- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఓ భారతా! దైవీ గుణాలతో పుట్టిన వారిలో ఈ లక్షణాలు ఉంటాయి: భయం లేకపోవటం, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగంలో స్థిరంగా ఉండటం, దానగుణం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, వేదాధ్యయనం, తపస్సు, నిష్కపటమైన ప్రవర్తన, అహింస, సత్యం, కోపం లేకపోవటం, త్యాగబుద్ధి, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, ప్రాణుల పట్ల దయ, లోభం లేకపోవటం, మృదు స్వభావం, తప్పు చేయడానికి భయపడటం, చంచలత్వం లేకపోవటం, తేజస్సు, క్షమ, మనఃస్థైర్యము, బాహ్య-అంతర శుద్ధి, ఎవరికీ ద్రోహం చేయకపోవటం మరియు అతిగా గర్వించకపోవటం. (16.1-3)
- ఓ పార్థా! ఆసురీ గుణాలతో పుట్టిన వారిలో ఈ లక్షణాలు ఉంటాయి: గొప్పలు చెప్పుకోవటం, గర్వం, అహంకారం, కోపం, కఠినంగా మాట్లాడటం మరియు అజ్ఞానము. (16.4)
- దైవీ సంపద మోక్షానికి దారితీస్తుంది. ఆసురీ సంపద బంధనానికి కారణమవుతుంది. ఓ పాండవా! నీవు బాధపడకు, ఎందుకంటే నీవు దైవీ సంపదతోనే జన్మించావు. (16.5)
- ఈ లోకంలో ప్రాణుల సృష్టి రెండు రకాలుగా ఉంటుంది – ఒకటి దైవము, రెండు ఆసురము. దైవీ స్వభావం గురించి వివరంగా చెప్పాను. ఇప్పుడు ఆసుర స్వభావం గురించి నా నుండి విను. (16.6)
- ఆసురీ స్వభావం గలవారికి ఏ పని చేయాలో (ప్రవృత్తి), ఏ పని మానుకోవాలో (నివృత్తి) తెలియదు. వారిలో శుచి ఉండదు, మంచి ఆచరణ ఉండదు, సత్యం అసలే ఉండదు. (16.7)
- ఆసుర స్వభావం కలవారు – “ఈ జగత్తు సత్యం కాదు, దీనికి ఎటువంటి ఆధారం లేదు, దీనిని నడిపించే దేవుడు లేడు. ఇది కేవలం స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టింది, కామమే దీనికి మూలం” అని అంటారు. (16.8)
- ఇటువంటి తప్పుడు దృష్టిని కలిగి ఉండటం వల్ల, ఆ అల్పబుద్ధి గలవారు తమ ఆత్మను తామే నశింపజేసుకుంటారు. వారు క్రూరమైన పనులు చేస్తూ, లోకానికి హాని కలిగిస్తూ, జగత్తు వినాశనం కోసం పుడతారు. (16.9)
- వారు ఎన్నటికీ తీరని కోరికలను ఆశ్రయించి, డంబం, గర్వం, మదంతో నిండి ఉంటారు. మోహం వల్ల తప్పుడు సిద్ధాంతాలను తలకెక్కించుకుని, అపవిత్రమైన పనులు చేస్తూ లోకంలో తిరుగుతుంటారు. (16.10)
- ఆసుర స్వభావం గలవారు మరణం వరకు ముగియని, అపరిమితమైన చింతలను ఆశ్రయించి ఉంటారు. ఇంద్రియ సుఖాలను అనుభవించడమే జీవిత పరమావధి అని వారు గట్టిగా నమ్ముతారు. వందలాది ఆశలనే పాశాల చేత బంధించబడి, కామక్రోధాలకు బానిసలై, తమ ఇంద్రియ తృప్తి కోసం అన్యాయ మార్గాల ద్వారా ధన సంపాదనకు ప్రయత్నిస్తారు. (16.11-12)
- వారి మనసులో నిరంతరం ఇలాంటి ఆలోచనలే ఉంటాయి: “ఈరోజు ఈ లాభం పొందుతాను, రేపు ఆ కోరికను తీర్చుకుంటాను.”, “నా దగ్గర ఇంత ధనం ఉంది, భవిష్యత్తులో ఇంకా వస్తుంది.” “ఈ శత్రువును చంపేశాను, మిగిలిన వారిని కూడా అంతం చేస్తాను.”, “నేనే ఈశ్వరుడిని, నేనే భోగిని, నేనే సర్వ సిద్ధులు కలవాడిని, నేనే బలవంతుడిని మరియు సుఖవంతుడిని.” “నేను గొప్ప ధనవంతుడిని, ఉన్నత వంశీయుడిని; నాకంటే గొప్పవాడు ఎవడు? నేను యజ్ఞాలు చేస్తాను (పేరు కోసం), దానాలిస్తాను, ఆనందిస్తాను.” ఇలా వారు అజ్ఞానంతో భ్రమించి ఉంటారు. అనేక రకాల ఆలోచనలతో కలవరపడి, మోహమనే వలలో చిక్కుకొని, ఇంద్రియ భోగాల యందే మునిగిపోయి… అటువంటి వారు చివరకు అత్యంత అపవిత్రమైన నరకంలో పడతారు. (16.13-16)
- వారు తమను తామే పొగుడుకుంటూ, గర్వంతో, ధన మదంతో నిండిపోయి, శాస్త్ర విధిని పక్కన పెట్టి, కేవలం సమాజంలో పేరు కోసం నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు. అహంకారం, బలం, గర్వం, కామ క్రోధాలను ఆశ్రయించి, తమ శరీరంలోనూ మరియు ఇతరుల శరీరాలలోనూ అంతర్యామిగా ఉన్న నన్ను (పరమాత్మను) ద్వేషిస్తూ, అసూయతో ప్రవర్తిస్తారు. (16.17-18)
- అటువంటి ద్వేషించే క్రూరులను, పాపాత్ములను, నరాధములను నేను సంసార చక్రంలో ఎల్లప్పుడూ అశుభకరమైన ఆసుర యోనులలోనే పడేస్తాను. (16.19)
- ఓ కౌంతేయా! అటువంటి ఆసుర జన్మలను పొందిన మూఢులు జన్మజన్మలకూ నన్ను చేరుకోలేక, అంతకంతకూ మరింత అధమ గతిని పొందుతారు. (16.20)
- ఆత్మను అధోగతి పాలు చేసే నరక ద్వారాలు మూడు: 1. కామము (కోరిక), 2. క్రోధము (కోపం), 3. లోభము (అత్యాశ/పిసినారితనం). ఇవి మనిషిని నిలువునా ముంచేస్తాయి కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ మూడింటిని ఖచ్చితంగా వదిలిపెట్టాలి. (16.21)
- ఓ కౌంతేయా! ఈ మూడు తమో ద్వారాల నుండి విముక్తుడైన మనిషి, తన ఆత్మ శ్రేయస్సు కోసం ప్రయత్నిస్తాడు. తద్వారా అతడు పరమ గతిని పొందుతాడు. (16.22)
- ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని, కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో, వారు పరిపూర్ణ సిద్ధిని కానీ, సుఖాన్ని కానీ, చివరకి జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు. (16.23)
- కాబట్టి అర్జునా! ఏ పని చేయదగినది, ఏ పని చేయకూడనిది అని నిర్ణయించుకోవడానికి నీకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రోక్తంగా చెప్పబడిన విధివిధానాలను తెలుసుకుని, ఈ లోకంలో నీ కర్తవ్య కర్మలను ఆచరించడం నీకు తగిన పని. (16.24)