1. పరమానంద స్వరూపుడూ; వాక్కుకూ, మనస్సుకూ అతీతమైనవాడూ; వేదాంత సిద్ధాంతాలలోని జ్ఞానానికి మాత్రమే గోచరమయ్యేవాడూ; అజ్ఞానాన్ని తొలగించే సద్గురుమా అయిన ‘గోవింద’ నామం కల పరబ్రహ్మానికి నేను నమస్కరిస్తున్నాను.
2. ఈ సృష్టిలోని ప్రాణికోటికి మనుష్యజన్మ లభించడం అరుదు. మనుష్యజన్మ లభించి పురుషశరీరం , బ్రాహ్మణత్వం ప్రాప్తించడం ఇంకా ఎంతో కష్టం. ఇవి లభించినా వేదంలో ప్రతిపాదించబడిన మార్గంలో పయనిస్తూ ధర్మానికే కట్టుబడి జీవించడం దుర్లభం. అటువంటి ధర్మపరాయణత అలవడినా వేదాంతశాస్త్ర జ్ఞానం కలగడం బహుకష్టం. ఆపై వేదాంతశాస్త్రజ్ఞానం కలిగినా నిత్య–అనిత్య వస్తు వివేకం అబ్బడం అతి దుర్లభం. అట్టి వివేకం అబ్బినా ఆత్మానుభవం పొందడం కడు దుర్ఘటం. చివరిగా ఆత్మానుభవం కలిగినా బ్రహ్మైక్యం పొంది, నిరంతరం నిరంతరాయంగా పరమాత్మస్థితుడై సంపూర్ణ జీవన్ముక్త అవస్థలో ఉండడం అత్యంత దుర్లభం. నూరు కోట్ల జన్మలలో చేసుకున్న పుణ్యం పక్వమైనపుడే ఈ రకమైన ముక్తి లభిస్తుంది.
3. మనుష్యజన్మ, మోక్షం కావాలనే కోరిక, మహాపురుషుల ఆశ్రయం అనే ఈ మూడు లభించడం దుర్లభం. కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే ఇవి ప్రాప్తిస్తాయి.
4. పూర్వజన్మలో ఆర్జించిన పుణ్యఫలంగానూ, దైవానుగ్రహం వలననూ లభించిన మనుష్యజన్మలో పురుషశరీరంలో ఉంటూ, వేదవేదాంతాలలో నిష్ణాతుడై తన ముక్తి కోసం ప్రయత్నించక, అనిత్యాలైన ధనపుత్రదారగృహాదుల ఆర్జనలో ఎవరైతే తలమునకలవు తుంటారో అట్టి మూఢులు తమను తామే చంపుకునే ఆత్మఘాతకులు. (Isha Upanishad Verse 3)
5. అత్యంత దుర్లభమైన మనుష్యజన్మ పొంది, వేదాంత శాస్త్ర విచారాదులకు అవసరమైన పురుషత్వం కూడా పొంది, అత్యంతావశ్యక కర్తవ్యమైన మోక్షప్రాప్తిని నిర్లక్ష్యం చేసేవారి కంటే మూఢులు ఎవరుంటారు?
6. మానవుడు వేదాంతశాస్త్రాలను వాఖ్యానాలతో సహా పఠించవచ్చు గాక, యజ్ఞయాగాలు చేసి దేవతలనందరినీ మెప్పించవచ్చు గాక – వీటి వలన ప్రయోజనం శూన్యం. ఆత్మతో మన ఐక్యతను అనుభూతి చెందకుండా లక్షల కోట్ల జన్మలను గడిపినా మోక్షప్రాప్తి కలుగదు.
7. వేదాంత వాక్యాల ప్రకారం, సిరిసంపదల వలన మోక్షప్రాప్తి కలుగనే కలుగదు. కాబట్టి సిరిసంపదల కోసం చేసే కర్మలు కూడా మోక్షప్రాప్తికి ఏ మాత్రం సాయపడవు.
8. మోక్షసాధకుడు రస–రూప–గంధ–శబ్దాది బాహ్యవిషయాల ఆకర్షణలను నిగ్రహించి, పరతత్త్వబోధనకు సమర్థుడైన గురువుని శరణువేడి, ఆయన ఉపదేశించిన మహావాక్యాలను శ్రద్ధతో విని, మననం చేస్తూ, బంధవిముక్తి కోసం తీవ్రంగా ప్రయత్నం చేయాలి.
9. యోగారూఢుడై (అనగా ఇంద్రియార్థాలకూ, ఇంద్రియకర్మలకూ అతీతుడై) ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనే నిష్ఠ, పట్టుదలలతో జనన మరణ సంసారచక్రం నుండి తనను తానే ఉద్ధరించుకోవలెను.
10. సంసారబంధం నుండి విముక్తి కోరే ముముక్షువు సర్వకర్మలనూ (అనగా ఫలాపేక్షతో చేసే అన్ని పనులనూ) పరిత్యజించి, నిరంతరం భవబంధవిముక్తి కోసం ప్రయత్నించాలి.
11. స్థూలదృష్టితో చూస్తే, ఈ శ్లోకం యొక్క అర్థం ఇలా అనిపిస్తుంది. శ్రుతులలో చెప్పబడిన కర్మల వలన చిత్తశుద్ధి మాత్రమే కలుగుతుంది, కానీ జ్ఞానం వలన మాత్రమే అపరోక్షానుభూతి లభిస్తుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే, కర్మలు కూడా విముక్తిని ఇస్తాయి. కాకపోతే అవి నేరుగా కాక చిత్తశుద్ధి ద్వారా జ్ఞానోదయానికి దారితీస్తాయి. జ్ఞానమార్గం నేరుగా బ్రహ్మజ్ఞానప్రాప్తికి చేరుస్తుంది కానీ, ఇది దుష్కరమైనది. కర్మల వలన అనేక బంధాలు ప్రాప్తిస్తాయి. అందువలన దూరదృష్టి గల జ్ఞానులు కర్మలు చేయనక్కరలేని స్థితిని సంపాదిస్తారు.
12. ఒక రజ్జువు (అనగా త్రాడు)ను చూసి పాముగా భ్రమపడ్డ వ్యక్తి భయంతో కంపించిపోతాడు. ఎవరైనా అది పాము కాదనీ, తాడు మాత్రమేననీ తెలియజెప్పిన వెంటనే భయం తొలగిపోతుంది. అదే విధంగా గురూపదేశము వలన జనన మరణ సంసార చక్రము యొక్క స్వభావమును సరియైన విచక్షణతో తెలుసుకొన్నప్పుడు దుఃఖము తొలిగి బ్రహ్మసాక్షాత్కారం కలుగుతుంది.
13. గురువు చేసిన హితబోధలవల్ల, సరియైన తత్త్వజ్ఞానవిచారణ వల్ల తప్ప, నదీనదాలలో పుణ్యస్నానాలు ఆచరించడం వలన, దానాల వలన, వందలసార్లు ప్రాణాయామాల్ని చేయడం వలన పరమసత్యం మీద నిశ్చయమైన విశ్వాసం కలుగదు.
14. సాధనసంపత్తి కలవాడు అనగా తీవ్రంగా సాధన చేసేవాడు మాత్రమే మోక్షానికి అర్హుడు. దేశ కాలాదులు (ఒకే చోట, ఒకే సమయానికి నియమానుసారం చేసే ధ్యానాది సాధనలు) కేవలం సహకారులు మాత్రమే.
15. కాబట్టి ఆత్మజ్ఞానం పొందాలనుకునే జిజ్ఞాసువు; బ్రహ్మవేత్త, దయాసాగరుడు అయిన ఉత్తమ గురువును ఆశ్రయించి, ఆయన ఉపదేశించిన మార్గంలో తత్త్వవిచారణ చేయవలెను.
16. వేదశాస్త్రవాఙ్మయపు అనుకూల, ప్రతికూల భావనలను విచక్షణతో తర్కించగల నిపుణుడు, మేధావి, విద్వాంసుడు అగు సాధకుడు మాత్రమే తత్త్వజ్ఞానపాత్రుడు అనగా తత్త్వజ్ఞానాన్ని పొందే అధికారము గలవాడు.
17. శమదమాది గుణాఢ్యుడు, శాంతచిత్తుడు, నిత్యానిత్య వివేకి, వైరాగ్యసంపన్నుడు అయిన ముముక్షువు మాత్రమే బ్రహ్మతత్త్వాన్ని తెలుసుకొనుటకు అర్హుడు.
18. బ్రహ్మోపాసనకు నాలుగు సాధనలు చెప్పబడినవి. ఈ సాధనచతుష్టయ సంపన్నుడే బ్రహ్మవిద్యకు అధికారి. అది లేనివానికి బ్రహ్మవిద్య సిద్ధింపదు. ఈ నాలుగు సాధనలు తదుపరి శ్లోకములలో వివరింపబడినవి.
19. సాధనాచతుష్టయంలో మొదటిది నిత్యానిత్య వస్తువివేకం. రెండవది ఇహపర లోకాలలో ఫలాలు అనుభవించాలనే కోరిక లేకపోవడం. మూడవది షట్సంపత్తి ని పెంపొందించుకోవడం. నాలుగవది ముముక్షుత్వం (మోక్షం కోసం తపన).
20. బ్రహ్మమే సత్యమనీ, కనిపించే జగత్తు మిథ్య అనీ దృఢవిశ్వాసం కలిగివుండడమే నిత్యానిత్య (నిత్య+అనిత్య) వస్తువివేకమని చెప్పబడుతుంది.
21. ఇంద్రియాల ద్వారా అనుభవించదగిన సమస్త భోగ్యవస్తువులు అశాశ్వతాలని గ్రహించి, వాటి మీద ఇచ్ఛ లేకపోవడమే వైరాగ్యం.
22. అసంఖ్యాకమైన ఇంద్రియవిషయాలలోని దోషాలను ఎరిగి, వాటి నుంచి మనస్సును మరల్చి, గమ్యమైన ఆత్మసాక్షాత్కారంపై స్థిరంగా లగ్నం చేయడాన్ని ‘శమం’ అంటారు.
23. జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను నిగ్రహించి, పరబ్రహ్మం మీద స్థిరపరచడాన్ని ‘దమం’ అంటారు. బాహ్యాకర్షణ లకు లొంగక, మనస్సు అంతర్ముఖమవ్వడాన్ని ‘ఉపరతి’ అంటారు.
24. శీతలం (చలి), ఉష్ణం (ఎండ), క్షుత్పిపాసలు (ఆకలిదప్పులు) మొదలైన ఈతి బాధలను ఓర్చుకుంటూ, ఇతరుల వలన జరిగే అవమానాలకు ప్రతీకారం తీర్చుకోగల నేర్పు, శరీర దారుఢ్యం కలిగివుండి కూడా, అలా చేయకుండా, వాటివలన ఏమాత్రం వ్యాకులపడకుండా ఉండడాన్ని ‘తితిక్ష’ అంటారు.
25. శాస్త్రవాక్యాలలోను, గురువాక్యాలలోను పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగివుండడాన్ని ‘శ్రద్ధ’ అంటారు. దీనివల్ల సత్యసాక్షాత్కారమౌతుంది.
26. ఏకాగ్రలక్ష్యంతో బుద్ధిని ప్రత్యగాత్మ (పరబ్రహ్మం) నందు నిలపడాన్ని ‘సమాధానం’ అంటారు. తత్త్వశాస్త్రం మీద వాదోపవాదాలు చేసి పొందే సంతృప్తి కోసమో, కాలక్షేపం కోసమో పరమాత్మ గురించి ఆలోచించడం నిష్ప్రయోజనం. అనగా శుష్కవేదాంత ధ్యానం వలన ఏమీ ప్రయోజనం లేదు.
27. అజ్ఞానం వలన కలిగే దేహభావం, అహంకారం – వీటి వలన కలిగే ఇతర బంధాలను త్రెంచుకొని, స్వస్వరూపాన్ని తెలుసుకుని, ఆత్మ సాక్షాత్కారం ద్వారా ముక్తి పొందాలనే తపనను ‘ముముక్షుత’ అంటారు.
28. ఈ ముముక్షుతలో మంద (తక్కువస్థాయి), మధ్యమ, ఉత్తమమనే మూడు స్థాయులున్నాయి. సాధకుడు మంద, మధ్యమ స్థాయులలో ఉన్నా, సద్గురు కృపచేత వైరాగ్యం అలవడి, చిట్టచివరకు పరమానందరూప మహాఫలాలను పొందవచ్చు.
29. ఎవరిలో వైరాగ్యం, ముముక్షుత తీవ్రంగా ఉంటాయో, వారిలో శమదమాదులు సార్థకమై శీఘ్రంగా ఫలాలను ఒసగుతాయి.
30. ఎవరిలో వైరాగ్యం, మోక్షేచ్ఛ మందర్గా ఉంటాయో వారిలో కనిపించే శమదమాదులు ఎడారిలో మరీచికల వంటివి.
31. మోక్షకారణ సాధనాలలో భక్తి అత్యుత్తమమైనది. వివేకచూడామణి స్వస్వరూపాన్ని అనగా ‘నేనెవర్ని?’ అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే తీవ్రమైన తపననే భక్తి అంటారు.
32. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే భక్తికల చికీర్షువు బ్రహ్మనిష్ఠుడైన ఆచార్యుని ఆశ్రయించి బంధవిముక్తికై యత్నించాలి. ఆయన బంధాలనుండి మనకు ముక్తి కలిగిస్తాడు.
33. అటువంటి ఆచార్యుడు – వేదవేదాంతాలలో యథార్థజ్ఞానం కలిగినవాడు, పాపరహితుడు, కోరికలు లేనివాడు, బ్రహ్మజ్ఞాని, నిరంతరం బ్రహ్మతత్త్వంలోనే లీనమై ఉండేవాడు, ఇంధనం అంతా మండిపోవడం వలన చిటచిటలాడక శాంతంగా వెలిగే అగ్నిలాంటివాడు, దయాసాగరుడు, వినమ్రులైన శిష్యులకు ఆత్మబంధువులాంటివాడు, అయి ఉంటాడు.
34. అటువంటి గురువును సాధకుడు భక్తితో ఆరాధిస్తూ; వాక్కులతోనూ, శుశ్రూషలతోనూ, వినయభయభక్తులతో సేవచేస్తూ ప్రసన్నుని చేసుకోవలెను. ఆపై ఆత్మజ్ఞానవిషయాన్ని గూర్చి ప్రశ్నించాలి.
35. ముకుళితహస్తాలతో ఆయనను సమీపించి, “ఓ! స్వామీ! ఆశ్రితమందారా! కారుణ్యసింధో! మీకు నా నమస్కృతులు. జనన మరణ సంసారచక్రంలో చిక్కుకున్న నన్ను తమ కరుణామృతవర్షధారలతోనూ, కటాక్షవీక్షణాలతోనూ ఉద్ధరించండి” అని శరణువేడవలెను.
36. “ఆర్పలేని సంసార బడబాగ్ని నన్ను దహించివేస్తోంది. పూర్వజన్మ సంస్కారాలనే పెనుగాలులు నన్ను సమూలంగా కుదిపివేస్తున్నాయి. భీతితో దిక్కుతోచక మిమ్ము శరణువేడుతున్నాను. మీరు తప్ప ఇతఃపరమెరుగను.”
37. “వసంత ఋతువు సచరాచరసృష్టికోటికంతటికీ ఎలా మంచి చేస్తుందో అలాగే, కొందరు శాంతచిత్తులైన మహాత్ములు కారణం లేకుండానే ఇతరులకు మంచి చేస్తారు. భీకర సంసార సాగరాన్ని తాము తరించి, ఇతరులు తరించడానికి సహితం సహాయపడతారు.”
38. “ఇతరుల కష్టాలను తొలగించడానికి వారు స్వభావసిద్ధంగా, వారంతట వారే కదలివస్తారు. ఎలాగంటే, సూర్యరశ్మి వేడికి మలమల మాడిపోతున్న భూప్రపంచాన్ని, చంద్రుడు తనంతట తానుగా చల్లని కిరణాలతో సేదదీరుస్తాడు కదా! ఇది అందరికీ అనుభవైకవేద్యమే.”
39. “ప్రభూ! ఈ ప్రాపంచిక దావానలం నన్ను దహించివేస్తున్నది. బ్రహ్మానంద రసానుభవంతో నిండి పవిత్రములైన, మీ చల్లని అమృతవాక్కులను నాపై వర్షించి, నా తాపాన్ని ఉపశమించండి. మీ కటాక్షవీక్షణాలు క్షణమాత్రం ఎవ్వరిపై ప్రసరిస్తాయో వారు మోక్షసాధనకు అర్హులై మీ స్వకీయులవుతారు.”
40. చివరికి ఇలా వేడుకుంటాడు: “మహాత్మా! నేను ఈ సంసారసాగరాన్ని దాటే ఉపాయమెట్టిదో, నాకు ఏ గతి పట్టనున్నదో, అణుమాత్రమైనా నాకు అవగాహనకు వచ్చుట లేదు. నన్ను అనుగ్రహించి ఈ జన్మమృత్యుసంసారదుఃఖాన్ని తొలగించండి.”
41. సంసారదావానలంలో మగ్గిపోతూ ఈ విధంగా ప్రార్థించగా, గురువు తన కృపాదృష్టిని శిష్యునిపై ప్రసరించి, అభయమిస్తాడు.
42. అప్పుడు ప్రశాంతచిత్తుడు, గురువాక్య పరిపాలన చేయువాడు, మోక్షమునందు అధికమైన ఇచ్ఛగలవాడూ అయిన శిష్యునికి ఆ ఆచార్యుడు దయతో తత్త్వోపదేశం చేయును.
43. గురువు, “ఓ విద్వాంసుడా! భయపడకు! నీకు ఏ అపాయమూ లేదు. ఏ మార్గాన్ని అనుసరించి సనాతనులైన యతులు సంసారసాగరాన్ని తరించారో, ఆ మార్గాన్ని నేను నీకు ఉపదేశిస్తాను,” అని పలుకుతాడు.
44. ఈ సంసారసాగర తరణానికి చక్కని రాజమార్గం ఒకటి ఉన్నది. ఆ మార్గంలో పయనించే విధానాన్ని నీకు ఉపదేశిస్తాను.
45. వేదాంత వాక్యాలను విచారణ చేయడం ద్వారా పరబ్రహ్మాన్ని గురించిన అపరోక్షజ్ఞానం (సూటిగా అనుభూతి చెందడం ద్వారా పొందే జ్ఞానం) ఉదయిస్తుంది. ఆ జ్ఞానం సంసారదుఃఖాన్ని ఉపశమింపజేస్తుంది.
46. శ్రద్ధ, భక్తి, ధ్యానం, యోగం – వీటిని నిరంతరం అభ్యాసం చేసిన సాధకుడు అజ్ఞానం వలన కలిగిన శరీరబంధం నుండి విముక్తి పొంది, మోక్షప్రాప్తికి చేరువవుతాడు.
47. అజ్ఞానం వల్లనే నీవు జనన మరణ సంసారచక్రంలో పడి, శరీరంతో తాదాత్మ్యం చెంది, “నేనే పనిచేసే కర్తను, నేనే అనుభవించే భోక్తను ” అని అనుకుంటున్నావు. ఆత్మజ్ఞానం అనే అగ్ని వలన మాత్రమే ఈ అజ్ఞానం సమూలంగా దగ్ధమై, స్వస్వరూపజ్ఞానం కలుగుతుంది.
48. శిష్యుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు: “స్వామీ! నాకొక సందేహం కలుగుతున్నది. మీరు దయతో దానిని నివృత్తి చేయండి!”
49. “స్వామీ! బంధం అనగా ఏమి? అది ఎట్లు కలిగినది? అది ఎందుకు కొనసాగుతోంది? దానిని నుండి తప్పించుకోవడం ఎలా? ‘అనాత్మ’ అంటే ఏమిటి? ‘ఆత్మ’ అంటే ఏమిటి? ఈ రెంటికీ భేదం ఏమిటి? జీవాత్మ ఎవరు? పరమాత్మ ఎవరు? జీవాత్మ పరమాత్మను ఎలా తెలుసుకుంటాడు?”
50. దానికి గురువు ఈ విధంగా బదులిచ్చాడు. “శిష్యా! అజ్ఞానం వలన కలిగిన సంసారబంధం నుంచి విముక్తిని కోరుతున్న నీవు ధన్యుడవు. నీ వలన నీ వంశం మొత్తం తరిస్తుంది.” గురువు ఇంకా ఇలా తన జ్ఞానబోధను కొనసాగించాడు.
51. పితృదేవతల ఋణం శ్రాద్ధాది కర్మల వలన తీర్చుకొన వచ్చును. కానీ భవబంధ విముక్తికై ఎవరికి వారే పాటుపడవలెను.
52. తలమీద ఉన్న భారాన్ని ఇతరులు తొలగించగలుగుతారు. కానీ ఆకలి వేసినప్పుడు స్వయంగా భుజించినప్పుడు మాత్రమే ఆ క్షుద్బాధ తొలగిపోతుంది.
53. ఔషధం సేవనం, పథ్యం చక్కగా చేసిన రోగికి వ్యాధి ఉపశమిస్తుంది. కానీ ఇతరులెవరో ఔషధం సేవిస్తే రోగవిముక్తి కలుగదు కదా!
54. చంద్రుని స్వరూపం ఎటువంటిదో స్వయంగా చూచినప్పుడే తెలుస్తుంది గానీ, ఇతరుల వర్ణనల వలన తెలియదు కదా! అట్లే ఆత్మస్వరూపం స్వకీయమైన జ్ఞాననేత్రాలకు గోచరిస్తుంది కానీ ఆచార్యుల వివరణల వలన తెలియనేరదు.
55. ఆత్మజ్ఞానం వలననే అవిద్యాపాశాల నుండి విమోచనం కలుగుతుంది కానీ, జ్ఞానోదయం కానంతవరకూ శతకోటి జన్మలెత్తిననూ బంధవిముక్తి కాజాలదు.
56. హఠయోగ అభ్యాసం వలన కానీ, యాంత్రికంగా ప్రకృతిపురుష వివేచన వలన కానీ, అన్యమనస్కంగా ఆచరించే కర్మయోగం వలన కానీ మోక్షం కలుగదు. పరబ్రహ్మంతో మన ఐక్యతను అనుభూతిచెందినపుడే బంధమోచనమై మోక్షం సిద్ధిస్తుంది.
57. వీణ మొదలైన సాధనాల తంత్రులను చక్కగా వాయించుచూ చేసే గానాది సాధనలు ప్రజారంజనకు ఉపయోగపడతాయి కానీ, మోక్షసామ్రాజ్యాన్ని కొనితేలేవు.
58. పండితులు తమ వాక్చాతుర్యంతో, వివిధ అలంకార ప్రయోగాలతో శాస్త్రవ్యాఖ్యానాలను ఎన్ని చెప్పి పాండిత్య ప్రకర్షణ చేసినా, అవి భుక్తి కోసమే కానీ ముక్తి కోసం కాదు.
59. మనం పరమాత్మ కంటే వేరుకాదన్న పరమసత్యం గోచరం కానంతవరకూ తర్క–వ్యాకరణ–శాస్త్రపఠనం పూర్తిగా నిష్ఫలం, అనగా ప్రయోజనశూన్యం. ఆ పరమసత్యం అనుభూతి చెందాక ఆ అధ్యయనాలు మరింత నిష్ఫలం. (ఆరంభదశలలో శాస్త్రాధ్యయనంతో పాటు పరతత్త్వజ్ఞానాభ్యాసం కూడా చేయవలెను. దానితోపాటు వివేకవైరాగ్యాలు పెంపొందాలి. ఎందుకంటే వివేకవైరాగ్యాలు లేని శాస్త్రపాండిత్యం నిష్ఫలమైనది. అయితే మానవ జీవితగమ్యమైన జ్ఞానోదయం కలిగాక శాస్త్రములతో పనిలేదని అర్థమవుతుంది!)
60. వ్యాకరణాది శబ్దసముదాయాన్ని మహారణ్యంతో పోల్చవచ్చును. అటువంటి చోట చిక్కుపడినవారు దారీతెన్నూ తెలియకపోవటం వలనా, క్రూరజంతువుల భయం వలనా ఎలా మతి చలించినట్లు తయారవుతారో, శాస్త్రపరిశోధన వలన కూడా అలాగే తయారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శాస్త్రాలలోని ఒక్కొక్క శబ్దానికి అనేకమైన అర్థాలు, ఒక్కొక్క వాక్యానికి పెక్కు భావాలు ఉంటాయి. అందువలన అనేక సంశయాలు కలుగుతాయి. వాటి సందేశం ఇదమిత్థం అని నిశ్చయంగా తెలుసుకోలేము. అందువలన బుద్ధిమంతులైనవారు శాస్త్రప్రకర్షణలో సమయాన్ని వృథా చేయక సద్గురువును ఆశ్రయించి ఆత్మజ్ఞానప్రాప్తికి ప్రయత్నించవలెను.
61. అజ్ఞానం అనే సర్పం చేత కాటువేయబడ్డ వారికి బ్రహ్మజ్ఞానం అనే ఔషధం తప్ప వేరే గతిలేదు. వేదాధ్యయనం* కానీ, శాస్త్రపఠనం* కానీ, మంత్రోపాసన* కానీ, ఆయుర్వృద్ధి చేసే ఔషధాలు కానీ వారిని రక్షించేందుకు ఏ మాత్రం పనికిరావు. అనగా మామూలు పాముకాటుకు మణిమంత్రౌషధాల వలన విరుగుడు ఉండవచ్చునేమో కానీ, అజ్ఞానం వలన కలిగిన జన్మమృత్యురూప సంసారబంధం నశించుటకు బ్రహ్మజ్ఞానమే దివ్యౌషధం.
62. ఔషధం పేరును ఉచ్చరించినంత మాత్రాన రోగం నయం కాదు. మందును త్రాగినప్పుడే ఉపశమనం లభిస్తుంది. అలాగే బ్రహ్మసాక్షాత్కారం లభించినప్పుడే బంధవిముక్తుడు అవుతాడు.
63. మనం ఉన్న ఈ దృశ్యమానప్రపంచం పరమాత్మలో విలీనమై, ఐక్యం అవ్వడాన్ని అనుభూతి చెందకుండా, కేవలం ‘అహం బ్రహ్మాస్మి’ అని శబ్దోచ్చారణ చేయటం వలన ముక్తి లభించదు. ఈ పెట్టెలో ‘మణి ఉంది’, ‘మణి ఉంది’ అని అంటూవుంటే ఆ మణి చేజిక్కుతుందా? నాలుక చివర నుండి జపం చేయటం వలన మనుష్యులకు కలిగే ప్రయోజనం శూన్యం.
64. ఎవరైనా శత్రువులను నిశ్శేషంగా సంహరించి, భూమండలాధిపత్యం వహించినప్పుడే ‘రాజు’ అనిపించుకోగలడు కానీ ‘నేనే రాజును’, ‘నేనే రాజును’ అని చెప్పుకొనేవాడు ఎన్నటికీ ‘రాజు’ కాజాలడు. అనగా కామ–క్రోధ–లోభ–మద–మాత్సర్యాలనే శత్రువులను ఓడించి, మనస్సు అనే సామ్రాజ్యానికి అధిపతి అయి, తానే పరబ్రహ్మమని తెలుసుకున్నవాడే ‘బ్రహ్మవేత్త’ అనిపించుకొంటాడు కానీ, ‘నేనే బ్రహ్మని’, ‘నేనే బ్రహ్మని’ అని చెప్పుకొనేవాడు మాత్రం కాదు.
65. భూమిలో ఒక నిధి ఎక్కడో పాతిపెట్టబడి ఉందని తెలిసినప్పుడు, ఆ చోటును రూఢిగా చెప్పగల ఆప్తుని సహాయంతో, అక్కడ తవ్వి, మట్టినీ రాళ్ళనూ తొలగించి, దానిని సొంతం చేసుకోవాలి. ‘త్రవ్వాలి’, ‘త్రవ్వాలి’ అనుకొంటూ కూర్చుంటే, అది లభించదు కదా! అదే విధంగా ఆత్మజ్ఞానం లభించాలంటే, సద్గురువు ఉపదేశించిన మార్గంలో; నిత్య–అనిత్య వివేచనతో; మననం, నిధిధ్యాసనం మొదలైన ప్రక్రియలతో సాధన చేసి; మాయ, అహంకారం మొదలైనవాటి క్రింద కప్పబడిపోయిన ఆత్మతత్త్వాన్ని వెలికితీయాలి.
66. రోగి స్వయంగా ఔషధాన్ని సేవించి రోగవిముక్తి పొందినట్లు, సంసారబంధ నివృత్తి కోరే వివేకి అయిన సాధకుడు శ్రవణమననాది సకలోపాయాల సహాయంతో, సర్వవిధాలా స్వప్రయత్నం చేసి ఆధ్యాత్మిక తాపత్రయాన్ని పోగొట్టుకొనవలెను.
67. శిష్యా! నీవు అడిగిన ప్రశ్న ఉత్తమోత్తమైనది. శాస్త్రపారంగతులచే సూత్రప్రాయమూ, నిగూఢార్థమూ అని కొనియాడబడినది. ముముక్షువులు తప్పక తెలుసుకోదగినది.
68. ఓ విద్వాంసుడా! నేను చెప్పబోయే విషయాన్ని సావధానంగా విను! ఈ శ్రవణం వలన అచిరకాలంలోనే భవబంధవిముక్తి కలుగుతుంది.
69. మోక్షహేతువులను ముందు చెప్పుచున్నాను. అవి 1. అశాశ్వతమైన వస్తువుల పట్ల పూర్తి వైరాగ్యం, 2. శమం, 3. దమం, 4. తితిక్ష, 5. సకామకర్మల పరిత్యాగం (ఫలాపేక్షను వదలిపెట్టడం).(21, 22, 23, 24 శ్లోకములలో వైరాగ్య, శమ, దమ, తితిక్షలు వివరింపబడినవి.)
70.తర్వాత, 6. గురుముఖతః వేదాంతవాక్యశ్రవణం, 7. మననం (విన్నదానిని సరియైన పద్ధతిలో పలుమార్లు విచారించుట), 8. నిదిధ్యాసనం (తెంపులేకుండా దీర్ఘకాలం ఆత్మతత్త్వంపై ఏకాగ్రమైన ధ్యానం) 9. నిర్వికల్పస్థితి. ఈ నిర్వికల్పస్థితి ద్వారా నిర్వాణసుఖం కలుగుతుంది. (ఈ స్థితిలో మనిషి ‘నేను’ అని అనుకునే దానికీ, తన చుట్టూ చూసే విషయప్రపంచానికీ, పరమాత్మకూ మధ్య ఉన్న విభేదం తొలగిపోతుంది. మానసిక వ్యాపారాలన్నీ స్తంభించి సాధకుడు ఆత్మైక్యాన్ని అనుభూతి చెందుతాడు. ఇది ఎంతో అరుదుగా లభించే, మాటలకందని అత్యున్నతస్థితి – వర్ణనకు అతీతమైన ఆనందం – పరిశుద్ధచైతన్యం).
71. నీవు తప్పకుండా తెలుసుకోవలసిన ఆత్మానాత్మ వివేచన (నిత్యానిత్య విచక్షణ లేదా ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో అనే వివేకము) గూర్చి పూర్తిగా చెప్పదలుచుకున్నాను. చక్కగా విని మననం చేయుము.
72. ఈ స్థూలశరీరం మజ్జ, ఎముకలు, కొవ్వు, మాంసం, రక్తం, చర్మం, త్వక్కు అనెడి సప్తధాతువులతో చేయబడింది. దీనికి పాదములు, తొడలు, రొమ్ము, భుజములు, వీపు, శిరస్సు అనే అవయవాలు ఉన్నాయి.
73. నేను, నాది అని ప్రసిద్ధి చెందిన ఈ మాయాకల్పిత దేహాన్ని ‘స్థూలశరీరం’ అని పండితులంటారు. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే సూక్ష్మ (పంచ)భూతాలచే ఇది ఏర్పడింది.
74. సూక్ష్మమైన ఈ పంచభూతాలు ఒకదానితో మరొకటి కలిసి స్థూలంగా మారి, చివరికి స్థూలశరీరాన్ని ఏర్పరుస్తాయి. దీనిని పంచీకరణమంటారు. వీటి అంశలు శబ్ద–స్పర్శ–రూప– రస–గంధాలుగా పంచేంద్రియాలకు వివిధ అనుభవాలను కలిగిస్తున్నాయి. జీవుడు ఈ విధంగా సుఖదుఃఖాదులను అనుభవిస్తున్నాడు.
75. ఈ సుఖదుఃఖాలనిచ్చే విషయపంచకం (అనగా ఇంద్రియార్థాల మీద లేదా ఇంద్రియాలను ఆకర్షించే శబ్ద–స్పర్శ–రూప–రస–గంధాల) మీద అనురాగం వలన ఎడతెగని సంసారబంధంలో చిక్కుకున్న మూఢులు వారివారి కర్మలను బట్టి మళ్ళీమళ్ళీ జన్మలెత్తుతూ, ఉచ్చ–నీచ గతుల పాలవుతూ ఉంటారు.
76. శ్రవణేంద్రియం (బోయవాని వేణుగానం) చేత లేడి, సర్శేంద్రియం (ఆడు ఏనుగు స్పర్శ) చేత ఏనుగు, నయనేంద్రియం (మంట) చేత మిడుత, రసనేంద్రియం (ఎర యొక్క రుచి) చేత చేప, ఘ్రాణేంద్రియం (చంపకపుష్ప పరిమళం) చేత తుమ్మెద ప్రేరేపింపబడి, బంధాలలో చిక్కుకుని ప్రాణాలను కోల్పోవడం విదితమే. ఇక ఈ ఐదు ఇంద్రియాలకూ దాసుడైన మనిషి యొక్క గతి ఎట్లుండునో కదా? జీవులకు గల ఈ స్వాభావిక లక్షణాన్ని (ఆకర్షింపబడే స్వభావాన్ని) ‘గుణం’ అని కూడా అంటారు.
77. ఇంద్రియార్థాల (అంటే ప్రాపంచిక విషయాలు పెట్టే ప్రలోభాల) ఆకర్షణలు పాముకాటు కంటే విషపూరితాలు. పాము యొక్క విషం అది కాటువేస్తేనే పనిచేస్తుంది. కానీ ఈ శబ్దాది ఇంద్రియాకర్షణలను కన్నెత్తి చూస్తే చాలు, కాటు వేస్తాయి. అంటే వాటితో అత్యల్పమైన సంపర్కం చాలు, నాశనం కొనితెస్తాయి.
78. విషయాపేక్ష (ఇంద్రియాకర్షణలు) అనే తెంచుకోలేని బంధం నుండి విముక్తి పొందిన వాడే, మోక్షానికి అర్హుడు. విషయలోలుడు షట్శాస్త్ర పండితుడైనా వానికి విముక్తి లభించదు.
79. మందవైరాగ్యం కలవారు సంసార భవసాగరాన్ని దాటడానికి ప్రయత్నిస్తే, ‘కోరిక’ అనే మొసలి వారిని కంఠం పట్టుకుని ముంచివేస్తుంది. కొందరు సంసార జీవితంలోని సమస్యల వలనో, ఉదరపోషణ జరుగకో, కీర్తిప్రతిష్ఠల కొరకో, సన్న్యాసం తీసుకుని, భవసాగరాన్ని తరించాలని ప్రయత్నిస్తుంటారు. అటువంటి తీవ్రవైరాగ్యం లేనివారిని ‘ఆశాపాశాలు’ విడిచిపెట్టవు. అంటే సంపూర్ణ వైరాగ్యం కలవారు మాత్రమే భవసాగరాన్ని దాటగలరని భావం.
80. పరిపూర్ణ వైరాగ్యం అనే ఖడ్గంతో విషయవాసనలనే మకరాన్ని ఎవరైతే నరికివేయగలరో వారే సంసార సాగరాన్ని దాటగలరు.
81. ఎవరైతే విషయసుఖాలను అనుభవిస్తూ కూడా ముక్తి మార్గంలో పయనించగలమని మందబుద్ధితో అనుకుంటూ ఉంటారో వారు అడుగడుగునా విపత్తులలో చిక్కుకుని, చివరికి మృత్యువాత పడతారు. ఎవరైతే తమ మేలుకోరే గురువు యొక్క ఉపదేశాలను చక్కగా అనుష్ఠిస్తూ, స్వయంగా వివేకవైరాగ్యాలు కలిగివుండి, విషయవాసనలను సమూలంగా నాశనం చేస్తారో, వారు తప్పక ఫలసిద్ధి పొందుతారు.
82. శిష్యా! సర్వానర్థాలనూ తొలగించుకుని, నిత్యసుఖదాయకమైన మోక్షాన్ని నీవు నిజంగా పొందాలనుకుంటే, విషయభోగాలను విషంలాగా విసర్జించు. అమృతసమానమైన తోషం, దయ, క్షమ, ఆర్జవం, ప్రశాంతి అనే గుణాలను పెంపొందించుకో!
83. అనాది నుండీ ఉన్న అజ్ఞానం వలన మనకు కర్తృత్వభోక్తృత్వ బంధం (అంటే ‘నేను చేస్తున్నాను’, ‘నేను అనుభవిస్తున్నాను’ అనే భావన) ఏర్పడింది. “ఈ దేహం ఎట్టిది ? నేను ఎవరిని? నాకూ ఈ దేహానికీ గల సంబంధం ఏమిటి” అనే విచారణ చేస్తూ, బంధవిముక్తి కోసం ప్రయత్నించకుండా, ఆ దేహాన్నే తానుగా భావిస్తూ దాని పోషణను గురించిన ఆలోచనలలోనే నిమగ్నమై ఉండేవాడు తనను తానే చంపుకునే ఆత్మఘాతకుడు.
84. శరీరపోషణ పరాయణత్వమే తన నిత్యకృత్యంగా జీవిస్తూ, మరొక ప్రక్క మందవైరాగ్యంతో ఆత్మసాక్షాత్కారాన్ని కోరేవాడు, మొసలిని తెప్పగా చేసుకుని నది దాటాలని ప్రయత్నించే మూఢుని వంటివాడు.
85. దేహాదుల (శరీరం, భార్య, పుత్త్రులు మొదలైనవాటి) మీద మమకారమే మోహం. ఇది ముముక్షువుకు మృత్యుసమానం. ఈ మోహాన్ని ఎవరు జయిస్తారో వారే మోక్షానికి అర్హులు.
86. ఈ మహామృత్యువైన మోహాన్ని జయించినవారు మాత్రమే మహోన్నతమైన విష్ణుపదాన్ని అనగా ఆత్మైక్యస్థితిని చేరగలరు.
87. చర్మం, మాంసం, రక్తం, నరాలు, కొవ్వు, మజ్జ, ఎముకలు, మూత్రం, పురీషాలతో నిండిన ఈ స్థూలశరీరం మిక్కిలి హేయమైనది.
88. స్థూలసూక్ష్మభూతాల పంచీకరణ వలనా, పూర్వజన్మలలోని పుణ్యపాపాల వలనా ఏర్పడిన ఈ శరీరం జీవాత్మకు వివిధ అనుభవాలను చవిచూపించే పరికరం.
89. జీవాత్మ మేలుకుని ఉన్నప్పుడు, తాను శరీరం కాకపోయినా, తానే ఈ శరీరాన్ని అనుకుంటూ రకరకాల పుష్పమాల–చందన– కామోపభోగాలను అనుభవిస్తూ ఉంటుంది. అందువలన స్థూలదేహం జాగ్రదావస్థలో చురుకుగా పనిచేస్తూ ఉంటుంది.
90. గృహస్థుడు ఒక గృహంలో నివసిస్తూ, బాహ్యసంసార కర్మలను ఎలా నిర్వర్తిస్తుంటాడో, అలాగే జీవాత్మ ఈ శరీరాన్ని ఆశ్రయించి, చూచుట, వినుట, చేయుట, సుఖీంచుట మొదలగు ఇంద్రియ వ్యాపారాలను నిర్వహిస్తున్నది.
91. జనన మరణాలు, బాల్య యౌవన కౌమార వార్ధక్య అవస్థలు, ఒళ్ళు చేయడం, చిక్కడం మొదలైన స్థితులు, నానావిధరోగానుభవాలు, వర్ణాశ్రమ నియమాలు, రాజపూజ్య అవమానాలు స్థూలశరీరానికి మాత్రమే చెందిన ధర్మాలు.
92. చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనే అవయవాలు క్రమంగా శబ్దం, స్పర్శ, దృశ్యం, రుచి, వాసనల యొక్క జ్ఞానాన్ని అందిస్తాయి. కాబట్టి అవి జ్ఞానేంద్రియాలని పిలువబడుతున్నాయి. పనిచేసే అవయవాలైన నోరు – భాషణం, చేతులు – ఇచ్చిపుచ్చుకోవడం, కాళ్ళు – గమనం, పాయువు – విసర్జనం, ఉపస్థ – కామోపశమనం అనే కర్మలను నెరవేరుస్తున్నాయి కాబట్టి, కర్మేంద్రియాలని చెప్పబడుతున్నాయి. వీటినే జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం అని కూడా పిలుస్తారు.
93-94. ఈ దేహం లోపల ఉండి నడిపించే అవయవాన్ని అంతః కరణం అని అంటారు. దీనికి నాలుగు విధులున్నాయి. ఆ విధులనుబట్టి దానిని నాలుగు పేర్లతో పిలుస్తారు. అవి 1. మనస్సు = బాహ్యప్రపంచంలోని వివిధ విషయాలను గ్రహిస్తూ, పరిపరి విధాల పోవునది. 2. బుద్ధి = సత్య–అసత్య నిర్ధారణ, యుక్త–అయుక్త విచక్షణ చేయునది. 3. అహంకారం = ‘నేను–నాది’ అనే భావాన్ని కలిగించి శరీరంతో తాదాత్మ్యం చేయునది. 4. చిత్తం = పూర్వ జన్మలలో చేసిన వివిధ కర్మల వలన కలిగిన సంస్కారాల గిడ్డంగి. దీనివలన మనకు ఇష్టానిష్టాలు కలుగుతాయి. ఈ నాల్గింటినీ అంతఃకరణ చతుష్టయం అంటారు.
95. నీరు అది ఉండే చోటునుబట్టి రకరకాల రుచులను కలిగివుంటుంది. సువర్ణం వివిధ ఆభరణాల రూపంలో ఉన్నప్పుడు ప్రత్యేక నామాలను కలిగివుండటం తెలిసినదే. అలాగే, శరీరంలోని వాయువును అది చేసే పనులను బట్టి వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
96. కర్మేంద్రియ పంచకం, జ్ఞానేంద్రియ పంచకం, ప్రాణ పంచకం, అంతఃకరణ చతుష్టయం, అజ్ఞానం, కామం, కర్మ – ఈ ఎనిమిదింటినీ ‘పుర్యష్టకం’ (పురి+అష్టకం = ‘అష్ట నగరాలు’) అంటారు. ఇదే సూక్ష్మశరీరం.
97. లింగశరీరం అని కూడా పిలువబడే ఈ సూక్ష్మశరీరం పంచ భూతాల యొక్క పంచీకరణకు పూర్వమే ఏర్పడుతుంది. పూర్వ సంస్కారాల యొక్క ముద్రలు కలిగిన ఈ శరీరం, జీవాత్మ యొక్క పూర్వకర్మల ఫలితమైన సుఖదుఃఖాలను అనుభవించేటట్లు చేస్తుంది. అనాదిగా ఉన్న అజ్ఞానం వలననే జీవాత్మ బ్రహ్మమయమైన తన స్వస్వరూపాన్ని తెలుసుకోలేక సుఖదుఃఖప్రవాహంలో సాగిపోతూ వుంటుంది.
98-99. జీవాత్మ యొక్క సూక్ష్మశరీరావస్థను స్వప్నావస్థ అని కూడా అంటారు. ఈ స్థితిలో అంతరంగుడైన ప్రత్యగాత్మ (లేదా పరమాత్మ) ఆ జీవి యొక్క బుద్ధిచేత ఆవరించబడి, స్వప్రకాశంతో భాసిస్తూ ఉంటాడు. జాగ్రదవస్థలో చేసిన వివిధకర్మల వలన జీవాత్మలోని మనస్సు మీద సంస్కారాలనే అనేక ముద్రలు పడుతూ వుంటాయి. కానీ ఈ ముద్రలు ఏవీ కూడా ఆ పరమాత్మనుకంటవు. బంధరహితమైన ఆ ప్రత్యగాత్మ సాక్షీమాత్రమై ఏ పరిమితులూ లేక వెలుగొందుతూ ఉంటాడు.
100. వడ్రంగి పనిలో బాడిసె మొదలైన పనిముట్లు ఉపయోగిస్తాడు. కానీ వాటితో అనుబంధం పెంచుకోడు. అదే విధంగా సూక్ష్మశరీరాలు చిదాత్మ (లేదా పరమాత్మ)కు పనిముట్లు మాత్రమే. వీటితో అసంగత్వం (అనగా ఏ బంధం లేకపోవడం) వలన ఆ పరమాత్మ అసంగుడు.
101. బలంగా, చక్కగా పనిచేసే అవయవాలు కానీ, అంధత్వం, ఇతర దృష్టిదోషాలు, బధిరత్వం, మూకత్వం మొదలైన ధర్మాలు కానీ శరీరానికి సంబంధించినవి మాత్రమే. అంతరాత్మకు వీటితో ఏ సంబంధమూ లేదు. ఇంద్రియ వ్యాపారాలతో (పనులతో) సంబంధం లేకపోవటం వలన అంతరాత్మను నిస్సంగుడు అని అంటారు.
102. ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసలు, ఆవలింతలు, స్పందించుట, నిష్క్రమించుట మొదలైన వ్యాపారాలు ప్రాణాది పంచవాయువులకు సంబంధించినవి. అలాగే ఆకలిదప్పులు ప్రాణికి మాత్రమే చెందిన సహజధర్మాలు.
103. జీవిలోని అంతఃకరణం నేత్రాది వివిధ అంగాలలో నెలకొని, వాటితో తాదాత్మ్యం చెందుతూ, అంతరాత్మ నుంచి లభించిన ప్రకాశంతో భాసిస్తూ ఉంటుంది.
104. జీవిలోని అహంకారం శరీరంతో తాదాత్మ్యం చెందుతూ కర్తృత్వ, భోక్తృత్వ అనుభూతులను పొందుతూ ఉంటుంది. అలాగే సత్త్వరజస్తమో గుణాలతో కలిసి జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలలో మెలగుతూ ఉంటుంది.
105. అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను సుఖంగా ఉన్నాననీ, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అంతా దుః ఖమంగా ఉందనీ అనుకుంటూ ఉంటాడు. ఈ సుఖదుఃఖాలు అహంకారానికి సంబంధించినవే కానీ ఆత్మకు వీటితో ఏ మాత్రం ప్రమేయం లేదు.
106. ఇంద్రియ విషయాలలో ఆత్మ యొక్క అంశ ఉండటం వలననే వాటిమీద ఇష్టం కలుగుతున్నది. ఆ అంశ వాటిలో లేకపోతే అవి ఏ మాత్రం ఇష్టం కలిగించలేవు. నిజానికి ప్రేమస్వరూపమైన ఆత్మ మాత్రమే అందరికీ ప్రియతమమైనది. ఆ విధంగా చూసినప్పుడు ఆత్మ సదా ఆనందంలో మునిగి ఉంటుంది. దానికి దుఃఖమనేదే ఉండదు.
107. గాఢనిద్రలో ఇంద్రియవ్యాపారాలు పూర్తిగా ఆగిపోతాయి. ఆ నిద్రలో నుంచి మేల్కొనినవాడు “నిదురలో నాకేమీ తెలియలేదు. హాయిగా నిదురించితిని” అని పలుకుతాడు. ఈ అనుభవం వలన సుషుప్తి అవస్థలో నిర్విషయానందం (ఇంద్రియవిషయాల వలన పొందే ఆనందం కంటే ఎంతో ఉన్నతమైన ఆత్మానందం) ఉందని నిశ్చయించవచ్చును. శ్రుతులు, పరంపరాప్రాప్తమైన జ్ఞానం కూడా దీనిని సమర్థిస్తాయి.
108. ‘అవ్యక్తం’, ‘అవిద్య’, ‘మూలప్రకృతి’ అనే పేర్లతో పిలువబడే పరమేశ్వరశక్తికి లేదా మాయకు మొదలు అనేది లేదు. సత్త్వరజస్తమో గుణాలు సమపాళ్ళలో సమ్మిళితమగుటచేత ఈ మాయ రూపొందింది. ఆ గుణాల వలన కలిగే వివిధ పరిణామాలకు ఆ మాయ అతీతమైనది. ఆ పరిణామాలను సూక్ష్మబుద్ధితో విశ్లేషించినపుడు మాత్రమే ఆ మాయను గూర్చి ఊహించగలము. ఈ మూడు గుణాలు సమతౌల్యతలో ఉన్నప్పుడు కంటికి కనిపించే ఈ చరాచర సృష్టికి ఉనికి లేదు. ఆ సమతౌల్యతలో తేడా వచ్చినప్పుడు సృష్టి ప్రారంభం అవుతుంది.
109. ఈ మాయస్వరూపాన్ని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టం. అది ‘ఉంది’, ‘లేదు’, ‘ఆ రెండూ కూడా’ ! మరొక విధంగా చెప్పాలంటే ‘ఉంది అనుకుంటే ఉంది’, ‘లేదు అనుకుంటే లేదు’ ! ఆ మాయ అన్నింటా ఒకే విధంగా ఉంటుందనీ లేదా వేర్వేరు విధాలుగా ఉంటుందనీ కూడా అనలేము. విభిన్నరూపాలలో ఉందని కానీ, అభిన్నంగా ఒకే రూపంలో ఉందని కానీ చెప్పలేము. అవాఙ్మానసగోచరమైన ఆ మాయ మహాద్భుతమైనది – వాక్కులకు అతీతమైనది – అనిర్వచనీయమైనది.
110. త్రాడును చూసి పాము అనుకుని భయపడినప్పుడు; అది త్రాడు మాత్రమేననీ, పాము కాదనీ తెలియజెప్పే వివేకం ఆ భ్రాంతిని పూర్తిగా తొలగించగలదు. అలాగే అద్వితీయ బ్రహ్మ పదార్థాన్ని అపరోక్షంగా అనుభూతి చెందినప్పుడు మాత్రమే మాయ నశిస్తుంది. తెలుపు, ఎరుపు, నలుపు నూలుదారాలతో ఒక త్రాడు నేయబడినట్లు, మాయ సత్త్వరజస్తమో గుణాల మిశ్రమంతో చేయబడింది. ఆ త్రిగుణాల కార్యాలను అనుసరించి మాయ స్వభావం మారుతూ ఉంటుంది. ప్రసన్నచిత్తంతో ఉన్నప్పుడు సత్త్వగుణం, క్రోధాదులు కలిగినప్పుడు రజోగుణం, నిద్రాదుల స్థితిలో ఉన్నప్పుడు తమోగుణం మనలో ప్రధానంగా ఉన్నాయని చెప్పబడును.
111. ఈ త్రిగుణాలలో క్రియారూపాన్ని దాల్చేది రజోగుణం. దీనిని మాయ యొక్క ‘విక్షేపశక్తి’ అంటారు. దీనినుంచే సకలసృష్టి ఉద్భవించింది. మనోవికారాలైన రాగద్వేషాలు, సుఖదుఃఖాలు ఈ విక్షేపశక్తి యొక్క కార్యాలు.
112. కామం, క్రోధం, లోభం, కపటం, అసూయ, గర్వం, ఈర్ష్య, పగ మొదలైన భయానక ప్రవృత్తులు రజోగుణం యొక్క ధర్మాలు. ఈ గుణానికి వశుడైన మనిషి ప్రాపంచిక బంధాలలో చిక్కుకుంటాడు.
113. వస్తువు యొక్క యథార్థరూపాన్ని కప్పివేసి, వేరే విధంగా అగుపడేటట్లు చేసే శక్తి తమోగుణానిది. దీనిని ‘ఆవృతి’ లేదా ‘ఆవరణశక్తి’ అని కూడా అంటారు. ఇది జీవాత్మను జననమరణ సంసారచక్రంలో పడవేసి, విక్షేపశక్తి (రజోగుణం) యొక్క కామక్రోధాదుల ప్రవాహంలో కొట్టుకుపోవడానికి కారణభూతం అవుతున్నది.
114. ఎంతటి పండితుడైనా, ఎటువంటి ప్రజ్ఞావంతుడైనా, ఎంతో సూక్ష్మదృష్టి కలిగిన చతురుడైనా తమోగుణం యొక్క ఆవరణ శక్తి చేత కప్పబడి, స్వస్వరూపాన్ని తెలుసుకోలేక దేహమే తానని నమ్మి ప్రవర్తిస్తూ ఉంటాడు. శ్రుతులు, స్మృతులు, అనుభవాలు – వీటన్నింటి చేత పలుమార్లు విస్పష్టంగా బోధింపబడినా ఆ భ్రాంతిని పోగొట్టుకోలేడు. ఈ ఆవృతి ఎంత ప్రబలమైనదో కదా!
115. సత్యాసత్యాలను అర్థం చేసుకోలేక పోవడం లేదా తప్పుగా అర్థం చేసుకోవడం, ఆత్మ యందు విశ్వాసం లేకపోవడం ఆవరణ శక్తి (తమోగుణం) వలన కలుగుతాయి. ఈ ఆవరణ శక్తి సత్య విషయాలను కప్పిపుచ్చగా, విక్షేప శక్తి (రజోగుణం) అసత్య విషయాల యందు మోహం కలిగించి సంసార దుఃఖంలో పడవేస్తూ ఉంటుంది.
116. అవివేకం, బద్ధకం, జడత్వం, నిద్ర, అజాగ్రత, మూర్ఖత్వం మొదలైనవి అన్నీ తామసిక లక్షణాలు. ఈ గుణాలు కలవానికి జ్ఞానప్రాప్తి అసంభవం. అట్టివాడు నిద్రించేవాని వలె లేదా స్తంభం వలె కదలకమెదలక ఉండును.
117. శుద్ధజలంలో ఒకటి రెండు నలకలు ఉంటే, ఆ నీటిని సులభంగా త్రాగేందుకు వీలుగా చేయవచ్చును. అలాగే సత్త్వగుణంలో స్వల్పంగా రజస్తమోగుణాలు మిళితమైవున్నప్పుడు జీవాత్మ పరమాత్మ వైపు పయనించగలదు. సూర్యబింబం అఖీలజగత్తునూ ప్రకాశింపజేస్తున్నట్లు, అటువంటి సత్త్వగుణ ప్రధానమైన బుద్ధిలో ఆత్మ ప్రతిఫలించి అజ్ఞానపు చీకట్లను తొలగించును.
118. ముందు శ్లోకంలో చెప్పబడిన సత్త్వగుణం యొక్క లక్షణాలు: అహంకారం, గర్వం లేశమాత్రమైనా లేకపోవటం; యమ నియమాలను పాటించటం; శ్రద్ధ, భక్తి, ముముక్షుత్వం, అహింస, సత్యవ్రతం, అక్రోధం (కోపం లేకపోవటం) మొదలైన దైవీ సంపత్తిని కలిగివుండడం; అనిత్యమైన దేహేంద్రియాలపై విముఖత.
119. రజస్తమో గుణాలు ఏమాత్రం మిళితం కాని శుద్ధసత్త్వం యొక్క లక్షణాలు: చిరునవ్వు మోము, తాను ఆత్మస్వరూపమని అర్థం చేసుకున్న ఆత్మానుభూతి, పరమ ప్రశాంతత, నిత్య సంతోషం, ఆత్మానుభూతి వలన కలిగిన ప్రహర్షం లేదా పారవశ్యం, ఆత్మ యందు అనన్యభక్తి. వీటిని కలిగిన జీవాత్మ అంతులేని అపరిమితానందాన్ని అనుభవించును.
120. సత్త్వరజస్తమో గుణాల యొక్క మిళితాన్నే ‘అవ్యక్తం’ అంటారు. ఇది ఆత్మ శరీరాన్ని దాల్చటానికి లేదా జీవాత్మగా మారటానికి కారణం అవుతున్నది. జీవాత్మకు సుషుప్తి (గాఢనిద్ర) అనే ప్రత్యేకమైన అవస్థలో శరీరస్పృహ ఏమాత్రం ఉండదు. అజ్ఞానం ఆవరించటం వలన ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆగిపోతాయి. కానీ ఇది సమాధి స్థితికి పూర్తిగా వ్యతిరేకమైనది. సుషుప్తిలో పరబ్రహ్మం యొక్క ఎరుకే ఉండదు. కానీ సమాధిస్థితిలో ఇంద్రియవ్యాపారాలన్నీ పరబ్రహ్మంలో లీనమయిపోతాయి.
121. సుషుప్తి అనే అవస్థలో ఇంద్రియజనిత జ్ఞానం, నేను అనే అహంకారం మొదలైన శరీరధర్మాలన్నీ నిద్రాణస్థితిలో ఉండి, స్పృహ ఉండదు. బుద్ధి బీజరూపంలో అణిగి ఉంటుంది. అందువలన గాఢనిద్ర పోయిన మనిషి, “నాకేమీ తెలియలేదు, చక్కగా నిద్రించాను!” అని చెప్పడం లోకానుభవమే.
122. శరీరం, వివిధ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, అహంకారం, సుఖదుఃఖాలు, రాగద్వేషాలు, పంచభూతాలు, చరాచర విశ్వం మొత్తం, త్రిగుణాల కలయిక అయిన అవ్యక్తం – ఇవన్నీ కూడా అనాత్మ (అనగా ఆత్మకు సంబంధించని) వస్తువులేనని గ్రహించాలి.
123. విశ్వభావరాశి (సృష్టి యొక్క మేధస్సు) లేదా మహత్తు మొదలుకొని స్థూలశరీరం దాకా ప్రతిదీ మాయ యొక్క ప్రభావమే. ఎండమావులలో నీరు లేకపోయినా నీరు ఉన్నట్లు గోచరిస్తుందో అలాగే మాయాకల్పిత జగత్తు మిథ్య అయినా నిజంలాగా కనిపిస్తుంది.
124. ఇప్పుడు పరమాత్మ (అంతరాత్మ లేదా ఆత్మ) యొక్క నిజస్వరూపాన్ని గురించి నీకు చెప్పబోతున్నాను. దీన్ని ఎరిగిన నరుడు బంధవిముక్తుడై మోక్షాన్ని పొందుతాడు.
125. ‘నేను’ అన్న అహంభావనను మనకు కలిగిస్తూ; జాగ్రత, స్వప్న, సుషుప్తి అవస్థాత్రయానికి సాక్షీమాత్రమై; పంచకోశా లకుక్విభిన్నమైన సర్వస్వతంత్ర వస్తువు (ఆత్మ) ఒకటి కలదు.
126. ఆ ఆత్మకు అవస్థాత్రయంలో జరిగే ప్రతి విషయం, బుద్ధి వృత్తులు చేసే వివిధ కార్యాలు (అనగా బుద్ధి వలన కలిగే మంచి, చెడుభావాలు) పూర్తిగా తెలియును. ఆ ఆత్మయే మనం ‘నేను’ అనుకునే అహంకారానికి పూర్వరంగం అనగా మూలం.
127. ఆ ఆత్మ సర్వాన్నీ స్వయంగా గమనిస్తూ ఉంటుంది. కానీ ఆ ఆత్మను ఎవరూ చూడలేరు. బుద్ధి మొదలైన సకల జడ పదార్థాలకు చేతనత్వాన్ని కలిగించేది ఆ ఆత్మయే. స్వయంప్రకాశకమైన ఆ ఆత్మకు అవేవీ చేతనత్వాన్ని కలిగించలేవు.
128. ఆ ఆత్మ ఈ విశ్వాన్ని వ్యాపించి ఉంది. ఆ ఆత్మను ఆవరించగలిగిన మరొక వస్తువు లేనేలేదు. జగత్తులోని మిగిలిన వస్తువులన్నీ ఆ ఆత్మ వలననే భాసిస్తున్నాయి కానీ దానిని భాసింపజేసేది మరొకటి లేదు.
129. కేవలం, ఆ ఆత్మ సన్నిధానం వలన, ఆత్మచేత ప్రేరణ పొంది శరీరం, వివిధ అంగాలు, మనస్సు, బుద్ధి తమతమ వ్యాపారాలను సేవకులలాగా నిర్వహిస్తున్నాయి.
130. వెలుతురులో రకరకాల కుండల భౌతిక స్వరూపాలను గుర్తించగలిగినట్లు, అహంకారం నుండి దేహందాకా ఉన్న వివిధ ఇంద్రియాలు, సుఖదుఃఖాదుల యొక్క నిజస్వరూపాలను ఆ ఆత్మ యొక్క ప్రకాశం వలన తెలుసుకోవచ్చును. ఎందుకంటే పరమజ్ఞానం యొక్క సారం ఆత్మయే.
131. ఈ ఆత్మ నిరంతర అఖండ సుఖానుభవ స్వరూపుడు. అనాది నుండీ ఉంటూ ఏ మార్పులూ లేని శాశ్వతుడు. వివిధ మనోవ్యాపారాల ద్వారా వ్యక్తమవుతూ, ఇంద్రియాలనూ, ప్రాణాలనూ నియంత్రిస్తున్నాడు.
132. ఆకాశంలో సూర్యుడు తన తేజస్సుతో ప్రకాశిస్తూ, స్థావరజంగమరూప సకల విశ్వాన్నీ ప్రకాశింపజేస్తున్నట్లు, ప్రత్యగాత్మ సత్త్వగుణంతో నిండిన బుద్ధి యొక్క అంతరాళంలో అవ్యక్తరూపంలో ఉండి మనోహరమైన భాసంతో వెలుగొందుతూ ఉంటుంది.(ఈ శ్లోకంలో ఆత్మ కోసం ఎక్కడ వెతకాలో సూచింపబడింది. ఆరోహణ క్రమంలో ఈ విధంగా నిశితంగా విచారించాలి. స్థూల శరీరం – దాని అంతఃకరణం మనస్సు – దానికి మార్గదర్శనం చేసే బుద్ధి – దానిని ఆవరించివుండి అవ్యక్తం అని పిలువబడే కారణశరీరం – ఆ పైన వీటన్నింటికీ అతీతమైన ఆత్మ.)
133. మనస్సు యొక్క, అహంకారం యొక్క పోకడలను గమనిస్తూ; శరీరం, దాని అంగాలు, వివిధ ప్రాణాల యొక్క వ్యవహారాలను ఆత్మ నడిపిస్తూ ఉంటుంది. ఒక కొడవలిని ఎర్రగా కాల్చినపుడు, ఆ కొడవలి రూపంలో అగ్ని కనిపించినా, నిజానికి అగ్నికి రూపం లేదు. వస్తువులు కమ్మరి దెబ్బలకు రూపాంతరం చెందుతాయి కానీ, వాటి రూపంలో కనిపించే అగ్నిలో ఏ మార్పూ రాదు. అదే విధంగా ఆత్మ తన సమక్షంలో జరిగే వివిధ క్రియలను సాక్షీమాత్రుడై, అసంగుడై నడిపిస్తూ ఉంటాడు.
134. ఆత్మకు జననం, మరణం, ఎదుగుదల, క్షీణించుట, మార్పు చెందుట మొదలైనవి లేవు. ఒక కుండ తెరిచివున్నప్పుడు లోపలా బయటా ఆకాశంతో నిండి ఉంటుంది. ఒక మూతతో ఆ కుండను మూసినప్పుడు లోపలి ఖాళీ ప్రదేశం, ఆకాశం యొక్క ధర్మాలనే కలిగివుంటుంది కానీ, వేరే పదార్థంగా మారదు లేదా నశించదు. అదే విధంగా ఆత్మకు మార్పు, వినాశం లేవు.
135. మనం చూసే చరాచర ప్రపంచానికి మూలం ప్రకృతి. జ్ఞానస్వరూపుడైన పరమాత్మ ప్రకృతి కంటే ఎంతో ఉన్నతుడు. మన ఉన్న వస్తుప్రపంచాన్ని, భావప్రపంచాన్ని సాక్షీభూతుడై ఆ పరమాత్మే ప్రకాశింపజేస్తున్నాడు. మనలోని అహంకారానికి ఆధారమై, మనకు ‘నేను’ అనే భావనను కలిగిస్తున్నాడు.
136. నీ బుద్ధిని నిర్మలం చేసుకుని, ఏకాగ్రచిత్తంతో నీలోని ఆత్మను (అనగా ‘అహం’ శబ్దంతో తెలియబడే వస్తువును) కనుగొనుము. అది నీవేనని తెలుసుకుని, జననమరణ సంసార సాగరాన్ని దాటి, బ్రహ్మైక్యాన్ని పొంది తరించు.
137. అనాత్మ (అనగా ఈ దేహమే నేను అనుకునే బుద్ధి) బంధహేతువు. అజ్ఞానం వలన అశాశ్వతమైన శరీరమే శాశ్వతమని తలచి దానిని సకలోపచారాలతో పోషించటం జరుగుతూ ఉంటుంది. గొంగళిపురుగు తన కట్టుకున్న గూట్లో తానే బందీ అయినట్లు, ఈ శరీరసంరక్షణ వలన జీవాత్మ సంసారబంధంలో మరింత కూరుకుపోతున్నాడు.
138. అజ్ఞానం వలన జీవాత్మ భ్రాంతిలో పడి, తన వివేకాన్ని కోల్పోయి తప్పులు చేస్తూ ఉంటాడు. ఒక పామును చూసి, త్రాడు అనుకుని పొరపాటున పట్టుకున్న మనిషి ప్రమాదంలో పడతాడు. అలాగే అనాత్మయైన శరీరాన్ని శాశ్వతమని భావించటం వలన బంధాలు ఏర్పడి నానావిధాల దుఃఖాలూ కలుగుతాయి.
139. గ్రహణ సమయంలో సూర్యబింబాన్ని రాహువు ఆచ్ఛాదిస్తుంది . అట్లే అఖండం, నిత్యం, అద్వితీయం అయి, జ్ఞానంతో స్ఫురించే ఆత్మను తమోగుణమయమైన ఆవరణశక్తి (లేదా మాయ) తాత్కాలికంగా ఆవరిస్తుంది.
140. విశుద్ధప్రకాశస్వరూపమైన ఆత్మను మాయ యొక్క ప్రబలమైన ఆవరణశక్తి ఆచ్ఛాదించినపుడు, జీవాత్మ మోహవశుడై అనాత్మ అయిన శరీరాన్ని తానే అనుకుని వ్యవహరిస్తాడు. అప్పుడు జీవాత్మను రజోగుణజనితమైన విక్షేపశక్తి కామక్రోధాది బంధాలలో పడవేసి అనేక దుఃఖాలను కలిగిస్తుంది.
141. విక్షేపశక్తి అనే మొసలి జ్ఞానజ్యోతిని మ్రింగివేయటం వలన, జీవాత్మ అజ్ఞానాంధకారం చేత ఆవరించబడి, బుద్ధి వక్రించి ప్రవర్తిస్తూ, అపారసంసారసాగరంలో మునిగితేలుతూ నానాయిక్కట్లూ పడతాడు.
142. సూర్యుని కిరణాల వేడిచేత తయారైన మేఘాలు ఎలా సూర్యుణ్ణే కప్పివేస్తాయో, ఆత్మవలన తయారైన అహంకారం ఆత్మనే ఆవరించి మసకబారుస్తుంది.
143. దట్టమైన మేఘాలు సూర్యుణ్ణి క్రమ్మివేసిన తుఫాను వాతావరణంలో ప్రచండవాయువుల చేత లోకులు వ్యథ చెందినట్లు, ఎడతెగని తమోగుణం ఆత్మను ఆవరించినప్పుడు, విక్షేపశక్తి మరింత తీవ్రతరమై, భయం గొలుపుతూ, జీవాత్మను పీడిస్తుంది.
144. ఈ విక్షేపావరణ శక్తుల బారిన పడినవాడు బంధాలలో ఇరుక్కుని, దేహమే తాననుకొంటూ సంసారచక్రంలో పడి, దేహం తర్వాత మరొక దేహం పొందుతూ ఉంటాడు.
145. ఈ శ్లోకంలో జీవాత్మను పక్షి తోనూ, సంసారాన్ని వృక్షంతోనూ సదృశం చేసి, మనోహరంగా పోలిక చెప్పబడింది. సంసారం వృక్షమైతే, ఆ వృక్షబీజం జీవాత్మ యొక్క అజ్ఞానం (లేదా అవిద్య). దేహంతో తాదాత్మ్యం చేసే భావనలు చిగుళ్ళు. ఇదే విధంగా, జీవాత్మ చేసే వివిధకర్మలు ఆ చెట్టుకు పోయబడే జలాలతోనూ, శరీరం మ్రానుతోనూ, ప్రాణపంచకం శాఖలతోనూ, ఇంద్రియగ్రామం (వివిధ అంగాల సముదాయం) ఉపశాఖలతోనూ, శబ్దాది తన్మాత్రలు (ఇంద్రియార్థాలు) పుష్పాలతోనూ, నానావిధ కర్మల వలన కలిగే సుఖదుఃఖాలు ఫలాలతోనూ పోల్చబడ్డాయి. ఈ సంసారవృక్షం యొక్క వివిధ ఫలాలను చవిచూస్తూ, వాటి రుచులను (అనగా కర్మఫలాలను) అనుభవించే పక్షే జీవాత్మ. (BG 15.1, Katha Upanishad 2.3.1)
146. అజ్ఞానమే మూలంగా కల అనాత్మ భావనలను (అనగా దేహంతో తాదాత్మ్యం చేసే ఆలోచనలను) ఆద్యంతాలు (మొదలు–చివర) లేని ప్రవాహంతో పోల్చవచ్చు. ఈ అనాత్మ భావనలు జననం, మరణం, ముసలితనం, వ్యాధి మొదలైన కడగండ్ల దుః ఖప్రవాహంలో జీవాత్మ కొట్టుకుపోయేటట్లు చేస్తాయి.
147. అస్త్రశస్త్రాలు, వాయువు యొక్క గతిశక్తి, అగ్ని యొక్క దహనశక్తి, కోట్లకొద్దీ సకామకర్మలు – ఇవేమీ కర్మబంధాన్ని త్రుంచలేవు. ఈశ్వరానుగ్రహం వలన ప్రాప్తించిన వివేకం అనే ఖడ్గం తప్ప మరే ఇతర ఉపాయమూ ఈ కర్మబంధాన్ని ఛేదించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించలేదు.
148. శ్రుతులలో వివరించబడిన ఆత్మజ్ఞానమార్గంలో దృఢనమ్మకం ఉన్న సాధకునికి మాత్రమే తన స్వధర్మ కర్మానుష్ఠానం (అనగా ప్రస్తుతం తాను చేసే పనుల)లో శ్రద్ధ, భక్తి ఏర్పడుతాయి. వీటి వలన మనస్సు పరిశుద్ధం అవుతుంది. పరిశుద్ధ మనస్కుడు మాత్రమే పరమాత్మను సాక్షాత్కరించుకొని, సంసారబంధాన్ని నిర్మూలించగలడు.
149. చెరువు నీటి మీద పెరిగిన నాచు మొత్తం చెరువులోని నీటి ఉపరితలాన్ని తన ఆకుపచ్చ రంగుతో కప్పివేస్తుంది. అదే విధంగా పంచకోశాలు దేహంలోని ఆత్మను ఆవరించి మసకబారుస్తున్నాయి.
150. ఆ నాచును తొలగించినప్పుడే దాని క్రింద ఉన్న పరిశుద్ధ జలం కనిపించి, దాహార్తిని తీర్చి, సౌఖ్యాన్ని ఇస్తుంది.(ఆ పరిశుద్ధజలాన్ని ఎక్కడనుంచో తేవలసిన పని లేదు. అది ఎల్లప్పుడూ ఎదురుగానే ఉంది. అయితే అడ్డంకులను తొలగించినప్పుడు తనంతటతానుగా లభ్యమవుతుంది. ఆత్మ కూడా అంతే.)
151. అనాత్మలైన (అనగా ఆత్మ కానివి అయిన) ఈ ఐదు కోశాలను వివేకంతో అధిగమించినప్పుడు నిత్యానందైకరస స్వరూపుడు, స్వయంజ్యోతి, అందరి అంతరంగాల లోపల విరాజిల్లే ఆత్మ పైకివచ్చి భాసిస్తుంది.
152. సంసారబంధ విముక్తి కోరే ముముక్షువు ఆత్మానాత్మ వివేచన (అనగా నిత్యానిత్య విచక్షణ) చేయవలెను. దానివలన మాత్రమే తన నిజస్వరూపమైన సచ్చిదానంద పరబ్రహ్మాన్ని తెలుసుకుని పరమానందాన్ని పొందగలడు.
153. ముంజగడ్డి పైపొరలను తొలగించినప్పుడు లోపలి సూక్ష్మాంకురం మాత్రమే మిగులుతుంది. అదే విధంగా దేహానికి సంబంధించిన ఇంద్రియాలను, పంచకోశాలను గూర్చి వివేచన చేసి వాటి సంబంధించిన భావనలను తొలగించి, లోపలి అంతరాత్మను ఎవరైతే అనుభూతి చెందుతారో వారే ముక్తులు.
154. మనకున్న ఈ శరీరం అన్నగతమైనది. అనగా ఆహారం ఉంటే జీవిస్తుంది. లేకపోతే నశిస్తుంది. అందువలన దీనిని అన్నమయ కోశం అంటారు. ఇది చర్మం, మాంసం, రక్తం, ఎముకలతో చేయబడిన అశుద్ధరాశి. ఇది నిత్యశుద్ధమైన ఆత్మ ఎన్నటికీ కానేరదు.
155. జన్మించినపుడు ఉత్పత్తి చెంది, మరణించినపుడు నశించేది ఈ దేహం. ఇది ప్రతిక్షణం మారుతూ ఉంటుంది. చైతన్యం లేనిది. ఒక కుండ కొంతకాలం ఉపయోగపడి, మట్టిలో కలిసిపోయి మరలా కుండగా మారుతూ ఉంటుంది. అటువంటి ఈ శరీరం నిత్యశుద్ధమూ, సాక్షీమాత్రమూ అయిన ఆత్మ ఎలా అవుతుంది?
156. చేతులు, కాళ్ళు, తల మొదలైన భాగాలు కల ఈ శరీరం, ఒకటి రెండు భాగాలు లోపించినా జీవిస్తుంది. ప్రత్యగాత్మ నియమం ప్రకారం ఆయుఃకాల పర్యంతం జీవనక్రియలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వేరొకరి నియమానుసారం మసలుకొనే దేహం, సర్వస్వతంత్రుడైన ఆత్మ కాజాలదు.
157. ఎల్లప్పుడూ మారిపోతూ, రకరకాల ధర్మాలు కలిగి, పరిపరివిధాల పోయే దేహం, శాశ్వతమూ, నిష్క్రియమూ, సాక్షీ అయిన ఆత్మ కంటే వేరు అని సులభంగా గ్రహించవచ్చు.
158. ఎముకల ప్రోగు, మలమాంస పూర్ణమైన ఈ శరీరం సర్వజ్ఞాతమైన ఆత్మ ఎలా అవుతుంది? మలినాలతో నిండిన ఈ దేహం కంటే ఆత్మ సహజంగానే విలక్షమైనది.
159. చర్మం చేత చుట్టబడిన మాంసం ముద్ద మన శరీరం. దానిలో ఇంకా కొవ్వు, ఎముకలు, పురీషం మొదలైన జుగుప్సాకరమైనవన్నీ నిండివున్నాయి. అవివేకి అయినవాడు మాత్రమే ఈ శరీరాన్నే ‘నేను’, ‘నేను’ అని అభిమానిస్తూ ఉంటాడు. సచ్చిదానంద పరబ్రహ్మం ఈ శరీరం కంటే వేరని వివేకి స్పష్టమైన అవగాహన కలిగివుంటాడు.
160. మూఢజనులు వారి దేహాలే ఆత్మ అని తలుస్తారు. శుష్కశాస్త్రజ్ఞానం కల పండితులు తాము దేహమనీ, మనసే ఆత్మ అని తలుస్తారు. కానీ అపరోక్షానుభూతి పొందిన మహాత్ములు మాత్రమే తాము ఆత్మ స్వరూపులమనే దృఢనమ్మకాన్ని కలిగివుంటారు.
161. కాబట్టి ‘చర్మం, మాంసం, కొవ్వు, పురీషాల రాశిగా రూపుదాల్చిన ఈ శరీరమే నేను!’ అని అనుకోకుండా, శాశ్వతుడైన పరమాత్మను భజించి, పరమశాంతిని పొందు!
162. అనిత్యమైన శరీరం, మేధస్సు మొదలైనవాటితో బంధాలను ఛేదించనంత వరకూ, వేదాంత గ్రంథాలలో ఎంత పాండిత్యం సంపాదించినా వ్యర్థం. ‘నేను ఇంత చదువుకున్నాను!’, ‘పాండిత్యంతో ఇంత సంపాదించాను!’ – ఈ విధమైన ఆలోచనలు అహంకారం వలన కలుగుతాయి. ఇటువంటి పుస్తకపండితులకు మోక్షప్రాప్తి అన్న ప్రశ్నే లేదు.
163. ఎండలో ఉన్నప్పుడు ఏర్పడే నీడతోనూ, నీటిలో లేదా అద్దంలో ఏర్పడే ప్రతిబింబంతోనూ, ఊహలలో మనం తాల్చే మిథ్యాశరీరాలతోనూ ఎలాగైతే బంధం పెంచుకోమో, అలాగే ప్రస్తుతజీవితంలోని స్థూలశరీరంతో కూడా ఐక్యం కాకూడదు.
164. భ్రాంతి వలన కలిగే దేహతాదాత్మ్యత (శరీరమే తానుగా భావించుట)ను ‘ఉపాధి’ అంటారు. ఈ భ్రాంతిని పోగొట్టుకోలేని అజ్ఞానులు జనన మరణ సంసారచక్రంలో చిక్కుకుని దుఃఖాలు అనుభవిస్తుంటారు. ఈ ఉపాధిని ఎంతో జాగ్రత్తగా, ఎన్నో ప్రయాసలను ఓర్చుకుంటూ నిర్మూలించాలి. అప్పుడే పునర్జన్మ కలుగుతుందనే భయం వీడిపోతుంది.
165. కర్మేంద్రియాల్ని నడిపించే ప్రాణశక్తిని ప్రాణమయ కోశం అంటారు. ఇది అన్నమయ కోశం అంతా వ్యాపించి ఉంటుంది. అందువలన అన్నమయ కోశం తానే ప్రాణంతో ఉన్నట్లు ఆహార, విహారాది కర్మలన్నింటినీ చేస్తూ ఉంటుంది.
166. వాయురూపాంతరమయిన ఈ ప్రాణమయ కోశం ఆత్మ కానేరదు. ఎందుకనగా దీనికి స్వయంనిర్ణయాధికారం లేదు. ఆత్మ ఆజ్ఞలకు అనుగుణంగా, జనన సమయంలో ఒక శరీరంలో ప్రవేశించి, మరణం తరువాత ఆ దేహాన్ని విడిచివేస్తుంది. తనకు ఏది సంక్షేమకరమో, ఏది హానికరమో కూడా దానికి తెలియదు.
167. జ్ఞానేంద్రియ పంచకాన్ని, మనస్సును కలిపి మనోమయ కోశం అంటారు. ఈ సమూహంలో మనస్సు ప్రధానేంద్రియం కాబట్టి దీని పేరు మనోమయ కోశం అయింది. ఇది ‘నేను చేస్తున్నాను!’, ‘నేను కష్టసుఖాలను అనుభవిస్తున్నాను!’, ‘నా భార్యాపుత్త్రులు!’, ‘నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి!’ వగైరా కర్తృత్వ–భోక్తృత్వ–భావనలకు పుట్టినిల్లై, ప్రాణమయ కోశంలో విజృంభిస్తూ ఉంటుంది. ఇది కూడా ఆత్మ కానేరదు.
168. యజ్ఞం చేసేటప్పుడు ఋత్వికులు సమిధలతో అగ్నిని రగిల్చి, ఆజ్యధారలతో హవిస్సులను అర్పించటం వలన యజ్ఞకర్తకు స్వర్గసుఖాలు కలుగుతాయి. అదే విధంగా అనేక జన్మలలో కలిగిన సంస్కారాలు ఇంధనంగా, విషయాకర్షణలు ఆజ్యంగా, ఇంద్రియాలు ఋత్వికులుగా జ్వలించే ఈ మనోమయ కోశాగ్ని, సుఖదుఃఖాలనిచ్చే దృశ్యమాన ప్రపంచాన్ని తయారుచేస్తున్నది.
169. మనస్సే అవిద్య లేదా అజ్ఞానం. ఆ మనస్సే ముందు చెప్పబడిన కర్తృత్వ–భోక్తృత్వ–భావనలు కలిగించి, సంసారబంధానికి కారణభూతం అవుతున్నది. అవిద్య నాశనమయినప్పుడు మాత్రమే బంధవిముక్తికి మార్గం సుగమం అవుతుంది. ఆ మనస్సు విజృంభిస్తున్నంత కాలం బంధాలు ఇంకాయింకా పెరిగిపోతూనే ఉంటాయి.(వేదాంత భావనల ప్రకారం ఆత్మలో ఏ మార్పూ ఉండదు. అది స్వభావసిద్ధంగా నిత్యశుద్ధం, పరిపూర్ణం. అజ్ఞానం లేదా అవిద్య దానిని ఆవరించడం వల్ల అది పరిమితమైన దేహం రూపంలోనూ, మార్పుకు లోనయ్యేదిగానూ కనిపిస్తుంది. ఈ అజ్ఞానం మనస్సులో జనించేదే కానీ ఆత్మకు సంబంధించినది కాదు. సాధన ద్వారా ఈ అజ్ఞానాన్ని నాశనం చేసినప్పుడు ఆత్మ యొక్క వైభవం దానంతట అదే వ్యక్తమవుతుంది. మోక్షం లేదా ముక్తి లేదా ఆత్మసాక్షాత్కారం లేదా నిర్వాణం అంటే ఇదే.)
170. స్వప్నావస్థలో అనగా నిద్రించే సమయంలో బాహ్యప్రపంచంతో ఏమీ సంపర్కం లేకపోయినా, మనస్సే ఒక కలల రూపంలో ఒక మిథ్యాప్రపంచాన్ని తయారుచేస్తున్నది. ఆ కలగనేవాడు కూడా ఈ కలల ప్రపంచంలో ఒక భాగంగా ఉంటాడు. అదే విధంగా జాగ్రదవస్థలోని బాహ్యప్రపంచానికి, స్వప్న ప్రపంచానికీ తేడా ఏమీ లేదు. దృశ్యమాన ప్రపంచం మొత్తం మనస్సు యొక్క విక్షేపం మాత్రమే కానీ వాస్తవం కాదు.
171. సుషుప్తి అవస్థలో మనస్సు నిద్రాణస్థితిలో ఉండటం వలన బాహ్యప్రపంచపు ఉనికి ఏ మాత్రం స్ఫురించదు. ఇది మనకు అనుభవమే. దీనిని మనస్సు యొక్క కారణస్థితి అంటారు. ఈ స్థితిలో అంతర్ధానమైపోయిన బాహ్యప్రపంచం మనిషి మేలుకున్నప్పుడు తిరిగి ఉనికిని పొందుతున్నది. అనగా మేలుకునివున్న స్థితికి మనస్సు చేరినప్పుడు కల్పించబడినదే దృశ్యమాన ప్రపంచం కానీ, దానికి ప్రత్యేకమైన ఉనికి లేదు.
172. వాయువు యొక్క ప్రబలశక్తి వలన పట్టపగలే ఆకాశం మేఘావృతమై, చీకట్లు క్రమ్ముకుంటాయి. మరలా అదే వాయువు ఆ మేఘాలను చెదరగొట్టి వెలుగును తిరిగివచ్చేటట్లు చేస్తుంది. అదే విధంగా సంసారబంధం మనస్సుచేతనే కల్పింపబడి, దానిచేతనే విడిపింపడుతుంది. అనగా విషయాసక్తమైన మనస్సు బంధహేతువు. కానీ విషయాసక్తి లేనప్పుడు అదే మనస్సు మోక్షహేతువు కూడా అవుతుంది. (BG 6.6)
173. ఒక పశువును బంధించటానికి త్రాళ్ళతో కట్టివేస్తాము. అలాగే మనస్సు, ఇంద్రియాలకు తన్మాత్రల రూపంలో వివిధ ఆకర్షణలను కల్పించి, దేహాన్ని పాశాలతో బంధిస్తుంది. తరువాత అదే మనస్సు తన్మాత్రలు విషపూరితాలన్న భావన కలిగించి పాశమోచనం చేస్తుంది కూడా.
174. పాశబంధనమైనా, పాశమోచనమైనా రెంటినీ చేయగలది మనస్సే. రజోగుణ సంపర్కం వలన కలిగే బంధనప్రాప్తి, రజస్తమస్సులు శుద్ధసత్త్వానికి తలొగ్గినపుడు కలిగే బంధమోచనం ఆ మనస్సే చేస్తూ ఉంటుంది.
175. వివేక వైరాగ్యాలు వృద్ధి చెందుతున్న కొద్దీ, మనస్సు పరిశుద్ధమై మోక్షమార్గం సుగమం అవుతుంది. అందువలన శ్రద్ధగల సాధకుడు వీటిని నిరంతరం అభ్యాసం చేయాలి.
176. విత్తవనితాది విషయాకర్షణలనే మహారణ్యంలో మనస్సు అనే మహావ్యాఘ్రం విహరిస్తూ ఉంటుంది. మోక్షాసక్తుడైన ముముక్షువు ఆ అరణ్యం జోలికి ఎప్పుడూ వెళ్ళడు.
177. జాగ్రదవస్థలో స్థూలరూపంలోనూ, స్వప్నావస్థలో సూక్ష్మరూపంలోనూ మనస్సు వివిధ విషయాకర్షణలను తయారుచేస్తూనే ఉంటుంది. అనుభవించటానికి అనేక దేహాల్ని, వర్ణాశ్రమాల్ని, జాతి భేదాల్ని, సకామక్రియల్ని, వాటికి ఫలాలను కల్పించేది కూడా మనస్సే.
178. చిదాత్మ అంశ అయిన జీవాత్మకు దేహం, ప్రాణాలు, ఇంద్రియాలు, తన్మాత్రలు, సత్త్వరజస్తమో గుణాలు మొదలైన అనేక బంధాలను కల్పించి మనస్సు మభ్యపెడుతూ ఉంటుంది. ‘నేను’, ‘నాది’ అనే అహంకార, మమకార భావాల్ని, సకామక్రియలను, వాటి ఫలాలను కలుగజేస్తూ త్రోవ తప్పేటట్లు చేస్తుంది.
179. ‘శరీరమే తాను’ అనుకునే దోషాన్ని ‘అధ్యాసం’ అంటారు. ఈ అధ్యాసదోషం వలన సంసారచక్రంలో జీవాత్మ చిక్కుపడి అనేక జన్మలెత్తుతున్నాడు. మనస్సే ఈ దోషాన్ని కలగజేసి, రజస్తమో గుణాలతో నిండివున్న అవివేకులను దుఃఖాలలో పడవేస్తున్నది.
180. వాయువు వలన మేఘమండలం కదులుతున్నట్లు, మనస్సు వలననే సమస్త ప్రపంచం సృష్టిస్థితిలయాలను పొందుతున్నది. బ్రహ్మజ్ఞానం పొందిన మహాత్ములు ఈ మనస్సే అవిద్య లేదా అజ్ఞానం అని దర్శించారు.
181. కాబట్టి ముముక్షేచ్ఛ గల సాధకులు మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి. మనస్సు శుద్ధమూ, పవిత్రమూ అయినప్పుడు మోక్షం ‘హస్తామలకం’ అవుతుంది. చేతిలోని ఉసిరి పండును ప్రయాస లేకుండానే భుజించవచ్చు. దీనినే ‘హస్తామలకం’ అంటారు.
182. మోక్షేచ్ఛ గల సాధకుడు విషయవాసనలను నిర్మూలించి, సకామకర్మలను పరిత్యజించి, గురువు చెప్పిన వేదాంత వాక్యాలలో అఖండ విశ్వాసం ఉంచి, ధ్యానాది అభ్యాసాలను చేస్తూ, రాజసిక ప్రవృత్తులను పోగొట్టుకుంటాడు.
183. మనస్సుక్ప్రధానంగా కల మనోమయ కోశానికి ఒక ఆది (జననం), ఒక అంతం (మరణం) అంటూ ఉన్నాయి. అంతేకాక అది మార్పు చెందుతూ, సుఖదుఃఖాలను పొందుతూ ఉంటుంది. ఒక దృశ్యాన్ని చూసేవాడు, చూడబడే దృశ్యం రెండూ ఎలాగైతే వేర్వేరో, సాక్షీమాత్రమైన ఆత్మకు ఈ కోశం కూడా ఒక దర్శింపబడుతున్న విషయం మాత్రమే. కాబట్టి మనోమయ కోశం కూడా ఆత్మ కానేరదు.
184. కర్తృత్వ–భోక్తృత్వ భావనలతోనూ, అహంకారంతోను కూడి, మంచిచెడులను నిర్ణయించే బుద్ధిని విజ్ఞానమయ కోశం అంటారు. ఇది కూడా మార్పులు చెందుతూ, ‘నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను’ అనే ఉపాధులు కలిగి ఉండటం వలన ఆత్మ కానేరదు.
185. విజ్ఞానమయ కోశం జీవాత్మకున్న అన్ని అవస్థలలోనూ ఆత్మనుకనుసరిస్తూ, ఆ ఆత్మను ప్రతిబింబించటం వలన చైతన్యం కలిగియున్నట్టు కనిపిస్తుంది. జ్ఞానం కలిగివున్నా శరీరంతోనూ, ఇంద్రియాలతోనూ తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది. ఇది కూడా ప్రకృతి యొక్క రూపాంతరమే కాబట్టి ఇది చైతన్యరహితము మరియు అనాత్మ.
186. అనాది నుండీ అస్తిత్వం కలిగివుండి, అహంకార స్వభావంతో, సమస్తవ్యాపారాలు జీవాత్మ చేత (అది ఉన్న సాపేక్షస్థాయిలో) చేయించేది ఈ విజ్ఞానమయ కోశమే. ఇదే పూర్వసంస్కారాల వలన పుణ్యపాపాలను చేస్తూ వాటి ఫలాలను అనుభవిస్తూ ఉంటుంది.
187. ఈ కోశం పూర్వకర్మఫలాలను బట్టి పశుపక్షివృక్షమానవాది జన్మలను ఎత్తుతూ, వివిధ కర్మలను చేస్తూ, ఆ కర్మఫలాలను అనుభవించటం కోసం పరలోకాలకు వెళ్ళివస్తూ ఉంటుంది. జాగ్రత్స్వప్నసుషుప్తి అవస్థలు మూడింటినీ కలిపే సూత్రంలాగా ఉంటూ సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది.
188. ఈ విజ్ఞానమయ కోశం ఆత్మకు అత్యంత సమీపాన ఆవరించి ఉండటం వలన, ఆత్మభాసంతో తాను ప్రకాశిస్తూ, దేహేంద్రియాదులను కూడా ప్రకాశింపజేస్తుంది. సాత్త్విక రాజసిక తామసిక గుణ తాదాత్మ్యం చెందుతూ, శరీరంలోనే ఉంటూ, వర్ణాశ్రమ ధర్మాలు, వాటికి సంబంధించిన కర్మలు ఆత్మయే నిజంగా చేస్తున్నట్లు భావనను కలిస్తుంది. కానీ ఆత్మకు వీటితో సంబంధంలేకపోవటం వలన ఈ కోశం ఆత్మకు ‘ఉపాధి’ అనబడుతోంది. ఆత్మ యొక్క ఎరుక ఉన్నా, భ్రాంతి వలన సంసారచక్రంలో పరిభ్రమిస్తూ ఉంటుంది.
189. స్వయంప్రకాశకమైన ఆత్మ, ఎల్లప్పుడూ మార్పుచెందక కూటస్థుడై హృదయమధ్యంలో ఉంటూ దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తూ ఉంటాడు. విజ్ఞానమయ కోశమనే ఉపాధి చేత నిష్క్రియుడైన ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వ భావనలు ఆపాదింపబడుతున్నాయి.
190. మట్టితో తయారయిన కుండ, దాని యొక్క మూలపదార్థమైన మట్టికంటే వేరు కాకపోయినా, చూడటానికి భిన్నంగా కనిపిస్తుంది. అదే విధంగా పరమాత్మ, విజ్ఞానమయకోశంతో తాదాత్మ్యదోషం వలన తాను ఆత్మను కాననీ, దేహాన్ననీ అనుకుంటాడు. నిజానికి స్వయంప్రకాశకుడు, సర్వస్వరూపుడు అయిన పరమాత్మయే మాయ యొక్క ప్రభావం వలన జీవాత్మగా మసలుకొంటున్నాడు.
191. ఇనుప పనిముట్ల తయారీలో, ఎర్రగా కాల్చబడిన పనిముట్టు ఆకారంలో ఉష్ణశక్తి వెలిగిపోతూ కనిపిస్తుంది. నిజానికి ఉష్ణానికి ఆకారం లేదు. అదే విధంగా పరిపూర్ణుడైన పరమాత్మ, పంచకోశరూపంలోని ఉపాధుల వలన తాను జీవాత్మననే జీవభావాన్ని పొందుతున్నాడు. నిజానికి ఆయన ఎటువంటి మార్పులకూ లోనుకాడు. జీవులకు సహజమైన బుద్ధి, మనస్సు మొదలైన ధర్మాలు ఆయనకు లేనేలేవు.
192. శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు:– మాయ, భ్రాంతి, అవిద్య లేదా ఇతరత్రా కారణాల వలన పరమాత్మ తనను తాను జీవాత్మ అనుకుంటున్నాడు. ఈ ఉపాధి అనాదియైనది కాబట్టి, దీనికి అంతం ఎలా ఉంటుంది?
193. ఈ అవిద్య అనాది కాబట్టి నాశనం లేక శాశ్వతంగా కొనసాగుతూ పోతుంది కదా! అలాంటప్పుడు జీవాత్మకు మోక్షప్రాప్తి ఎలా కలుగుతుందో దయచేసి వివరించండి.
194. గురువు ఈ విధంగా సమాధానమిచ్చారు. ఓ విద్వాంసుడా! సరియైన ప్రశ్న వేశావు. నీ ప్రశ్నకు సమాధానం చెపుతాను. సావధానంగా విను. భ్రాంతి వలన కల్పించబడిన ఈ ఉపాధి యథార్థం కానేరదు.
195. ఆకాశానికి రంగు లేకపోయినా అది నీలంగా ఉందని మనం అనుకుంటాము. నిజానికి ఆ నీలివర్ణం మన మనస్సులోదే కానీ ఆకాశానిది కాదు. అదే విధంగా ఉపాధి మన మనస్సులోనిదే కానీ యథార్థంగా ఉనికి లేనిది. ఈ ఉపాధి వలననే నిరాకార నిస్సంగ నిష్క్రియ పరమాత్మకు దృశ్యమాన ప్రకృతికి సంబంధం ఏర్పడుతున్నది.
196. త్రిగుణాతీతం, సాక్షీమాత్రం, సత్–చిత్–ఆనంద స్వరూపం అయిన ఆత్మకు బుద్ధి యొక్క అధ్యారోపణ వలన ఉపాధి కలిగింది. ఈ ఉపాధి మాయాకల్పితమైనందున అశాశ్వతమైనది. జ్ఞానోదయం అయినప్పుడు ఆ ఉపాధి నశిస్తుంది.
197. భ్రాంతి వలన కలిగిన అవివేకం పోనంతవరకూ తాడును పాముగా భావిస్తాము. ఆ భ్రాంతి తొలగిన వెంటనే సత్యం గోచరిస్తుంది.
198-199. స్వప్నంలో కనిపించు దృశ్యాలు మేల్కొన్నంతనే అదృశ్యం అవుతాయి. అదే విధంగా అనాది అయిన అవిద్య, ఆ అవిద్యాకారకము, ఆ అవిద్యాపరిణామాలు జ్ఞానోత్పత్తి అయిన వెంటనే సమూలంగా నశిస్తాయి. ఇందుమూలంగా మనకు కనిపించే దృశ్యమాన ప్రపంచం అనాది అయినా శాశ్వతం కాదని తేటతెల్లం అవుతున్నది.(ప్రాగభావం = ప్రాక్ (ముందు) + అభావం (లేకపోవటం) : ఇది తర్కశాస్త్రతంలో వాడబడే పదము. ఒక వస్తువు ఒక నిర్దిష్ట సమయంలో ఉత్పత్తి అయితే, ఆ నిర్దిష్ట సమయానికి ముందు వరకూ ఆ వస్తువుకు ఉనికి లేదు. అనగా అనాది నుంచీ ఆ నిర్దిష్ట సమయం వరకు మాత్రమే ఆ ‘వస్తువు–లేని–స్థితి’ ఉంది. దీనినిబట్టి ఆ ‘వస్తువు–లేని–స్థితి’ అనాది అయినా, ఆ వస్తువు ఉత్పత్తి అయిన వెంటనే ‘వస్తువు–లేని–స్థితి’ నశిస్తోంది. అలాగే ఆరంభం లేని అజ్ఞానం జ్ఞానోదయం అయిన వెంటనే నశిస్తుంది.)(శ్రీరామకృష్ణ పరమహంస ఇటువంటి సందర్భంలోనే, ‘వెయ్యి సంవత్సరాలు చీకటిలో మునిగి ఉన్న గదిలో ఒక దీపాన్ని వెలిగిస్తే మరుక్షణం ఆ గది వెలుగుతో నిండిపోతుంది కదా!’ అనే ఉదాహరణను ఇచ్చారు.)
200-201. ‘వస్తువు–లేని–స్థితి’ అనాది అయినా అంతం కావడాన్ని ముందు శ్లోకం ద్వారా తెలుసుకున్నాము. బుద్ధి మొదలైన ఉపాధుల వలన ఆత్మకు ఆపాదించబడిన జీవత్వం నిజమైనది కాదు. అజ్ఞానం వలననే ఈ విధంగా జరుగుతున్నది. ఆత్మ ఈ ఉపాధులు, జీవత్వాని కంటే ఎంతో భిన్నమైనది.(ఒక తెరకి ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఒక పెద్ద వస్తువును చూస్తున్నప్పుడు, ఆ రంధ్రాన్ని పెద్దది చేస్తున్నకొద్దీ, ఆ వస్తువు పెద్దవుతున్నట్లు కనిపిస్తుంది లేదా ఆ వస్తువులోని మరిన్ని వివరాలు గోచరం అవుతాయి. ఇక్కడ మార్పు చెందుతున్నది ఆ తెర మాత్రమే కానీ వస్తువు కాదు. అదే విధంగా ఆత్మని ప్రకృతి ద్వారా గమనిస్తున్నప్పుడు, మనకున్న బుద్ధి, మనస్సు, అహంకారం మొదలైన ఉపాధుల వల్ల ప్రకృతిలో కనిపించే మార్పులు, ఆత్మలో సంభవించినట్లు కనిపిస్తాయి. నిజానికి ఆత్మలో ఎటువంటి మార్పూ ఉండదు.)
202. జ్ఞానోదయం అయినప్పుడు మాత్రమే జీవాత్మ యొక్క ఉపాధి తొలగిపోతుంది. జీవాత్మ తాను పరమాత్మ కంటే వేరుకాదని తెలుసుకున్నప్పుడే సంపూర్ణంగా జ్ఞానం ప్రాప్తించినట్లని శ్రుతులు తెలుపుతున్నాయి.
203. పరమాత్మ, అనాత్మల భేదవిచారణ వలననే జ్ఞానప్రాప్తి కలుగును. కాబట్టి పరమాత్మ యొక్క, అనాత్మ యొక్క యథార్థస్వరూపాలను గూర్చి వివేకవంతులు కూలంకషంగా చర్చ చేస్తారు.
204. స్వతఃసిద్ధంగా జలం నిర్మలమైనది. కానీ బురద, మట్టి మొదలైన పదార్థాలు చేరినప్పుడు మకిలపడుతూ ఉంటుంది. ఆ నీటిని వస్త్రపూతం (వస్త్రకాయం) వగైరా పద్ధతుల ద్వారా వడపోసినప్పుడు తిరిగి నిర్మలమవుతున్నది. అలాగే ఆత్మ యొక్క ఉపాధిని వివేకం ద్వారా తొలగించటం వలన అది తిరిగి భాసించటం మొదలుపెడుతుంది.
205. అవిద్య క్షీణించినప్పుడు జీవాత్మ తాను పరమాత్మనని తప్పక అర్థం చేసుకుంటుంది. కాబట్టి సాధకులు ఆత్మసాక్షాత్కారం కోసం అహంకారాది అనాత్మ వస్తువులను పూర్తిగా త్యజించాలి.
206. విజ్ఞానమయ కోశం జడము (చైతన్యం లేనిది), అనిత్యము (మార్పు చెందేది), పూర్వకర్మఫలాన ప్రాప్తించినది, ప్రకృతి యొక్క రూపాంతరం మాత్రమే అయినందువలన ఆత్మ కానేరదు.
207. పంచకోశాలలో చివరిది ఆనందమయ కోశం. ఆత్మలోని పరమానందానికి ప్రతిబింబమైన ఈ ఆనందమయకోశం కూడా అజ్ఞానం నుండి జనించినదే. సుఖప్రేయస్సులు దీని లక్షణాలు. ఎవరికైనా ఇష్టమైన వస్తువు లభించినప్పుడు తాత్కాలికంగా ఈ ఆనందమయ కోశం అనుభవానికి వస్తుంది. పుణ్యకార్యాల ఫలంగా దీనిని అనుభూతి చెందవచ్చును. మహాత్ములకు దీని అనుభూతి అప్రయత్నంగానే కలుగుతుంది.
208. గాఢనిద్ (సుషుప్తి)లో మాత్రమే దీని అనుభూతి సంపూర్ణంగాను, స్వప్నజాగ్రదవస్థలలో ఇష్టవస్తుప్రాప్తి మొదలైన అనుభవాల వలన దీని అనుభూతి అసంపూర్ణంగాను ఉంటుంది.
209. ఈ ఆనందమయ కోశం కూడా ఆత్మ కానేరదు. ఎందువలనంటే ఇది మిగిలిన కోశాలలో ఇమిడి ఉండి, మార్పుచెందే ప్రవృత్తి కలది. పూర్వకర్మఫలాలను బట్టి ప్రకృతి యొక్క పరిణామం వలన ఏర్పడినది.
210. శ్రుతివాక్యాలను అనుసరిస్తూ ఐదు కోశాలనూ అధిగమించినపుడు, పరమోచ్చస్థితిలో వున్న సాక్షీమాత్రమైన పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. ఈ స్థితికి చేరిన జీవాత్మ సమాధిస్థితి పొందిందనీ, ఈ అనుభూతిని అపరోక్షానుభూతి అనీ అంటారు.
211. స్వయంప్రకాశమైన ఆత్మ పంచకోశాలకు భిన్నమై, అవస్థాత్రయానికి సాక్షీమాత్రమై, నిర్వికారమై (అనగా ఎల్లప్పుడూ మారనిదై), నిరంజనమై (అనగా అవిద్యా సంపర్కములేక పవిత్రమైనదై), సర్వదా ఆనందస్వరూపమై విరాజిల్లుచుండును. తత్త్వజ్ఞాని తానే ఆ ఆత్మనని తెలుసుకోవలెను.
212. శిష్యుడు మరలా ప్రశ్నిస్తున్నాడు:– ఐదు కోశాలను నిషేధించగా (అనగా ఆత్మకాదని వదలివేయగా) నాకు శూన్యం తప్ప ఇంకేమీ గోచరించటం లేదు. అలాంటప్పుడు నా అసలు స్వస్వరూపం ఎలా తెలుస్తుంది?
213-214. గురువు సమాధానం: లెస్స పలికితి ఓ పండితుడా! నీవు నిజంగా తెలివికలవాడివి. దేనివలన జాగరూకస్థితిలో మనోబుద్ధ్య హంకారాది ఉపాధులు కలుగుతున్నాయో, దేని ప్రభావం వలన సుషుప్త్యవస్థలో వాటిని పూర్తిగా మర్చిపోతున్నామో, దేనినైతే మనం ఇంద్రియజ్ఞానంతో తెలుసుకోలేమో ఆ వస్తువునే ఆత్మ అని గ్రహించు.
215. ఒక వస్తువు యొక్క ఉనికిని ఇంద్రియాల ద్వారా ఒకరు అనుభూతి చెందినపుడు, వారు ఆ వస్తువుకు సాక్షులవుతారు. అలా అనుభూతి చెందేవారు లేనప్పుడు ఆ సాక్షిత్వం కూడా లేనట్టే కదా!
216. సకల చరాచరసృష్టి అంతా ఆత్మస్వరూపమే కాబట్టి ఆత్మను అనుభూతి చెందేందుకు వేరే ఎవరుంటారు? ఆత్మ తననుతానే అనుభూతి చెందుతోంది కాబట్టి ఆత్మను స్వసంవేద్యం అంటారు.
217. జాగ్రత్స్వప్నసుషుప్తి అనే మూడు అవస్థలలోనూ చైతన్యరూపంలో స్ఫురిస్తూ, అంతరంగంలో ‘నేను–నేను’ అనే భావనను అవిచ్ఛిన్నంగా కలగజేస్తూ, మనోబుద్ధ్యహంకారాల వివిధ రూపాలను సాక్షీమాత్రంగా వీక్షిస్తూ, సత్ (సత్యం) – చిత్ (జ్ఞానం) – ఆనంద (సంతోషం) రూపాలలో తనను తానే వ్యక్తపరుచుకుంటూ నీ హృదయంలో నివాసం ఉండేదే ఆత్మ అని గ్రహించు.
218. కుండలోని నీటిలో ప్రతిబింబించిన సూర్యుణ్ణి చూసి, అదే సూర్యగోళం అనుకునేవాడు అవివేకి. జీవాత్మలలోని బుద్ధి పరమాత్మ ప్రతిబింబమే అయినా అది ఉపాధి సహితంగా ఉంటుంది కదా! అందువలన ఆ బుద్ధినే పరబ్రహ్మమనుకోవటం మూఢత్వం.
219. వివేకవంతుడు ఆ కుండనీ, నీటినీ, ప్రతిబింబాన్నీ ప్రకాశింపజేసేది స్వయంభాసకమైన సూర్యగోళం అనీ, అంతేకాక ఆ సూర్యుడు వాటిమీద ఏ మాత్రం ఆధారపడి లేడనీ గ్రహిస్తాడు.
220-222. కుండవంటి స్థూలశరీరాన్ని, జలమువంటి సూక్ష్మశరీరాన్ని, ప్రతిబింబమైన బుద్ధిని వదలి, హృదయాంతరాళంలో అఖండజ్ఞానస్వరూపంతో ప్రకాశించే సూర్యుడులాంటి పరమాత్మను తెలుసుకోవాలి. ఆ పరమాత్మ శాశ్వతుడు, సర్వగతుడు (అనగా అన్నింటిలోనూ కలడు), అత్యంతసూక్ష్మస్వరూపుడు, చరాచరసృష్టికి సాక్షీమాత్రుడు. ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందినవాడు పాపరహితుడై, రజస్తమోగుణశూన్యుడై, శోకమోహాల్ని పోగొట్టుకుని, మృత్యువును సైతం జయించి ఆనందస్వరూపుడగును.
223. పరమానంద స్వరూపుడు, అద్వితీయుడు అయిన పరమాత్మతో సాధకుడు తన ఏకత్వాన్ని అనుభూతి చెందినప్పుడే సంసారబంధాల నుండి విముక్తుడై బ్రహ్మానందాన్ని పొందుతాడు.
224. సాధకుడు బ్రహ్మసాక్షాత్కారం వలననే జననమరణ సంసారచక్రం నుండి ముక్తుడై మరల దానిలో చిక్కుకోకుండా ఉండగలడు.
225. సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనందస్వరూపుడు, అనంతుడు, పరమపవిత్రుడు, సర్వోన్నతుడు, స్వయంభువు (తన జన్మకు వేరే కారణం లేనివాడు), శాశ్వతుడు, అంతర్బాహ్యరహితుడు (లోపల, బయట మొదలైన తేడాలు లేనివాడు), నిరంతరం విజయుడు అయిన పరబ్రహ్మ జీవుని కంటే వేరు కాదు.
226. పరమాద్వైతం అన్న స్థితికి చేరినప్పుడు సృష్టి మొత్తం పరబ్రహ్మ స్వరూపంలాగా కనిపిస్తుంది. బ్రహ్మేతర వస్తువు గోచరించదు. ఇదియే జీవన్ముక్తస్థితి. (BG 6.29, BG 6.30, BG 6.31, BG 13.14, BG 13.28, BG 13.29, Isha Upanishad Verse 1, Isha Upanishad Verse 6 and 7, Kaivalya Upanishad Verse 10)
227. అజ్ఞానం వలననే విశ్వం వివిధరూపాలలో కనిపిస్తుంది. జ్ఞానోదయం అయిన పిదప బ్రహ్మేతర పదార్థం గోచరించక, మానవ మేధస్సు యొక్క పరిధికి ఆవలవున్న బ్రహ్మపదార్థమే వివిధరూపాలు దాల్చినట్లు అర్థమవుతుంది.
228. మట్టితో చేయబడిన కుండలోని ఏ భాగమైనా రూపాంతరం చెందిన మట్టి తప్ప వేరే ఏమీ కాదు. పేరుకు అది కుండ కానీ, అది చేయబడిన మూలపదార్థం మట్టే. అలాగే చరాచర ప్రపంచంలోని విభిన్నరూపాలన్నీ పరమాత్మే.
229. కుండ యొక్క లోపలి తత్త్వం మట్టి కాక వేరొకటని ఎవరూ నిరూపించలేరు. కుండలా కనిపించే బాహ్యస్వరూపం మానవకల్పితమే (అనగా మనిషి చేత చేయబడిందే) కదా! అలాగే దృశ్యమాన ప్రపంచం పరమాత్మే అయినా మాయాకల్పిత అజ్ఞానం వలన వేరుగా కనపడుతోంది.
230. సకలసృష్టికి సత్స్వరూపుడైన బ్రహ్మే కారణం. కనుక ఆ సృష్టి పరబ్రహ్మ కంటే వేరని పలకటం అజ్ఞానం. ఇలా పలకటాన్ని మంచి నిద్రలో స్పృహ లేకుండా ఉన్నప్పుడు చేసే పలవరింతలతో పోల్చవచ్చు.
231. అథర్వణ వేదం ప్రకారం ఈ విశ్వం, బ్రహ్మం వేరు కావు. బ్రహ్మమే ఈ విశ్వానికి ఆధారం. ఆధారం లేకుండా ఏ వస్తుమా నిలవనట్లే, బ్రహ్మం అనే ఆధారం లేకపోతే ఈ సృష్టికి ఉనికే లేదు.
232. అద్వైతజ్ఞానం ప్రకారం పరబ్రహ్మం అద్వితీయమైనది (అనగా రెండు కాక ఒకటే అయినది) మరియు శాశ్వతమైనది. కానీ ఆ పరబ్రహ్మ అంశమైన ఈ దృశ్యమాన ప్రపంచం క్షణక్షణమూ మారుతూ ఉంటుంది. ఇది మనకు అనుభవమే. ‘ఈ ప్రపంచమే, మనకు కనిపిస్తున్న స్థితిలో, అనుభవమౌతున్న స్థితిలో, ఇదే పరమాత్మ, ఇదే శాశ్వతం’ అని అనుకుంటే, అప్పుడు అద్వితీయం, శాశ్వతం అయిన వస్తువులు ఒకటి కాక రెండు అవుతాయి. కాబట్టి అద్వైతజ్ఞానం ప్రకారమైనా, మన అనుభవం ప్రకారమైనా, ఈ దృశ్యమాన ప్రపంచమే పరబ్రహ్మం కాజాలదు. దీని వెనుక ఉన్న పరబ్రహ్మమే అద్వితీయుడు, శాశ్వతుడు. మహాత్ముల అభిప్రాయం ప్రకారం కూడా అశాశ్వతమైన ఈ ప్రపంచం పరమేశ్వరుడు కాజాలదు.
233. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ భావాన్నే సమర్థించాడు. “ఇంద్రియగోచరమగు ఈ భూతజాలానికి ఆధారం నేనే. కానీ నేను ఆ భూతాలలో లేను. అవి నాలో లేవు.”
234. ఈ ప్రపంచమే కనక నిజమైతే సుషుప్తి అవస్థలో కూడా మనం దాన్ని అనుభూతి చెందాలి. అలా జరగటం లేదు కనక ఈ ప్రపంచం నిజం కాదు, కల్పితము.
235. ఈ ప్రపంచానికి ఆధారం పరమాత్మ. కాబట్టి, పరమాత్మ కంటే ఈ ప్రపంచాన్ని వేరుగా దర్శించటమనేది భ్రాంతి వలననే జరుగుతోంది. ఆధారభూతమైన బ్రహ్మం మీద మాయాకల్పితమైన ఈ దృశ్యమాన ప్రపంచం ఆరోపించబడింది.
236. భ్రాంతిలో ఉన్న మానవునికి కనపడేది పరబ్రహ్మమే కానీ వేరు కాదు. వెండి వస్తువు ముత్యంలా కనిపించినట్లు, పరబ్రహ్మమే ప్రపంచంలా కనిపిస్తున్నది.
237-238. దృశ్యమాన ప్రపంచరూపంలో కనిపించే ఆ పరబ్రహ్మ శాశ్వతుడు, అద్వితీయుడు, పవిత్రుడు, జ్ఞానస్వరూపుడు, నిరంజనుడు, ప్రశాంతుడు, ఆద్యంత రహితుడు, నిష్క్రియుడు, ఆనందమయుడు, మాయ లేదా అజ్ఞానం చేత సృష్టించబడిన ఉపాధులకు అతీతుడు, దుః ఖాలకు అందనివాడు, అవిభాజ్యుడు, అవ్యక్తుడు, నామరూప రహితుడు, నిశ్చలుడు, స్వయంప్రకాశకుడు.
239. జ్ఞాతృ (తెలుసుకునేవాడు), జ్ఞేయం (తెలుసుకోదగిన విషయం), జ్ఞానం (తెలుసుకున్న విషయం); ఇటువంటి తేడాలు ఆ పరబ్రహ్మంలో లేవు. దానిని బుధులు (జ్ఞానులు) అపారం, సర్వాతీతం, జ్ఞానస్వరూపంగా సాక్షాత్కరించుకుంటారు.
240. ఇంకా ఆ పరబ్రహ్మం గ్రహింపదగినది కాదు లేదా విడవదగినది కాదు (ఎందుకంటే దానికి వస్తుత్వం లేదు కనుక). మనస్సుకూ వాక్కుకూ అది అతీతం. ఇంకా అది అపరిమితం, ఆద్యంతరహితం, పరిపూర్ణం, సర్వజీవులలో నెలకొనివుండి అసమానమైన తేజంతో తన ఉనికిని తెలియజెప్పే అంతరాత్మ.
241-242. సూర్యుడు – మిణుగురు పురుగు; రాజు – సేవకుడు; సాగరం – కూపం; మేరుపర్వతం – పరమాణువు; వీటిలో మొదటిది బ్రహ్మాండమైనదైతే, రెండవది చాలా చిన్నది. కానీ రెంటికీ ఒక సమాన ధర్మం ఉంది. పరమాత్మకూ, జీవాత్మకూ మధ్య కూడా ఇటువంటి పోలికే ఉంది. పరమాత్మ, జీవాత్మల ఐక్యతను తెలిపే ‘తత్త్వమసి’ మొదలైన శ్రుతివాక్యాలను కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి.
243. జీవాత్మ పరమాత్మల మధ్య తారతమ్యం మాయాకల్పితమే కానీ వాస్తవం కాదు. మహత్తు నుండి స్థూలశరీరం వరకూ గలవాటికన్నింటికీ జన్మనిచ్చిన మాయ వాటి ద్వారా పరమాత్మకు ఉపాధి కల్పిస్తోంది. జీవాత్మకు కూడా పంచకోశాలనే ఉపాధిని ఆ మాయే కల్పించింది.
244. రాజ్యాన్ని కలిగివున్నవాడు రాజు; డాలు–కత్తి చేపట్టినవాడుసైనికుడు. రాజు యొక్క రాజ్యాన్ని, సైనికుడి డాలుకత్తులను తీసివేస్తే ఇద్దరికీ భేదమే లేదు. ఇద్దరూ సామాన్య మానవులే. అలాగే ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత మొదలైన గుణాలను; జీవుని యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తే ఇరువురికీ భేదమే లేదు.
245. పరబ్రహ్మ గురించివున్న ద్వైతభావనల్ని శ్రుతి వాక్యాలు సమర్థించవు. ఇటువంటి అధ్యారోప (కాని విషయాన్ని ఔను అనిపించే భావన)లను సత్యసాక్షాత్కారం ద్వారా తొలగించాలి.
246. భ్రాంతి వలన తాడు పాము వలె కనిపిస్తుంది (రజ్జుసర్పభ్రాంతి). అలాగే స్థూలసూక్ష్మప్రపంచాలు భ్రాంతిజనితాలే కానీ నిజం కావు. వివేచనతో ఈ ప్రపంచాన్ని నిషేధించి (అనగా తోసిపుచ్చి) జీవాత్మ పరమాత్మల ఐక్యతను అనుభూతి చెందాలి.
247. జీవాత్మ పరమాత్మల ఐక్యతను అర్థం చేసుకొనేటప్పుడు,భాగత్యాగ లక్షణాలలో మూడవ దానిని అనుసరించవలెను. అంటే పూర్తి నిరాకరణ, పూర్తి స్వీకరణ – రెండూ పనికిరావు. (వేదాంత పరిభాషలో మూడు రకాల భాగత్యాగ లక్షణాలు కలవు. అవి 1) జహతి (జహల్లక్షణ) 2) అజహతి (అజహల్లక్షణ) 3) భాగ లక్షణ (జహదజహల్లక్షణ). మొదటి పదానికి వివరణ: ‘గంగాయాం ఘోషః’ అన్నప్పుడు గోకులం గంగలో కాక గంగ ఒడ్డున ఉన్నదని అర్థం. పైకి కనిపించే అర్థం వదలి సమీపార్థాన్ని తీసుకోవాలి. రెండవ పదానికి వివరణ: ‘శ్వేతో ధావతి’ అన్నప్పుడు తెల్లని గుర్రం పరిగెత్తుతున్నదని అర్థం కానీ తెల్లరంగు పరిగెత్తుతున్నదని కాదు. దీనిలో పైకి కనిపించే అర్థంతో పాటు ఇవ్వబడిన అధికసమాచారాన్ని గ్రహించాలి. మూడవ పదానికి వివరణ: దీని యందు ఈ రెండు రకాల పద్ధతులనూ అనుసరించి సమాచారాన్ని గ్రహించాలి.)
248-249. “ఈ దేవదత్తుడే ఆ దేవదత్తుడు” అన్న వాక్యంలో “రెండు సందర్భాలలోని దేవదత్తుడు ఒకడే” అని సూచింపబడుతోంది. కానీ రెండు సందర్భాలలో అతని వయసు, స్వభావం, నివాసప్రాంతం వేర్వేరు కావచ్చును. అదే విధంగా ‘జీవుడే శివుడు’ అన్నప్పుడు వారిద్దరి ఉమ్మడి లక్షణమైన జ్ఞానస్వరూపతను మాత్రమే పరిగణించాలి. వందల వేదాంతగ్రంథాలలో ఈ విషయం వివరించబడింది.
250. అనాత్మను నిషేధించి స్వయంభూతం, బంధరహితం, ఊహాతీతం అయిన ఆత్మను సాక్షాత్కరించుకోవలెను. అవాస్తవమైన దేహమే ఆత్మ అనే భావనను విడిచి, జ్ఞానస్వరూపమైన ఆత్మనే నేను గ్రహించు!
251. రకరకాల కుండలు ఒకే మట్టితో చేయబడినా, మనం వాటిని మట్టిగా కాక పాత్రలుగానే పరిగణిస్తున్నాము. అదే విధంగా చరాచరసృష్టి మొత్తం బ్రహ్మపదార్థంతోనే చెయ్యబడింది. స్వయంభవుడైన బ్రహ్మం కానిదేదీ లేదు కాబట్టి, నీవు కూడా ఆ ప్రశాంతమైన, పవిత్రమైన, అద్వితీయమైన ఆత్మవే.
252. స్వప్నంలోని ప్రదేశాలు, కాలాలు, వస్తువులు, వాటిని చూసేవారు అంతా అవాస్తవమే. అదే విధంగా జాగ్రదవస్థలో మనం చూసే ప్రపంచం కూడా అసత్యమే. దేహం, దాని అంగాలు, ప్రాణాలు, అహంకారం కూడా అజ్ఞానజనితమైనవి కాబట్టి అవాస్తవాలే. కాబట్టి ప్రశాంతమైన, పవిత్రమైన, అద్వితీయమైన ఆత్మవు నీవేనని గ్రహించు!
253. భ్రాంతి వలన ఒక వస్తువు, వేరొక వస్తువు మీద అధ్యారోపణ చేయబడినప్పుడు, అది భిన్నమైనదిగా కనిపిస్తుంది. ఆ భ్రాంతి తొలగినప్పుడు మాత్రమే మొదటి వస్తువుకు కారణభూతమైనది రెండవదనీ, అంతేకాక, ఆ రెండూ వేరుకాదనీ కూడా తెలుస్తుంది.
254. జాతికులగోత్రాలకు అతీతమైనది, నామరూప రహితమైనది, దేశకాలాది విషయాలను అధిగమించేది అయిన పరబ్రహ్మమే నీవని తెలుసుకుని, ఆ పరబ్రహ్మం గూర్చి నీ మనసులో ధ్యానించు.
255. ఆ పరబ్రహ్మం వాక్కుకు అతీతం. నిర్మలమైన జ్ఞానచక్షువులకు మాత్రమే అది గోచరిస్తుంది. పవిత్రమూ, జ్ఞానస్వరూపమూ, అనాదీ అయిన ఆ పరమాత్మను మదిలో ధ్యానించు.
256. ఆకలి, దప్పిక, దుఃఖము, క్షీణించడం, మరణించడం, భ్రాంతి అనే ఆరింటినీ ‘షడూర్ములు’ అందురు. ఈ షడూర్ములకు అతీతమూ, యోగీశ్వరుల హృదయాలు ధ్యానించేదీ, ఇంద్రియాలకు, బుద్ధికి సైతం అగోచరమూ, ఎదురులేనిదీ అయిన ఆ పరబ్రహ్మం గూర్చి హృదయంలో ధ్యానించు!
257. భ్రాంతికల్పితమైన జగత్తుకు ఆధారభూతమూ, స్వాశ్రయమూ (తనకు తానే ఆశ్రయం), స్థూలసూక్ష్మ ప్రపంచాలకు విభిన్నమూ, అఖండమూ, నిరుపమానమూ (పోల్చదగిన వస్తువు లేనిది) అయిన బ్రహ్మతత్త్వమే నీవని మనస్సులో ధ్యానించు!
258. జననం, వృద్ధి, పరిణామం, క్షీణత, వ్యాధి, మరణం – ఈ ఆరింటినీ షడ్వికారాలందురు. షడ్వికారాలు లేనిది, అవ్యయమైనది, సృష్టిస్థితిలయాలకు కారణభూతమైనది అయిన ప్రత్యగాత్మను మదిలో ధ్యానించు.
259. భేదరహితమూ, ఎల్లప్పుడూ సారభూతమైనదీ, తరంగాలు లేని సాగరం వలె నిశ్చలమూ, నిత్యముక్తమూ, అఖండమూ అయిన ఆత్మస్వరూపాన్ని అంతఃకరణంలో ధ్యానించు.
260. అనేక విషయాలకు ఒకే కారణభూతమూ, మిగిలిన కారణాలను ఖండించగలదీ, స్వయంగా కారణరహితమూ, మాయకూ, దాని ఫలితాలకూ అతీతమూ, సర్వస్వతంత్రమూ అయిన పరబ్రహ్మాన్ని మదిలో ధ్యానించు!
261. ద్వైతభావనలకు అతీతమూ, అనంతమూ, నాశరహితమూ, మాయ, ప్రపంచం మొదలగు వాటికి విభిన్నమూ, నిత్యమూ, అవ్యయమైన ఆనందస్వరూపమూ, నిరంజనమూ, కల్మషరహితమూ అయిన పరబ్రహ్మాన్ని మనస్సులో ధ్యానించు!
262. హిరణ్యం వివిధ ఆభరణాల రూపాలను దాల్చినట్లు, అనేక నామరూపగుణ వికారాలు పొందుతున్నట్లు కనిపించే పరబ్రహ్మను మదిలో ధ్యానించు.
263. సర్వాతీతమూ, మాయ కంటే కూడా అధికభాసం కలదీ, చరాచరసృష్టి మొత్తానికీ అంతరాత్మా, అనంతమూ, అవ్యయమూ, సచ్చిదానంద స్వరూపమూ అయిన పరబ్రహ్మను మనస్సులో ధ్యానించు.
264. శ్రుతి వాక్యాలకు విరుద్ధం కాని వాదనల సహాయంతోనూ, స్వయంబుద్ధితోనూ వివేచన చేస్తూ నీలోని ఆత్మతత్త్వం మీద నీవే ధ్యానించాలి. అప్పుడు చేతిలోని నీటిబిందువు ఎంత స్పష్టంగా గోచరిస్తుందో అదే స్పష్టతతో సత్యసాక్షాత్కారం కలిగి నిశ్శంకస్థితిని చేరతావు.
265. సైన్యాన్ని నడిపించే రాజు సర్వస్వతంత్రంగా, నియంతకు ఉండేటటువంటి స్వేచ్ఛతో వ్యవహరించినట్లు, శరీరంతో ఉండగానే జ్ఞానస్వరూపమైన ఆత్మను సాక్షాత్కరించుకున్న వ్యక్తి ఆత్మారాముడై (అనగా తనలోని ఆత్మతత్త్వంలో సువ్యవస్థితుడై) పరబ్రహ్మలో ప్రపంచాన్ని లయిస్తాడు.
266. బుద్ధి యొక్క గు (అంతరాళం)లో స్థూలసూక్ష్మ శరీరాలకంటే విభిన్నంగా అద్వితీయమైన, సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ నివసిస్తూ ఉంటుంది. నిత్యమూ ఈ ఎరుకలో, అంటే బ్రహ్మలో నివసించేవాడికి పునర్జన్మ లేదు.
267. బ్రహ్మసాక్షాత్కారం కలిగినా కర్తృత్వ–భోక్తృత్వ భావనల బలమైన వాసనలు (సంస్కారాలు) మిగిలే ఉంటాయి. వాటివలన పునర్జన్మ కలుగుతుంది. అందువలన ఆత్మైక్యస్థితిలో నిస్సంగంగా ఉండటం నిరంతరం అభ్యాసం చేయటం ద్వారా మాత్రమే ముక్తి లభిస్తుందని మునులు పలికారు.
268. “నేను, నా శరీరం, నా తెలివితేటలు” మొదలైన అనాత్మ భావనలను ఆత్మైక్యతను అభ్యాసం చేయటం ద్వారా విద్వాంసుడైన సాధకుడు విడిచిపెట్టాలి.
269. హృదయాంతరాళంతో నెలకొని, బుద్ధి, దాని మార్పులకు సాక్షీమాత్రంగా ఉండే ఆత్మను, సోఽహం (నేనే ఆత్మను) అనే ఆశావహమైన ఆలోచనతో అనాత్మ భావనలను జయించాలి.
270. సమాజ బాధ్యతలనూ, దేహ పోషణాసక్తినీ, శాస్త్రపాండిత్య ప్రకర్షణనూ వదలనిదే ఆత్మధ్యాస కలుగదు.
271. సమాజ బాధ్యతలంటూ సమాజం చుట్టూ తిరిగేవారికి, శాస్త్రపాండిత్యం మీద మిక్కిలి మమకారం కలవారికి, శరీరాన్ని నీటుగా ఉంచుకొనుటకు సమయం వృథా చేసేవారికి ఆత్మసాక్షాత్కారం సాధ్యం కాదు.
272. సంసారం అనే కారాగృహం నుండి విముక్తి కోరేవారికి పైన చెప్పబడిన కోరికలే శృంఖలాలు. వాటిని విడిచిపెట్టినవారికే విముక్తి సాధ్యం.
273. అగరుచందనాది చెక్కలపై దుర్గంధపూరితమైన కల్మషాలు పేరుకున్నప్పుడు, ఆ చెక్కలను శుభ్రం చేసి, సానరాయి మీద అరగదీస్తే, వాటిలోని సుగంధం గుబాళిస్తుంది.
274. అదే విధంగా అంతరాత్మ మీద పేరుకుపోయిన రాజస, తామస సంస్కారాలనే మలినాలను జ్ఞానాగ్ని అనే ఒరిపిడితో తొలగిస్తే, తిరిగి ఆ అంతరాత్మ భాసిస్తుంది.
275. ఆత్మసాక్షాత్కారం మీది ఇచ్ఛ, అనాత్మ సంబంధమైన కోరికల రాశితో కప్పబడిపోయింది. ఆత్మైక్యతను తలపోస్తూ వాటిని నాశనం చేస్తే, ఆత్మ తన స్వప్రకాశంతో తిరిగి వెలుగొందుతుంది.
276. పైన చెప్పబడిన అభ్యాసం వలన క్రమక్రమంగా మనస్సు ఆత్మలో వ్యవస్థితమై, బాహ్యాకర్షణలకు దూరం అవుతుంది. అవి పూర్తిగా వ్యయమైనప్పుడు ఆత్మ యొక్క నిరాఘాట సాక్షాత్కారం కలుగుతుంది.
277. యోగి మనస్సు నిరంతర ఆత్మధ్యానం వలన మరణిస్తుంది. దానితోపాటే కోరికలు కూడా పోతాయి. కాబట్టి అధ్యారోపణలను వదలిపెట్టు.
278. రజస్సత్త్వాలు తమస్సునీ, సత్త్వం రజస్సునీ, సత్త్వాన్ని శుద్ధసత్త్వమూ (అనగా పరబ్రహ్మం) నాశనం చేస్తాయి. కాబట్టి శుద్ధసత్త్వగుణ సహాయంతో నీ అధ్యారోపణలను జయించు.
279. ప్రారబ్ధ కర్మల (క్రితం చేసిన పనుల) ఫలం శరీరాన్ని నడిపిస్తోందని ఎరిగి, మౌనంగా ఓర్పుతో అధ్యారోపణలను తొలగించు.
280. “నేను జీవాత్మను కాను. పరమాత్మనే” అని తలపోస్తూ ప్రారబ్ధకర్మజనిత అనాత్మ భావనలనూ, అధ్యారోపణలనూ దూరం చేయుము.
281. శాస్త్రజ్ఞాన సహాయంతోనూ, వివేచనతోనూ, నీ సొంత అనుభూతుల వలననూ నీవే ఆత్మనని తెలుసుకొని, అన్ని అధ్యారోపణలనూ పోగొట్టుకొనుము.
282. మునులకు కర్మఫలస్వీకారం, కర్మఫలత్యాగం – ఈ రెంటితోనూ సంబంధం లేదు. కాబట్టి నిరంతర బ్రహ్మనిష్ఠతో అధ్యారోపణలను విడిచిపెట్టు.
283. “తత్త్వమసి” (నీవే ఆత్మవు) వంటి వాక్యాల సహాయంతో బ్రహ్మైక్యతాభావాన్ని బలంగా పెంపొందించుకొని అధ్యారోపణలను వదలిపెట్టు.
284. శరీరంతో తాదాత్మ్యం పూర్తిగా నశించే దాకా జాగరూకతతోనూ, ఏకాగ్రతతోనూ సాధన చేసి అధ్యారోపణలను నిర్మూలించు.
285. ప్రపంచం, దానిలోని వస్తువుల అనుభవం స్వప్నమాత్రం ఉన్నా, దానిని తొలగించుటకు తెంపులేకుండా సాధన చేయవలెను.
286. నిద్రకు గాని, లౌకిక వ్యవహారములకు గాని, పరాకునకు గాని అవకాశమీయక నీ అంతఃకరణాన్ని సదా ప్రత్యగాత్మ యందు నిలుపుము.
287. మాతాపితరుల కలయికనుంచి ఉద్భవమైన ఈ హేయమైన శరీరాన్ని మాంస మలపూరితమూ, చండాలంగానూ భావిస్తూ, దాని యందలి వ్యామోహాన్ని త్యజించి, బ్రహ్మసాక్షాత్కారాన్ని పొంది కృతకృత్యుడవు కమ్ము.
288. వేదాంత పరిభాషలో సర్వత్రా ఉన్న ఆకాశాన్ని మహాకాశం అనీ, ఒక ఘటం (కుండ)లోని ఆకాశాన్ని ఘటాకాశం అనీ అంటారు. ఘటం నశించినప్పుడు ఘటాకాశం మహాకాశంలో ఎలా కలిసిపోతుందో అదే విధంగా పరమాత్మలో తాదాత్మ్యం చెందినట్లు భావించి, ధ్యానం చేస్తూ జీవాత్మను పరమాత్మలో లయించు.
289. చరాచర సృష్టికి కారణభూతమూ, స్వయంప్రకాశకమూ అయిన పరబ్రహ్మానివి నీవే అయి, ఈ బ్రహ్మాండాన్నీ, దానికి పరమాణురూపమైన పిండాండాన్నీ మలభాండం వలె త్యజించు.
290. దేహంతో లీనమైవున్న నీ అహంకారాన్ని సచ్చిదానంద పరబ్రహ్మంలో లయించి, లింగశరీరాన్ని త్యజించి చైతన్యస్వరూపుడవు కమ్ము.
291. అద్దంలో ఒక నగరం ప్రతిబింబించినట్లే, ఏ పరమాత్మలో ఈ జగత్తు ప్రతిబింబిస్తోందో ఆ పరమాత్మే నీవని గ్రహించి కృతకృత్యుడవు కమ్ము.
292. నాటకంలో నటించే నటుడు ఒక పాత్ర కోసం వేసుకున్న ముసుగును, ఆ నాటకం పూర్తి అయిన తర్వాత త్యజించి తన స్వస్వరూపాన్ని తిరిగి పొందినట్లు నీ నిజరూపమైన అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని తిరిగిపొందు.
293. దృశ్యమాన ప్రపంచం, నీలోని అహంకారం, ఈ రెండూ క్షణికాలే. క్షణికమైన ఆ అహంకారం “నాకు అన్నీ తెలుసు” అనుకొంటే అది నిజం ఎలా అవుతుంది?
294. అహంకారాదులకు మనలోని అంతరాత్మ సాక్షీమాత్రంగా నిలచివుండును. జాగ్రత్సప్నసుషుప్తి అవస్థాత్రయంలోనూ ద్రష్టగా నిలిచే ఆ ఆత్మకు శ్రుతి వాక్యాల ప్రకారం జననమరణాదులు లేవు. అది శాశ్వతమైనది. కాబట్టి అది స్థూలసూక్ష్మ శరీరాల కంటే విభిన్నమైనది.
295. మార్పు చెందే సృష్టిని పూర్తిగా ఎవరు ఎరుగుదురో వారు ఏ మార్పు లేకుండా ఉండటం సహజం కదా! ఊహలలోనూ, కలలలోనూ, సుషుప్తిలోనూ స్థూలసూక్ష్మ శరీరాల ఎరుక మనకు లేకపోవటం నిత్యానుభవమే కదా!
296. మాంసం ముద్ద అయిన స్థూలశరీరంతోనూ, అహంకారపూరితమైన సూక్ష్మశరీరాలతోనూ తాదాత్మ్యం మాని నీ స్వరూపమైన సచ్చిదానంద పరబ్రహ్మాన్ని తెలుసుకొని శాంతిని పొందు.
297. తుచ్ఛమైన ఈ శరీరానికి గల కులగోత్రనామరూపాదులయందునూ, గృహస్థాశ్రమ ధర్మాలు మొదలైనవాటి యందునూ, లింగశరీర ధర్మాలైన కర్తృత్వ భావనల యందునూ కల అభిమానాన్ని విడిచి, అఖండ సచ్చిదానంద పరబ్రహ్మైక్యతను పొందుము.
298. అహంకారం వలన అనేక అడ్డంకులు సంసారతరణం చేయగోరే సాధకునికి కలుగుతున్నాయి. ఈ అహంకారం అజ్ఞానం యొక్క రూపాంతరం మాత్రమే.
299. అహంకారంతో లేశమాత్ర సంబంధం ఉన్నా ముక్తి కలలోని వార్త.
300. రాహువు నుండి విముక్తి పొందిన చంద్రుడు పూర్ణరూపాన్ని పొందినట్లే, అహంకార విముక్తి పొందిన జీవాత్మ పవిత్రమూ, అనంతమూ, నిరంతరానందస్వరూపమూ, స్వయంప్రకాశకమూ అవుతుంది.
301. అజ్ఞానం వలన నేను జ్ఞానినని లేదా బలవంతుణ్ణని కొందరు, నేను అజ్ఞానినని లేదా బలహీనుణ్ణని కొందరు, ఇలా రకరకాలుగా తమను ఊహించుకొంటూ ఉంటారు. ఈ “నేను” అన్న భావన పూర్తిగా నశించిన సాధకుడే నిరాఘాత బ్రహ్మైక్యతను అనుభూతి చెందుతాడు.
302. ‘బ్రహ్మానందం’ అనే నిధి ‘అహంకారం’ అనే భయంకరమైన సర్పం చేత కాపాడబడుతున్నది. సత్త్వరజస్తమో గుణాలు దాని పడగలు. విద్వాంసుడైన సాధకుడు వేదాంతబోధల ప్రకారం సాధన చేస్తూ, ‘వేదాంతవిజ్ఞానం’ అనే ఖడ్గాన్ని చేపట్టి దాని పడగలు నరికివేసినప్పుడు మాత్రమే ఆ నిధి చేజిక్కుతుంది. అనగా సాధకుడి అహంకార నిర్మూలన జరిగినపుడే బ్రహ్మైక్యతను అనుభూతి చెందుతాడు.
303. విషపదార్థం యొక్క అవశేషాలు శరీరంలో ఉన్నంత కాలం స్వస్థత చేకూరదు. అలాగే లేశమాత్ర అహంకారం శేషించివున్నా ముక్తి లభించదు.
304. అహంకారం యొక్క సమూలనాశనం; శంక, భ్రాంతి మొదలైన మనస్సు యొక్క ఆలోచనాతరంగాల విరామం; అంతరంగంలోని నిజతత్త్వంపై అవగాహన – ఇవి మాత్రమే సత్యసాక్షాత్కారానికి దారితీస్తాయి.
305. ఆత్మతో తాదాత్మ్యం చెందటానికి అడ్డుపడే అహంకారాన్ని విడిచిపెట్టు. అది ఎల్లప్పుడూ మారిపోతూ ఉంటుంది. అది ఆత్మ యొక్క ప్రతిబింబం కావటం వలన మేధస్సు కలదిలాగా అగుపిస్తుంది. దాని వలననే నీవు జననమరణ సంసార చక్రంలో చిక్కుకున్నావు. నిజానికి నీ యథార్థస్వరూపం సచ్చిదానంద పరబ్రహ్మం.
306. జననమరణాదివికార రహితుడవు, సర్వవ్యాపకుడవు, నిష్కళంకుడవు అయిన నీకు అహంకార తాదాత్మ్యం వలననే సంసారబంధం కలిగింది. ఇదే లేనిచో నీవు సదానందస్వరూపమైన పరబ్రహ్మానివి.
307. కంఠంలో దిగిన ముల్లు తినేవానికి ఎలా అడ్డుపడుతుందో, అలాగే అహంకారం నీ శత్రువై అడ్డుపడుతోంది. జ్ఞానం అనే ఖడ్గంతో ఆ అహంకారాన్ని ఛేదించి ఆత్మసామ్రాజ్యాన్ని చేరుకొని ఆనందించు.
308. అహంకారం యొక్క పోకడలను నిగ్రహించి, రాగరహితుడవై, మౌనం వహించి, ఆత్మసుఖానుభవంలో వర్తిల్లు.
309. వర్ష ఋతువునందు మేఘం వాయుప్రభావంచే మరల మరల వర్షిస్తుంది. అట్లే అహంకారం పూర్తిగా నిర్మూలించబడినా, క్షణమాత్రం మనస్సులోకి తిరిగివస్తే, మళ్ళీ వేళ్ళూనుకొని ప్రబలమై అనేక విక్షేపాలకు కారణం అవుతుంది.
310. జంబీర వృక్షం (దబ్బచెట్టు) మొదలుకు నరికివేయబడినా నీరు లభిస్తే, తిరిగి చిగిర్చి పెద్దవృక్షంగా వృద్ధి చెందుతుంది. అలాగే అహంకారం తన ఉనికిని కోల్పోయినా, విషయచింతన (అనగా ఇంద్రియార్థాల గుర్చిన ఆలోచనల) వలన పునర్జీవితమై ప్రబలం అవుతుంది. విషయచింతన ఏ మాత్రం చేయరాదని భావం.
311. శరీరంతో తాదాత్మ్యం చెందినవాడే ఇంద్రియసుఖాలను కామిస్తాడు. అట్లు కానివాడు కామించడు కదా! కాబట్టి ఇంద్రియార్థ చింతనే ద్వైతభావనలను పెంచి బంధహేతువు అవుతున్నది.
312. కామబీజం (అనగా ఇంద్రియార్థాల పట్ల కోరిక) సకామకర్మల వలన మరింత వృద్ధి అవుతున్నది. ఈ కర్మలను మానివేసిన కామబీజం కూడా క్రమేణా నశిస్తుంది. కాబట్టి సకామకర్మలను త్యజించి, నిష్కామకర్మలను చేయవలెను.
313. అట్లే కామబీజం వలన ఫలాపేక్షతో చేసే కర్మలు వృద్ధి చెంది, అవి తిరిగి కామబీజాన్ని పెంపు చేయును. అందువలన మానవుని సంసారచక్రం ఎడతెగక సాగుతూనే ఉంటుంది.
314. ఈ సంసారచక్రాన్ని ఛేదించుటకు సాధకుడు కామాగ్నిని, సకామకర్మలను జ్ఞానాగ్నిచే దహించవలెను. విషయచింతన, సకామకర్మలు భస్మీపటలం అయినప్పుడే సంసారబంధం తెగును.
315-316. సకామకర్మలనూ, విషయచింతననూ, ఇంద్రియార్థాల పట్ల ఆకర్షణనూ దహించుటకు మన దృక్పథాన్ని మార్చుకోవాలి. సర్వకాల సర్వావస్థలలోనూ, సర్వవస్తువులనూ బ్రహ్మమయంగా చూడాలి. పరబ్రహ్మంతో తాదాత్మ్యం చెందటానికి పడే ఆరాటం వలన పై మూడు నాశనమవుతాయి.
317. సకామకర్మలూ, విషయచింతనా నాశనం అయినప్పుడు కామబీజం కూడా నాశనం అవుతుంది. అంటే జీవించి ఉన్నప్పుడే కోరికలు నశిస్తాయి. ఇదే జీవన్ముక్తి.
318. ఎంత దట్టమైన చీకటైనా సూర్యోదయంతో మాయం అయినట్లు, బ్రహ్మసాక్షాత్కారం కొరకు వాంఛ తీవ్రమయితే, అహంకార జనితమైన కోరికలు వెంటనే నశిస్తాయి.
319. ఎంతటి అంధతామిస్రమైనా భానూదయంతో మాయం కావలసిందే. అట్లే పరమానందసాక్షాత్కారం అయినపుడు బంధాలూ, దుఃఖాలూ పారిపోవలసిందే.
320. దృశ్యమానమైనది బాహ్య ప్రపంచం, ఆలోచనాజనితమైనది అంతర్ ప్రపంచం – ఈ రెంటినీ కూడా ‘నేతి – నేతి’ (ఇది బ్రహ్మం కాదు, కానేరదు) అనే సాధనతో నిషేధించి, పరమానందస్వరూపమైన పరబ్రహ్మంపై ధ్యానం చేస్తూ, ప్రారబ్ధకర్మ మిగిలివున్నంత కాలం, అత్యంత జాగరూకతతో గడపాలి.
321. బ్రహ్మసుతుడైన సనత్కుమారుడు, “ఏమరుపాటుతనం మృత్యువుతో సమానం” అని పోల్చాడు. కాబట్టి బ్రహ్మనిష్ఠతో చేసే సాధనలో జాగరూకత అత్యావశ్యకం.
322. జ్ఞానసాధన చేసేవారికి తమ స్వస్వరూపానుసంధానంలో ఏమరుపాటుతనాన్ని చూపడానికి మించిన అనర్థం మరి లేదు. ఎందుకంటే దానివలన మోహం, మోహం వలన అహంకారం, అహంకారం వలన బంధనప్రాప్తి, చివరకు దుఃఖం కలుగుతాయి.
323. జారస్త్రీ తన విటుణ్ణి మభ్యపెట్టినట్లు, విషయోన్ముఖుడైన జ్ఞాని యొక్క ఆత్మతత్త్వాన్ని, ఏమరుపాటుతనం (లేదా మరుపు) కప్పిపుచ్చి విషయాసక్తిని పెంచివేస్తుంది.
324. తటాకంలోని నీటిపై ఆవరించివున్న నాచును తొలగించిన మరుక్షణం తిరిగి అది ఆ నీటిని ఎలా కప్పివేస్తుందో, అదే విధంగా, మాయ లేదా అజ్ఞానం విషయాసక్తుడైన సాధకుని ఆవరించి మోహంలో ముంచివేస్తుంది.
325. చేయిజారి మొదటి మెట్టుమీద పడిన బంతి, మెట్టు తర్వాత మెట్టు ఆగకుండా దొర్లుతూ క్రిందకు చేరుతుంది. అదే విధంగా లక్ష్యచ్యుతి (అనగా ఏమరుపాటుతనం) సాధకుణ్ణి ఇంకాయింకా బాహ్యాకర్షణలవైపుకు మరల్చి, అధఃపాతాళానికి దిగజారుస్తుంది.
326. విషయాసక్తి వలన ఆయా విషయాల గుణాలపైకి మనస్సు మరలుతుంది. విషయగుణ సంపర్కం వలన కోరికలు కలిగి, ఆ కోరికల సాధనకు సాధకుని మనస్సు పరుగిడును.
327. జ్ఞాని అయిన సాధకునికి ఏకాగ్రచిత్తంలో ఏమరుపాటుతనం మృత్యువు కంటే కూడా ప్రమాదకరం. ఏకాగ్రచిత్తం కల సాధకుడు ఎంతో జాగ్రత్తగా మెలిగినప్పుడే సంపూర్ణవిజయాన్ని సాధిస్తాడు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనస్సును పరబ్రహ్మం మీద ఏకాగ్రం చేయాలి.
328. ఏమరుపాటుతనం వలన సాధకుడు తన నిజతత్త్వాన్ని మరచి పతనం అవుతాడు. పతనమైన సాధకుడు జ్ఞానమార్గంలో తిరిగి ఆరోహించటం ఎంతో అరుదు.
329. సర్వానర్థాలకూ హేతువైన ఇంద్రియార్థాల సంపర్కాన్ని (అనగా కామసంకల్పాల్ని) విడనాడాలి. ఎవరు జీవించి ఉండగానే కైవల్యస్థితి (అనగా సంకల్పరహిత బ్రహ్మైక్యస్థితి లేదా జీవాత్మ–పరమాత్మల అభేదభావన)ని పొందుతారో, అట్టివారుమరణానంతరం పరబ్రహ్మమే అగుదురు. భేదభావన ఏ మాత్రం కలిగినా, అనాత్మభావన వల్ల కలిగే ‘భయం’ వారిని వీడదని యజుర్వేదం చెప్పుచున్నది.
330. ఏ విద్వాంసుడి (అనగా సాధకుడి)కైనా మరుపు వలన పరబ్రహ్మంతో భేదభావం కలిగితే, అది భయానికి మూలకారణం అవుతుంది.
331. శిక్షార్హమైన దొంగతనాన్ని చేసిన దొంగ శిక్షను అనుభవించినట్లే, శ్రుతులు, స్మృతులు, తర్కాలు దేనిని తూలనాడాయో ఆ దేహాది వస్తుతాదాత్మ్యం వలన సాధకుడు అంతులేని దుఃఖాలను పొందుతాడు.
332. నిత్యానంద పరబ్రహ్మం మీద ధ్యానించే సాధకుడు అజ్ఞానవిముక్తిని పొంది ఆత్మైక్యతను బడయును. అనాత్మ వస్తువులను ధ్యానించువాడు నాశనం పొందును. ఒక దోషి ఎట్టకేలకు ఎలా శిక్షింపబడతాడో, అట్లే నిర్దోషి చివరికి బంధవిముక్తిని పొందును కదా!
333. బంధహేతువగు అనిత్యవస్తు అనుసంధానాన్ని యతి (సాధకుడు) విడువవలెను. ఆత్మ యందే మనస్సును అనుసంధానం చేస్తూ, నేనే పరమాత్మ స్వరూపుడనని భావించవలెను. ఈ విధంగా బ్రహ్మనిష్ఠ పాటిస్తూ బ్రహ్మానుభవపరుడైనప్పుడు అజ్ఞానజనిత సంసారదుఃఖం తొలగి పరమసుఖాన్ని పొందును.
334. ఆత్మేతరాలైన బాహ్యవస్తువుల అనుసంధానం చెడు సంస్కారాల వృద్ధికి హేతువు అవుతుంది. వివేకి అయిన సాధకుడు బాహ్యవస్తు స్మరణ మాని, ప్రత్యగాత్మ చింతన చేయవలెను.
335. బాహ్య ప్రపంచాన్ని గూర్చిన ఆలోచనలను తిరస్కరించుట ద్వారా మనస్సు ప్రసన్నతను పొందుతుంది. ఈ ప్రసన్నత పరమాత్మ దర్శనానికి దారితీస్తుంది. పరమాత్మ సాక్షాత్కారం జననమరణశ్రేణిని ఛేదిస్తుంది. కాబట్టి బాహ్య ప్రపంచ తిరస్కృతి విముక్తికి సోపానము.
336. ఎవరు పండితుడు? నిత్యానిత్య విచక్షణ చేయగలిగి, వేదవాఙ్మయంపై విశ్వాసం కలిగి, పరమాత్మపై దృష్టి కలవాడై, మోక్షసాధన చేయువాడే పండితుడు. అటువంటి పండితుడు, చిన్నపిల్లవాని వలె పతనహేతువైన అనాత్మ చింతన చేయునా? చేయడని భావము.
337. నిద్రించుచున్న వ్యక్తిని మేలుకొని ఉన్నట్లు, మేలుకొని ఉన్న వ్యక్తిని నిద్రించుచున్నట్లు లెక్కింపము. అట్లే శరీర తాదాత్మ్యం కలవానికి ముక్తి కలుగదు. ముక్తి లభించినవానికి శరీర తాదాత్మ్యం ఉండదు.
338. సమస్త స్థావరజంగమ వస్తుసముదాయాన్ని వ్యాపించి, సర్వాధారమై ఉండే ఆత్మయే తానని గ్రహించి, సకలోపాధులను త్యజించి, ఎవరైతే అఖండ పరిపూర్ణ పరబ్రహ్మంలో లీనమైవుంటాడో అతడే ముక్తుడు.
339. అఖండ విశ్వం మొత్తం తానేనని అర్థం చేసుకొనుటయే బంధవిముక్తిని కలిగిస్తుంది. ఈ భావనను మించిన భావన మరి లేదు. దృశ్యమాన ప్రపంచాన్ని బహిష్కరించి (అనగా కాదని) ఆత్మను అచంచలంగా అంటిపెట్టుకొనుట ద్వారా ఇది సాధ్యమగును.
340. శరీరంతో తాదాత్మ్యం చెందినవాడు, ఇంద్రియార్థాలపై లగ్నమైన మనస్సు కలవాడు, సకామకర్మలు చేయువాడు దృశ్యమాన ప్రపంచాన్ని ఎట్లు బహిష్కరించగలడు? సర్వాశ్రమ ధర్మాలనూ, సకామకర్మలనూ, తన్మాత్రలనూ పరిత్యజించిన తత్తజ్ఞ్వులు, పరమానందస్వరూపమైన పరమాత్మ మీది ఇచ్ఛతో బ్రహ్మనిష్ఠను పాటించుట ద్వారా మాత్రమే ప్రపంచాన్ని కాదనగలరు.
341. గురు ముఖతః పరమసత్యాన్ని గూర్చి శ్రవణం చేసి, షట్సంపత్తిని కలిగివున్న విరాగి మాత్రమే ఈ చరాచరవిశ్వమూ, ఆత్మ ఒకటేనన్న ఐక్యతను సమాధి ద్వారా కనుగొనునని శ్రుతివాక్యాలు తెలుపుతున్నాయి.
342. ఆత్మ యొక్క అపరోక్షానుభూతిని నిర్వికల్ప సమాధి అందురు. ఈ స్థితిలో సాధకుడు సాపేక్షభావలన్నింటినీ దాటి పరబ్రహ్మను యథాతథంగా అనుభూతి చెందును. ఈ స్థితికి చేరినవారు మాత్రమే ప్రబలమైన అహంకారాన్ని, జన్మజన్మల ఫలమైన సంస్కారాలను నాశనం చేయగలరు.
343. ఆవరణశక్తి సహాయంతో, విక్షేపశక్తి సాధకుణ్ణి అహంకారరూపంలో ఉండే మోహంలో పడవేసి, కర్తృత్వ భోక్తృత్వ భావనలను కలిగించును.
344. ఆవరణశక్తిని నిర్మూలించకుండా విక్షేపశక్తిని జయించటం ఎంతో కష్టం. క్షీరనీరాలను విభాగించినట్లు; ‘ద్రష్ట లేదా దృక్ (చూచువాడు)’ అయిన ఆత్మను, ‘దృశ్యం (చూడబడేది)’ అయిన జగత్తు నుంచి వేరుచేసినప్పుడు మాత్రమే ఆవరణశక్తి స్వాభావికంగా నశిస్తుంది. అనిత్యాలైన ఇంద్రియార్థాల వలన మనస్సుకు కలిగే ఆకర్షణలను అరికట్టినపుడే, నిరాఘాటమైన విజయం సంపూర్ణం అవుతుంది.
345. అపరోక్షానుభూతి వలన కలిగిన దృక్–దృశ్య వివేకం (ఆత్మ, అనాత్మల నిజ తత్త్వ జ్ఞానం) మాత్రమే మాయాకల్పిత బంధనాలను ఛేదించి, పునర్జన్మ లేకుండా చేయగలదు.
346. దుర్భేద్యమైన అవిద్య అనే అరణ్యాన్ని జీవాత్మ, పరమాత్మల ఐక్యతను అవగతం చేసే జ్ఞానాగ్ని మాత్రమే నిశ్శేషంగా దహిస్తుంది. ఈ ఐక్యతను అనుభూతి చెందినవానిలో పునర్జన్మ బీజం మిగులుతుందా?
347. సత్యసాక్షాత్కారం సంపూర్తిగా కలిగినపుడే ఆత్మను మరుగు పరిచే మాయాకల్పితమైన ముసుగు (భ్రాంతి) తొలగిపోతుంది. దాని వలన మిథ్యాజ్ఞానం (దేహమే ఆత్మ అనుకునే అపోహ) నశిస్తుంది. దాని వలన విక్షేపశక్తినుండి జనించే సర్వదుఃఖాలూ నిర్మూలింపబడతాయి.
348. పైన చెప్పుకున్న మూడింటినీ రజుసర్పభ్రాంతిలో గమనించవచ్చు. (భ్రాంతి = తెలియకపోవటం వలన, మిథ్యాజ్ఞానం = త్రాడును పాము అనుకోవటం, దుఃఖాలు = అలా అనుకోవటం కలిగిన భయం.) కాబట్టి జ్ఞాని బంధవిముక్తి కోసం వస్తువుల యొక్క నిజతత్త్వాన్ని ఆకళింపు చేసుకోవాలి.
349-350. స్వయంప్రకాశకం కాని ఇనుము అగ్ని వలన వేడెక్కి ఎర్రగా మారి, ప్రకాశిస్తుంది. అట్లే జడమైన (అనగా ప్రాణం లేని) బుద్ధి, ఆత్మసామీప్యత వలన జ్ఞాతృ (తెలుసుకొనేవాడు) – జ్ఞానం (తెలుసుకొనబడే విషయం) అనే రూపాలుగా పరిణమిస్తోంది. భ్రాంతిలో ఉన్నప్పుడూ, స్వప్నాలలోనూ, ఊహలలోనూ ఈ రెండూ మిథ్య కాబట్టి, మేలుకొనివున్నప్పుడు కూడా మిథ్యే. అదే విధంగా అహంకారం నుండి స్థూలశరీరం వరకూ గల వివిధ అంగాలు, ఇంద్రియార్థాలు, తెరవెనుకవున్న ఆత్మవలన చైతన్యాన్ని పొందుతున్నాయి. అవి మారుతూ ఉంటాయి కాబట్టి అనిత్యాలు. ఆత్మ ఒక్కటే నిత్యం.
351. పరమాత్మ నిత్యమూ, అద్వితీయమూ, అఖండజ్ఞాన స్వరూపమూ, బుద్ధ్యాదులకు సాక్షీమాత్రమూ, స్థూలసూక్ష్మ శరీరాల కంటే విభిన్నమూ, సర్వజీవులకు అంతర్గతమైనదీ, సదానందమయమూ, మనలోని నిజమైన నేను (మూడవ భాగ లక్షణ ప్రకారం) అయి ఉన్నది.(దీని వివరణ శ్లోకం సంఖ్య 247 వద్ద వివరింపబడినది.)
352. జ్ఞాని అయిన సాధకుడు నిత్యానిత్య విచక్షణ చేస్తూ, జీవాత్మ పరమాత్మ ఒకటేనన్న సత్యాన్ని రూఢిపరచుకొంటూ, అన్నిరకాల అడ్డంకులనూ అధిగమించి, చిదానందస్వరూపమై తనలోనే ఉన్న పరమాత్మను సాక్షాత్కారం చేసుకొని శాంతిని పడయవలెను.
353. అద్వితీయమైన ఆత్మను నిర్పికల్ప సమాధి ద్వారా అవలోకించినపుడు అజ్ఞానమనే హృదయగ్రంథి నాశనమగును.
354. ‘నేను’, ‘నీవు’, ‘ఇది’ మొదలైనవన్నీ బుద్ధి వికారాలే. కానీ సమాధిస్థితిలో అద్వితీయమైన పరమాత్మ సాక్షాత్కరించినపుడు సత్యోదయమై, ఈ వికారాలన్నీ మటుమాయమవుతాయి.
355. మౌనియై, సంయమనం పాటిస్తూ, ఇంద్రియ ప్రపంచం నుండి అంతర్ముఖుడై, అత్యంతమైన ఓరిమితో, తానే విశ్మాత్మనన్న అవగాహనతో యతి సమాధిస్థితికై యత్నించవలెను. ఈ విధమైన అభ్యాసంతో అజ్ఞానజనితమైన భ్రమలన్నింటినీ తొలగించుకొని, కర్మాతీతుడై, మనోవికల్పరహితుడై పరబ్రహ్మంలో వర్తిల్లును.
356. దృశ్యమాన ప్రపంచాన్నీ, ఇంద్రియాలనూ, మనస్సునూ, అహంకారాన్ని సైతం ఆత్మలో లయించి, సమాధిస్థితిని పొందిన వారే జననమరణ సంసార బంధవిముక్తిని పొందుతారు. అంతేకానీ పాండిత్యప్రకర్షణ చేయువారు కాదు.
357. పారదర్శకంగా ఉన్న స్ఫటికాన్ని, ఎర్రని గులాబీపూవు ముందు ఉంచితే, అది కూడా ఎర్రగా కనిపిస్తుంది. పువ్వుని తీసిన మరుక్షణం తిరిగి పారదర్శకం అవుతుంది. అదే విధంగా నిర్గుణ పరబ్రహ్మం యొక్క అంశ అయిన మానవుడు ఉపాధులు చుట్టుముట్టటం వలన భిన్నత్వాన్ని అనుభూతి చెందుతాడు. ఉపాధులు తొలగిపోయినప్పుడు తిరిగి అచలమైన నిర్గుణపరబ్రహ్మగా భాసిస్తాడు. కాబట్టి విద్వాంసుడైన సాధకుడు ఉపాధుల నిర్మూలన కోసం నిర్వికల్పసమాధిని అనవరతం సాధన చేస్తాడు.
358. నిత్యసత్యమైన దానిమీద తదేకనిష్ఠ ఉన్నవాడు నిత్యుడుగా మారిపోతాడు. భ్రమరకీటకన్యాయం ప్రకారం, తుమ్మెదకు భయపడిన కీటకం ఆ తుమ్మెదనే తలపోస్తూ, చివరకు తుమ్మెదలా మారిపోతుంది. అదే విధంగా బ్రహ్మమే లక్ష్యంగా, ఏకనిష్ఠతో సర్వదా ధ్యానించు సాధకుడు బ్రహ్మమే అగును.
359. కీటకం మిగిలిన వ్యాపారాలన్నీ మాని, భ్రమరం గూర్చి గాఢయోచన చేసి భ్రమరంగా మారినట్లు, యోగి పరమాత్మతత్త్వాన్ని తదేకనిష్ఠతో ధ్యానించి పరమాత్మను చేరును.
360. పరమాత్మతత్త్వం అతిసూక్ష్మమైనది. స్థూలదృష్టితో అనగా తర్కం, వాదోపవాదాలు మొదలైన వాటితో దానిని గ్రహించలేము. మహనీయులు చిత్తవృత్తులను నిరోధించి, మిక్కిలి నిర్మలమూ, సూక్ష్మమూ ఐన మనఃస్థితిని పొంది పరమాత్మతత్త్వానికి చేరువవుతారు.
361. పుటంపెట్టబడిన సువర్ణం మలినాలను పోగొట్టుకొని తన స్వాభావికమైన భాసాన్ని ఎలా పొందుతుందో అదే విధంగా ధ్యానం వలన మనస్సు సత్త్వరజస్తమో గుణాలనే మలినాలను పోగొట్టుకొని తన యథార్థస్వరూపమైన ఆత్మను పొందును.
362. నిరంతర అభ్యాసం వలన పవిత్రుడైన సాధకుడు సవికల్పసమాధి నుండి నిర్వికల్పసమాధిని చేరుతాడు. అప్పుడు అద్వితీయమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు.
363. కోరికలను గ్రంథు (చిక్కుముడుల)తో పోలుస్తారు. నిర్వికల్పసమాధి వలన ఈ గ్రంథులు పూర్తిగా నశించును. కర్మలు కూడా పరిపక్వమై కర్మాతీతస్థితికి సాధకుడు చేరును. అతనికి తన లోపలాబయటా కూడా ఆత్మతత్త్వమే స్ఫురిస్తూ ఉంటుంది.
364. వేదాంత వాక్యాల శ్రవణం కంటే, వాటి మననం నూరు రెట్లు అధికఫలాన్ని ఇస్తుంది. అట్లే ధ్యానం మననం కంటే లక్షరెట్ల ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కానీ నిర్వికల్పసమాధి ఎడతెగని అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది.
365. స్వతఃసిద్ధంగా మనస్సు చంచలమైనది. దీనివలన అది అనాత్మ వస్తువుల వెన్నంటి పరుగిడుతూ ఉంటుంది. నిర్వికల్పసమాధి వలన మాత్రమే బ్రహ్మతత్త్వం పూర్తిగా అవగతమై మనఃచాంచల్యం నశిస్తుంది.
366. కాబట్టి మనస్సును శాంతపరిచి, ఇంద్రియాలను నిగ్రహించి, అంతరాత్మలో మనస్సును నిమగ్నం చేసి, ఆత్మతత్త్వంతో తాదాత్మ్యం చెందవలెను. అప్పుడే అనాది అయిన అజ్ఞానం అంతమవుతుంది.
367. వాఙ్నిరోధం (వ్యర్థ సంభాషణ చేయకపోవటం), అపరిగ్రహం (ఇతరుల వస్తువులను, సంపదలను ఆశించకపోవటం), నిరాశ (విషయవాంఛలు లేకపోవటం), నిరీహం (పేరుప్రతిష్ఠలు, పుత్రదారవిత్తాదుల కోసం ప్రాకులాడకపోవటం), ఏకాంతశీలత్వం (ఏకాంత జీవనాన్ని గడపటం) – ఈ గుణాలు యోగమార్గంలో సాధన చేయటానికి మొదటి మెట్లు.
368. ఏకాంత ప్రదేశంలో జీవనం వలన ఇంద్రియనిరోధం, ఇంద్రియనిరోధం వలన మనోనిగ్రహం, మనోనిగ్రహం వలన అహంకార నాశనం, అహంకార నాశనం వలన అవిచ్ఛిన్న పరమానంద రసానుభవం సిద్ధిస్తాయి. కాబట్టి సాధకుడు మనస్సు స్వాధీనానికి ఎల్లప్పుడూ అవిరళకృషి సల్పుతూ ఉండాలి.
369. మనస్సు ద్వారా వివిధ ఇంద్రియాలను, బుద్ధి ద్వారా మనస్సును, బుద్ధికి సాక్షీమాత్రమైన జీవాత్మ ద్వారా బుద్ధిని నియంత్రించి, జీవాత్మను పరమాత్మలో లయించి పరమశాంతి పొందు!
370. దేహం, ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి – వీటిలో దేనితో అహంకారానికి సంపర్కం కలుగుతుందో ఆ ఉపాధితో అనుబంధం ఏర్పడుతుంది.
371. ఈ అనుబంధాన్ని నివృత్తి చేయటం ద్వారా, మునులు సర్వబంధాలనూ త్రెంచుకొని, సదానందరసానుభవాన్ని పొందుతారు.
372. విరక్తితో నిండిన (అనగా మమతానురాగాలు లేని) సాధకుడు మాత్రమే అంతరంగంలోనూ, బయటా కూడా సన్న్యాసి కాగలడు. అటువంటి సాధకుడు మాత్రమే మోక్షం కోసం అంతర్గతమైన, బాహ్యమైన బంధాలన్నింటినీ త్రెంచివేస్తాడు.
373. వైరాగ్యంతో పరబ్రహ్మంలో సుప్రతిష్ఠమైన సాధకుడు మాత్రమే శబ్దరూపరసాదులతో సంగాన్ని, అహంకారాదులతో తాదాత్మ్యాన్ని విడిచిపెట్టగల సమర్థుడు.
374. ఆకసంలో ఎగిరే పక్షికి రెండు రెక్కలు ఎలా అవసరమో, అట్లే వైరాగ్యం, వివేకం అనేవి సాధకునికి రెండు రెక్కలవంటివి. వాటి సహాయంతోనే సాధకుడు విముక్తి సౌధాన్ని అధిరోహించగలడు.
375. అత్యంత వైరాగ్యం కలవాడికే సమాధి లభిస్తుంది. సమాధిలోనే నిరాఘాటమైన సత్యసాక్షాత్కారం లభిస్తుంది. అటువంటి సాధకుడు మాత్రమే బంధనాల నుండి స్వేచ్ఛ పొంది, నిత్యానందపదాన్ని చేరును.
376. ఇంద్రియనిగ్రహం ఉన్న సాధకునికి వైరాగ్యం కంటే సుఖదాయకమైనది మరి లేదు. దీనికి ఆత్మసాక్షాత్కారం తోడయితే సర్వస్వతంత్రమైన ఆత్మసామ్రాజ్యానికి దారి తీస్తుంది. ఇదే మోక్షద్వారకవాటం కాబట్టి అంతరంగంలోనూ, బాహ్యంగానూ వైరాగ్యాన్ని పాటించి, ఆత్మ యందే నిదిధ్యాసం ఒనర్చుము!
377. విషతుల్యమైన విషయవాంఛను వదలిపెట్టు. మృత్యువుకు మలిరూపమైన జాతికులాశ్రమాభిమతిని (అనగా కుల, వర్ణ, ఆశ్రమ, జాతులవలన జనించే అహంకారాలు), వాటికి సంబంధించిన సమస్త కర్మలను దూరం చేయి. అనిత్యాలైన అటువంటి శరీరసంబంధితాలను త్యజించి, ఆత్మపై దృష్టి పెట్టు. వస్తుతః దృశ్యప్రపంచానికి నీవు ద్రష్ట (సాక్షీమాత్రుడ)వు మాత్రమే. మనఃశృంఖలాలను ఛేదించి పరబ్రహ్మవు కమ్ము.
378. బ్రహ్మమే లక్ష్యంగా ఉంచుకొని; ఇంద్రియాలను వాటివాటి స్థానాలలో నిగ్రహించి; శరీరపోషణార్థమైన ఆలోచనలను త్యజించి; బ్రహ్మైక్యతను సాధించి; తెంపులేకుండా బ్రహ్మానందరసాస్వాదన చేయుము. మిగిలిన ఆనందదాయికాలన్నీ డొల్లలే.
379. దుఃఖదాయికమూ, కశ్మలపూరితమూ అయిన అనాత్మ చింతనను వదలి, పరమానంద స్వరూపమూ, మోక్షదాయికమూ అయిన ఆత్మను ధ్యానించుము.
380. స్వయంప్రకాశకమూ, సాక్షీమాత్రమూ అయిన ఆత్మ, బుద్ధి యొక్క అంతరాళంలో స్థానం ఏర్పరుచుకొని భాసిస్తూ ఉంటుంది. శాశ్వతమైన ఆ ఆత్మనే లక్ష్యంగా చేసుకుని, మిగిలిన ఆలోచనలను వదలి ధ్యానం చేయవలెను.
381. ఇతర ఆలోచనలను చొరనీయకుండా, ఆత్మనే ధ్యానిస్తూ, దానితో తాదాత్మ్యం చెందవలెను.
382. పగిలిపోయిన కుండలవల్ల ఏ ఉపయోగమూ లేదు. దేహం, ఇంద్రియాలు, అహంకారాదులు పగిలిన కుండల వంటివి. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా పరబ్రహ్మతో తాదాత్మ్యం చెందుతూ, ఉదాసీనంగా, స్థిరచిత్తంతో మసలుకొనుము.
383. మనస్సును పవిత్రీకరించి, జ్ఞానస్వరూపమూ, సాక్షీమాత్రమూ అయిన ఆత్మపై కేంద్రీకరించి, నెమ్మదిగా మనస్సును నిశ్చలమొనర్చి, సాధకుడు తన నిజమైన ఆత్మతత్త్వాన్ని అవలోకించాలి.
384. శరీరం, దాని అంగాలు, ప్రాణాలు, మనస్సు, అహంకారం మొదలైనవన్నీ అజ్ఞానజనితమైన ఉపాధులు. ఆకాశం వలె ఉపాధిరహితమూ, అఖండమూ, అనంతమూ అయిన ఆత్మపై తదేకనిష్ఠతో ఏకాగ్రం చేయాలి.
385. కుండలో, కలశంలో, ధాన్యం నిలువచేసే గాదెలో, సూదిబెజ్జంలో, ఇలా విశ్వంలోని ప్రతివస్తువులో నిండి, వేర్వేరు ఆకారాలలో కనిపిస్తున్నప్పటికీ ఆకాశం ఒకటే కానీ వేర్వేరు కాదు. అట్లే సృష్టిలోని ప్రతివస్తుమా ఒకేవొక్క బ్రహ్మపదార్థంతో చేయబడింది.
386. చరాచర సృష్టిని సృజించిన బ్రహ్మ మొదలు గడ్డిపోచవరకూ గల అన్ని స్థావర జంగమాలూ ఉపాధులే. కాబట్టి సాధకుడు తనలోగల బ్రహ్మతత్త్వమే తన నిజతత్త్వంగా గుర్తెరగవలెను.
387. భ్రాంతి వలన రజ్జువును సర్పం అనుకొంటాము. వివేకం అనే దీపం వెలుగులో ఆ భ్రాంతి తొలగినప్పుడు రజ్జువు యొక్క నిజరూపం గోచరం అవుతుంది. అదే విధంగా విశ్వం యొక్క నిజస్వరూపం పరబ్రహ్మమేనని, వివేకం వలననే గోచరం అవుతుంది.
388. స్వస్వరూపం అవగతం అయినప్పుడు వేర్వేరు రూపాలలో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రాదులే కాక సర్వచరాచరవిశ్వమూ పరబ్రహ్మస్వరూపంగా గోచరిస్తుంది.
389. లోపల, బయట, పైన, క్రింద, ముందు, వెనుక, ఇరుపక్కలు, అన్ని దిశలా నిండి ఉన్నది ఆత్మయే. ఆత్మేతరమైనది లేనేలేదు.
390. నీటిలో ఉన్న తరంగాలు, నురుగు, సుడులు, బుడగలు నీటి యొక్క వివిధరూపాలు మాత్రమే. అదే విధంగా స్థూలశరీరం మొదలు అహంకారం దాకా సర్వమూ చిత్స్వరూపమే అనగా అఖండ విశుద్ధ చైతన్య జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మమే.
391. మృత్తిక నుండి తయారైన కుండ, భాండం, ఘటం మొదలైనవాటి పేర్లు వేరయినా, అన్నీ మట్టి యొక్క రూపాలే కదా! మాయ అనే మదిర వలన కలిగే మత్తు యొక్క ప్రభావం వలననే ‘నేను’, ‘నీవు’ అనే తేడాలు తోస్తున్నాయి. అదే విధంగా ఇంద్రియగ్రాహ్యమైన ప్రకృతి పరమాత్మ కంటే వేరు కాదు.
392. శ్రుతి వాక్యాలు ద్వైతరాహిత్యాన్నే బోధిస్తున్నాయి. అనగా మనకు కనిపించేది అద్వితీయ పరబ్రహ్మ తప్ప మరేదీ కాదు.
393. పరబ్రహ్మాన్ని ఆకాశంతో పోలుస్తారు. అది నిర్మలం (పవిత్రం), నిర్వికల్పం (దోషరహితం), నిస్సీమం (ఎల్లలు లేనిది), నిః స్పందనం (నిశ్చలం), నిర్వికారం (మార్పులేనిది), అంతర్బహిఃశూన్యం (లోపల బయట అనే తేడాలు లేనిది), అద్వితీయం (రెండు కాదు, ఒకటే). అదే మనలోని అంతరాత్మ. దీనికంటే తెలుసుకోదగిన వస్తువు ఏమున్నది?
394. ఇంకనూ విస్తరించి చెప్పుటకు ఏమి కలదు? జీవుడు స్వయంగా బ్రహ్మమే. చరాచర ప్రపంచం మొత్తం బ్రహ్మమే. కాబట్టే మహాత్ములు తమ బ్రహ్మైక్యతను గుర్తెరిగి, దృశ్యమాన ప్రపంచంతో బంధాలను త్రెంచుకొని, అద్వితీయ సచ్చిదానంద పరబ్రహ్మం నందే వర్తిల్లుచున్నారు.
395. స్థూల శరీరం వలన కలిగే అహంకారాన్ని ముందు పోగొట్టుకో. వాయు సమానమైన లింగశరీరమందు కల అభిమానాన్ని బలవంతంగా తొలగించుకో. వేదవాఙ్మయం చేత కీర్తింపబడిన పరమానంద స్వరూపమైన బ్రహ్మం నీవేనని గ్రహించి, జీవించు.
396. శవసమానమైన దేహం మీది అభిమానం పోనంతవరకూ జీవాత్మ అపవిత్రుడే. జననం, వ్యాధి, మరణం మొదలైన శత్రువులు ఆ జీవాత్మను బాధిస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే తాను పవిత్రాత్మ స్వరూపుడన్న భావన అవగతమవుతుందో అప్పుడు ఈ బాధలు అన్నీ తొలగిపోతాయి.
397. అహంకారాది ఉపాధులను తొలగించినప్పుడు, అనంతమూ, అద్వితీయమూ, నిష్క్రియమూ అయిన పరమాత్మ మిగులును.
398. చిత్తవృత్తులను అనగా మనస్సు పోకడలను పరమాత్మలో లయించినప్పుడు, నామరూపమయమైన ఈ దృశ్యమాన ప్రపంచం అజ్ఞానుల జల్పం (వ్యర్థ ప్రేలాపన) అవుతుంది.
399. చరాచర విశ్వం కేవలం అద్వితీయ బ్రహ్మం యొక్క కల్పన. నిర్వికారం (సుస్థిరం), నిరాకారం (రూపం లేనిది) నిర్విశేషం (మార్పు చెందనిది) అయిన పరబ్రహ్మకు భేదం (లేదా మార్పు) ఎక్కడి నుంచి వస్తుంది?
400. ద్రష్టృ (చూచువాడు), దర్శన (చూడటం), దృశ్య (చూడబడేది) – ఈ మూడు భావనలూ లేని నిర్వికార, నిరాకార, నిర్విశేష పరబ్రహ్మకు భేదం ఎక్కడి నుంచి వస్తుంది?
401. కల్పాంతంలో ప్రళయం వచ్చిన తరువాత సముద్రాలన్నీ ఏకమై నిశ్చలమహాసాగరంగా మారి ప్రపంచమంతటినీ నీటితో నింపివేస్తాయి. ఆత్మ కూడా ఏకార్ణం (అనగా ఒకేవొక మహాసాగరం)లాగా అంతటా పరిపూర్ణంగా వ్యాపించి, నిశ్చలంగా ఉంటుంది. అటువంటి పరిపూర్ణైకాత్మకు భేదం ఎక్కడిది?
402. సూర్యోదయం చీకటిని హరిస్తుంది. అలాగే జ్ఞానోదయం అయినప్పుడు, భ్రాంతికి మూలకారణమైన అజ్ఞానం పరమాత్మలో లయించి, ఆ అద్వితీయ పరమాత్మ ఒక్కటే మిగులుతుంది. అప్పుడు పరమాత్మతత్త్వంలో భేదానికి తావు ఎక్కడిది?
403. సుషుప్తి (గాఢనిద్ర) అనే అవస్థలో ఎవరికైనా తారతమ్యం గోచరిస్తుందా? అలాగే అద్వితీయమూ, అన్నింటిలో ఒకే విధంగా వ్యాపించివున్న ఆత్మలో భేదభావం ఎక్కడిది?
404. బ్రహ్మజ్ఞానం లభించిన తర్వాత భ్రాంతి ఎప్పటికినీ కలుగనేరదు. నిజం తెలిశాక రజ్జువు సర్పంగానూ, ఎండమావిలో నీరు ఉన్నట్లుగానూ కనిపించవు కదా!
405. సుషుప్తి అవస్థలో ఈ ప్రపంచానికి ఉనికి లేదు. శ్రుతి వాక్యాలు కూడా జ్ఞానదృష్టితో చూస్తే ప్రపంచం భ్రాంతియేనని చెపుతున్నాయి.
406. ఒకే మూలపదార్థంతో చేయబడిన రెండు వస్తువులలో ఒక వస్తువు రెండవదానిని ఆవరించివుంటే, రెండూ ఒకటేనని విజ్ఞులు అవగతం చేసుకొంటారు. అట్లే మాయ ఆవరించుట చేత బ్రహ్మపదార్థమే ప్రపంచం రూపంలో కనిపిస్తుంది. అందుచేత దానిని వేరుగా భావిస్తాము. కానీ ప్రపంచానికి వేరైన ఉనికి లేదు. రజ్జువు నందు భ్రాంత్యారోపణచేత అగుపించు సర్పం భ్రాంతి తొలగిపోయాక రజ్జువే అవుతుంది కదా!
407. దృశ్యమాన ప్రపంచం యొక్క మూలం మనస్సులోనే ఉంది. మనస్సు లయించినపుడు అది కూడా లయిస్తుంది. కాబట్టి మనస్సును నీ నిజతత్త్వమైన పరమాత్మ మీద ఏకాగ్రపరచి, దానిలోనే లయించు!
408. జ్ఞానస్వరూపమూ, ఆనందమయమూ, ఉపాధిరహితమూ, సర్వస్వతంత్రమూ, నిష్క్రియమూ అయిన ఆత్మకు ఎల్లలూ, ఆ ఆత్మను పోలిన వస్తువులూ మరి లేవు. ఆ ఆత్మ తన హృదయం (బుద్ధి) లోనే ఉందని సమాధిస్థితిలో సాధకుడు తెలుసుకొంటాడు.
409. ‘కారణం–ఫలితం’ – వీటికి అతీతమైనది, భావనలన్నింటి వెనుక గల అసలైన భావం, సమవ్యాప్తి కలది, అసమానమైనది, సాక్షాత్కారం తప్ప వేరొక తార్కాణం లేనిది, వేదవాక్యాలచే వక్కాణించబడినది అయిన ఆత్మ హృదయంలో ఉందని సమాధిస్థితిలో విద్వాంసులు తెలుసుకొంటారు.
410. నాశనం లేనిది, శాశ్వతమైనది, అభావ–ప్రాగభావ– ప్రధ్వంసాభావ రహితమైనది (అభావము – ‘అసలు లేకపోవడం’, ప్రాగభావము – ‘ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది’, ప్రధ్వంసా భావము – ‘ఒకప్పుడు ఉంది – ఇప్పుడు లేదు’), అలలు లేని ప్రశాంతసాగరం వంటిది, నామరూపరహితమైనది, సుగుణదుర్గుణ రహితమైనది అయిన ఆత్మ హృదయంలో ఉందని సమాధిస్థితిలో విద్వాంసులు తెలుసుకొంటారు.
411. సావధాన చిత్తంతో సమాధిని పొంది, స్వస్వరూపమైన ఆత్మ యొక్క అఖండవైభవాన్ని అవలోకించు! అనేక జన్మల సంస్కారాల వలన కలిగిన బంధాలను త్రెంచుకొని, మానవజన్మకు గమ్యమైన మోక్షాన్ని సాధించి, జన్మసాఫల్యాన్ని పొందు.
412. నీలో అంతర్యామిగా ఉండి, ఉపాధిరహితమై, అద్వితీయమై, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మను ధ్యానించు. తద్వారా జన్మాంతరం కలుగనే కలుగదు.
413. పూర్వవాసనాఫలమై నీడలా వెన్నంటివున్న శరీరాన్ని మహాత్ములు శవసమానంగా తలచి, దానితో అనుబంధాన్ని పెంచుకోరు.
414. వాంతి చేయబడిన ఆహారం పట్ల ఎవరూ మరల ఆకర్షితులు కారు. అది గుర్తుకు వస్తే జుగుప్స కలుగుతుంది. అట్లే జడమూ, అశుద్ధమూ, అనేక పరిమితులకు లోబడినది అయిన శరీరాన్ని త్యజించి, శాశ్వతానందజ్ఞానస్వరూపమైన ఆత్మను అనుభూతి చెందు.
415. నిజమైన జ్ఞాని దృశ్యమాన ప్రపంచాన్ని బ్రహ్మజ్ఞానం అనే అగ్నిలో సమూలంగా దహించి, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మలో వసిస్తాడు.
416. తన మెడలో ఉన్న చక్కని పూలదండ పడిపోయినా, ఉన్నా ఆవు పట్టించుకోదు. అట్లే మహాత్ములు ప్రారబ్ధం అనే దారాలతో ముడిపడివున్న శరీరానికి ప్రాధాన్యతను ఈయక, పరబ్రహ్మంలో లీనమయివుంటారు.
417. పరమానంద స్వరూపమైన ఆత్మనే తమ నిజతత్త్వంగా ఎరిగిన తత్త్వవిదులు, సాధారణ జనుల వలె శరీరాన్ని లక్షింపరు.
418. ఆత్మతత్త్వంలో లీనమై, జీవన్ముక్తిని పొందిన యోగి పరమానందాన్ని అంతర్గతంగానూ, బాహ్యంగానూ కూడా అనుభవిస్తాడు.
419. వైరాగ్యం యొక్క ఫలం జ్ఞానం. జ్ఞానం ద్వారా ఉపరతి (అనగా ఇంద్రియసుఖాలపై విముఖత), తద్వారా బ్రహ్మానందానుభవం, ఎట్టకేలకు పరమశాంతి కలుగుతుంది.
420. సాధకుని ప్రయత్నలోపం వలన ఈ వరుసక్రమంలో మొదటి స్థితులు నిష్ఫలమైతే, చివరి స్థితులు సాధించబడవు. వైరాగ్యం వలన జ్ఞానం, ఆ జ్ఞానం వలన ఉపరతి కలుగకపోతే బ్రహ్మానందానుభవం, పరమశాంతి కలుగవు. కానీ ఆ వరుసక్రమంలో సక్రమంగా సాధన చేస్తే, విషయవాసనా నివృత్తి జరిగి, మహత్తృప్తి, అనుపమమైన ఆనందం లభిస్తాయి.
421. అజ్ఞానవశంలో ఉన్నప్పుడు నానారకాల పనులు చేసినా, జ్ఞానోదయం తర్వాత సాధకుడు అట్లు చేయలేడు. నిజజీవితంలో వచ్చే సామాన్యదుఃఖాలను జ్ఞాని ఏ మాత్రం ఖాతరు చేయడు.
422. మృగతృష్ణ (ఎండమావి)లో నీరు ఉందని దాని కోసం పరిగెత్తడం అజ్ఞానం. ఆ విషయం ఎరిగిన జ్ఞాని చిరునవ్వుతో తన మార్గంలో కొనసాగుతాడు. అదే విధంగా దృశ్యమాన ప్రపంచాన్ని చూస్తున్న జ్ఞానికి అది అనిత్యం అని రూఢిగా తెలియటం వలన, దానిచేత ఆకర్షింపబడడు. జ్ఞానప్రాప్తి వలన కలిగే లాభాలకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?
423. అజ్ఞానగ్రంథి (అనగా అజ్ఞానమనే చిక్కుముడి) తొలగినప్పుడు, స్వార్థకార్యాలకు, విషయవాంఛలకు అవకాశం ఎక్కడుంటుంది?
424. ఇంద్రియార్థాలు మనస్సును ఏమాత్రం ఆకర్షించలేని స్థితిని వైరాగ్యానికి పరాకాష్ఠగా చెప్పవచ్చును. అలాగే అహంకారాన్ని సమూలంగా నిర్మూలించటమే పరిపూర్ణజ్ఞానం. మనోవృత్తులు పూర్తిగా పరబ్రహ్మంలో లయమైపోయి, పునరుత్థానం కానపుడు (అంటే తిరిగి ఉదయించనపుడు) ఉపరతి ఉచ్చస్థితికి చేరిందని చెప్పవచ్చు.
425. సుఖనిద్రలో ఉన్న వ్యక్తి లేదా పసిబాలుడు ఇతరులు ప్రేరేపించినపుడే ఆహారం, నీరు తీసుకొంటాడు. అలాగే సర్వకాలసర్వావస్థలలో పరబ్రహ్మం నందే లయమై ఉండటం వలన జ్ఞాని ప్రపంచాన్ని ఒక స్వప్నంలా చూస్తూ, అప్పుడప్పుడు మాత్రమే దానితో అనుసంధానం చేస్తాడు. ఆహారాదులను అర్ధచేతనావస్థలో తీసుకుంటూ, తన అనంతమైన పుణ్యఫలాలను అనుభవిస్తూ, కృతకృత్యుడై ఉండే జ్ఞాని చాలా అరుదు.
426. స్థితప్రజ్ఞుడైన సన్న్యాసి తన చిత్తాన్ని సచ్చిదానందంలో లయించి, నిరాకార–నిష్క్రియ–శాశ్వత బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు.
427. సృష్టికి కారణభూతమూ, ఉపాధిరహితమూ, అద్వితీయమూ, శుద్ధచైతన్య స్వరూపమూ అయిన పరబ్రహ్మంలో తాదాత్మ్యభావం ఒక నిరంతర ప్రవాహరూపంలో ఉంటే ఆ స్థితిని ‘ప్రజ్ఞ’ అంటారు. ఈ ప్రజ్ఞలో సుస్థిరతను సంపాదించినవాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు.
428. స్థితప్రజ్ఞుడై, అప్రతిహతమైన ధారలాగా స్థిరమైన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ, ప్రపంచస్మృతి లేనివాడు ‘జీవన్ముక్తుడు’ అనబడతాడు.
429. పరబ్రహ్మంలో లీనమైనప్పటికీ జాగరూకుడై ఉండేవాణ్ణి, ఇంద్రియ వ్యాపారాల నుండి విముక్తి పొందినవాణ్ణి, ప్రాపంచిక వాసనలు లేకుండా దృఢమైన హెచ్చరిక కలవాణ్ణి ‘జీవన్ముక్తుడం’ టారు.
430. సంసారంలో ఉన్నా మమతాహంకారాలు లేనివాణ్ణి, శరీరాంగాలు ఉన్నా వాటి ప్రసక్తి లేనివాణ్ణి, ఏ ఆరాటాలూ లేనివాణ్ణి, ‘జీవన్ముక్తుడం’ టారు.
431. ఏ మనిషికైనా నీడ మీద అభిమానం ఉండదు. అదే విధంగా జీవాత్మను నీడలా వెంటాడే శరీరంపై ‘నాది’ అనే మక్కువ లేకపోవటం, ‘నేను’ అనే కర్తృత్వభోక్తృత్వ భావనలను కలిగివుండక పోవటం జీవన్ముక్తుని లక్షణం.
432. గతించిన పూర్వవైభవాలనూ, భవిష్యత్ ప్రణాళికలనూ, వర్తమానంలో ప్రాప్తించిన స్థితిగతులనూ పట్టించుకోక ఉదాసీనంగా ఉండుట – జీవన్ముక్తుని లక్షణం.
433. వివిధ నామరూపాలతో, అంతులేని పరిమాణ ఆకృతులతో, లెక్కకుమిక్కిలి గుణదోషాలతో కనిపించే ఈ ప్రపంచంలోని అన్ని వస్తువుల వెనుక చైతన్యరూపంలో ఉన్న పరబ్రహ్మాన్ని మాత్రమే చూడటం – జీవన్ముక్తుని లక్షణం.
434. ఇష్టమైన వస్తువు ప్రాప్తించినపుడు మోదం; అనిష్టమైన వస్తువు ప్రాప్తించినపుడు లేదా ఇష్టమైన వస్తువు పోయినపుడు ఖేదం – ఈ రెండు పరిస్థితులకూ అతీతంగా సమదర్శిత్వాన్ని కలగివుండటం జీవన్ముక్తుని లక్షణం.
435. ఇది నా సొంతం (అంతరంగికమైనది), ఇది నాది కాదు (బాహ్యమైనది); ఈ విధమైన భావనలు లేకపోవటం జీవన్ముక్తుని లక్షణం.
436. తీవ్రమైన స్థాయిలో పని చేస్తున్నా ‘నేను–నాది’ అన్న భావనలు లేకపోవటం; తన శరీరం, మేధస్సు వగైరాలు తనవి కావని అనుకోవటం – ఈ విధమైన తటస్థభావన జీవన్ముక్తుని లక్షణం.
437. భవబంధాలను పూర్తిగా త్రెంచుకోవటం, శ్రుతి వాక్యాలలో చెప్పబడినట్లు తానే బ్రహ్మమనే ఎరుక కలిగి ఉండటం – ఇవి జీవన్ముక్తుని లక్షణాలు.
438. దేహం, ఇంద్రియాలపై ‘నావి’ అనే అహంభావం లేకపోవటం, మిగిలినవాటిపై ‘ఇవి వివిధములైన వస్తువులు’ అనే భావం కలగకపోవటం – ఇవి జీవన్ముక్తుని లక్షణాలు.
439. జీవాత్మ – పరమాత్మల మధ్య, సృష్టి – సృష్టికర్తల మధ్య అభేదభావాన్ని సాక్షాత్కరించుకున్నవాడే జీవన్ముక్తుడు.
440. సాధుజనులు పూజించినా, దుర్జనులు పీడించినా సమభావంతో ఎవరైతే ఉండగలుగుతాడే వారే జీవన్ముక్తులు.
441. ఎన్ని నదీప్రవాహాలు సాగరంలో కలిసినా, సాగరంలో వృద్ధి కలుగదు. అదే విధంగా ఇతరులు ఎన్ని ఇంద్రియభావనలు కలిగించాలని ప్రయత్నించినా చలించక, బ్రహ్మతాదాత్మ్యంలో ఉండేవాడు జీవన్ముక్తుడు.
442. పరబ్రహ్మమే సత్యమని సాక్షాత్కారం చేసుకొన్న వానికి అంతకు పూర్వంలా కాక, ఇంద్రియార్థాల పట్ల పూర్తి విముఖత కలుగుతుంది. అలా కాకపోతే అతనికి సత్యసాక్షాత్కారం కాలేదనీ, ఇంద్రియార్థాల ఆకర్షణలు వీడలేదనీ అర్థం.
443. జ్ఞాని అని చెప్పుకొనేవాడు, తన పూర్వసంస్కారాల వలన ఇంద్రియవిషయాలపై ఆకర్షణలు కలుగుతున్నాయని సంజాయషీ ఇస్తే అది సమర్థనీయం కాదు. ఎందుకంటే జ్ఞానోదయం వలన కోరికలు పూర్తిగా నశిస్తాయి కదా!
444. అత్యంత కాముకుడైనా తన తల్లి సమక్షంలో సంయమనంతో ఉంటాడు. అట్లే సచ్చిదానంద బ్రహ్మసాక్షాతాక్కారం అయిన తరువాత ప్రాపంచిక కోరికలు ఉండనే ఉండవు.
445. నిదిధ్యాసన ద్వారా జ్ఞానోదయమైన మహాత్ములు ఆహారపానీయాదులు తీసుకొనుట, మోక్షేచ్ఛగల సాధకులకు సహాయం చేయుట వంటి కార్యాలు చేయటం చూడనవుతుంది. శ్రుతి వాక్యానుసారం ప్రారబ్ధం (కర్మఫలం) వలన అలా జరుగుతున్నది కాని వాంఛల వలన కాదు.
446. సుఖదుఃఖానుభూతులు ఉన్నంత వరకూ ప్రారబ్ధం ఉంటుందని అంటారు. అనుభవించే ఫలితానికి కారణమైన కర్మ ఉండి తీరాలి. కర్మ లేకుండా ఫలితం ఉండదు.
447. స్వప్నసమయంలో మనం చేస్తున్న పనులు మెలకువ రావడంతో మాయం అవుతాయి. అదే విధంగా శతకోటి జన్మలలో చేసిన కర్మల ప్రారబ్ధం బ్రహ్మజ్ఞానం వలన పూర్తిగా నశిస్తుంది.
448. స్వప్నంలో చేసిన పాపపుణ్యాలు మనిషి మేలుకున్న తరువాత, అతనిని నరకానికి గానీ, స్వర్గానికి గానీ కొనిపోగలవా?
449. ఆత్మసాక్షాత్కారం తర్వాత ఆకాశం వలె నిర్లిప్తంగా, ఉదాసీనంగా ఉన్నవానికి భవిష్యత్కర్మలు కూడా అంటవు.
450. ఘటంలోని సుర యొక్క వాసన, ఆ ఘటంలోని ఆకాశాన్ని అంటజాలదు. అట్లే ఆత్మ ఉపాధులలో మునిగివున్నా వాటి ధర్మాలు ఆత్మను అంటజాలవు.
451. ఎక్కుపెట్టిన బాణాన్ని వెనుకకు తీయవచ్చు. కానీ విడువబడిన బాణాన్ని ఉపసంహరించలేము. జ్ఞానోదయానికి పూర్వం చేసిన కర్మల ఫలాన్ని విడువబడిన బాణంతో (ఉద్గారితశరంతో) పోలుస్తారు. అది జ్ఞానోదయం వలన నశించదు. దానివలన ప్రాప్తమైన శరీరం, తక్కిన పరిణామాలను అనుభవించవలసిందే.
452. పులిని లక్ష్యంగా చేసుకుని విడువబడిన బాణం, ఆ లక్ష్యం పులి కాక గోవు అయినా దానిని భేదించక మానదు. వేగం వలన కలిగిన పూర్తిశక్తితో లక్ష్యాన్ని తాకకమానదు.
453. ప్రారబ్ధకర్మఫలం బలీయమైనది. దానిని అనుభవించినపుడు మాత్రమే నశిస్తుంది. కానీ పరబ్రహ్మంతో తాదాత్మ్యం చెందిన సాధకుని మీద సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు మూడూ పనిచేయలేవు. అవి అతని జ్ఞానాగ్నిలో దహింపబడి నిష్ఫలం అవుతాయి. కాబట్టి బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలోని ఏ బలమూ పనిచేయలేదు.
454. స్వప్నంలో చూసిన వస్తువులతో మేలుకున్న తర్వాత ఏ సంబంధమూ ఉండదు. అట్లే అద్వితీయ పరబ్రహ్మంలో లీనమై, ఉపాధులకు అతీతుడైన బ్రహ్మవేత్తకు ప్రారబ్ధకర్మ అర్థరహితమైనదవుతుంది.
455. నిద్ర మేలుకొన్న వ్యక్తి కలలలో చూసిన తన స్వప్నశరీరంపైననూ, తక్కిన వస్తువులపైననూ మమతానురాగాలను కలిగివుండడు. స్వప్నభంగం అయిందని దుఃఖీస్తూ కూర్చోడు.
456. స్వప్నకాలమందలి ఘటనలను సమర్థించుటకు గానీ, ఆ సమయంలో కనిపించిన వస్తువులను సంగ్రహించాలనీ గానీ ఎవరూ అనుకోరు. ఒకవేళ ఆ మిథ్యాప్రపంచానికే ఎవరైనా అంటిపెట్టుకొని ఉంటే వారు ఇంకా మేలుకోలేదని రూఢిగా చెప్పవచ్చు.
457. బ్రహ్మంతో తాదాత్మ్యం చెందినవాడు, సర్వాన్నీ బ్రహ్మమయంగా చూస్తాడు. నిద్రలో కనిపించిన సంఘటనలు మనుష్యులకు గుర్తున్నట్లు, శరీర వ్యాపారాలను (అనగా నిద్రాహారాదులను) స్వప్నవృత్తాంతాలుగా పరిగణిస్తాడు.
458. ఈ శరీరం వివిధ జన్మలలో చేసిన కర్మల ఫలం. కనుక ప్రారబ్ధం దేహానికే అన్వయిస్తుంది గానీ ఆత్మకు కాదు. ఆత్మ కర్మనిర్మితం కాదు.
459. శ్రుతి వాక్యానుసారం ఆత్మకు జనన మరణ క్షీణాదులు లేవు. అది అనాదియైనది, శాశ్వతమైనది. అటువంటి ఆత్మతో తాదాత్మ్యం చెందినవాని మీద ప్రారబ్ధం ఎలా పనిచేస్తుంది?
460. దేహభ్రాంతి ఉన్నంతవరకే ప్రారబ్ధం. ఆత్మసాక్షాత్కారం పొందినవ్యక్తికి దేహతాదాత్మ్యత ఉండటం అసాధ్యం. కాబట్టి అతని విషయంలో ప్రారబ్ధం అసంబద్ధం.
461. శరీరానికి ప్రారబ్ధాన్ని ఆపాదించటం కూడా దోషమే. ఒక వస్తువు మీద ఆరోపించబడిన వేరొక వస్తువుకు ప్రత్యేకమైన ఉనికి ఎక్కడిది? ఉనికి లేనిదానికి చావుపుట్టుకలు ఉంటాయా? కాబట్టి నిజజీవితంలోని దేహానికి కూడా ప్రారబ్ధం లేదు.
462-463. అజ్ఞానం వలన కలిగిన పరిణామాలను సమూలంగా నాశనం చేసేది జ్ఞానం. అలా అయితే జ్ఞానోదయం అయ్యాక అజ్ఞానఫలమైన శరీరం యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి శరీరం, ప్రారబ్ధం – వీటి యొక్క మనుగడ బాహ్యదృష్టి ప్రకారమే. శరీర ధర్మాలను సులభంగా అర్థం చేసుకోవడానికి మాత్రమే శ్రుతులు ‘ప్రారబ్ధ సిద్ధాంతాన్ని’ వచించాయి. దేహాదులు సత్యమని శ్రుతుల అభిప్రాయం కాదు. శాశ్వతమూ, అద్వితీయమూ అయిన పరబ్రహ్మ తత్త్వాన్ని బోధించడమే శ్రుతుల అభిమతం.
464. అద్వితీయమూ, అనంతమూ, ఆద్యంత రహితమూ, పరమమూ, పరిణామరహితమూ అయిన పరబ్రహ్మం ఒక్కటే కానీ పెక్కులు కాదు.
465. సత్తు (సత్యం), చిత్తు (జ్ఞానం), ఆనందం (సుఖం) – వీటికి సారభూతమైన పరబ్రహ్మం ఒక్కటే కానీ పెక్కులు కాదు.
466. సర్వాంతర్యామి, సర్వతోముఖము (అనగా సర్వత్రా సమంగా వ్యాపించినది), అనంతము, పూర్ణము (అన్ని విధాలా సమగ్రమైనది) అయిన పరబ్రహ్మం ఒక్కటే కానీ పెక్కులు కాదు.
467. అంగీకరణానికి, నిరాకరణానికి అతీతమైనది, తన మనుగడకు ఏ ఆధారమూ అవసరం లేనిది అయిన పరబ్రహ్మం ఒక్కటే కానీ పెక్కులు కాదు.
468. గుణాతీతమైనది, అభేద్యమైనది, సూక్ష్మమైనది, మార్పులేనిది, పాపరహితమైనది అయిన పరబ్రహ్మం ఒక్కటే కానీ పెక్కులు కాదు.
469. తెలుసుకోలేనిదీ, మనస్సుకూ, వాక్కుకూ అగ్రాహ్యమైనదీ (అర్థం చేసుకొనడానికి లేదా తెలియజెప్పడానికి వీలు లేనిది) అయిన పరబ్రహ్మం ఒక్కటే కానీ పెక్కులు కాదు.
470. సత్యస్వరూపమూ, స్వయంప్రకాశకమూ, స్వతస్సిద్ధమూ (తనంతట తానే సంభవమైనది), పవిత్రమూ, చైతన్యస్వరూపమూ, అసమానమూ (సృష్టిలోని వస్తువులతో పోల్చలేనిది) అయిన పరబ్రహ్మం ఒక్కటే కానీ పెక్కులు కాదు.
471. సర్వబంధాలనూ నిర్మూలించి; ఇంద్రియసుఖాలను త్యజించి; ప్రశాంతమైన మనస్సుతో; ఇంద్రియాలను నిగ్రహంతో సాధన చేసి, మహాత్ములు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆత్మానందాన్ని అనుభవిస్తారు.
472. శిష్యా! నీవు కూడా నీ యథార్థస్వరూపాన్ని గూర్చిన పరమసత్యాన్ని విచారించి, నీ దేహాదుల భ్రాంతిని తొలగించుకొని, జీవితగమ్యమైన పరమార్థతత్త్వాన్ని సాక్షాత్కరించుకొని ముక్తిని పొందు.
473. గురు ముఖతః విన్న శ్రుతివాక్యాలను అసందిగ్ధంగా, నిస్సంశయంగా అర్థం చేసుకున్నప్పుడు శంకలు పూర్తిగా తొలగి పోతాయి. మనస్సు సునిశ్చలమై సమాధిస్థితిని పొంది, సత్యస్వరూపం విస్పష్టంగా గోచరమవుతుంది.
474. అనాది నుండీ ఉన్న అవిద్యను పోగొట్టుకోవటం వలన సత్య–జ్ఞాన–ఆనంద స్వరూపమైన ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. శాస్త్రాలు, సమ్యగ్వివేచన (సరియైన విచారణ), ఆప్తుడైన గురుని వాక్యాలు దీనికి నిదర్శనాలు కాగా, స్వానుభూతి (అనగా ఒకరు చెప్పగా వినుటచేత కాక సొంతంగా పొందిన అనుభవం) అత్యున్నతమైన ప్రమాణం.
475. బంధం, మోక్షం, తృప్తి, ఆందోళన, ఆరోగ్యం, ఆకలి, దప్పిక అనుభవించే వానికే తెలుస్తాయి. ప్రక్కవారు వాటిని కేవలం ఊహించ గలరు. నిజంగా వాటి తీవ్రత ఎంతో వారి అవగాహనకు రాదు.
476. గురు వాక్యాలు, శ్రుతులు అపరోక్షమైనవి. అనగా దూరం నుండి చెప్పిన వర్ణనల వంటివి. జ్ఞానోదయం ద్వారా మాత్రమే అజ్ఞానాన్ని సాధకుడు దాటగలడు. దీనికి ఈశ్వరానుగ్రహం తప్పనిసరి.
477. ద్వైత భావనలు పోగొట్టుకొని, స్వానుభూతితో అఖండ సచ్చిదానంద పరబ్రహ్మాన్ని ముఖాముఖీ దర్శించి సర్వోత్కృష్ట స్థితిని పొందు.
478. వేదాంత సిద్ధాంతాల తుది తీర్పు ఇది: “జీవాత్మయే పరమాత్మ. అద్వైతానుభూతి (అనగా అఖండ సచ్చిదానంద పరబ్రహ్మంతో తాదాత్మ్యత)యే మోక్షం.” అద్వితీయ పరబ్రహ్మానికి శ్రుతులే ప్రత్యక్ష ప్రమాణాలు. (ఈ వాక్యాలతో గురువు తన భాషణను ముగించాడు.)
479. గురువాక్యాలను శ్రద్ధతో ఆలకించిన శిష్యుడు వేదాంత వచనముల యందు అఖండవిశ్వాసంతో, తన సొంత విచారణల సహాయంతో, ఇంద్రియాలను ఉపశమింపజేసి, మనస్సును ఏకాగ్రం చేసి, స్థిరశరీరుడై ఆత్మలో నిమగ్నం అయ్యాడు.
480. బ్రహ్మైక్యతలో కొంతకాలం గడిపి, బాహ్యస్మృతిలోకి వచ్చిన శిష్యుడు ఈ విధంగా పలికాడు.
481. గురువర్యా! బ్రహ్మైక్యతను అనుభూతి చెందటం వలన నా మనస్సు, ఇంద్రియ వ్యాపారాలు నశించాయి. ‘ఇది ఔను, ఇది కాదు’ అనే సాపేక్ష భావాలు (పోలిక ద్వారా తెలుసుకొనే విషయాలు) నాకు గోచరించుట లేదు. అపరిమిత బ్రహ్మానందపు అవధులు తెలియటం లేదు.
482. ఆనంద మకరందంతో నిండిన పరబ్రహ్మ తత్త్వాన్ని మాటలలో చెప్పలేము. మనసుకు కూడా అందదు. సముద్రంలో కురిసిన వడగళ్ళు కరిగి సముద్రంలోనే కలిసిపోయినట్లు, పరబ్రహ్మ అంశ అయిన నా మనస్సు పరబ్రహ్మంలోనే లీనమయిపోయింది.
483. దృశ్యమాన ప్రపంచం ఎటు పోయింది? ఎవరు దీనిని అదృశ్యం చేశారు? ఎందులో లీనమైపోయింది? చూస్తూ వుండగానే మాయమైందే? ఇది ఒక మహాద్భుతంలా ఉంది.
484. పరబ్రహ్మం అనెడి మహాసాగరం పరమానందం అనే మకరందంతో నిండివుంది. దీనిని మించి గ్రహించదగినది, విడువదగినది, ఏమిటో తెలియలేదు. ‘నా కంటే వేరయినది ఏది? బ్రహ్మం కానిది ఏది?’ అనిపించింది.
485. నాకు ఇంకేదీ కనిపించలేదు, వినిపించలేదు, తెలియలేదు. పరిపూర్ణానంద స్వరూపమైన పరమాత్మగా, చరాచర ప్రపంచం నుంచి వేరై దానిని వీక్షించే సాక్షిలాగా అనుభూతి చెందాను.
486. ఓ గురుదేవా! మీకు మరల మరల నమస్కరిస్తున్నాను. మీరు మహాత్ములు, సంగరహితులు, అద్వితీయ–నిత్య–అనంత– పరమానంద స్వరూపులు, దయాసాగరులు.
487. ప్రాపంచికత వలన నాలో రగులుతున్న అగ్నితాపం, చంద్రకిరణాల వంటి మీ చల్లని కృపావీక్షణాల వలన చల్లారింది. బ్రహ్మజ్ఞానం యొక్క అక్షయమైన అనంతానందాంబుధి ప్రాప్తించింది.
488. నేను ధన్యుడనైతిని. నా జీవితం సార్థకమైంది. జననమరణ సంసారచక్రం నుండి విముక్తి లభించింది. అనంతమైన నిత్యానందానికి నేనే సారమని మీ అనుగ్రహం వలన గ్రహించాను.
489. విషయభోగాలతో సంగాన్ని, స్థూల సూక్ష్మ శరీరాలతో తాదాత్మ్యతను పోగొట్టుకొని, నాశరహితుడనైతిని. అనంతమూ, వినిర్మలమూ, శాశ్వతమూ అయిన ఆత్మతో ఐక్యతను అనుభూతి చెంది ప్రశాంతమనస్కుడనయ్యాను.
490. నేను కర్తను కాను. భోక్తను కాను. అందువలన నిష్క్రియుడను. ఎన్నడూ మార్పు చెందకుండా, ఎల్లజీవులకూ శుభాల నిచ్చే జ్ఞానమయ సదాశివ స్వరూపంతో ఐక్యతను అనుభూతి చెందాను.
491. ద్రష్ట, శ్రోత, వక్త, కర్త, భోక్త – ఇవేమీ నేను కాను. నేను అఖండమూ, జ్ఞానసారమూ, నిత్యమూ, నిష్క్రియమూ, అసంగమూ, అనంతమూ అయిన ఆత్మను.
492. నేను ‘ఇది – అది’ (అనగా ఇంద్రియగోచరమయ్యే వస్తువులను) కాను. వాటిని ప్రకాశింపజేసే అద్వితీయ, నిరంజన, బాహ్యాంతర రహిత, అనంతాత్మను అనే అనుభూతి చెందాను.
493. ఆద్యంత రహితమూ, అద్వితీయమూ, ‘నేను, నీవు, ఇది, అది’ మొదలైన భావాలకు అతీతమూ, ఆనందసారమూ, యథార్థమూ అయిన పరబ్రహ్మను అనుభూతి చెందాను.
494. భూదేవి పుత్రుడైన నరకాసురుణ్ణి చంపిన నారాయణుడు; త్రిపురాసురుణ్ణి చంపిన శివుడు; పరమ పురుషుడు – ఇవన్నీ నేనే. బోధస్వరూపమైన సర్వసాక్షిని నేనే కాబట్టి, నాకు నేనే ప్రభువును. నన్ను పరిపాలించే ప్రభువులు వేరే ఎవరూ లేరు. ‘నేను – నాది’ అన్న భావనలకు అతీతుడిని.
495. సర్వజీవులలోనూ జ్ఞానరూపంలో ఉన్నది నేనే; బాహ్యాంతరాలలో వాటికి ఆధారం నేనే; భోక్త–భోగ్యం (చేయువాడు–చేయబడేది) రెండూ నేనే. అజ్ఞానదృష్టితో చూచినప్పుడు అగుపించే ‘ఇది–అది’ మొదలైన భావనలు నశించాయి. అనగా అఖండ పరబ్రహ్మమే సర్వం అన్న అనుభూతి కలిగింది.
496. నాలో అనంతమైన ఆనందసాగరం ఉంది. మాయ అనే వాయువు ఆ సాగరంలో అలలను సృష్టిస్తోంది. ఆ అలలే చరాచర జగత్తులన్న అనుభూతి కలిగింది.
497. మాసాలు, సంవత్సరాలు, శతాబ్దాలు, యుగాలు, ఋతువులు– కాలాన్ని కొలిచే ఇవన్నీ అఖండమూ, పరమమూ అయిన కాలచక్రం మీద ఆరోపితాలు (అనగా కల్పించబడ్డాయి). అదే విధంగా స్థూలసూక్ష్మ భావనలు కూడా కల్పితాలేనన్న అనుభూతి కలిగింది.
498. ఎండమావులలో కనిపించిన జలప్రవాహాలు ఎడారిని తడపలేవు కదా! అలాగే అన్నింటికీ ఆధారభూతమైన ఆత్మను అజ్ఞానజనిత ఆరోపిత భావనలు అంటలేవు.
499. ఆకాశంలాగా నేను దోషరహితుడను; పర్వతంలాగా నిశ్చలుడను; సముద్రంలాగా నాకు ఎల్లలు లేవు. ఎలాగైతే సూర్యుడిచేత ప్రకాశింపబడే వస్తువుల కంటే సూర్యుడు విభిన్నుడో అట్లే నేను మాయాకల్పిత జగత్తు కంటే విలక్షమైనవాడినన్న అనుభూతి కలిగింది.
500. ఆకాశానికి మేఘాలతోగానీ, వాటి రాకపోకలతోగానీ ఏ సంబంధం లేనట్లే నాకు దేహంతో ఏ సంబంధమూ లేదు. అలా అయితే దేహధర్మాలైన జాగ్రత్స్వప్నసుషుప్తి అవస్థలు నామీద ఎటువంటి ఫలితాలను చూపగలవు?
501. పురాణాలలో కుల పర్వతం గూర్చి, దాని అద్భుతమైన స్థిరత్వాన్ని గూర్చి చెప్పబడింది. అట్లే నేను కూడా నిశ్చలుడను. ఉపాధి వలననే శరీరం జన్మించి, కర్మలు ఆచరించి, వాటి ఫలాలను అనుభవించి, క్షీణించి, మరణిస్తూ ఉంటుంది. కానీ ఈ ఉపాధి ధర్మాలు అంతరాత్మ అయిన నాకు మాత్రం లేనే లేవు.
502. అంతటా సమంగా (ఒకటిగా) వ్యాపించిన ఆకాశం వలె ఉన్న నాకు వివిధ అంగాలు లేవు. అందువలన ప్రవృత్తి నివృత్తి అనేవి (కర్మ చేయటం, మానటం రెండూ) లేవు. ఏకాత్మనై, పరిపూర్ణమై, సర్వవ్యాపకమై ఉన్న నాకు చేష్టలతో పని ఏమున్నది?
503. మనస్సు, ఇంద్రియాలు లేని నాకు, రూపు ఎలా ఉంటుంది? వికారశూన్యుడైన (అనగా ఏ మార్పులూ లేని) నాకు పుణ్యపాపాలు ఎక్కడివి? శ్రుతివాక్యాల ప్రకారం జాగ్రత్స్వప్నసుషుప్తి అవస్థలలోని పుణ్యపాపాలను ఆత్మ ఆ స్థితులలోనే వదలివేయును గాని మరొక స్థితికి కొనిపోదు. కాబట్టి ఈ మూడు అవస్థలకూ అతీతమైన స్థితికి చేరిన ఆత్మకు పుణ్యపాపాలు అంటనే అంటవు.
504. ఒక మనిషి నీడను ఉష్ణం, శీతలం, మంచి, చెడు వంటివి తాకినా, ఆ మనిషిని ప్రభావితం చేయలేవు. అలాగే శరీరధర్మాలు ఆత్మను అంటవు.
505. ఒక గృహంలో జరిగే వ్యాపారాలు ఆ గృహాన్ని దీప్తిమంతం చేసే దీపానికి అంటవు. అలాగే సర్వసృష్టికి సాక్షి అయిన ఆత్మకు ఆ సృష్టి యొక్క ధర్మాలు అంటవు.
506. సూర్యకాంతిలో జనులు మంచి, చెడు అన్నిరకాల కర్మలనూ చేస్తూ ఉంటారు. ఈ కర్మలకు సూర్యుడు సాక్షి మాత్రమే. వాటి ఫలాలు సూర్యుణ్ణి అంటవు. అగ్ని తరతమభేదం లేకుండా అన్నింటినీ కాల్చి వేస్తుంది. రజ్జువు మీద ఆరోపింపబడిన సర్పానికి రజ్జువుకు ఏ సంబంధమూ లేదు. చైతన్య స్వరూపుడనైన నాకు దేనితోనూ సంబంధం లేదు.
507. నేను కర్మలకు కర్తను (చేయువాడను) కాను; కారయితనూ (ప్రేరకుడను) కాను; భోక్తను (అనుభవించు వాడను) కాను; భోజయితనూ (అనుభవింపజేయువాడను) కాను; ద్రష్టను (చూచువాడను) కాను; దర్శయితనూ (చూపువాడను) కాను. నేను ఇంద్రియాలకు అగోచరమూ, స్వయంప్రకాశకమూ అయిన ఆత్మను.
508. చలిస్తున్న నీటిలో సూర్య ప్రతిబింబం కదులుతున్నట్లు కానవస్తుంది. కానీ నిజానికి సూర్యుడు నిశ్చలంగా, నిష్క్రియంగా ఉన్నాడు. అలాగే ఉపాధులైన దేహేంద్రియాదులు ఆత్మ యొక్క ప్రతిబింబాలు మాత్రమే. మూఢజనులు ఈ ఉపాధులను తమకు ఆరోపించుకొని ‘నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను చనిపోతున్నాను’ అని విలపిస్తారు.
509. ఘటం యొక్క ధర్మాలు, పరిస్థితులు మారుతున్నా, ఘటంలోని ఆకాశం మారదు. అట్లే శరీరం నీటిలో మునిగినా, నేలపై దొర్లినా ఆ తడి, దుమ్ము ఆత్మను అంటవు.
510. బుద్ధి యొక్క వికారాలైన కర్తృత్వం, భోక్తృత్వం, చెడ్డతనం, మధుమత్తత, జడత్వం, బద్ధత్వం (బంధాలలో చిక్కుకొనుట), బంధవిముక్తి మొదలైన వాటితో అద్వితీయమైన పరమాత్మకు ఏ సంబంధమూ లేదు.
511. మేఘాలు ఆకాశంలో ఎన్నిసార్లు అటుయిటూ పయనించినా ఆ అంబరాన్ని తాకలేవు. అలాగే ప్రకృతిలో వికారాలు (మార్పులు) పదులు, వందలు, వేలు జరిగినా అవేవీ అసంగ–పరమ–జ్ఞానస్వరూపమైన నాకు అంటవు.
512. నేను అద్వితీయమూ, ఆకాశసమమూ, సూక్ష్మమూ, ఆద్యంతరహితమూ అయిన పరబ్రహ్మాన్ని. చరాచర సృష్టిలోని జీవులన్నీ నాలో తిరిగే ఛాయలలాగా కనిపిస్తున్నాయి.
513. అద్వితీయమూ, సకల జగత్తుకూ ఆధారభూతమూ, విశ్వంలోని వస్తువులన్నింటినీ ప్రకాశింపజేసేది, అనంతమైన రూపాలు కలది, సర్వవ్యాప్తమూ, అద్వితీయమూ, నిత్యమూ, నిష్కల్మషమూ, నిశ్చలమూ, పరమమూ అయిన బ్రహ్మాన్ని నేనే.
514. ఏ పరబ్రహ్మంలో మాయాకల్పిత సకల జగత్తు విలీనం అవుతుందో, సర్వభూతాలకు సారమైనట్టిది ఏదో, చైతన్యవంతమైన బుద్ధికి ఏది అగోచరమో, సచ్చిదానంద స్వరూపమైనది ఏదో, అట్టి బ్రహ్మాన్ని నేను.
515. పరబ్రహ్మనైన నాకు చలనాదిక్రియలు లేవు. ఏ వికారాలు (మార్పులు) లేవు. ఆకారమూ లేదు, అవయవాలూ లేవు. నాకు నేనే ఆధారం (వేరే ఎటువంటి ఆధారమూ లేదు).
516. నేను సృష్టిలోని సకల చరాచరవస్తువులలోనూ ఆత్మరూపంలో ఉన్నాను. సర్వంలో ఉన్నా సర్వాతీతుడను. అద్వితీయ అఖండ జ్ఞాన స్వరూపుడను. నిరంతరానంద స్వరూపుడను.
517. విశ్వానికి మార్గదర్శనం చేసే స్వయంప్రకాశమైన ఆత్మసామ్రాజ్యాన్ని మీ కృప వలన పొందగలిగాను. ఓ! మహాత్మా! గురుమూర్తీ! మీకు మరల మరల నమస్కరిస్తున్నాను.
518. గురువరేణ్యా! తమ నిర్హేతుకదయతో నన్ను ఒక మహాస్వప్న స్థితి నుండి మేలుకొలిపారు. ఆ మాయాకల్పిత స్వప్నంలో ఉన్నప్పుడు, జన్మమృత్యుజరావ్యాధులనబడే కీకారణ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. అక్కడ నన్ను ప్రతిరోజూ అంతులేని తాపత్రయాలు పట్టి పీడించాయి. అహంకారం అనే మహావ్యాఘ్రం ఎన్నో బాధలు పెట్టింది. అటువంటి స్థితిలో ఉన్న నేను, మీ కృపకు పాత్రుడినై ధన్యుడనయ్యాను.
519. ఓ గురువర్యా! మీయొక్క ఏ అద్భుతమైన తేజస్సు చరాచర జగత్తు రూపంలో భాసిస్తోందో, అనిర్వచనీయమూ, సునిశ్చితమూ అయిన ఆ తేజోరూపానికి నమోవాకములు.
520. ఆత్మతత్త్వాన్ని తెలుసుకొని బ్రహ్మానంద నిమగ్నుడై తనకు నమస్కరించిన శిష్యుని చూసి, సంతోషచిత్తుడైన గురువు తన బోధనను ఇలా కొనసాగిస్తున్నాడు:–
521. మనకు కనిపించే చరాచర విశ్వం బ్రహ్మం యొక్క రకరకాల ఎడతెగని అనుభూతులు మాత్రమే. కాబట్టి అన్నిటి వెనుకా సచ్చిదానంద బ్రహ్మమే ఉందని విచారణతో తెలుసుకోవచ్చు. సర్వకాల సర్వావస్థలలోనూ ప్రశాంత చిత్తంతో, విచక్షణ నిండిన దృక్కులతో విశ్వాన్ని పరికించాలి. వివేకవంతుడు సర్వవిశ్వాన్ని మనస్సు చేత తయారుచేయబడిన వివిధ నామరూపాలతో నిండివున్నట్లు గమనిస్తాడు. అటువంటి వివేకవంతుడిని విశ్వం వెనుకవున్న బ్రహ్మం తప్ప వేరే విషయం ఆకర్షిస్తుందా?
522. దేదీప్యమానంగా ఆకాశంలో వెలుగుతున్న చంద్రుడిని చూసి ఆనందిస్తారు కానీ ఆ చంద్రుడి కుడ్యచిత్రాన్ని చూసి కాదుకదా! అలాగే వివేకవంతుడు అశాశ్వతాలైన సృష్టిలోని వస్తువులను వదలి, వాటి వెనుకవున్న శాశ్వత పరబ్రహ్మంలో రమిస్తాడు.
523. అశాశ్వతాలైన సృష్టిలోని వస్తువుల వలన సంతృప్తి కలుగదు సరికదా దుఃఖం కలుగుతుంది. కాబట్టి బ్రహ్మసాక్షాత్కారం పొంది, ఆ అద్వితీయ పరబ్రహ్మంలో తాదాత్మ్యం చెంది సుఖీంచాలి.
524. కాబట్టి సర్వకాల సర్వావస్థలలో బ్రహ్మాన్నే తలపోస్తూ, ఆ అద్వితీయ పరమాత్మను అన్నింటిలో చూస్తూ, ఆత్మానందాన్ని అనుభవిస్తూ కాలం గడపాలి.
525. ఒకటే అయిన సచ్చిదానంద పరబ్రహ్మాన్ని ద్వైతభావనలతో వేరువేరుగా చూడటమనేది ‘గాలిలో మేడలు కట్టడం’ వంటిది. కాబట్టి, అలా చేయక, అన్ని సమయాలలోనూ ఆ పరమాత్మతో ఐక్యం చెంది, పరమశాంతిని పొంది, సాక్షీమాత్రంగా ఉండాలి.
526. బ్రహ్మసాక్షాత్కారం పొందిన మహాత్ములకు వికల్పహేతువైన మనస్సు పరిపూర్ణంగా నిశ్చలమౌతుంది. ఆ నిశ్చలస్థితిలో బ్రహ్మంతో తాదాత్మ్యం చెంది, బ్రహ్మానందసుఖం అనుభవమౌతుంది.
527. తన స్వస్వరూపాన్ని తెలుసుకొని, బ్రహ్మానందరసాన్ని తెంపు లేకుండా ఆస్వాదిస్తున్న వానికి, నిర్వాసనా (కోరికలు లేని) స్థితి కన్నా ఆనందకరమైనది మరొకటి ఉండదు.
528. ఆత్మైక్యం చెందిన ముని నిలిచినా, నడిచినా, కూర్చున్నా, శయనించినా, మరి ఏ ఇతరస్థితిలోనైనా ఆత్మారాముడై (అనగా ఆత్మలో రమిస్తూ) స్వేచ్ఛగా వర్తిస్తాడు.
529. సాక్షాత్కారం పొంది, చిత్తవృత్తులను నిరోధించిన మహాత్ములు ప్రదేశం, కాలం, ఆసనం, దిక్కు, యమ, నియమాదుల అవసరం లేకనే బ్రహ్మనిష్ఠలో ఉంటారు. అటువంటి వారికి ఈ సహాయకములతో పనిలేదు.
530. ‘ఇది కుండ’ అని గుర్తించటానికి కంటికి సహాయకంగా కాంతి ఉంటే చాలు. అలాగే బ్రహ్మాన్ని గుర్తించుటకు జ్ఞానమనే కాంతి ఒక్కటే సరిపోతుంది కదా!
531. సమ్యజ్జ్ఞానం (సరియైన ఎరుక) కలిగిన వెంటనే ఆత్మ తనంతట తానుగా దేశం, కాలం, బాహ్యమైన పరిశుద్ధత మొదలైనవాటిని తోసిరాజని ప్రకాశిస్తుంది.
532. ‘నేను దేవదత్తుడ’ ను అనెడి భావన దేశకాలపరిస్థితులను బట్టి ఉండదు. అలాగే బ్రహ్మజ్ఞాని దేశకాలపరిస్థితులతో సంబంధం లేకుండా తానే బ్రహ్మమనే ఎరుకతో ఉంటాడు.
533. దృశ్యమాన ప్రపంచం యావత్తూ సూర్యభగవానునిచే ప్రకాశింపబడుతోంది. అలాగే అనిత్యమూ, తుచ్ఛమూ అయిన ఈ చరాచర విశ్వం ఆత్మభాసం వలననే వెలుగొందుతోంది.
534. వేదశాస్త్రపురాణాలు, స్థావరజంగమజగత్తు ఏ ఆత్మ వలన భాసిస్తున్నాయో, ఆ ఆత్మకు వెలుగునిచ్చేది మరొకటి ఉంటుందా?
535. స్వయంప్రకాశకమూ, అనంత శక్తిమంతమూ, మనకున్న పరిమిత జ్ఞానానికి అతీతమైనదయినా అనుభావకమైనదీ (అనగా మనకు ఆత్మవంటిది ఒకటి ఉందని అనిపిస్తూ ఉంటుంది), అసమానమైనదీ అయిన ఆత్మను తెలుసుకొన్న సాధకుడు విముక్తుడై విరాజిల్లుతాడు.
536. పరమమూ, నిరంతరమూ అయిన ఆత్మానందంలో సంతృప్తుడైన ఆ సాధకుడు ఇంద్రియార్థాల వలన సుఖదుఃఖాలను పొందడు. వాటిని కామించడు, ద్వేషించడు కూడా. ఆత్మతో క్రీడిస్తూ విహరిస్తూ ఉంటాడు.
537. శారీరక బాధలను, ఆకలిదప్పులను మరచి బాలలు ఆటలలో మునిగితేలుతూ ఉంటారు. అట్లే బ్రహ్మవిద్వాంసుడు ‘నేను–నాది’ భావనలు వీడి ఆత్మలో రమిస్తూ సుఖీస్తాడు.
538. బ్రహ్మవేత్తలు చింతలు, మానాభిమానాలు విడిచిపెట్టి, భిక్షాన్నం తీసుకొని, నదీజలాలను త్రాగుతారు. స్వేచ్ఛగా జీవిస్తూ, నిర్భయంగా అరణ్యంలోనైనా, శ్మశానంలోనైనా కటికనేలపైనే శయనిస్తారు. వారు ఉతికి ఆరవెయ్యవలసిన అవసరం లేని చెట్టుబెరడు మొదలైన వాటిని వస్త్రంగా ధరిస్తారు లేదా దిగంబరులుగా ఉంటారు. కానీ వేదాంతవీథులలో సంచరిస్తూ (అనగా వేదాంతభావనలతో ఐక్యం చెంది) పరబ్రహ్మంలో క్రీడిస్తూ ఉంటారు.
539. బ్రహ్మజ్ఞానులు బాహ్యాడంబరాలు ఏ మాత్రం లేకుండా జీవిస్తూ, బాహ్యవిషయాలతో ఏ అనుబంధాలు లేకుండా, శరీరంలో ఉన్నా దానితో తాదాత్మ్యం చెందకుండా, తాను ఎటువంటి వాడినో ఇతరులకు తెల్పకుండా జీవిస్తారు. యాదృచ్ఛికంగా లభించిన ఆహారపానీయాదులతో సంతృప్తి పడుతూ, పసిపిల్లల వలె జీవిస్తారు.
540. వారు ఒకసారి దిగంబరంగానూ, ఒకసారి సాంబరంగానూ (అనగా బట్టలు ధరించి), ఒకసారి త్వగంబరంగానూ (అనగా చర్మం ధరించి) మసలుతూ ఉంటారు. పసిబాలుని వలె లేదా పిచ్చివాని వలె లేదా పిశాచం వలె సంచరిస్తూ ఉంటారు.
541. పూర్తిగా నిష్కాములై (కోరికలను విడిచిపెట్టి), అంతరాత్మతో సంతృప్తులై, తానే సృష్టిలోని సమస్తజీవజాలాన్ని అని ఎరిగి వసిస్తూ ఉంటారు.
542. పరమాత్మలో రమించే ప్రాజ్ఞులు, ఒకసారి మూర్ఖుని వలె, ఒకసారి మహాయోగీశ్వరుని వలె, ఒకసారి మహారాజవైభవంతోనూ, ఒకసారి దేశద్రిమ్మరి వలె, ఒకసారి అజగరం (కదలక మెదలక పడివుండే కొండచిలువ) వలె, ఒకసారి ప్రసన్నవదనంతో, ఒకసారి గౌరవించబడి లేదా అవమానించబడి, ఒకసారి అనామకుని (ఎవరికీ తెలియని వాని) వలె వర్తిల్లుతూ ఉంటారు.
543. అటువంటి మహనీయుడు ధనవస్తువాహనాదులు లేకపోయినా నిత్యసంతోషి. అసహాయుడు (ఎవరి సహాయం అవసరం లేనివాడు) అయినా మహాబలుడు (ఆత్మయే అతని సంపద, శక్తి). ఇంద్రియార్థాలతో భోగించకపోయినా సదా సంతృప్తితో జీవిస్తుంటాడు. తనతో సమానమైన వస్తువు లేకపోయినా అన్నింటినీ సమంగా చూస్తూ ఉంటాడు.
544. కర్తృత్వభోక్తృత్వాభిమానం లేకపోవటం వలన అతడు కర్మలను ఆచరిస్తున్నా ఏమీ చేయనివాడే; కర్మఫలాలను అనుభవిస్తున్నా వాటిచేత ప్రభావితం కాడు. శరీరం ఉన్నా దానితో తాదాత్మ్యం చెందడు. భౌతికంగా ఒకచోట ఉన్నా సర్వవ్యాపియే అవుతాడు.
545. శరీరంతో ఉన్నా శరీరస్పృహ లేకపోవటం వలన సుఖదుః ఖాలు, శుభాశుభాలు (మంచి చెడులు) అతనిని స్పృశింపవు.
546. స్థూలసూక్ష్మ శరీరాలతో తాదాత్మ్యం కలవానికే సుఖదుఃఖాలు, శుభాశుభాలు కలుగుతాయి కానీ సదాత్మరూపుడై, దేహాభిమానం లేని మునిని అవి ఏమి చేయగలవు?
547. సూర్యగ్రహణం సంభవించినపుడు రాహుగ్రహం సూర్యుని కబళించినదని భ్రాంతి వలన జనులు తలుస్తారు. కానీ నిజానికి అటువంటిది ఏమీ లేదు. సూర్యతత్త్వం తెలియపోవటం వలననే అలా జరుగుతోంది.
548. ఆత్మతత్త్వం ఎరిగి, అన్ని బంధాలనూ త్రెంచుకొన్న బ్రహ్మవేత్తను శరీరబద్ధుడని (శరీరానికి పరిమితమైనవాడని) మూఢులు తలుస్తారు.
549. పాము చేత విడువబడిన కుబుసం గాలికి అటునిటు కదలుతూ ఉంటుంది. అట్లే దేహాభిమానశూన్యుడైన జ్ఞాని యొక్క శరీరాన్ని ప్రాణం అది పోవలసిన చోట్లకు తీసుకువెడుతూ ఉంటుంది.
550. ఒక నదిలోని ప్రవాహం దూలాన్ని ఎత్తుపల్లాలకు చేర్చినట్లు, ప్రారబ్ధకర్మ జ్ఞాని శరీరానికి సుఖదుఃఖాదులను కలిగించి రకరకాల కర్మఫలాలను అనుభవింపజేస్తుంది.
551. మామూలు మనుష్యుల వలెకాక జ్ఞాని తన పూర్వకర్మల ఫలాలను నిశ్శబ్దంగా, శరీరస్పృహ ఏమాత్రం లేకుండా, పూర్తిగా పరబ్రహ్మంలో లీనమైవుండి అనుభవించును. బండి చక్రము తిరుగుతున్నా, ఇరుసు స్థిరంగా ఉన్నట్లు, జీవన్ముక్తుడైన యోగి ప్రారబ్ధకర్మ ఫలాలను అనుభవిస్తున్నా నిర్లిప్తుడై సాక్షివలె వర్తిస్తాడు.
552. ఆ యోగి ఇంద్రియాలను వాటి తన్మాత్రలవైపు మళ్ళించడు లేదా వాటిని నిగ్రహించడు కూడా. ఒక ప్రేక్షకుడిలా గమనిస్తుంటాడు. ప్రారబ్ధకర్మ ఫలాలను ఏ మాత్రం పట్టించుకోడు. బ్రహ్మానందపు మధుమత్తతతో వర్తిస్తుంటాడు.
553. ధ్యానం అనే లక్ష్యసాధనకు ఫలానా విషయాన్ని స్వాగతించాలి లేదా ఫలానా విషయాన్ని త్యజించాలి అన్న భావనలకు అతీతుడై, పరమాత్మలో లీనమై జీవించే బ్రహ్మవిద్వరిష్ఠుడు సాక్షాత్ శివస్వరూపుడే.
554. సర్వ ఉపాధులనూ నాశనం చేసి, అద్వైత బ్రహ్మంలో లీనమై, జీవన్ముక్తుడైన బ్రహ్మవిదుడు జీవితగమ్య సాధనలో కృతకృత్యుడవుతాడు.
555. ఒక నటుడు వేషధారణలో ఉన్నా లేకపోయినా మనిషే కదా! అట్లే బ్రహ్మవిద్యావరేణ్యుడు ఏ అవస్థలో ఉన్నా బ్రహ్మమే కానీ వేరు కాదు.
556. బ్రహ్మభావాన్ని పొందిన యతీశ్వరుని శరీరం భౌతికంగా జీవించి ఉన్నా, జ్ఞానాగ్ని చేత దగ్ధమైనందు వలన, అది చెట్టు నుండి రాలిన ఆకు వలె ఎప్పుడు ఎక్కడ పడిపోయినా లక్ష్యపెట్టడు.
557. సర్వదా అద్వయానందమయుడై బ్రహ్మంలో సుప్రతిష్ఠమైన యోగి, ఉత్తరాయణ కాలం లేదా దక్షిణాయన కాలం, స్వగృహం లేదా పుణ్యక్షేత్రం అన్న చింత లేకుండా చర్మరక్తమాంసాదులతో నిండిన తుచ్ఛశరీరాన్ని పరిత్యజించటానికి వెరవడు.
558. హృదయంలో ఉండే అజ్ఞానగ్రంథి నాశనమవ్వటమే మోక్షం కానీ, దండకమండలాదులను (చేతికర్ర, కమండలాలను) వదలిపెట్టుట లేదా శరీరాన్నే త్యజించుట మోక్షం కాదు.
559. ఒక చెట్టు ఆకు చిన్న కాలువలో లేదా నదిలో లేదా శివక్షేత్రంలో లేదా నాలుగు రోడ్ల కూడలిలో పడినా ఆ చెట్టుకు లెక్కలేదు. అలాగే జ్ఞాని శరీరత్యాగానికి ప్రదేశం యొక్క పవిత్రతతో నిమిత్తం లేదు.
560. ఒక ఆకు, పూవు లేదా పండు రాలిపడిపోయినా చెట్టు మరణించదు. అలాగే శరీరపతనం, అంగఛేదం, ప్రాణక్షయం, బుద్ధినాశం మొదలైన వాటివలన నిత్యసత్యస్వరూపమైన ఆత్మకు కించిత్తు నష్టం కూడా లేదు.
561. ‘ప్రజ్ఞానఘనం’ అనే శ్రుతి వాక్యానుసారం ఆత్మ యొక్క నిజస్వరూపం వ్యక్తీకరించబడింది. దాన్ని అనుసరించి ఆత్మ ఉపాధులలో చిక్కుకున్నప్పుడు భౌతికమైన దేహాన్ని ధరిస్తుంది. ఆ ఉపాధి నాశనమే దేహనాశనం అవుతున్నది కానీ దాని వెనుకనున్న ఆత్మకు నాశనం లేదు.
562. అశాశ్వతాలైన దేహాది పదార్థాలు నశించినా అధిష్ఠానమైన ఆత్మకు నాశం లేదనీ, యథార్థంగా ఆత్మకు ప్రళయం లేదని శ్రుతులు చెపుతున్నాయి.
563. పాషాణం, వృక్షం, తృణం, ధాన్యం, వస్త్రం మొదలైనవన్నీ అగ్ని చేత దహించబడి భస్మంగా మారుతాయి. అలాగే దృశ్యమాన ప్రపంచం, మనఃప్రాణేంద్రియాదులు జ్ఞానాగ్ని చేత దగ్ధమై, ఆత్మలో లీనం అవుతాయి.
564. తమస్సు (చీకటి) సూర్యోదయం కాగానే పటాపంచలవుతుంది. అట్లే దృశ్యమాన ప్రపంచం మొత్తం జ్ఞానోదయంతో బ్రహ్మంలో లయమవుతుంది.
565. ఘటంలో ఉన్న ఆకాశం, ఆ ఘటం నాశనమైనప్పుడు బాహ్యంగా ఉన్న అనంతమైన ఆకాశంతో కలిసిపోయినట్లు, పైపైన ఉన్న ఉపాధులు తొలగిపోయినపుడు బ్రహ్మజ్ఞాని బ్రహ్మంలో లీనమయిపోతాడు.
566. క్షీరం క్షీరంలో, తైలం తైలంలో, జలం జలంలో అరమరికలు లేకుండా పూర్తిగా కలిసిపోయినట్లు, ఆత్మజ్ఞానం పొందిన ముని ఆత్మలో కలిసిపోతాడు.
567. శరీరతాదాత్మ్యత వలన ఆత్మతో కలిగిన ఎడబాటును గ్రహించిన యతి ఆత్మైక్యతను సాధించి, జనన మరణాల నుండి విముక్తి పొందుతాడు.
568. అజ్ఞాన జనితాలైన స్థూలసూక్ష్మకారణ దేహాలు జ్ఞానాగ్ని వలన దహ్యమై, జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందుతాడు. బ్రహ్మైక్యం చెందాక పునర్జన్మ ఎలా కలుగుతుంది?
569. భ్రాంతి వలన రజ్జువు సర్పంలా కనిపిస్తుంది. భ్రాంతి తొలగినప్పుడు నిజరూపంలో కనిపిస్తుంది. కానీ రజ్జువునకు ఈ భ్రాంతి, దాని వలన కల్పింపబడిన సర్పం రెంటితో నిమిత్తం లేదు. అలాగే బంధం, మోక్షం రెండూ మాయాకల్పితాలు. ఆత్మకు సంబంధం లేదు.
570. మాయ అనే ముసుగు ఆత్మను కప్పినపుడు బంధం అనీ, అది తొలగినపుడు మోక్షం అనీ అంటారు. దీని వలన ఆత్మ, మాయ అనే రెంటికీ అస్తిత్వం ఉన్నట్లవుతుంది. కానీ అద్వైతసిద్ధాంతం ప్రకారం రెండు లేనేలేవు. ఆత్మ ఎల్లవేళలా ఏ ఆచ్ఛాదనం లేక ప్రకాశిస్తూ ఉంటుంది. అందువలన శ్రుతులు ఆత్మ యొక్క ఏకత్వాన్ని నొక్కి వక్కాణించాయి.
571. ‘మేఘాలు సూర్యుని కప్పివేశాయి’ అన్నపుడు, అవి మన కళ్ళకు, సూర్యునికి మధ్య ఉన్నాయి కానీ సూర్యుని పూర్తిగా ఆవరించలేదు. అట్లే బంధం మోక్షం అనేవి బుద్ధికి సంబంధించినవే గాని వాటిని ఆత్మకు ఆపాదించటం మూర్ఖత్వం. నిజానికి ఆత్మ నిత్యం, జ్ఞానస్వరూపం, అద్వితీయం, సంగరహితం.
572. బంధం ఉంది, బంధం లేదు – ఈ రెండు భావనలూ బుద్ధికి మాత్రమే వర్తిస్తాయి. పరబ్రహ్మానికి ఎన్నడూ వర్తించవు.
573. బంధమోక్షాలు మాయాకల్పితాలే. అఖండమూ, నిష్క్రియమూ, ప్రశాంతమూ, కళంకరహితమూ, పవిత్రమూ, అద్వితీయమూ, పరమమూ, ఆకాశం వలె అసమానమూ అయిన ఆత్మకు బంధమోక్షాలనే ఉపాధులను ఎలా ఆపాదించగలం?
574. ఉత్పత్తి, నాశనం, బద్ధజీవి, సాధకుడు, ముముక్షువు, ముక్తుడు – ఇలాంటివి ఏమీ లేవు. ఆత్మ ఒక్కటే నిత్యం. ఇదే అంతిమ సత్యం.
575. “శిష్యా! తండ్రి తన కుమారునికి జ్ఞానబోధ చేసినట్లు, నేను నీకు ఈ రోజు అత్యుత్తమమూ, అతిగుహ్యమూ, సకలవేదాంతసారమూ, వేదవాఙ్మయానికి చూడామణి వంటి తత్త్వమార్గాన్ని పరిపరివిధాల బోధించాను. కనుక మాయాకల్పిత సకలోపాధిశూన్యుడవై, సర్వ భవబంధశృంఖల నిర్మూలనలో కృతకృత్యుడవు కమ్ము!” అని తన భాషణను ముగించాడు.
576. ఆ వాక్యాలను ఆకర్ణించిన శిష్యుడు ప్రఫుల్లహృదయంతో గురువుకు సాష్టాంగప్రణామం గావించి, ఆయన అనుమతితో బంధవిముక్తుడై వెడలిపోయాడు.
577. అనంతరం గురువు సదానందసింధు నిమగ్నుడై (ఆత్మైక్యమానసుడై) ప్రపంచ పర్యటన చేసి సర్వజనులనూ పవిత్రులు, బంధవిముక్తులను చేసెను.
578. ఈ విధంగా గురుశిష్య సంవాదరూపంలో ఆత్మతత్త్వం ముముక్షువులకు సులభగ్రాహ్యంగా బోధించబడింది.
579. సంసారబంధవిముక్తి కోరే ముముక్షువులు, అహంకారాది దోషవర్జితులై, విషయసుఖవిముఖులై, జితేంద్రియులై, శ్రుతుల మరియు గురువుల వాక్యాలలో అచంచల విశ్వాసపూరితులై ఈ హితోపదేశాన్ని శ్రద్ధతో ఆచరించి నిత్యానంద స్వరూపులగుదురు గాక!
580. సంసారపథంలో తాపత్రయరూపంలోని సూర్యకిరణాల వేడికి పరితపిస్తూ, దుఃఖీతులై, దాహార్తి ఉపశమన నిమిత్తం విషయరూప మరుభూమిలో జలాన్వేషణాతత్పరులై పరిభ్రమిస్తూ, శ్రమపడుతున్న ముముక్షువులకు సుఖకరమైన మోక్షసుధాంబుధిని అత్యంత సమీపానికి తెచ్చి, నిర్వాణసుఖాన్ని సమకూర్చి, ఈ శ్రీశంకరాచార్యుల సందేశం మార్గదర్శనం చేస్తున్నది.
ఓం తత్ సత్