- అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణరూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘననిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండువిధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విదులెవరు? (12.1)
- శ్రీ భగవానుడు ఇట్లనెను – పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణరూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు – అని నా అభిప్రాయము. (12.2)
- కాని ఏ పురుషులు అనిర్వచనీయమైన స్వరూపముగలవాడును, నిరాకారుడును , సర్వవ్యాపియైనవాడును, మనస్సుకు బుద్ధికి గోచరము గానివాడును, సర్వదా ఒకే స్థితిలో ఉండువాడును, నిశ్చలుడును, నిత్యుడును, శాశ్వతుడైన సచ్చిదానందఘనబ్రహ్మను ఏకీభావముతో ఉపాసింతురో…(ఏ పురుషులు) ఇంద్రియ సముదాయమును పూర్తిగా వశపఱచుకొని, అన్నిటియందును సమభావముగలవారై, సకల ప్రాణులకును హితముచేయగోరువారుగా ఉంటారో, వారు (యోగులు) నన్నే పొందుదురు. (12.3-4)
- కాని సచ్చిదానందఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తచిత్తులైనవారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతోగూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్తపరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. (12.5)
- కాని మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటిని నాయందే అర్పించి, సగుణపరమేశ్వరరూపమునే అనన్యభక్తియోగముతో సతతము చింతన చేయుచు భజించుచుందురో……… ఓ అర్జునా నాయందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగనే మృత్యురూపసంసారసాగరము నుండి ఉద్ధరించెదను. (12.6-7)
- నాయందే మనస్సు నిలుపుము. నాయందే బుద్ధిని లగ్నముచేయుము. పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏ మాత్రమూ సందేహమునకు తావులేదు. (12.8)
- మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడవు కానిచో అర్జునా! అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. (12.9)
- అభ్యాసముచేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుటద్వారాకూడ నన్నే పొందెదవు. (12.10)
- మత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని, సకల కర్మఫలములను త్యజింపుము. (12.11)
- తత్త్వము నెఱుంగకయే చేయు అభ్యాసముకంటెను జ్ఞానము శ్రేష్ఠము. కేవలము పరోక్ష జ్ఞానము కంటెను అనగా అనుభవరహితమైన జ్ఞానముకంటెను (శాస్త్ర పాండిత్యముకంటెను) పరమేశ్వరస్వరూపధ్యానము శ్రేష్ఠము. ధ్యానము కంటెను కర్మఫలత్యాగము మిక్కిలి శ్రేష్ఠమైనది. ఏలనన త్యాగమువలన వెంటనే పరమశాంతి లభించును. (12.12)
- ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణులయందును అవ్యాజమైనప్రేమ, కరుణ కలవాడును, మమతాహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను, దుఃఖము ప్రాప్తించినను, సమభావము కలిగియుండువాడును, క్షమాగుణము కలవాడును (అపరాధికిని అభయమును ఇచ్చువాడును)……సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడైయుండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకొనినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును, అయి నాయందే మనోబుద్దులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. (12.13-14)
- లోకమున ఎవరికిని ఉద్వేగము (క్షోభ) కలిగింపనివాడును, ఎవరివలనను తాను ఉద్వేజితుడు కానివాడును (ఉద్వేగమునకు గురికానివాడును), హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. (12.15)
- ఏమాత్రమూ కాంక్షలేనివాడు, శరీరేంద్రియమనస్సులయందు శుచియై యున్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చలింపనివాడును, సమస్తకర్మల యందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. (12.16)
- ఇష్టవస్తుప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికినీ శోకింపనివాడును, దేనినీ ఆసింపనివాడును, శుభాశుభకర్మలను త్యజించినవాడును, ఐన భక్తుడు నాకు ప్రియుడు. (12.17)
- శత్రువులయెడను, మిత్రులయెడను సమభావముతో మెలగువాడును, మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ఆసక్తిరహితుడును…. నిందాస్తుతులకు చలింపనివాడును, మననశీలుడును, శరీరనిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును, నివాసస్థానములయందు మమతాసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. (12.18-19)
- ఉపర్యుక్తధర్మ్యామృతమును సేవించుచు (పైనపేర్కొనభడిన ఉత్తమ గుణములను కలిగియుండి), నిష్కామభక్తిశ్రద్దలతో మత్పరాయణులైన భక్తులు నాకత్యంత ప్రియులు. (12.20)