- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: జ్ఞానములన్నింటిలోనూ అత్యుత్తమమైనది, పరమార్థ విషయమూ అయిన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను. దీనిని తెలుసుకోవడం వల్లే మునులందరూ ఈ సంసార బంధం నుండి విముక్తులై పరమ సిద్ధిని పొందారు. (14.1)
- ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి నా స్వభావాన్నే పొందిన వారు, సృష్టి కాలంలో మళ్ళీ జన్మించరు, ప్రళయ కాలంలో ఎటువంటి వ్యధను చెందరు. (14.2)
- ఓ భారతా! నాదైన మూల ప్రకృతి ఒక గర్భస్థానం వంటిది. అందులో నేను చేతన అనే బీజాన్ని ఉంచుతాను. దానివల్లే సమస్త భూతముల ఉత్పత్తి జరుగుతోంది. (14.3)
- ఓ అర్జునా! పుట్టిన సమస్త జీవ రాశులకు మూల ప్రకృతియే తల్లీ, నేను బీజాన్ని ప్రసాదించే తండ్రిని. (14.4)
- ఓ మహాబాహో! ప్రకృతి నుండి పుట్టిన సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు, నాశనం లేని ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి. (14.5)
- ఓ పాపరహితుడా! ఆ మూడింటిలో ‘సత్వ గుణం’ నిర్మలమైనది. అది వెలుగునిచ్చేది మరియు వికారాలు లేనిది. అయితే, ఇది మనిషిని “నేను సుఖిని” అనే భావనతో మరియు “నేను జ్ఞానిని” అనే అహంకారంతో బంధిస్తుంది. (14.6)
- ఓ కౌంతేయా! రజో గుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది. ఇది ప్రాపంచిక కోరికలు మరియు మమకారముల వల్ల పుడుతుంది. ఇది జీవుడిని “నేను ఈ పనులు చేయాలి” అనే కర్మల పట్ల ఉన్న మమకారంతో బంధిస్తుంది. (14.7)
- ఓ భారతా! ‘తమో గుణం’ అజ్ఞానం నుండి పుడుతు, ప్రాణులందరినీ మోహింపజేస్తుంది. ఇది మనిషిని అజాగ్రత్త, సోమరితనం మరియు అతిగా నిద్రపోవడం అనే లక్షణాలతో బంధిస్తుంది. (14.8)
- సత్వ గుణం మనిషిని సుఖం వైపు ప్రేరేపిస్తుంది. రజో గుణం కర్మల వైపు మొగ్గు చూపేలా చేస్తుంది. కానీ ఓ భారతా! తమో గుణం మాత్రం ఉన్న జ్ఞానాన్ని కూడా కప్పివేసి, మనిషిని పొరపాట్లు లేదా అజాగ్రత్త వైపు మళ్ళిస్తుంది. (14.9)
- ఓ భారతా! మనస్సులో ఈ మూడు గుణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రజస్సును, తమస్సును అణచివేసి సత్వ గుణం పైకి వస్తుంది. అలాగే ఒక్కోసారి సత్వాన్ని, తమస్సును అణచివేసి రజో గుణం; సత్వాన్ని, రజస్సును అణచివేసి తమో గుణం ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి. (14.10)
- ఈ దేహంలోని సర్వ ద్వారములందు ఎప్పుడైతే వివేకమనే వెలుగు, జ్ఞానం ఉదయిస్తాయో… అప్పుడు ఆ మనిషిలో సత్వ గుణం వృద్ధి చెందిందని గ్రహించాలి. (14.11)
- ఓ భరతశ్రేష్ఠా! మనిషిలో అత్యాశ, నిరంతరం ఏదో ఒక పని చేయాలనే ధోరణి, స్వప్రయోజనం కోసం పనులు మొదలుపెట్టడం, మనశ్శాంతి లేకపోవడం మరియు కోరికలు… ఇవన్నీ రజో గుణం పెరిగినప్పుడు కనిపిస్తాయి. (14.12)
- ఓ కురునందనా! వివేకం లేకపోవటం, కర్తవ్యం పట్ల విముఖత, అజాగ్రత్త మరియు తెలివితక్కువతనం… ఇవన్నీ తమో గుణం వృద్ధి చెందినప్పుడు కలుగుతాయి. (14.13)
- సత్వ గుణం అధికంగా ఉన్నప్పుడు మరణించిన వాడు జ్ఞానులు పొందే నిర్మలమైన ఉత్తమ లోకాలను పొందుతాడు. (14.14)
- రజో గుణం పెరిగినప్పుడు మరణించిన వాడు కర్మల పట్ల ఆసక్తి గల మనుష్యులలో జన్మిస్తాడు. అలాగే తమో గుణంలో మరణించిన వాడు పశుపక్ష్యాదుల వంటి మూఢ యోనులలో జన్మిస్తాడు. (14.15)
- సాత్విక పనులకు ఫలితం నిర్మలమైన సుఖం. రజో గుణంతో చేసే పనుల ఫలితం దుఃఖం. తమో గుణంతో కూడిన పనుల ఫలితం అజ్ఞానం. (14.16)
- సత్వ గుణం నుండి జ్ఞానం పుడుతుంది. రజో గుణం నుండి లోభం పుడుతుంది. తమో గుణం నుండి అజాగ్రత్త, మోహం మరియు అజ్ఞానం పుడతాయి. (14.17)
- సత్వ గుణంలో ఉండేవారు ఉన్నత లోకాలకు వెళ్తారు. రజో గుణంలో ఉండేవారు మనుష్య లోకంలో ఉంటారు. తక్కువ స్థాయి కలిగిన తమో గుణంలో ఉండేవారు అధోగతిని పొందుతారు. (14.18)
- ఎప్పుడైతే వివేకవంతులు పనులన్నీ కేవలం మూడు గుణాల వల్లే జరుగుతున్నాయని, ఈ గుణాల కంటే వేరైన కర్త ఎవరూ లేరని గ్రహించి, గుణాలకు అతీతమైన నన్ను తెలుసుకుంటారో, వారు నా స్వరూపాన్నే పొందుతారు. (14.19)
- దేహంలో నివసించే జీవుడు, దేహానికి కారణమైన ఈ మూడు గుణాలను దాటినప్పుడు… జన్మ, మృత్యువు, ముసలితనం మరియు దుఃఖాల నుండి విముక్తుడై పరమానందాన్ని అనుభవిస్తాడు. (14.20)
- అర్జునుడు పలికెను: ఓ ప్రభూ! ఈ మూడు గుణాలను దాటిన వాని లక్షణాలు ఏమిటి? అతని ఆచరణ ఎలా ఉంటుంది? అసలు మనిషి ఈ మూడు గుణాలను ఎలా దాటగలడు? (14.21)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ పాండవా! సత్వగుణ కార్యమైన ‘ప్రకాశం’, రజోగుణ కార్యమైన ‘ప్రవృత్తి’, తమోగుణ కార్యమైన ‘మోహం’ కలిగినప్పుడు వాటిని ద్వేషించనివాడు… అవి తొలగిపోయినప్పుడు వాటి కోసం ఆశించనివాడు, ఎవడైతే పక్షపాతం లేని వానివలె ఉంటూ, గుణాల ప్రభావానికి లోనుకాడో… “గుణాలు తమ పని తాము చేసుకుపోతున్నాయి” అని గ్రహించి స్థిరంగా ఉంటాడో, చలించడో, సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు, తన ఆత్మయందే నిలిచినవాడు, మట్టిగడ్డను, రాయిని, బంగారాన్ని సమానంగా భావించేవాడు, ప్రియమైనది జరిగినప్పుడు లేదా అప్రియమైనది ఎదురైనప్పుడు చలించని ధీరుడు, నిందాస్తుతులను సమానంగా స్వీకరించేవాడు, మాన అవమానాలను సమానంగా చూసేవాడు, శత్రు మిత్రుల పట్ల సమబుద్ధి కలవాడు, కర్తృత్వ భావనతో పనులు మొదలుపెట్టనివాడు… ఇటువంటి లక్షణాలు ఉన్నవానినే ‘గుణాతీతుడు’ అంటారు. (14.22-25)
- ఎవరైతే అచంచలమైన భక్తి యోగంతో నన్ను సేవిస్తారో, వారు ఈ మూడు గుణాలను సులభంగా దాటి, బ్రహ్మ భావాన్ని పొందడానికి అర్హులవుతారు. (14.26)
- ఎందుకంటే – నాశనం లేని నిరాకార బ్రహ్మమునకు, సనాతన ధర్మమునకు మరియు అఖండమైన దివ్య ఆనందమునకు, నేనే ఆధారమును. (14.27)