరీరమును, మెడను, మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటూఇటూ తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి. ఈ విధంగా, ప్రశాంతతతో, భయరహితంగా, మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో, సావధానుడైన యోగి, నేనే పరమ లక్ష్యంగా, నా పై ధ్యానం చేయాలి. (6.13-14)
- ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపిఉంచుతూ, క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నా యందు ఉన్నట్టి మోక్షమే అంతిమంగా గల పరమ శాంతిని పొందుతాడు. (6.15)
- అర్జునా ! అతిగా భుజించువానికిని, ఏ మాత్రము భుజింపనివానికిని, అతిగా నిద్రించువానికిని, ఎల్లప్పుడును (ఏమాత్రము నిద్రింపక) మేల్కొనియుండువానికిని ఈ యోగసిద్ధి కలుగదు. (6.16)
- ఆహార విహారాదులయందును, కర్మాచరణములయందును, జాగ్రత్స్వప్నాదులయందును యథాయోగ్యముగ ప్రవర్తించు వానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. (6.17)
- చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని, దానిని పరమాత్మ యందే స్థిరముగా నిల్పినప్పుడు పురుషుడు సర్వభోగములయందును స్పృహారహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడనబడును. (6.18)
- వాయుప్రసారము లేనిచోట నిశ్చలముగానుండు దీపమువలె యోగికి వశమైయున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై యున్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. (6.19)
- ధ్యానయోగసాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది, పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో, ఆ భగవానుని సాక్షాత్కరింపజేసికొని, యోగి ఆ సచ్చిదానందఘనపరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే. గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మస్వరూపమునుండి ఏ మాత్రమూ విచలితుడు కానేకాడు. పరమాత్మప్రాప్తిరూపలాభమును పొందినవాడు (అనగా భగవత్సాక్షాత్కారమును పొందినవాడు) మఱేయితర లాభమునుగూడ దానికంటె అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవస్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములును చలింపజేయజాలవు. దుఃఖరూపసంసారబంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని (భగవత్సాక్షాత్కార రూపస్థితిని) యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన, ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ (విసుగులేని) చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. (6.20-23)
- సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటిని నిశ్శేషముగా త్యజించి, ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగ మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. క్రమక్రమముగా సాధనచేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమొనర్చి పరమాత్మను తప్ప మఱి ఏ ఇతర విషయమును ఏ మాత్రమూ చింతన చేయరాదు. (6.24-25)
- సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి మఱల్చి, దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. (6.26)
- ప్రశాంతమైనమనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానందఘనపరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. (6.27)
- పాపరహితుడైన ఆ యోగి పుర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమొనర్చుచు, పరబ్రహ్మపరమాత్మప్రాప్తిరూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. (6.28)
- సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితిరూప యోగయుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటిని సమభావముతో చూచువాడును అగు యోగి తనయాత్మను సర్వప్రాణులయందు స్థితమై యున్నట్లుగను, ప్రాణులన్నింటిని ఆత్మయందు కల్పితములుగను భావించును (చూచును). (6.29)
- సకల ప్రాణులయందును ఆత్మ రూపముననున్న నన్ను (వాసుదేవుని) చూచు పురుషునకు, అట్లే ప్రాణులన్నింటికి నా యందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను. అతడును నాకు అదృశ్యుడు కాడు. (6.30)
- భగవంతునియందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మ రూపముననున్న సచ్చిదానందఘన వాసుదేవుడనైయున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వథా సర్వవ్యవహారములయందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. (6.31)
- ఓ అర్జునా! సర్వప్రాణులను తనవలె (తనతో) సమానముగా చూచువాడును, సుఖమును గాని, దుఃఖమును గాని సమముగా (సమానముగ) చూచువాడును (ఇతరుల సుఖదుఃఖములులను తన సుఖదుఃఖములుగా భావించువాడును) అయిన యోగి పరమ శ్రేష్ఠుడు. (6.32)
- అర్జునుడు పలికెను – ఓ మధుసూదనా! సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలిసికొన లేకున్నాను. (6.33)
- ఓ కృష్ణా ! ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. ప్రమథనశీలమైనది (బాగుగా మథించు స్వభావము గలది). దృఢమైనది. మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటవలె మిక్కిలి దుష్కరమని భావింతును. (6.34)
- శ్రీ భగవానుడు పలికెను – హే మహాబాహో! నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. దానిని వశపఱచుకొనుట మిక్కిలి కష్టము. కాని కౌంతేయ ! అభ్యాసవైరాగ్యములద్వారా దానిని వశపఱచుకొనుట సాధ్యమే. (6.35)
- మనస్సును వశపఱచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభప్రాయము. (6.36)
- అర్జునుడు పలికెను – హే కృష్ణా! యోగమునందు శ్రద్ధాదరములతో యోగసాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి, యోగసిద్ధిని (భగవత్సాక్షాత్కారమును) పొందకయే మరణించిన సాధకుని గతియేమగును ? (6.37)
- హే మహాబాహో! అతడు (యోగభ్రష్టుడు) భగవత్ప్రాప్తి మార్గమునుండి జారినవాడై, ఆశ్రయరహితుడై (ఆలంబనము లేనివాడై), ఉభయభ్రష్టుడై, ఛిన్నాభిన్నమైన మేఘమువలె అధోగతి పాలు కాడు గదా! (6.38)
- ఓ కృష్ణ! ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తిచేయుట నీకే చెల్లును. ఏలనన ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరఱెవ్వరికిని శక్యము కాదు. (6.39)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ పార్థా! అట్టి (ఆ) పురుషుడు ఈ లోకమున గాని, పరలోకమున గాని అధోగతిపాలుగాడు. ఏలనన, నాయనా! ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్యకర్మలను ఆచరించువాడెవ్వడును దుర్గతిపాలుగాడు. (6.40)
- యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది, ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి, పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. (6.41)
- అథవా విరాగియైన పురుషుడు ఆ పుణ్య (ఊర్ధ్వ) లోకములకు పోకుండగనే జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. (6.42)
- అచట (యోగి కుటుంబమున పుట్టిన పిదప) పూర్వ దేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధిరూపయోగ సంస్కారములను అతడు సులభముగనే పొందును. ఓ కురునందన! ఆ బుద్ధిసంయోగ ప్రభావమున అతడు మఱల పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటికంటెను అధికముగా సాధన చేయును. (6.43)
- శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పుర్వసాధన ప్రభావమున నిస్సందేహముగ భగవంతుని వైపు ఆకర్షితుడగును. మరియు సమబుద్ధిరూప యోగజిజ్ఞాసువు గూడ వేదములలో తెల్పబడిన సకామకర్మల ఫలమును అధిగమించును. (6.44)
- కాని, ప్రయత్నపూర్వకముగ యోగసాధన చేయు యోగి అనేక జన్మల సంస్కార ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది, సంపూర్ణముగా పాపరహితుడై, తత్ క్షణమే పరమపదమును పొందును. (6.45)
- యోగి తాపసుల కంటెను శ్రేష్ఠుడు. శాస్త్ర జ్ఞానుల కంటెను శ్రేష్ఠుడు. సకామకర్మలను ఆచరించువారి కంటెను శ్రేష్ఠుడని భావించబడును. కావున ఓ అర్జునా! నీవు యోగివి కమ్ము. (6.46)
- యోగులందఱిలోను శ్రద్ధాళువై, అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి, అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన, దృఢమైన అనన్యభావముతో నా యందే స్థిరమైయున్న మనోబుద్ధిరూప – అంతఃకరణమును గలిగి, నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమ శ్రేష్ఠుడు – అని నానిశ్చితాభిప్రాయము. (6.47)