- అర్జునుడు పలికెను: ఈ విధంగా నిరంతరం నీపైనే మనసు లగ్నం చేసి, రూపం ఉన్న నిన్ను సేవించే భక్తులు కొందరు; అలా కాకుండా కంటికి కనపడని, నాశనం లేని పరబ్రహ్మాన్ని ఉపాసించే వారు మరికొందరు. వీరిలో ఎవరు శ్రేష్ఠులు? (12.1)
- శ్రీ కృష్ణ భగవానుడు పలికెను: ఎవరైతే తమ మనస్సును నా యందే లీనం చేసి, నిత్యం నాపై ఏకాగ్రతతో ఉండి, గొప్ప శ్రద్ధతో నన్ను ఆరాధిస్తారో… వారే అత్యుత్తమ యోగులని నా అభిప్రాయం. (12.2)
- అయితే, ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకుని, అన్నివేళలా సమబుద్ధితో ఉంటూ, సర్వ ప్రాణుల మేలును కోరేవారు … వర్ణించడానికి వీలుకాని, సర్వవ్యాప్తమైన, మార్పు లేని ఆ నిరాకార బ్రహ్మాన్ని ఉపాసించినా కూడా, వారు చివరికి నన్నే చేరుకుంటారు. (12.3-4)
- మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి కష్టం ఎక్కువ. ఎందుకంటే, దేహమే తాననే భావన ఉన్న మనుషులకు, కంటికి కనిపించని లక్ష్యాన్ని చేరుకోవడం చాలా దుఃఖంతో కూడుకున్న పని. (12.5)
- కానీ, తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ, నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ, నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారిని, ఓ పార్థా, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యుసంసారసాగరము నుండి విముక్తి చేస్తాను. వారి అంతఃకరణ నా యందే ఏకమైపోయి ఉంటుంది. (12.6-7)
- కాబట్టి అర్జునా! నీ మనస్సును నా యందే నిలుపు. నీ బుద్ధిని నా యందే లగ్నం చేయి. అప్పుడు నీవు కచ్చితంగా నాలోనే నివసిస్తావు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. (12.8)
- ఓ ధనంజయా! ఒకవేళ నీవు నీ మనస్సును నాపై స్థిరంగా నిలపలేకపోతే, అభ్యాసయోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు. (12.9)
- నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నాకోసమే పనులు చెయ్యటానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా నీవు చేసే ప్రతి పనిని భగవత్కార్యంగా భావించి చేస్తూ కూడా పరమ గతిని పొందవచ్చు. (12.10)
- అర్జునా! ఒకవేళ నీవు నా కొరకు కర్మలు చేయడం కూడా చేయలేకపోతే… అప్పుడు నీ మనస్సును అదుపులో ఉంచుకుని, నీవు చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని త్యాగం చేయుము. (12.11)
- అవగాహన లేని అభ్యాసం కంటే జ్ఞానం మేలు. జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్ఠం. ధ్యానం కంటే కర్మఫల త్యాగం మిన్న. ఎందుకంటే ఫలితం మీద ఆశ వదిలేసిన వెంటనే మనిషికి అనంతమైన శాంతి లభిస్తుంది. (12.12)
- ఏ ప్రాణిని ద్వేషించనివాడు, అందరి పట్ల స్నేహంగా, దయతో ఉండేవారు, ‘నాది’ అనే మమకారం, ‘నేను’ అనే అహంకారం లేనివారు, సుఖదుఃఖాలను సమానంగా చూసేవారు, ఓర్పు గలవారు… ఎప్పుడూ సంతుష్టిగా ఉంటూ, నిశ్చలమైన మనస్సుతో తన బుద్ధిని నాకే అర్పించిన భక్తుడు నాకు చాలా ఇష్టం. (12.13-14)
- లోకమున ఎవ్వరినీ బాధ పెట్టని వాడు మరియు ఎవరి చేత ఉద్వేగమునకు గురి కాని వాడు, సుఖాల్లో-బాధల్లో ఒక్కలాగే ఉంటూ, భయము మరియు ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. (12.15)
- దేనిపైనా ఆశ లేనివాడు, బాహ్యంగానూ అంతరంగంలోనూ శుచిగా ఉండేవారు, కార్యదక్షత కలవారు, పక్షపాతం లేనివారు, మనస్తాపం లేనివారు, ఫలితాన్ని కోరి పనులు మొదలుపెట్టని వారు నాకు ఇష్టులైన భక్తులు. (12.16)
- ఇష్టమైనది జరిగినప్పుడు అతిగా పొంగిపోనివాడు, అనిష్టమైనది జరిగినప్పుడు ద్వేషించనివాడు, దేనికోసం శోకించనివాడు, దేనినీ ఆశించనివాడు, మంచిని చెడును రెండింటినీ సమానంగా చూసే భక్తి గలవాడు నాకు ప్రియుడు. (12.17)
- శత్రువు పట్ల, మిత్రుని పట్ల సమబుద్ధి కలిగి ఉండటం; గౌరవ అవమానాలను, శీతోష్ణాలను, సుఖదుఃఖాలను సమానంగా చూడటం; దేనికీ అంటుకోకుండా ఉండటం; నిందాస్తుతులను సమానంగా భావించే మౌని; ఏది లభిస్తే దానితో తృప్తి పడేవాడు; ఇల్లు అనే మమకారం లేనివాడు; స్థిరమైన బుద్ధి కలవాడు నాకు ప్రియమైన భక్తుడు. (12.18-19)
- చెప్పిన విధంగా, అమృతం వంటి ఈ ధర్మాన్ని శ్రద్ధతో అనుసరిస్తూ, నన్నే పరమగతిగా భావించే భక్తులు నాకు అత్యంత ప్రియమైన వారు. (12.20)