- శ్రీ భగవానుడు పలికెను – ఓ అర్జునా! నీవు దోషదృష్టిలేని భక్తుడవు. కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మఱల విశిదముగ చెప్పుచున్నాను. దీనిని తెలిసికొని నీవు ఈ దుఃఖరూపసంసారమునుండి ముక్తుడవు కాగలవు. (9.1)
- ఈ విజ్ఞానసహితజ్ఞానము (నిర్గుణ సగుణ పరమాత్మతత్త్వజ్ఞానము) అన్ని విద్యలకును తలమానికము. సమస్త గోప్యవిషయములకును శిరోభూషణము, అతి పవిత్రము. ఉత్తమోత్తమము. ప్రత్యక్షఫలదాయకము. ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. (9.2)
- ఓ పరంతపా! ఈ ధర్మమార్గమునందు విశ్వాసములేని పురుషులు నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూపసంసారచక్రమున పరిభ్రమించుచుందురు. (9.3)
- నిరాకారపరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలె పరిపూర్ణమైయున్నది. ప్రాణులన్నియును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములైయున్నవి. కాని వాస్తవముగా నేను వాటియందు స్థితుడనుకాను. (9.4)
- ఈ ప్రాణులన్నియును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములన్నింటిని సృష్టించునదియు, పోషించునదియు నేనేయైనను యథార్థముగా నా ఆత్మ వాటియందు స్థితమై యుండదు. (9.5)
- ఆకాశమునుండి ఉత్పన్నమై సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమైయుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు (ప్రాణులు) అన్నియును నాయందే స్థితమై యుండును అని ఎఱుంగుము. (9.6)
- ఓ కౌంతేయా! కల్పాంతమునందు భూతములన్నియును నా ప్రకృతినే చేరును. అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాదియందు నేను మఱల వాటిని సృజించుచుందును. (9.7)
- తమతమ స్వభావవశమున పరతంత్రమైయున్న భూతసముదాయమును నాప్రకృతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. (9.8)
- ఓ అర్జునా! ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తిరహితుడనై, ఉదాసీనునివలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. (9.9)
- ఓ అర్జునా! అధిష్ఠాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచరజగత్తును సృష్టించుచున్నది. ఈ కారణమువలననే సంసారచక్రము పరిభ్రమించుచున్నది. (9.10)
- నా పరమభావమును ఎఱుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను (ప్రభువును) ఐన నన్ను లోకకల్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్యమానవునిగా భావించి, తక్కువగా ఊహింతురు. (9.11)
- వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులుగల అజ్ఞానులు రాక్షసీ-ఆసురీ – మోహినీ స్వభావములను ఆశ్రయింతురు. (9.12)
- కాని ఓ పార్థా! దైవీప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూలకారణముగను, అవ్యయునిగను (అక్షరస్వరూపునిగను) తెలిసికొని, నిశ్చలమనస్కులై నిరంతరము నన్నే భజింతురు. (9.13)
- ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్యబృందముతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదేపదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు. (9.14)
- మఱికొందరు జ్ఞానయోగులు నిర్గుణనిరాకారబ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞనముద్వారా అభేదభావముతో ఉపాసించుచుందురు. మఱికొందరు అనంతరూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావముతో ఆరాధించుచుందురు. (9.15)
- నేనే క్రతువును. నేనే యజ్ఞమును, స్వధయును నేనే, ఓషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూపక్రియయును నేనే. (9.16)
- ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మలఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయును నేనే. తెలిసికొనదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. ఋక్సామయజుర్వేదములను నేనే. (9.17)
- పరమగతియైన పరమధామమును, జగత్తును భరించి, పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే, అందఱికిని నివాసస్థానమును, శరణుపొందదగినవాడను నేనే, ప్రత్యుపకారమును ఆశింపక హితమొనర్చువాడను, అందఱి ఉత్పత్తిప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వతకారణమును నేనే. (9.18)
- ఓ అర్జునా! సూర్యుని రూపంలో నేను వేడిని ఇస్తున్నాను. సముద్రములనుండి నీటిని గ్రహించి, వర్షరూపమున మఱల వదలెదను. అమృతమును, మృత్యువును గూడ నేనే. సత్తును (శాశ్వతమైన ఆత్మను) అసత్తును (నశ్వరమైన సమస్త వస్తుజాలమును) గూడ నేనే. (9.19)
- ఋగ్యజుస్సామవెవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును, పాప రహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి, స్వర్గ ప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చట దేవతల దివ్యభోగములను అనుభవింతురు. (9.20)
- ఆ విశాలస్వర్గమునందు భోగములను అనుభవించి, పుణ్యములు అయిపోగానే (క్షీణింపగానే) మఱల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయవిహిత సకామకర్మలను ఆశ్రయించువారు, భోగములను ఆసించుచూ స్వర్గమర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమునకు వచ్చెదరు. (9.21)
- పరమేశ్వరుడనైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతనచేయుచు, నిష్కామ భావముతో సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. (అప్రాప్త వస్తుప్రాప్తిని ‘యోగము’ అనియందురు. ప్రాప్తించిన వస్తురక్షణమును ‘క్షేమము’ అని యందురు.) (9.22)
- ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని వారిపూజలు అవిధిపూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి. (9.23)
- ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్త్వమును ఎఱుంగరు. కావున పతనమగుదురు. అనగా పునర్జన్మను పొందుదురు. (9.24)
- దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. (9.25)
- నిర్మలబుద్ధితో, నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమునుగాని, పుష్పమునుగాని, ఫలమునుగాని, జలమునుగాని, నేను ప్రత్యక్షముగా (స్వయముగా) ప్రీతితో ఆరగింతును. (9.26)
- ఓ కౌంతేయా! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. (9.27)
- ఈ విధముగా సన్న్యాసయోగమునందు స్థిరచిత్తుడవై. అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూపకర్మబంధములనుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే చేరగలవు. (9.28)
- నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారియందు ప్రత్యక్షముగా ఉందును. (9.29)
- మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో ఆతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మఱియొకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. (9.30)
- కౌంతేయా! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును. శాశ్వతమైన పరమశాంతిని పొందును. ‘నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు’ అను విషయమును నిశ్చయముగా ఎఱుంగుము. (9.31)
- ఓ అర్జునా! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాదిపాపయోనిజులును నన్ను శరణుపొంది పరమగతినే పొందుదురు. (9.32)
- ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులును, రాజర్షులును, భక్తులును నన్ను శరణుపొందినచో వారు పరమపదమునుచేరుదురని చెప్పవలసిన పనియేలేదు. ఈ మానవశరీరము క్షణభంగురము. సుఖరహితము. ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది – నిరంతరము నన్నే భజింపుము. (9.33)
- నా యందే నీ మనస్సును లగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజింపుము. నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి, మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. (9.34)