- శ్రీ భగవానుడు పలికెను – ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్యశాఖగా(కాండముగా), వేదములే పర్ణములు(ఆకులు)గా గల ఈ సంసారరూప-అశ్వత్థవృక్షము నాశరహితమైనది(శాశ్వతమైనది). ఈ సంసార వృక్షతత్త్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎఱిగిన వాడు. (15.1)
- ఈ సంసారవృక్షమును త్రిగుణములనెడిజలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధిపొందు శాఖలే దేవమనుష్యతిర్యగ్యోనులలో జన్మించుప్రాణులు, చిగుళ్లే విషయభోగములు. ఈ శాఖలు, చిగుళ్ళు సర్వత్ర వ్యాపించియున్నవి. మనుజులను కర్మాను సారముగా బంధించు అహంకార మమకార వాసనలనెడి వేర్లు, ఊడలు అన్నిలోకములలోను క్రింద, పైన వ్యాపించి ఉన్నవి. (15.2)
- ఈ సంసారవృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణంపబడిన రీతిగా లభ్యముగాదు. ఏలనన ఇది ఆదియు, అంతము, సరియైన స్థితియు లేనిది. కనుక అహంకారమమకారవాసనారూపములైన ధృఢమైన వేర్లు, ఊడలు గల ఈ సంసారరూప అశ్వత్థవృక్షమును నిశితమైన వైరాగ్యమనెడి శస్త్రముతో ఖండించి. అనంతరము ఆ పరమపదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగ అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరునినుండియే ఈ పురాతన సంసారవృక్షపరంపర విస్తరించియున్నది. అట్టి ఆదిపురుషుడైననారాయణునే శరణుపొంది, దృఢనిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన, నిధిధ్యాసాదులు చేయవలెను. (15.3-4)
- దురభిమానమును, మోహమును త్యజించినవారును, ఆసక్తియను దోషమును జయించినవారును, ప్రాపంచికవాంఛలనుండి పూర్తిగా మఱలినవారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైనవారును, సుఖదుఃఖాదిద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. (15.5)
- స్వయంప్రకాశస్వరూపమైన నాపరంధామమును సూర్యుడుగాని, చంద్రుడుగాని , అగ్నిగాని ప్రకాశింప జేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మఱల ఈ జగత్తున ప్రవేశింపరు. అనగా జన్మింపరు. (15.6)
- ప్రాణి లోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతియందు స్థితములైన మనస్సు, ఇంద్రియములను, శబ్దాదివిషయములద్వారా తనవైపు ఆకర్షించును. (15.7)
- వాయువు వాసనలను ఒకచోటినుండి మఱియొక చోటికి తీసికొని పోయినట్లుగా దేహాదులకు స్వామియైన జీవాత్మ ఒక శరీరమును త్యజించునపుడు, మనస్సు ఇంద్రియములను గ్రహించి, వాటితో గూడ మఱొక శరీరమును పొందును. అనగా దానిలో ప్రవేశించును. (15.8)
- ఈ జీవాత్మ త్వక్ఛక్షుశ్ర్శోత్రజిహ్వాఘ్రాణములు అనెడి పంచేంద్రియములను, మనస్సును ఆశ్రయించి, శబ్దాదివిషయములను అనుభవించును. (15.9)
- జీవాత్మ శరీరమును త్యజించునప్పుడును, శరీరమునందు స్థితుడై యున్నప్పుడును, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలిసికొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమజ్ఞాననేత్రములవలన స్వస్వరూపమును తెలిసికొన గల్గుదురు. (15.10) (See BG 9.11, BG 4.9)
- అంతఃకరణశుద్ధిగల యోగులు తమహృదయముల యందున్న ఈ ఆత్మతత్త్వమును ప్రయత్నశీలురై తెలిసికొనగలరు. కాని, అంతఃకరణశుద్ధిలేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు, ఈ ఆత్మను తెలిసికొన జాలరు. (15.11)
- సమస్తజగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్నితేజస్సును నాతేజస్సేయని యెఱుంగుము. (15.12)
- పృథ్వియందు ప్రవేశించి, నేను నా శక్తిద్వారా సకల భూతములను ధరించి, పోషించుచున్నాను. రసస్వరూపుడనై – అనగా అమృతమయముడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికిని పుష్టిని చేకూర్చుచున్నాను. (15.13)
- నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో సర్వప్రాణుల శరీరముల యందుండి నాలుగువిధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును. (15.14)
- సమస్తప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్న వాడను నేనే. నానుండియే స్మృతి, జ్ఞానము, అపోహనము (సందేహమును తొలగించుట) కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను గూడ నేనే. (15.15)
- ఈ జగత్తునందు క్షరుడు (నశ్వరుడు), అక్షరుడు (వినాశరహితుడు) అని పురుషులు రెండు విధములుగా గలరు. సకలప్రాణులశరీరములు నశ్వరములు. జీవాత్మ నాశరహితుడు. (15.16)
- పై ఇద్దరికంటెను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకములయందును ప్రవేశించి అందఱిని భరించి పోషించుచున్నాడు. (15.17)
- ఏలనన, నశ్వరమగు జడవర్గము (క్షేత్రము) కంటెను నేను సర్వథా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈజగత్తునందును, వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధి కెక్కితిని. (15.18)
- ఓ అర్జునా! జ్ఞానియైనవాడు ఈ విధముగా నన్ను తత్త్వతః పురుషోత్తమునిగా ఎఱుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. (15.19)
- ఓ పుణ్యపురుషా! ఓ అర్జునా! అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్త్వమును తెలిసికొనిన మనుష్యుడు జ్ఞానియై కృతార్థుడు కాగలడు. (15.20)