- శ్రీ భగవానుడు పలికెను – కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మను ఆచరించువాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. కాని కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్న్యాసియుకాడు. అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగియుకాడు. (6.1)
- ఓ అర్జునా ! సన్న్యాసము అని పిలువబడునదియే యోగము అని తెలిసికొనుము. ఏలనన సంకల్పత్యాగము చేయనివాడెవ్వడును యోగి కాలేడు. (6.2)
- యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. (6.3)
- ఇంద్రియ భోగములయందును, కర్మలయందును ఆసక్తుడు గాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. (6.4)
- మనుజులు ఈ సంసారసాగరమునుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతిపాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగ తమకు తామే మిత్రులు. తమకు తామే శత్రువులు. (6.5)
- మనస్సును ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపనివాడు తనకుతానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తిసిద్ధికై మిత్రునివలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువులవలె ప్రవర్తించి లక్ష్యసాధనకు అవరోధకములుగా నిలుచును. (6.6)
- శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా (చలింపక) ఉండి, స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానందఘనపరమాత్మ చక్కగా స్థితుడై యుండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియును ఉండదు. (6.7)
- పరమాత్మ ప్రాప్తినందిన యోగియొక్క అంతఃకరణమునందు జ్ఞానవిజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపఱచుకొనినవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. (6.8)
- సుహృదులయందును, మిత్రులయందును, శత్రువులయందును, ఉదాసీనులయందును, మధ్యస్థులయందును, ద్వేషింపదగినవారియందును, బంధువులయందును, ధర్మాత్ములయందును, పాపులయందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. (6.9)
- శరీరేంద్రియమనస్సులను స్వాధీనపఱచుకొనిన వాడు, ఆశారహితుడు, భోగసామగ్రిని ప్రోగుచేయనివాడు అయిన యోగి ఒంటరిగా, నిర్జన (ఏకాంత) ప్రదేశమున కూర్చొని, ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను. (6.10)
- పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా ధర్భాసనమును, జింకచర్మమును, వస్త్రమును, ఒకదానిపై ఒకటి పఱచి, అంత ఎక్కువగాకాని, తక్కువగాకాని కాకుండ సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పఱచుకొనవలెను. ఆ అసనము పై కూర్చొని, చిత్తేంద్రియ వ్యాపారములను వశము నందుంచుకొని, ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణశుద్ధికై ధ్యానాయోగమును సాధన చేయవలెను. (6.11-12)
- శరీరమును, మెడను, శిరస్సును నిటారుగ నిశ్చలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలుపవలెను. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై, భయరహితుడై, బ్రహ్మచర్యవ్రతమును పాటించుచు, మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై యుండవలెను. (6.13-14)
- మనోనిగ్రహశాలియైన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమొనర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. (6.15)
- అర్జునా ! అతిగా భుజించువానికిని, ఏ మాత్రము భుజింపనివానికిని, అతిగా నిద్రించువానికిని, ఎల్లప్పుడును (ఏమాత్రము నిద్రింపక) మేల్కొనియుండువానికిని ఈ యోగసిద్ధి కలుగదు. (6.16)
- ఆహార విహారాదులయందును, కర్మాచరణములయందును, జాగ్రత్స్వప్నాదులయందును యథాయోగ్యముగ ప్రవర్తించు వానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. (6.17)
- చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని, దానిని పరమాత్మ యందే స్థిరముగా నిల్పినప్పుడు పురుషుడు సర్వభోగములయందును స్పృహారహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడనబడును. (6.18)
- వాయుప్రసారము లేనిచోట నిశ్చలముగానుండు దీపమువలె యోగికి వశమైయున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై యున్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. (6.19)
- ధ్యానయోగసాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది, పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో, ఆ భగవానుని సాక్షాత్కరింపజేసికొని, యోగి ఆ సచ్చిదానందఘనపరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే. గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మస్వరూపమునుండి ఏ మాత్రమూ విచలితుడు కానేకాడు. పరమాత్మప్రాప్తిరూపలాభమును పొందినవాడు (అనగా భగవత్సాక్షాత్కారమును పొందినవాడు) మఱేయితర లాభమునుగూడ దానికంటె అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవస్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములును చలింపజేయజాలవు. దుఃఖరూపసంసారబంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని (భగవత్సాక్షాత్కార రూపస్థితిని) యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన, ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ (విసుగులేని) చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. (6.20-23)
- సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటిని నిశ్శేషముగా త్యజించి, ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగ మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. క్రమక్రమముగా సాధనచేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమొనర్చి పరమాత్మను తప్ప మఱి ఏ ఇతర విషయమును ఏ మాత్రమూ చింతన చేయరాదు. (6.24-25)
- సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి మఱల్చి, దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. (6.26)
- ప్రశాంతమైనమనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానందఘనపరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. (6.27)
- పాపరహితుడైన ఆ యోగి పుర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమొనర్చుచు, పరబ్రహ్మపరమాత్మప్రాప్తిరూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. (6.28)
- సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితిరూప యోగయుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటిని సమభావముతో చూచువాడును అగు యోగి తనయాత్మను సర్వప్రాణులయందు స్థితమై యున్నట్లుగను, ప్రాణులన్నింటిని ఆత్మయందు కల్పితములుగను భావించును (చూచును). (6.29)
- సకల ప్రాణులయందును ఆత్మ రూపముననున్న నన్ను (వాసుదేవుని) చూచు పురుషునకు, అట్లే ప్రాణులన్నింటికి నా యందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను. అతడును నాకు అదృశ్యుడు కాడు. (6.30)
- భగవంతునియందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మ రూపముననున్న సచ్చిదానందఘన వాసుదేవుడనైయున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వథా సర్వవ్యవహారములయందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. (6.31)
- ఓ అర్జునా! సర్వప్రాణులను తనవలె (తనతో) సమానముగా చూచువాడును, సుఖమును గాని, దుఃఖమును గాని సమముగా (సమానముగ) చూచువాడును (ఇతరుల సుఖదుఃఖములులను తన సుఖదుఃఖములుగా భావించువాడును) అయిన యోగి పరమ శ్రేష్ఠుడు. (6.32)
- అర్జునుడు పలికెను – ఓ మధుసూదనా! సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలిసికొన లేకున్నాను. (6.33)
- ఓ కృష్ణా ! ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. ప్రమథనశీలమైనది (బాగుగా మథించు స్వభావము గలది). దృఢమైనది. మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటవలె మిక్కిలి దుష్కరమని భావింతును. (6.34)
- శ్రీ భగవానుడు పలికెను – హే మహాబాహో! నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. దానిని వశపఱచుకొనుట మిక్కిలి కష్టము. కాని కౌంతేయ ! అభ్యాసవైరాగ్యములద్వారా దానిని వశపఱచుకొనుట సాధ్యమే. (6.35)
- మనస్సును వశపఱచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభప్రాయము. (6.36)
- అర్జునుడు పలికెను – హే కృష్ణా! యోగమునందు శ్రద్ధాదరములతో యోగసాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి, యోగసిద్ధిని (భగవత్సాక్షాత్కారమును) పొందకయే మరణించిన సాధకుని గతియేమగును ? (6.37)
- హే మహాబాహో! అతడు (యోగభ్రష్టుడు) భగవత్ప్రాప్తి మార్గమునుండి జారినవాడై, ఆశ్రయరహితుడై (ఆలంబనము లేనివాడై), ఉభయభ్రష్టుడై, ఛిన్నాభిన్నమైన మేఘమువలె అధోగతి పాలు కాడు గదా! (6.38)
- ఓ కృష్ణ! ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తిచేయుట నీకే చెల్లును. ఏలనన ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరఱెవ్వరికిని శక్యము కాదు. (6.39)
- శ్రీ భగవానుడు పలికెను – ఓ పార్థా! అట్టి (ఆ) పురుషుడు ఈ లోకమున గాని, పరలోకమున గాని అధోగతిపాలుగాడు. ఏలనన, నాయనా! ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్యకర్మలను ఆచరించువాడెవ్వడును దుర్గతిపాలుగాడు. (6.40)
- యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది, ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి, పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. (6.41)
- అథవా విరాగియైన పురుషుడు ఆ పుణ్య (ఊర్ధ్వ) లోకములకు పోకుండగనే జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. (6.42)
- అచట (యోగి కుటుంబమున పుట్టిన పిదప) పూర్వ దేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధిరూపయోగ సంస్కారములను అతడు సులభముగనే పొందును. ఓ కురునందన! ఆ బుద్ధిసంయోగ ప్రభావమున అతడు మఱల పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటికంటెను అధికముగా సాధన చేయును. (6.43)
- శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పుర్వసాధన ప్రభావమున నిస్సందేహముగ భగవంతుని వైపు ఆకర్షితుడగును. మరియు సమబుద్ధిరూప యోగజిజ్ఞాసువు గూడ వేదములలో తెల్పబడిన సకామకర్మల ఫలమును అధిగమించును. (6.44)
- కాని, ప్రయత్నపూర్వకముగ యోగసాధన చేయు యోగి అనేక జన్మల సంస్కార ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది, సంపూర్ణముగా పాపరహితుడై, తత్ క్షణమే పరమపదమును పొందును. (6.45)
- యోగి తాపసుల కంటెను శ్రేష్ఠుడు. శాస్త్ర జ్ఞానుల కంటెను శ్రేష్ఠుడు. సకామకర్మలను ఆచరించువారి కంటెను శ్రేష్ఠుడని భావించబడును. కావున ఓ అర్జునా! నీవు యోగివి కమ్ము. (6.46)
- యోగులందఱిలోను శ్రద్ధాళువై, అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి, అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన, దృఢమైన అనన్యభావముతో నా యందే స్థిరమైయున్న మనోబుద్ధిరూప – అంతఃకరణమును గలిగి, నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమ శ్రేష్ఠుడు – అని నానిశ్చితాభిప్రాయము. (6.47)