షోడశీపూజ నుండి ఆంతరంగిక భక్తుల రాక మొదలయ్యే వరకు శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలు
1. రామేశ్వర్ మరణం
షోడశీ పూజానంతరం 1873 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మాతృదేవి కామార్పుకూర్కు తిరిగి వచ్చేశారని మేం పాఠకులకు తెలిపేవున్నాం. ఆమె అక్కడకు చేరిన స్వల్పకాలానికే శ్రీరామకృష్ణుల చిన్న అన్నగారైన రామేశ్వర్ భట్టాచార్య సన్నిపాత జ్వరం (టైఫాయిడ్) సోకి మరణించాడు. శ్రీరామకృష్ణుల తండ్రి తరఫు వంశీయులలోని స్త్రీ పురుషులందరి జీవితాలలోను ఆధ్యాత్మికత ఏదో రూపంలో అభివ్యక్తం అయింది. శ్రీ రామేశ్వర్ గురించి దీనికి సోదాహరణగా మేం ఎన్నో విషయాలు వినివున్నాం.
2. రామేశ్వర్ ఉదార నైజం
రామేశ్వర్ ధారాళ మనస్తత్వం ఉన్న వ్యక్తి. సాధువులు, ఫకీరులు తన వాకిటి వద్ద కొచ్చి ఏది కోరినా – అది ఇంట్లో ఉంటే చాలు – తక్షణమే దాన్ని వారికి ఇచ్చేసేవాడు. ఫకీరులు అతడి వద్దకు వచ్చి వంటపాత్ర, నీటికుండ, దుప్పటి ఇత్యాదులు కోరగా, అతడు ఇంట్లో నుండి వాటిని తెచ్చి వారికి ఇచ్చేసేవాడని అతడి బంధువుల నుండి మేం వినివున్నాం. తన కుటుంబంలో ఎవరైనా ఇందుకు ఆక్షేపణ వ్యక్తం చేస్తే అతడు శాంతంగా, “అతణ్ణి తీసుకోనీ! అడ్డు చెప్పకు! అటువంటి వస్తువులు అనేకం మళ్ళీ వస్తాయి. ఎందుకు సతాయిస్తావు?” అనేవాడు. జ్యోతిశ్శాస్త్రంలో కూడ అతడికి కొంత ప్రవేశం ఉంది.
3. రామేశ్వర్ మరణం గురించి శ్రీరామకృష్ణుల హెచ్చరిక
రామేశ్వర్ దక్షిణేశ్వరం నుండి చివరిసారిగా కామార్పుకూర్కు వెళ్ళనున్నప్పుడు అతడు అక్కడ నుండి తిరిగి రాడనే యథార్థం శ్రీరామకృష్ణులకు తెలుసు. ఆయన భావసమాధిలో రామేశ్వర్తో, “నువ్వు ఇంటికి వెళుతున్నావన్నమాట. వెళ్ళు! కాని భార్యతో ఏకశయ్యాగతుడవు కాబోకు. అలా చేసే పక్షంలో నువ్వు బ్రతకడం సందేహమే” అని హెచ్చరిక చేశారు. ఈ విషయం మాలో ఒకరు* శ్రీరామకృష్ణుల ముఖతా విన్నారు.
4. తల్లి సంవేదన పట్ల శ్రీరామకృష్ణుల అక్కర
ఇంటికి చేరుకొన్న కొన్ని రోజులకే రామేశ్వర్ రోగగ్రస్తుడయ్యాడనే వార్త అందింది. ఆ వార్త విని శ్రీరామకృష్ణులు, హృదయ్తో “నా నిషేధాన్ని అతడు పాటించలేదు. ఇప్పుడతడు బ్రతకడం సందేహమే” అని అన్నారు. ఈ వార్త అందిన ఐదారు రోజులకు రామేశ్వర్ మృతిచెందాడనే సమాచారం అందింది. వృద్ధురాలైన తన తల్లికి రామేశ్వర్ మరణ వార్త తీవ్ర ఆఘాతంగా పరిణమిస్తుందేమోనని శ్రీరామకృష్ణులు భయపడ్డారు. ఆయన ఆలయానికి వెళ్ళి తన తల్లిని శోకభారం నుండి రక్షించమని జగజ్జననిని దీనంగా ప్రార్థించారు. అలా ప్రార్థించాక తల్లిని ఊరడింప నహబత్కు వెళ్ళి కన్నీళ్ళతో ఈ విషాదవార్తను ఆమెకు తెలిపారు. స్వయంగా గురుదేవుల నుండి మేం ఈ విషయం వినివున్నాం – శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “అమ్మ ఈ విషాద వార్త విని స్పృహతప్పి పడిపోతుందనీ, ఈ ఆఘాతం తట్టుకొని బ్రతికివుండే అవకాశం తక్కువనీ నేను భయపడ్డాను. కాని తద్విరుద్ధంగా జరిగింది. ఆమె ఈ వార్త విని, ఒకింత బాధపడి, ‘సంసారం అనిత్యం. నేడో రేపో అందరూ పోవలసినవారే కదా! కాబట్టి అందుకై విలపించి ప్రయోజనం లేదు’ అంటూ నన్నే అనునయింపసాగింది. తంబురాను తారస్థాయి శ్రుతికి మీటినట్లుగా జగజ్జనని మా అమ్మ మనస్సును అత్యున్నత స్థాయిలో నిలిపి ఉంచినదనీ, అందుచేతనే ఈ ప్రాపంచిక దుఃఖశోకాలకు ఆమె చలించలేదనీ నాకు అనిపించింది. ఈ భావం మదిలో మెదలగానే జగజ్జననికి పదే పదే ప్రణామం చేసి, నిశ్చింతుడనయ్యాను.”
5. మరణ సమయంలో రామేశ్వర్ ప్రవర్తన
మరణించడానికి అయిదారు రోజులకు మునుపే తన ఆసన్న మరణం గురించి రామేశ్వర్ ఎరుగును. తన సన్నిహిత బంధువులకు ఈ సంగతి తెలిపి అంత్యక్రియల, శ్రాద్ధాది కర్మల ఏర్పాట్లన్నీ సిద్ధంచేసిపెట్టాడు. తన ఇంటికి ఎదురుగావున్న మామిడిచెట్లు ఏదో కారణంగా నరికివేయబడి ఉండటం చూసి, “మంచిదే అయింది. నా అంతిమసంస్కారానికి ఈ చెట్టు ఉపయోగపడుతుంది” అని అన్నాడు. రామేశ్వర్ అంతిమ క్షణాల వరకు పవిత్ర రామనామాన్ని జపిస్తూనే ఉన్నాడు. మరణం సంభవించడానికి కాస్సేపు ముందు మాత్రమే అతడు అపస్మారక స్థితిలో ఉండటం తటస్థించింది. తన భౌతికకాయాన్ని శ్మశానంలో దహనం చేయవద్దనీ, శ్మశానం ప్రక్క నుండి వెళ్ళే కాలిబాట క్రింద ఖననం చేయవలసిందనీ మరణించడానికి ముందు రామేశ్వర్ తన బంధువులను కోరాడు. అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు అతడు, “ఆ బాట మీదుగా నడిచి వెళ్ళే ఎందరో సాధువుల పాదధూళితో నాకు సద్గతి ప్రాప్తిస్తుంది” అని చెప్పాడు. అర్ధరాత్రి వేళ రామేశ్వర్ మరణించాడు.
6. మరణానంతరం రామేశ్వర్ తన స్నేహితుడు గోపాల్తో సంభాషించడం
గోపాల్ అనే ఆ గ్రామస్థు డొకడు, రామేశ్వర్ చాలకాలం నుండి ఆప్తమిత్రులుగా ఉండేవారు. రామేశ్వర్ మరణించిన అదే సమయంలో తన ఇంటి తలుపును ఎవరో తట్టిన చప్పుడు విన్నానని గోపాల్ చెప్పాడు. ఎవరు అని అడగ్గా, “నేను రామేశ్వర్ను. గంగాస్నానానికి పోతున్నాను. ఇంట్లో శ్రీరఘువీరుడు ఉన్నాడు. ఆయన సేవలో ఎలాంటి లోటూ రాకుండా కాస్త గమనిస్తూ ఉండు” అనే జవాబు వినవచ్చింది. మిత్రుని పిలుపు విని గోపాల్ తలుపు తెరవబోతూండగా, “నాకు దేహం లేదు. కాబట్టి తలుపు తెరిచినా నన్ను చూడలేవు” అన్న మాటలు వినిపించాయి. అయినప్పటికీ గోపాల్ తలుపు తెరిచాడు. కాని అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ తరువాత తను విన్న విషయంలోని నిజానిజాలు తెలుసుకోగోరి అతడు రామేశ్వర్ ఇంటికి వెళ్ళాడు. రామేశ్వర్ మరణం యథార్థమే అని అక్కడ గోపాల్ తెలుసుకొన్నాడు.
7. దక్షిణేశ్వర పూజారిగా రామ్లాల్ నియామకం
1873 వ సంవత్సరంలో, నలభై ఎనిమిదేళ్ళ వయస్సులో తన తండ్రి రామేశ్వర్ మరణించాడని శ్రీరామ్లాల్ ఛటోపాధ్యాయ చెబుతున్నాడు. తన తండ్రి చితాభస్మాన్ని సేకరించుకొని కలకత్తా సమీపంలోని ‘వైద్యవాటీ’ అనే ప్రదేశానికి వచ్చి, అక్కడ దాన్ని గంగలో నిమజ్జనం చేశాడు. దక్షిణేశ్వరంలో ఉన్న శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళే నిమిత్తం పడవలో అక్కడ గంగానదిని దాటాడు. గంగను దాటుతూ బారక్పూర్లో నిర్మింపబడుతున్న అన్నపూర్ణాదేవి ఆలయాన్ని చూశాడతడు. మథుర్నాథ్ భార్యయైన జగదంబాదాసీ పేరున నిర్మింపబడుతూన్న ఆ ఆలయ నిర్మాణం అప్పటికి సగం మాత్రమే పూర్తయింది. తదనంతరం ఆ ఆలయంలో దేవీ ప్రతిష్ఠాపన 12, ఏప్రిల్ 1875 వ సంవత్సరంలో జరిగింది. రామేశ్వర్ మరణానంతరం ఆయన స్థానే దక్షిణేశ్వర పూజారిగా రామ్లాల్ నియమితుడయ్యాడు.
8. శంభుమల్లిక్ ఉదంతం
మథుర్బాబు మరణానంతరం కలకత్తాలోని సిందూరియాపటీ పేట వాస్తవ్యుడైన శంభుచరణ్ మల్లిక్, శ్రీరామకృష్ణుల పరిచయ భాగ్యం పొందాడు. క్రమంగా ఆయన పట్ల అతడు అత్యంత భక్తిప్రపత్తులు పెంపొందించుకొన్నాడు.* అప్పటికే శంభుబాబు బ్రహ్మ సమాజంపట్ల అమిత ఆకర్షితుడయ్యాడు. అతడి దానశీలత కారణంగా కలకత్తాలో పేరెన్నిక గాంచాడు. శ్రీరామకృష్ణుల పట్ల శంభుబాబు భక్తిప్రపత్తులు దినదినాభివృద్ధి చెందాయి. మథుర్బాబులా గురుదేవులను సేవించుకొనే విశేషభాగ్యం అతడికి దక్కింది. శ్రీరామకృష్ణులకు, శారదామాతకు ఏవైనా వస్తువులు అవసర మైనాయని తనకు తెలిసీతెలియగానే శంభు వాటిని సరఫరా చేసేవాడు. శ్రీరామకృష్ణులను అతడు ‘గురూజీ’ అని సంబోధించేవాడు. అలా సంబోధించడం పట్ల చిరాకు వ్యక్తం చేస్తూ ఆయన, “గురువు ఎవరు? శిష్యుడెవరు? నువ్వే నా గురువువి” అని ఆయన అనడం కద్దు. కాని శంభు అలా సంబోధించడం మానలేదు. తన జీవితాంతం ఆయనను అలాగే సంబోధిస్తూ వచ్చాడు. ఆయన దివ్యసాంగత్యంతో అతడి ఆధ్యాత్మిక పథం వెలుగొంది, తత్ప్రభావంతో అతడి ఆధ్యాత్మిక జీవితం సఫలతను సంతరించుకొన్నదని శ్రీరామకృష్ణులను అతడు అలా సంబోధించడాన్ని బట్టి రూఢి పరచుకోవచ్చు. శంభుబాబు భార్య కూడ శ్రీరామకృష్ణులను సాక్షాత్తు దేవునిలా హృదయపూర్వకంగా ఆరాధించింది. మాతృదేవి దక్షిణేశ్వరంలో బసచేసిన సందర్భాలలో ఆమెను ప్రతి మంగళవారం* నాడు తమ స్వగృహానికి తోడ్కొని వెళ్ళి షోడశోపచారాలతో మాతృదేవి పాదపద్మాలను పూజించేది.
9. మాతృదేవి నిమిత్తం శంభు ఒక గది కట్టించి ఇవ్వడం
మాతృదేవి దక్షిణేశ్వరానికి రెండవసారి 1874 వ సంవత్సర వైశాఖ మాసంలో బహుశా వచ్చివుండవచ్చు. మునుపటిలా ఇప్పుడూ ఆమె శ్రీరామకృష్ణుల తల్లి (తన అత్తగారు)తో పాటు నహబత్లోనే నివసింపసాగింది. ఆ విషయం తెలిసి, ఆ చిన్నగదిలో ఆమెకు అసౌకర్యంగా ఉంటుందని భావించి శంభు, దక్షిణేశ్వర ఆలయం దగ్గర ఒక ఖాళీస్థలాన్ని రెండు వందల యాభై రూపాయలకు కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో విశాలమైన ఒక రెల్లుగడ్డి పైకప్పు గదిని ఆమె కోసం కట్టించాలని సంకల్పించాడు. ఆ సమయంలో కెప్టెన్ విశ్వనాథ్ ఉపాధ్యాయ్ అనే నేపాల్ ప్రభుత్వ అధికారి ఒకరు శ్రీరామకృష్ణులను సందర్శిస్తూ క్రమంగా ఆయన పట్ల విశేష భక్తిని పెంపొందించుకొన్నాడు. మాతృదేవి నిమిత్తం శంభు నిర్మించనున్న గది సంగతి తెలుసుకొని, అందుకు అవసరమైన కలపనంతా తాను సరఫరా చేస్తానని కెప్టెన్ విశ్వనాథ్ సంతోషంగా ముందుకు వచ్చాడు. నేపాల్ ప్రభుత్వానికి చెందిన సాల్ కలప వ్యాపారం యావత్తూ అతడి చేతులలో ఉండటమే ఇందుకు కారణం. అందుచేత అలా సరఫరా చేయడం అతడికి ఏమంత కష్టమూ కాదు, ఖర్చుతో కూడినదీ కాదు. గది నిర్మాణం ప్రారంభించగానే బేలూరు గ్రామంలోని తన కలప నిల్వలనుంచి విశ్వనాథ్ మూడు పెద్ద సాల్ కలప దుంగలను గంగా నీటి ప్రవాహం మీదుగా పంపించాడు. కాని నాటి రాత్రి నది ఉద్ధృతమైన పోటులో ఉన్నందున ఒక కలప దుంగ నది దిగువకు కొట్టుకుపోయింది. ఈ విషయం తెలిసి హృదయ్ విసుగుచెంది మాతృదేవిని ‘దురదృష్టవంతురాలు’ గా పేర్కొనే వరకు వెళ్ళాడు. ఒక దుంగ ప్రవాహంలో కొట్టుకొనిపోయిందని తెలిసి కెప్టెన్ మరో కలప దుంగను పంపించాడు. గది నిర్మాణం పూర్తయింది. మాతృదేవి ఆ గదిలో దాదాపు ఒక ఏడాదిపాటు నివసించింది. ఇంటి పనులలో సహాయం చేస్తూ మాతృదేవికి తోడుగా ఉండడానికి ఒక స్త్రీని నియమించారు. మాతృదేవి అక్కడ వంట చేసి నిత్యం శ్రీరామకృష్ణుల కోసం దక్షిణేశ్వరానికి భోజనం తీసుకుపోయేవారు. ఆయన భోజనం చేసిన తరువాత ఆమె వెనక్కు తిరిగి వచ్చేసేవారు. పగటి వేళ ఎప్పుడైనా శ్రీరామకృష్ణులు ఆమెను చూడటానికి ఆ గదికి వెళ్ళేవారు. కాస్సేపు అక్కడ గడిపి మళ్ళీ దక్షిణేశ్వర దేవాలయానికి తిరిగి వెళ్ళిపోయేవారు. ఒకే ఒక్క రోజు మాత్రం ఈ నియమాన్ని ఆయన ఉల్లంఘించవలసిన అగత్యం ఏర్పడింది. ఆ రోజు మధ్యాహ్నం శ్రీరామకృష్ణులు అక్కడకు రాగానే కుంభవృష్టి ప్రారంభమై అర్ధరాత్రి దాటేవరకు ఆగలేదు. నాటి రాత్రి ఆయన ఆలయానికి తిరిగి పోవడం అసంభవమై అక్కడే ఉండవలసిన అగత్యం ఏర్పడింది. మాతృదేవి ఆయనకు అన్నం, చారు వండి భోజనం వడ్డించింది. ఆయన భోజనం చేసి నాటి రాత్రి అక్కడే ఉన్నారు.
రామ్లాల్ ఛటోపాధ్యాయ, రామేశ్వర్ పెద్దకూమారుడు
లక్ష్మీ ఛటోపాధ్యాయ రామేశ్వర్ కుమార్తె
శివరామ్ ఛటోపాధ్యాయ రామేశ్వర్ చిన్నకూమారుడు
10. శారదామాత తీవ్ర అనారోగ్యానికి గురి కావడం
ఒక సంవత్సర కాలం ఆ గదిలో నివసించిన తరువాత శారదామాత అతిసార వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెకు స్వస్థత చేకూర్చడంలో శంభు ఎంతో శ్రద్ధ వహించాడు. అతడు డాక్టర్ ప్రసాద్ను రావించి మాతృదేవికి అనారోగ్యానికి గురి కావడం చికిత్స చేయించసాగాడు. కాస్త కోలుకొన్న తరువాత ఆమె బహుశా 1876 వ సంవత్సరంలో జయరాంబాటిలోని పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి చేరగానే వ్యాధి తిరగబెట్టడంతో ఆమె మంచం పట్టింది. క్రమంగా వ్యాధి ముదిరి ఆమె కోలుకోగలదా అన్న అనుమానం తలెత్తింది. అప్పటికే ఆమె తండ్రిగారైన శ్రీరామచంద్ర ముఖోపాధ్యాయ్ దివంగతుడయ్యాడు. కనుక శారదామాత తల్లి, తమ్ముళ్ళు ఆమెకు తమ శక్తి మేరకు సేవలు అందించసాగారు. శారదామాత తీవ్ర అనారోగ్యం గురించి విని శ్రీరామకృష్ణులు ఇలా అన్నారని, మేం విన్నాం: కాబట్టి హృదూ! “ఆమె (శారదామాత) ఇప్పుడు శరీరం విడిచిపెడితే, ఆమె ఈ భూమిమీదకు రావడం ప్రయోజనం సిద్ధించదు. మానవజన్మకు సార్థకతను కూడా సాధించనట్లే అయ్యేది” అని అన్నారు.
11. సింహవాహినీ ఆలయంలో శారదామాత ప్రాయోపవేశం
ఏ రకమైన చికిత్సకూ వ్యాధి ఉపశమింపకపోవడంతో దేవి ఎదుట ప్రాయోపవేశం చేయ మాతృదేవి సంకల్పించింది. తల్లికి, తమ్ముళ్ళకు ఈ విషయం తెలిస్తే వాళ్ళు అందుకు అడ్డుపడతారని ఎంచి శారదామాత ఎవరికీ తెలుపకుండా గ్రామంలోని సింహవాహినీదేవి ఆలయానికి వెళ్ళి ప్రాయోపవేశ వ్రతం ఆచరించింది. ప్రాయోపవేశ స్థితిలో ఆమె కేవలం కొన్ని గంటలు గడపగానే దేవి ప్రసన్నురాలై ఆమెకు స్వస్థత కలిగించే ఔషధం సూచించింది.
దేవి ఆదేశంగా ప్రాప్తమైన ఔషధం పుచ్చుకోగానే వ్యాధి తగ్గుముఖం పట్టి, క్రమంగా పూర్వపు శక్తిని ఆమె పుంజుకోగలిగింది. ఆ విధంగా శారదామాత ప్రాయోపవేశ వ్రతం ఆచరించి ఔషధం సంప్రాప్తించుకొన్న సంఘటనానంతరం, సింహవాహినీదేవి ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో జాగ్రదాదేవిగా* ప్రసిద్ధి కెక్కింది.
12. మరణ సమయంలో శంభు నిర్భయ వర్తనం
శ్రీరామకృష్ణులను, మాతృదేవిని దాదాపు నాలుగు సంవత్సరాలు శంభుబాబు సేవించాడు. పిదప రోగంతో మంచంపట్టాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులు రోగంతో బాధ పడుతున్న శంభును వెళ్ళి పలకరించి వచ్చారు. తిరిగి వచ్చాక, సమయంలో శంభు “శంభు జీవన దీపంలో చమురు ఇగిరిపోయింది” అని అన్నారు. శ్రీరామకృష్ణుల వాక్కులు నిజమయ్యాయి. మధుమేహవ్యాధి జటిలమై అతడు కొద్దిరోజుల్లోనే మరణించాడు. శంభుబాబు పరమ ఉదారుడు, నిర్భయుడైన భక్తి తత్పరుడు. రోగంతో బాధపడుతున్న సమయంలో ఒక్క రోజైనా అతడి మనోప్రసన్నత తగ్గిందిలేదు. మరణించడానికి కొన్ని రోజుల ముందు అతడు హృదయ్తో సంతుష్టహృదయుడై “మరణం గురించి నా కెలాంటి ఆరాటమూ లేదు. మూటాముల్లె సర్దుకొని పోవడానికి తయారుగా ఉన్నాను” అని అన్నాడు. శంభుబాబుతో పరిచయం ఏర్పడటానికి చాలాకాలం క్రితమే శ్రీరామకృష్ణులు భావసమాధి స్థితిలో జగజ్జనని అతణ్ణి తన రెండవ రసద్దారు (సరఫరాదారు)గా నియామకం చేయడం చూశారు. ప్రప్రథమంగా అతణ్ణి చూడగానే ఇతడే ఆ వ్యక్తి అని ఆయన గుర్తించారు.
13. చంద్రమణీదేవి అంతిమ దినాలు
అనారోగ్య కారణంగా తన పుట్టింటికి శారదామాత వెళ్ళిపోయిన తరువాత శ్రీరామకృష్ణుల జీవితంలో ఒక ముఖ్య సంఘటన జరిగింది. 1876 వ సంవత్సరం సరిగ్గా శ్రీరామకృష్ణుల పుట్టినరోజు నాడు ఆయన తల్లిగారైన చంద్రమణీదేవి తన ఎనభై ఐదవ ఏట పరమపదించింది. వృద్ధాప్యం కారణంగా చనిపోవడానికి కొన్ని సంవత్సరాలకు ముందు నుండి ఆమె మనస్సు, ఇంద్రియాల పటుత్వం చాలావరకు సన్నగిల్లిపోయాయి. ఆమె మరణం గురించి హృదయ్ నుండి మేం విన్నది ఇక్కడ పొందుపరుస్తున్నాం.
చంద్రాదేవి మరణించడానికి నాలుగు రోజుల ముందు హృదయ్ సెలవు పుచ్చుకొని ఒకసారి ఇంటికి వెళ్ళివద్దామనుకొన్నాడు. కాని ఏదో తెలియరాని భయంతో అతడి మనస్సు ఆరాటం చెందింది. శ్రీరామకృష్ణులను ఒంటరిగా వదలి వెళ్ళడానికి అతడికి మనస్కరించలేదు. హృదయ్ తన భయోద్రేకాన్ని శ్రీరామకృష్ణులకు వ్యక్తం చేయగా, ఆయన, “అయితే నువ్వు వెళ్ళవద్దు” అని అన్నారు. మూడు రోజులు ఏ అవాంఛనీయ సంఘటనా జరక్కుండానే గడచిపోయాయి.
ప్రతీ రోజు శ్రీరామకృష్ణులు, తల్లి వద్దకు వెళ్ళి కొంతసేపు ఆమె వద్ద గడిపి, స్వహస్తాలతో ఆమెకు సేవలందించేవారు. హృదయ్ కూడ అట్లే చేసేవాడు. ‘కాళీతల్లి’ అనే పరిచారిక దాదాపు పగలంతా ఆ వృద్ధురాలిని కనిపెట్టుకొనే ఉండేది. ప్రస్తుతం ఆమె హృదయ్ పట్ల సుముఖంగా ఉండడం లేదు. అందుకు కారణం: అక్షయ్ మరణించినప్పటి నుండి అక్షయ్ను హృదయ్ చంపాడనీ, తన కుమారుణ్ణీ కోడలినీ కూడ చంపే ప్రయత్నంలో ఉన్నాడనీ ఒక వెర్రితలంపు ఆమె మనస్సులో గాఢంగా పాదుకుపోయింది. అందుకే ఆమె అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులను, “హృదయ్ మాటలకు ఎన్నడూ చెవి ఒగ్గకు” అని హెచ్చరించేది. వయోభారం, అస్థిరత మూలంగా ఆమెలో పరిస్థితులను అవగతం చేసుకొనే శక్తి సన్నగిల్లినట్లు మరెన్నో విషయాల నుండి తెలియవస్తున్నది. ఈ క్రింది విషయం ఉదాహరణగా తీసుకోవచ్చు: దక్షిణేశ్వర కాళికాలయం ప్రక్కనే ఆలంబజార్ జనుపనార మిల్లు నెలకొనివుంది. ప్రతి రోజు మధ్యాహ్నం మిల్లులోని పనివారికి అరగంట సేపు విరామం ఇచ్చేవారు. అరగంట తరువాత పని ప్రారంభించడానికి సంకేతంగా ఈల ధ్వని వినవచ్చేది. ఈ ఈల ధ్వని విని చంద్రాదేవి అది వైకుంఠంలో ధ్వనించే శంఖారావం అని నిర్ణయించుకొంది. కనుక ఆమె ఆ ఈల ధ్వని వినవచ్చే వరకు భోజనానికి కూర్చునేది కాదు. భోజనం చెయ్యమని ఆమెను అడిగితే, “ఇప్పుడే ఎలా భోజనం చేస్తాను? ఇంకా లక్ష్మీనారాయణునికి నైవేద్యం కాలేదే! వైకుంఠం నుండి శంఖారావం వినబడలేదు. ఎవరైనా నైవేద్యం కాకుండా తినవచ్చునా?” అని అడిగేది. మిల్లు సెలవు రోజుల్లో ఈల ధ్వని వినరానందున ఆ వృద్ధురాలిని భోజనానికి కూర్చోబెట్టడం ఎంతో కష్టంగా ఉండేది. ఆమె చేత భోజనం తినిపింపజేయడానికి శ్రీరామకృష్ణులు, హృదయ్ ఎన్నో ఉపాయాలు ఆలోచింపవలసివచ్చేది.
ఏది ఎలావున్నప్పటికీ నాలుగవ రోజు రానేవచ్చింది. ఆమెలో అనారోగ్య లక్షణాలు ఏవీ పొడసూపలేదు. చీకటిపడ్డాక శ్రీరామకృష్ణులు ఆమె వద్దకు వెళ్ళి తన చిన్ననాటి సంఘటనలు, వాటి వివరాలు ముచ్చటిస్తూ ఆమెను ఆనందింప చేశారు. ఆమెను పడుకోబెట్టి శ్రీరామకృష్ణులు తమ గదికి వచ్చేసరికి అర్ధరాత్రి అయింది.
మర్నాడు భళ్ళున తెల్లవారింది. ఉదయం ఎనిమిది గంటలయింది. కాని ఆ వృద్ధురాలు తలుపు తీసి బయటికి రాలేదు. పరిచారిక కాళీతల్లి నహబత్ మొదటి అంతస్తులోని ఆమె గది తలుపు వద్దకెళ్ళి పదేపదే ఆమెను పిలిచింది. కాని ఏ బదులూ రాలేదు. తలుపుకు చెవి ఆన్చి వినగా వృద్ధురాలి కంఠం నుండి గురగుర శబ్దం రావడం వినిపించింది. భయంతో వెంటనే ఆ విషయం శ్రీరామకృష్ణులకు, హృదయ్కు తెలిపింది. హృదయ్ వచ్చి చాకచక్యంతో బయట నుంచి లోపలి గడియ తీసి వెళ్ళి చూడగా, చంద్రాదేవి స్పృహకోల్పోయి పడివుంది. వెంటనే అతడు ఆయుర్వేద ఔషధం తెచ్చి ఆమె నాలుకపై పెట్టాడు. కాస్త పాలు, గంగాజలం కూడ ఆమె గొంతులో పోయసాగాడు. మూడు రోజులు ఆమె అదే స్థితిలో ఉండిపోయింది. తదుపరి అంతిమ క్షణాలు రానే వచ్చాయి. ఆమెను గంగాతీరానికి తీసుకువెళ్ళారు. ఆమెను అంతర్జలనిని (అంటే సగం దేహం నదీ జలంలో ఉంచడం) చేశారు. పుప్వులు, చందనం, తులసీదళాలతో శ్రీరామకృష్ణులు ఆమె పాదపద్మాలకు అంజలి ఘటించారు. సన్న్యసియైన శ్రీరామకృష్ణులు తల్లికి అంతిమ సంస్కారాలు చేయడం నిషిద్ధం కనుక, ఆయన చిన్నన్నగారి పుత్రుడైన రామ్లాల్చే వాటిని చేయించారు. అట్లే అశౌచ గడువు పూర్తయ్యాక తల్లి పేరిట ఒక కోడెదూడెను విడిచిపెట్టి రామ్లాల్ చంద్రాదేవి శ్రాద్ధకర్మలన్నిటినీ యథావిధిగా నిర్వర్తించాడు.
కేశవ్ చంద్రసేన్ (1838 -1884): బ్రహ్మసమాజ నాయకుడు
శ్రీరామకృష్ణులకు బైబిల్ చదివి వినిపించిన శంభు మల్లిక్
14. శ్రీరామకృష్ణులు తల్లికి తర్పణం ఇవ్వ ప్రయత్నించడం
సన్న్యాసాశ్రమ ప్రతిష్ఠ గౌరవాల పట్ల, శాస్త్ర నిర్దేశాలపట్ల గల మాన్యతతో శ్రీరామకృష్ణులు తల్లి మరణించినప్పుడు అశౌచం తదితర గార్హస్థ్య నియమాదులను పాటించలేదు. కాని తల్లిపట్ల కుమారుడు నిర్వర్తించవలసిన ఏకర్మా చేయలేదని తలచి ఒక రోజు ఆయన తల్లికి తర్పణం వదలాలనుకొన్నారు. కాని దోసిలిలో నీరు తీసుకొంటుండగానే ఆయన భావావేశపరులయ్యారు. ఆయన వ్రేళ్ళు కొరడుబారి, విడివడి వ్రేళ్ళ సందులగుండా నీళ్ళు కారిపోయాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా అట్లే జరగడంతో దుఃఖీస్తూ పరలోకగతురాలైన తల్లికి తన అసమర్థతను మొరపెట్టుకొన్నారు. ‘గలిత కర్మావస్థ’ అనే అవస్థను గురించి శాస్త్రాలు పేర్కొంటున్నాయని, అలాంటి అవస్థ లేక స్థితి పొందిన వ్యక్తి, అంటే ఆధ్యాత్మికోన్నతి కలిగినప్పుడు, స్వతఃసిద్ధంగానే కర్మలన్నీ పరిపూర్ణంగా తొలగిపోతాయని ఒక పండితుని నుండి శ్రీరామకృష్ణులు తదనంతరం విన్నారు. అలాంటి అవస్థలో ఉన్న వ్యక్తికి శాస్త్రవిహిత కర్మలు నిర్వర్తించడం సాధ్యం కాదు. అలా చేయకపోయినా అతడికి ఎలాంటి పాపమూ చుట్టుకోదు.
15. శ్రీరామకృష్ణులు కేశవచంద్రసేన్ను చూడబోవడం
తల్లి మరణించడానికి ఒక సంవత్సరానికి మునుపు శ్రీరామకృష్ణుల జీవితంలో జగజ్జనని సంకల్పం చేత ఒక ముఖ్య సంఘటన జరిగింది. మార్చి 1875 వ సంవత్సరంలో బ్రహ్మసమాజ నేతయైన కేశవచంద్రసేన్ను చూడాలనే ఆకాంక్ష శ్రీరామకృష్ణులకు కలిగింది. భావపారవశ్యంలో ఉండగా ఈ చూడబోవడం విషయంగా జగజ్జనని ఆదేశం ఆయనకు వినవచ్చింది. కలకత్తాకు కొన్ని మైళ్ళ ఉత్తర దిశలో ఉన్న బేల్ఘారియాలోని జయగోపాల్ సేన్ గృహోద్యానంలో ఆ సమయంలో కేశవసేన్ తన శిష్యులతో ఆధ్యాత్మిక సాధనలలో మునిగి ఉన్నాడని ఆయన తెలుసుకొన్నారు. ఆయన హృదయ్తో కలిసి కెప్టెన్ విశ్వనాథ్ ఉపాధ్యాయ్ బండిలో బయలు దేరి, అక్కడకు దాదాపు ఒంటి గంట ప్రాంతాన చేరుకొన్నారు. (ఈ విషయం మేం హృదయ్ నుండి విన్నాం.) ఆ రోజు శ్రీరామకృష్ణులు ఎర్ర అంచు ధోవతి ధరించారు. ధోవతి అడుగు అంచు ఎడమ భుజం మీదుగా వెనక్కు వ్రేలాడేటట్లు వేసుకొన్నారు.
16. బేల్ఘారియా ఉద్యానంలో కేశవ్
హృదయ్ బండి నుండి దిగి ఉద్యాన కాసారం గట్టుమీద కేశవ్, ఆయన అను యాయులు కూర్చుని ఉండడం చూశాడు. కేశవ్ వద్దకు వచ్చి అతడితో “నా మేనమామ ఒక మహాభక్తుడు. మీ ముఖతా భగవత్ ప్రసంగం వినగోరి ఇక్కడకు వచ్చారు. మీరు సమ్మతిస్తే ఆయనను ఇక్కడకు తోడ్కొని వస్తాను” అని అన్నాడు. కేశవ్ అందుకు సమ్మతించాడు. శ్రీరామకృష్ణులను బండినుండి హృదయ్ జాగ్రత్తగా దింపి అక్కడకు తోడ్కొని వచ్చాడు. అప్పడిదాకా కేశవ్ తదితరులు ఆయనను చూడాలని ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. ఆయనను చూడగానే వారి ఆతురత చప్పగా చల్లారింది. ఆయన వారికి ఒక సామాన్యవ్యక్తిగానే కనిపించారు.
17. మొదటిసారిగా కేశవ్తో శ్రీరామకృష్ణులు సంభాషించడం
శ్రీరామకృష్ణులు, కేశవ్ వద్దకు వచ్చి “బాబూ! మీరు భగవద్దర్శనం పొందారట కదా! ఆ దర్శనం ఎలా ఉంటుందో తెలుసుకోగోరుతున్నాను. అందుకే నేను మీ వద్దకు వచ్చాను” అని అన్నారు. ఆ విధంగా భగవత్ప్రసంగం ప్రారంభ మైంది. శ్రీరామకృష్ణుల ప్రశ్నకు కేశవ్ ఏం సమాధానం చెప్పాడో తెలియడం లేదు. కాని కొన్ని క్షణాలయ్యాక, “ఎరుగగ తరమె ఏరికినైనా, తల్లి కాళి నిజతత్వ మించుక? షడ్దర్శనములె శక్తిహీనములు, తల్లి విషయము తెలియచేయుటకు…..” అన్న రాంప్రసాద్ సుప్రసిద్ధ గీతాన్ని పాడి శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులయ్యారని హృదయ్ మాకు తెలిపాడు. శ్రీరామకృష్ణుల భావపారవశ్య స్థితిని చూసి కేశవాదులు దానినొక ఉన్నత ఆధ్యాత్మిక అవస్థగా పరిగణించలేదు. అది కేవలం ఒక నటనగానో, మతిచెడిన వ్యవహారంగానో వారు తలచారు. శ్రీరామకృష్ణులకు బాహ్యచైతన్యం కల్పింప హృదయ్ ఆయన చెవిలో ఓంకారనాదం వినిపించసాగాడు. దాంతో మధుర దర హాసంతో ఆయన ముఖారవిందం తేజోవిరాజమానమైంది. ఆ విధంగా పాక్షికంగా బాహ్య చైతన్యం పొంది ప్రగాఢ ఆధ్యాత్మిక విషయాలను అతి సరళమైన భాషలో సాధారణ ఉదాహరణలు జోడిస్తూ వివరించసాగారు. అందరూ మంత్రముగ్ధులై ఆయన ముఖంవైపే చూస్తూ కూర్చుండిపోయారు. స్నానపానాదుల వేళ ఎప్పుడో దాటిపోయిందని, మళ్ళీ సంధ్యా సమయ ఉపాసన వేళ అయిందని ఎవరికీ ఎరుకే లేకపోయింది. వారి మనోవైఖరిని గమనించి శ్రీరామకృష్ణులు “ఆవుల మందలోకి మరో జంతువు ఏదైనా ప్రవేశిస్తే, అవి ముందుకెళ్ళి దాన్ని కుమ్మబోతాయి. కాని మరో ఆవు కనుక వస్తే అవి దాని ఒంటిని నాకుతాయి. అది స్వజాతిది. మన వ్యవహారమూ నేడు అట్లే ఉంది” అని అన్నారు. పిదప కేశవ్ను ఉద్దేశించి, “నీ తోక తెగి పడిపోయింది” అన్నారాయన. ఆయన మాటలు అంతరార్థం అవగతం చేసుకోలేక కేశవ్ అనుయాయులు ఒకింత చికాకు వ్యక్తం చేయడం చూసి, తమ వచనాల అంతరార్థాన్ని వివరించి చెప్పారు. “ఇలా చూడండి. తోక ఉన్నంత వరకు చిరుకప్ప నీళ్ళలో మాత్రమే జీవిస్తుంది, నేలపైకి రాలేదు. కాని తోక రాలిపోయిన తరువాత అది నీళ్ళలోను, నేలమీద మనగలదు. అదేవిధంగా అజ్ఞానం అనే తోక ఉన్నంతవరకు మనిషి సంసారం అనే నీళ్ళలో జీవించక తప్పదు. కాని ఆ తోక తొలగిపోయిన పిదప సంసారంలోగాని, సచ్చిదానందంలోగాని యథేచ్ఛగా సంచరించవచ్చు. ఓ కేశవ్! నీ మనస్సు ప్రస్తుతం అలాటస్థితిని సంతరించుకోవడంతో నువ్వు సంసారంలోను, సచ్చిదానందంలోను జీవించగలవు.” అని శ్రీరామకృష్ణులు ఇలాంటి వివిధ అంశాలపై ఆ రోజు చాలాసేపు ప్రసంగించి దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చేశారు.
18. శ్రీరామకృష్ణులకూ, కేశవ్సేన్లకూ మధ్య నెలకొన్న సాన్నిహిత్యం
శ్రీరామకృష్ణులను మొట్టమొదటిసారి చూసినప్పటి నుండి కేశవసేన్ ఆయన పట్ల అమిత ఆకర్షితుడయ్యాడు. నాటి నుండి తన మరణ పర్యంతం, ఆయనను దర్శించడం మహద్భాగ్యంగా భావించి తరచూ ఆయన దివ్యసాంగత్య లబ్ధి పొందసాగాడు. స్వయంగా తనే దక్షిణేశ్వరానికి రావడంగాని లేక అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులను తన కలకత్తా నివాసమైన కమల కుటీరానికి తోడ్కొని వెళ్ళడంగాని చేసేవాడు. శ్రీరామకృష్ణ కేశవసేన్ల నడుమ నెలకొన్న సాన్నిహిత్యం ఎంత ప్రగాఢతరమైనదంటే పరస్పరం వాళ్ళు కేవలం కొన్ని రోజులు సైతం చూసుకోకుండా ఉండలేకపోయేవారనడం అతిశయోక్తి కాబోదు. అలాంటి సందర్భాలలో శ్రీరామకృష్ణులు కలకత్తాలోని కేశవ్ వద్దకో లేక కేశవ్సేన్ ఆయనను దర్శింప దక్షిణేశ్వరానికో రావడం కద్దు. బ్రహ్మసమాజ వార్షికోత్సవం నాడు తన అనుయాయులతో కలిసి శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళడమో లేక ఆయనను తమ వద్దకు తోడ్కొని వచ్చి భగవత్ప్రసంగాలతో నాడు ఆయనతో గడపడమో ఉత్సవంలో ఒక భాగంగా కేశవ్ పరిగణించేవాడు. తన అను యాయులతో స్టీమర్లో భగవత్ వైభవాన్ని కీర్తిస్తూ దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణులను స్టీమర్లో తోడ్కొని, ఆయన అమృతోపదేశాలను వీనులవిందు చేసుకొంటూ గంగానదిలో విహరించడం కేశవ్కు పరిపాటి.
19. దక్షిణేశ్వరంలో కేశవ్
శాస్త్ర ఆదేశాలను జ్ఞప్తిలో ఉంచుకొని కేశవ్ ఏనాడూ దక్షిణేశ్వరానికి రిక్తహస్తాలతో వచ్చి ఎరుగడు. వచ్చినప్పుడల్లా తనతోకూడ కొన్ని పళ్ళు తెచ్చి శ్రీరామకృష్ణుల ముందు వాటిని ఉంచేవాడు. భక్తిప్రపత్తులతో ఆయన పాదపద్మాల వద్ద కూర్చుని ఆయనతో సంభాషించేవాడు. ఒకసారి శ్రీరామకృష్ణులు పరిహాసంగా కేశవ్తో, “కేశవ్! నువ్వు నీ ప్రసంగాలతో అనేకులను మంత్రముగ్ధులను చేస్తావు. నాక్కూడా ఏదైనా చెప్పు” అన్నారు. అందుకు కేశవ్ వినమ్రంగా “మహాశయా! కమ్మరి కొలిమి వద్దకు నేను సూదులు అమ్మడానికి పోవాలా? దయచేసి మీరే ఏదన్నా చెప్పండి, నేను వింటాను. మీ ముఖతా విన్న వచనాలలో ఏవో కొన్ని లోకులకు చెప్పిన మరుక్షణమే వారు మంత్రముగ్ధులవుతున్నారు” అని జవాబిచ్చాడు.
20. కేశవ్కు శ్రీరామకృష్ణుల ఉపదేశాలు
“బ్రహ్మ పదార్థపు అస్తిత్వాన్ని అంగీకరించే పక్షంలో బ్రహ్మం యొక్క శక్తిని కూడ అంగీకరించవలసే ఉంటుంది. బ్రహ్మం, బ్రహ్మశక్తి సర్వదా అభిన్నమైన ఒక్కటే విషయం” అని ఒక రోజు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు, కేశవ్కు వివరించి చెప్పారు. కేశవ్ ఆ వివరణకు ఆమోదం తెలిపాడు. ఆ తరువాత మళ్ళీ ఆయన అతడితో ఇలా చెప్పారు: “బ్రహ్మం, బ్రహ్మశక్తి ఎలా అభేదమో అదే రీతిలో భాగవతం – భక్తుడు –భగవంతుడు – ఇలా రూపాలు మూడు ఐనప్పటికీ పదార్థం అభిన్నమైన ఒక్కటే; ఈ మూడు ఒక్కటే, ఒక్కటే మూడు” అని కూడ స్పష్టంచేశారు. కేశవ్ ఈ వచనాలు కూడ అవగతం చేసుకొని, అంగీకరించాడు. మళ్ళీ శ్రీరామకృష్ణులు ఇలా కొనసాగించారు: “గురువు, కృష్ణుడు, భక్తుడు – ఈ ముగ్గురూ ఒక్కరే, ఒక్కరే ముగ్గురూను. ఇప్పుడు ఈ విషయం నీకు వివరింపబోతున్నాను.” అన్న ఆ మాటలు విని కేశవ్ ఒకింతసేపు ఆలోచనలో పడ్డాడు. అతడి మనస్సులో ఏ ఆలోచనలు మెదలినవో తెలియరాలేదు. వినమ్రంగా అతడు, “మహాశయా! మీరు ఇప్పటికి చెప్పిన దానికంటే ఎక్కువ విషయాలు ప్రస్తుతం నేను అంగీకరింపలేను. కనుక ఈ విషయాంశాన్ని పొడిగించాల్సిన అవసరం లేదు” అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “మంచిది; ఇక్కడికి ఆపివేద్దాం” అన్నారు. పాశ్చాత్య భావనలచే, ఆదర్శాలచే ప్రభావితమైన కేశవసేన్ మనస్సు శ్రీరామకృష్ణుల దివ్యసాంగత్యం ద్వారా ఎంతో ప్రకాశాన్ని సంతరించుకొన్నది. కేశవ్ రోజురోజుకీ సనాతన వైదిక ధర్మ మర్మాలను అవగతం చేసుకొంటూ, ఆధ్యాత్మిక సాధనలలో మునిగిపోయాడు. శ్రీరామకృష్ణులకు మరింత సన్నిహితుడయ్యేకొద్దీ అతడి మతపరమైన అభిప్రాయాలు క్రమంగా మార్పుకు లోనుకావడం ద్వారా పై విషయం మనకు స్పష్టం అవుతోంది.
21. కూచ్బిహార్ వివాహం: పర్యవసానం
దారుణంగా గాయపడితే తప్ప మనిషి మనస్సు సంసారం పట్ల అనాసక్తతను వహించి, భగవంతుడే సర్వస్వం అని భావించదు. శ్రీరామకృష్ణులతో పరిచయం ఏర్పడ్డ మూడు సంవత్సరాల తరువాత కేశవసేన్ కూచ్బిహార్ సంస్థానం యువరాజుకు తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించడంతో, కేశవ్ పెద్ద ఆఘాతానికి గురియైనాడు. ఆ వివాహం భారతీయ బ్రహ్మసమాజంలో గొప్ప సంచలనం సృష్టించి, సమాజాన్ని రెండుగా విభజించివేసింది. కేశవ్కు ప్రతికూలురైనవారు సమాజం నుండి విడిపోయి ‘సాధారణ బ్రహ్మసమాజం’ అనే ఒక కొత్త సమాజాన్ని స్థాపించు కొన్నారు. రెండు వర్గాలవారి మధ్య ఒక అల్ప విషయం మీద చెలరేగిన కలహం గురించి దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణులు విని దిగ్భ్రాంతి చెందారు. బ్రహ్మసమాజస్థుల బాలికల వివాహయోగ్యమైన వయో నియమాన్ని గురించి విని శ్రీరామకృష్ణులు “జననం, మరణం, వివాహం – ఈ మూడూ పూర్తిగా భగవంతుని సంకల్పం మేరకే జరుగుతాయి. వీటిని నిర్నిబద్ధ నియమావళికి లోనుచేయరాదు. కేశవ్ ఎందుకు ఆ నియమావళిని విధించాడు?” అని వ్యాఖ్యానించారు. శ్రీరామకృష్ణుల సమక్షంలో ఎవరైనా కూచ్బిహార్ వివాహ ప్రస్తావన తెచ్చి, కేశవ్ను గర్హిస్తే ఆయన ఇలా అనేవారు: “అలా చేసినందుకు కేశవ్ను నిందించడ మెందుకు? అతడొక గృహస్థు. తన కుమారులకు, కుమార్తెలకు ఏది మంచిదో దాన్ని అతడు ఎందుకు చేయకూడదు? సన్మార్గం నుండి వైదొలగకుండా తన భుజస్కంధాల మీదవున్న కుటుంబ బాధ్యతను అలా నిర్వర్తించడంలో గర్హించవలసిన అగత్యం ఏముంది? మత, నైతికతలకు విరుద్ధంగా కేశవ్ వ్యవహరించలేదు. నిజానికి అతడు తండ్రిగా తన కర్తవ్యాన్ని నిర్వహించాడు” అని తెలియజెప్పారు. గృహస్థుడు ఒనరించవలసిన కర్తవ్యాల దృష్ట్యా పరికించి శ్రీరామకృష్ణులు సదా కేశవ్ చర్యను దోషరహితమైనదిగానే సమర్థించేవారు. ఏదిఏమైనప్పటికీ కూచ్బిహార్ వివాహ సంఘటన పర్యవసానంగా కేశవ్ మరింతగా అంతర్ముఖుడై ఆధ్యాత్మిక మార్గంలో సత్వరం పురోగమించాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
22. శ్రీరామకృష్ణులను అమితంగా గౌరవించాడు కాని ఆయన ఆదర్శాలనన్నింటినీ కేశవ్ అంగీకరించలేదు
శ్రీరామకృష్ణుల అవ్యాజ అనురాగాన్ని చూరగొన్నప్పటికీ ఆయనను సందర్శించి, ఆయన వచనాలను వినే అవకాశాలు ఎన్నో కలిగినప్పటికీ, పాశ్చాత్య భావాదర్శాలతో ప్రభావితుడైన కేశవసేన్, శ్రీరామకృష్ణులను సమగ్రంగా అవగతం చేసుకొన్నాడనడం సంశయాస్పదమే. ఒక వంక అతడు శ్రీరామకృష్ణులను మూర్తీభవించిన సజీవ ఆధ్యాత్మిక శక్తిగా పరిగణించేవాడు. ఆయనను తన ఇంటికి తోడ్కొనివెళ్ళి తాను ఎక్కడ శయనిస్తాడో, భుజిస్తాడో, కూర్చుంటాడో, బ్రహ్మసమాజ శ్రేయస్సుకై ఏ స్థలంలో కూర్చుని చింతన చేస్తాడో – ఆ స్థలాలనన్నిటినీ స్వయంగా ఆయనకు చూపించి, తన మనస్సు భగవంతుని విస్మరించకుండేటట్లు, ఆ స్థలాలలో తాను ఉన్నప్పుడు లౌకిక వస్తువుల స్ఫురణ కలుగకుండేటట్లు తనను ఆశీర్వదించమని ఆయనను కోరాడు. తాను భగవంతుని ధ్యానం చేసే స్థలానికి శ్రీరామకృష్ణులను తోడ్కొని వెళ్ళి ఆయన పాదపద్మాలను పుష్పాలతో పూజించాడు.* తాను దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు “నవవిధాన్కి జై’* అని నినాదం చేస్తూ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేయడం మాలో పలువురం చూసేవున్నాం.
23. ‘నవ విధాన్’ : శ్రీరామకృష్ణుల అభిప్రాయం
మరో వంక, ‘మతాలన్నీ సత్యాలే, ఎన్ని మతాలో అన్ని మార్గాలు’ అనే శ్రీరామకృష్ణుల సూక్తిని కేశవ్ పూర్తిగా ఆమోదించలేదు. ప్రత్యామ్నాయంగా అన్ని మతాల నుంచి తనకు ఆవశ్యకాలుగా కనిపించిన అంశాలను స్వీకరించి, అనావశ్యకాలను త్రోసిరాజని ‘నవవిధాన్’ అనే ఒక కొత్త మతాన్ని స్థాపింప ప్రయత్నిం చాడు. శ్రీరామకృష్ణులతో పరిచయమైన ఒకింత కాలానికే ఈ ‘నవ విధాన్’ స్థాపితం కావడం చూస్తే, శ్రీరామకృష్ణుల సకల మతాల సామరస్య సిద్ధాంతాన్ని కేశవ్ పాక్షికంగా ఆమోదించి ప్రచారం చేసినట్లుగా తోస్తున్నది.
24. శ్రీరామకృష్ణులు: భారతజాతీయ సమస్య
పాశ్చాత్య విద్య నాగరకతల ఉద్ధృత తరంగాలు భారత తీరాలను తాకి ప్రాచీన బ్రహ్మవిద్య, భారతీయ సామాజిక ఆచార సంప్రదాయాలలో సమూల మార్పును తెస్తున్న తరుణంలో, ఈ దేశంలోని ప్రతిభావంతులు ప్రతి ఒక్కరూ ప్రాచ్య పాశ్చాత్య విద్య, నాగరకతల మధ్య ఒక సామరస్యాన్ని కనుగొన ప్రయత్నించారు. రాజా రామ్మోహన్ రాయ్, మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్రసేన్ ప్రభృతులు వంగదేశంలో ఈ లక్ష్యార్థం ఎలా తమ ప్రాణాలు అర్పించారో, అట్లే భారతదేశం ఇతర రాష్ట్రాలలోకూడ ఎందరో మహనీయులు రంగప్రవేశం చేసి అదే పనిని కొనసాగించారు. కాని శ్రీరామకృష్ణుల అవతరణకు మునుపు వారిలో ఎవరూ ఈ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించలేకపోయారు. శ్రీరామకృష్ణులు భారతదేశంలోని సకల మత సాధనలను సముచిత రీతిలో తమ జీవితకాలంలో అనుష్ఠించి, ప్రతి మతంలోనూ సాఫల్యం సిద్ధించుకొని, భారతదేశ భ్రష్టతకు మతం హేతువు కాదనీ, దాని హేతువు మరెక్కడో ఉందనీ తెలియజేశారు. ధార్మికతనే ఆధారం చేసుకొన్న సమాజం, ఆచారాలు, సంప్రదాయాలు, వెరసి భారతీయ సంస్కృతీ నాగరికతలు గతంలో భారతదేశానికి వైభవాన్ని, సౌభాగ్యాన్ని సంతరించి పెట్టాయి. సంజీవనివంటి అదే ధార్మికత లేక మతం అట్లే పరిపూర్ణంగా నిలిచే ఉంది. మన సకల ప్రయత్నాలకూ ఒక్క ఆ ధార్మికతనే ఆధారం చేసుకొంటే మన జాతీయ జీవన నౌకను తిరిగి విజయవంతంగా మనం నడిపించగలం. మతం, మనిషి దృక్పథాన్ని ఎంత విశాలం చేయ గలదో ఆదర్శమయ జీవితాన్ని స్వయంగా తాము గడిపి శ్రీరామకృష్ణులు ప్రదర్శించి చూపారు. తదుపరి పాశ్చాత్య భావాల, ఆదర్శాలచే ప్రభావితులైన తమ యువశిష్యులకు, ప్రధానంగా స్వామి వివేకానందకు మతంలోని ఉదారతాశక్తిని ప్రసారం చేసి, జీవితంలో ప్రతి పనిని ఆ ధార్మికతకు తోడ్పడేటట్లు ఎలా నిర్వర్తించాలో వారికి బోధించారు. ఆ విధంగా పైన పేర్కొన్న భారతదేశ జటిల సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని చూపారు. లోకంలోని ప్రధాన మత సాధనలు అనుష్ఠించి, వాటిలో సఫలతను సాధించి శ్రీరామకృష్ణులు ఎలా లోకంలోని మత వైషమ్యాలు, ఆధ్యాత్మికపరమైన భేదాభిప్రాయాలు తొలగించే ఉపాయాన్ని సూచించారో, అట్లే భారతదేశంలోని అన్ని మత సాధనలలో పూర్వాచార విధానాల ద్వారా పరిపూర్ణత్వాన్ని సముపార్జించుకొని భారతీయ మతాల మధ్య నెలకొన్న కలహాలను రూపుమాపారు. దేనిని ఆధారంగా చేసుకొని మన జాతీయత మొదటి నుంచీ నిలిచి ఉన్నదో, భవిష్యత్తులో నిలబడగలదో దాన్ని చూపించారు.
25. కేశవ్ మరణం పట్ల శ్రీరామకృష్ణుల ప్రతిస్పందన
శ్రీరామకృష్ణుల ఆదర్శాల అంతస్సూచనలను కేశవ్ పరిపూర్ణంగా అవగతం చేసుకోవడంలో విఫలుడైనప్పటికీ, ఆయన అతణ్ణి అమితంగా అభిమానించారనడం 1884 వ సంవత్సరంలో కేశవ్ మరణించినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు మనకు స్పష్టం చేస్తుంది. ఆయన ఇలా “ఆ సమాచారం అందాక నేను మంచంనుండి మూడు రోజులు దిగలేకపోయాను; నా శరీరంలో ఒక భాగం పక్షవాతం సోకి పడిపోయినట్లుగా అనిపించింది” అని అన్నారు.
26. సంకీర్తన చేస్తున్న గౌరాంగుని శ్రీరామకృష్ణులు దర్శించడం
కేశవసేన్ను ప్రప్రథమంగా శ్రీరామకృష్ణులు కలుసుకొన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించి ఈ అనుబంధ భాగాన్ని పూర్తిచేస్తాం. ఆ సమయంలో సర్వులనూ ఆనందపారవశ్యంలో ముంచెత్తే శ్రీ చైతన్యుల నగర సంకీర్తనం చూడాలనే ఆకాంక్ష శ్రీరామకృష్ణులకు జనించింది. జగజ్జనని ఈ క్రింద వర్ణించిన రీతిలో ఆయన ఆకాంక్షను ఈడేర్చింది. తమ గది వెలుపల నిలబడినప్పుడు శ్రీరామకృష్ణులు పంచవటి దిశనుండి అద్భుత సంకీర్తన తరంగాలు తమవైపు రావడం తిలకించారు. పిదప ఆ తరంగాలు దక్షిణేశ్వర ప్రధాన ద్వారం వైపు సాగిపోతూ చెట్ల వెనుక కనుమరుగయ్యే దృశ్యాన్ని ఆయన గాంచారు. నవ ద్వీపచంద్రుడైన శ్రీగౌరాంగ మహాప్రభువు, నిత్యానంద అద్వైతులు ఇరువైపుల తనను అనుసరిస్తూ ఉండగా భగవత్ప్రేమోన్మత్తుడై జనసందోహం నడుమ నుండి సుతిమెత్తని గమనభంగిమతో ముందుకు వెళ్ళసాగడంగాంచారు. చుట్టూ గుమిగూడిన జనులు ఆయన ప్రేమోన్మత్త ప్రభావం చేత ఆధ్యాత్మికోన్మత్త స్థితిని పొంది వివశులై ఉన్నారు. వారిలో కొందరు నృత్యం చేయసాగారు. ఇసుక వేసినా రాలనంత మంది జనం ఉన్నారక్కడ. ఆ దివ్యసంకీర్తన బృందంలో అగపడిన కొందరి ముఖాలు శ్రీరామకృష్ణుల జ్ఞాపకాలలో స్థిరంగా ముద్రితమైపోయాయి. ఇది జరిగిన కొద్ది కాలానికి ఒకరొకరుగా ఆ సదరు వ్యక్తులు భక్తులుగా రాసాగినప్పుడు వారిని గుర్తించి, పూర్వజన్మలో వారు శ్రీచైతన్యుల సహచరులన్న స్థిర నిర్ణయానికి శ్రీరామకృష్ణులు వచ్చారు.
ఈ దర్శనం కలిగిన కొద్దికాలం తరువాత శ్రీరామకృష్ణులు కామార్పుకూర్కు, హృదయ్ స్వగ్రామమైన శిహోర్కు వెళ్ళారు. శిహోర్ గ్రామానికి కొన్నిమైళ్ళ దూరంలో ఫులుయ్ – శ్యాంబజార్ అనే గ్రామం ఒకటి నెలకొని ఉంది. అక్కడ వైష్ణవులు అనేకులు ఉంటున్నారనీ, వారు నిత్యం భగవత్ సంకీర్తన చేస్తూ ఆ ప్రదేశాన్ని ఆనందమయం చేస్తూవుంటారని విని ఆయన అక్కడకు వెళ్ళి వారి సంకీర్తన వినగోరారు. శ్యాంబజార్ సమీపంలో బేల్టే అనే మరోగ్రామం ఉంది. ఆ గ్రామ వాస్తవ్యుడైన నటవర్ గోస్వామి అంతకు మునుపే శ్రీరామకృష్ణులను దర్శించుకొని, తమ ఇంటికి వచ్చి ఆయన పాదధూళితో తన గృహాన్ని పావనం చేయమని ఆహ్వానించి ఉన్నాడు. హృదయ్తో కలిసి శ్రీరామకృష్ణులు అతడి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఏడు రోజులు బసచేసి, శ్యాంబజార్ వైష్ణవుల సంకీర్తనానందాన్ని గ్రోలారు. ఆయన పరిచయ భాగ్యం పొందిన ఆ గ్రామానికే చెందిన ఈశాన్చంద్ర మల్లిక్ తన ఇంటికి వచ్చి కీర్తనానందాన్ని ప్రసాదించవలసిందిగా భక్తిప్రపత్తులతో ఆయనను ఆహ్వానించాడు. సంకీర్తన సమయంలో శ్రీరామకృష్ణుల అపూర్వ భావపరివర్తన అక్కడి వైష్ణవులను అమితంగా ఆకర్షించింది. ఆయన అపూర్వ భావపరివర్తన సమాచారం శ్యాంబజార్లోనే కాక రాంజీవన్పూర్, కృష్ణగంజ్ తదితర సుదూర గ్రామాలకు కూడ ప్రాకింది. వెంటనే ఆ గ్రామాల నుండి సంకీర్తన బృందాలు దివ్యానందాన్ని వారితో కలిసి గ్రోల, శ్యాంబజారుకు గుంపులు కట్టి రాసాగారు. దానితో ఆ గ్రామం జనంతో క్రిక్కిరిసిపోయింది. సంకీర్తన రాత్రింబవళ్ళు కొనసాగింది. రోజులో పలుమార్లు పుట్టి గిట్టే ఎవరో గొప్ప భక్తుడు అక్కడకు వచ్చాడనే వార్త వ్యాపించింది. ఆయనను చూడాలనే ఉత్కంఠతో జనం నిద్రాహారాలు మరచిపోయి చెట్లు, ఇంటికప్పులపై కెక్కి కూర్చున్నారు. ఆ విధంగా మూడు పగళ్ళు, మూడు రాత్రులు అక్కడ దివ్యానందం వెల్లువై ప్రవహించింది. శ్రీరామకృష్ణులను చూసి, ఆయన పాదాలను స్పృశించేందుకు జనం పిచ్చివాళ్ళే అయ్యారు. శ్రీరామకృష్ణులకు ఆహారస్నానాదులకు సమయమే దొరకలేదు. పరిస్థితి విషమించక ముందే హృదయ్, శ్రీరామకృష్ణులను తోడ్కొని గోప్యంగా శిహోర్కు పారిపోయాడు. అంతటితో ఆ ఆనంద ప్రవాహపు వెల్లువ ఆగిపోయింది. శ్యాంబజార్ వాస్తవ్యులైన ఈశాన్ చౌధురి, నటవర్ గోస్వామి, ఈశాన్ మల్లిక్, శ్రీనాథ్ మల్లిక్ తదితరులు, వారి వంశస్థులు ఆ సంఘటనను ఇప్పటికీ ప్రస్తావించి శ్రీరామకృష్ణుల పట్ల విశేష భక్తిప్రపత్తులు కనబరుస్తూ ఉంటారు. కృష్ణగంజ్ గ్రామానికి చెందిన విఖ్యాత ఖోల్ (మద్దెల వంటి వాద్యం) వాద్యగాడైన శ్రీ రామ్చరణ్ దాస్తో శ్రీరామకృష్ణులకు పరిచయం కలిగింది. అతడి ఖోల్ వాద్యం విన్న
మరుక్షణంలోనే శ్రీరామకృష్ణులు భావసమాధి మగ్నులయ్యారు. పైన ప్రస్తావించిన సంఘటనను కొంత స్వయంగా శ్రీరామకృష్ణుల నుండి, కొంత హృదయ్ నుండి మేం విన్నాం. ఈ సంఘటన కాలాన్ని మేం ఈ క్రింది విధంగా నిర్ధారణ చేశాం:
1875 వ సంవత్సరంలో కేశవసేన్ శ్రీరామకృష్ణులను సందర్శించిన తరువాత శ్రీరామకృష్ణుల పరమ భక్తుడూ, ఆలంబజార్ వైద్యుడూ అయిన శ్రీ మహేంద్రనాథ్ పాల్ ఆయనను కలుసుకోవడం జరిగింది. తాను శ్రీరామకృష్ణులను ఆయన శిహోర్ నుండి తిరిగి వచ్చిన తరువాత కలుసుకొన్నాననీ, అప్పుడు ఆయన ఫులుయ్ – శ్యాంబజార్లో జరిగిన సంఘటనల గురించి తనతో ముచ్చటించారనీ మహేంద్రనాథ్ పాల్ మాకు తెలిపారు. కనుక పై సంఘటనలు బహుశ 1879 లో, అంటే శ్రీరామకృష్ణుల ఆంతరంగిక భక్తుల రాక ప్రారంభమైన కాలంలోనే జరిగి ఉండవచ్చు. దక్షిణేశ్వర ఆలయానికి అతి సమీపంలో స్వామి యోగానంద ఇల్లు ఉండడంతో, అతడు మాత్రమే శ్రీరామకృష్ణులను అంతకు మునుపే సందర్శించి ఉండవచ్చు. స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణుల వద్దకు 1881 లో వచ్చారు. జగదాంబదాసీ 1881 వ సంవత్సరం జనవరి 1 వ తేదీన మరణించింది. ఇది జరిగిన ఆరు నెలల తరువాత హృదయ్ అనాలోచితంగా మథుర్బాబు మనుమరాలి (పసిపాప) పాదాలను పూజించాడు. ఆమె తండ్రి, తద్ద్వారా తన కుమార్తెకు ఏదైనా కీడు వాటిల్లుతుందేమోనని భయపడి, కుపితుడై హృదయ్ను కాళికాలయ ఉద్యోగం నుంచి తొలగించాడు. కనుక మనం చర్చిస్తున్న సంఘటన 1879 లో గాని అంతకు ముందుగాని జరిగి ఉండవచ్చు.
సాధక భావం సమాప్తం