అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ।
పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ ॥ 11
అవజానంతి, మామ్, మూఢాః, మానుషీమ్, తనుమ్, ఆశ్రితమ్,
పరమ్, భావమ్, అజానంతః, మమ, భూత మహా ఈశ్వరమ్.
భూత మహా ఈశ్వరమ్ = సర్వభూతే శ్వరుడనైన; మమ = నా; పరంభావమ్ = పరమతత్త్వాన్ని; అజానంతః = ఎరుగకుండా; మూఢాః = మూఢులు; మానుషీం తనుమ్ = మానవదేహాన్ని; ఆశ్రితమ్ = ధరించిన; మామ్ = నన్ను; అవజానంతి = అవజ్ఞను చూపుతున్నారు.
తా ॥ నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడనూ, సర్వాత్మ స్వరూపుడనూ, సర్వేశ్వరుడనూ; అయినప్పటికీ (భక్తానుగ్రహార్థం శుద్ధసత్త్వమయమైన) మనుష్య దేహాన్ని ధరిస్తున్నాను. నా పరమస్వరూపాన్ని ఎరుగని మూఢులు నన్ను తిరస్కరిస్తున్నారు.
వ్యాఖ్య:-
పరమాత్మ సకల జీవరాశులకూ ప్రభువు, పాలకుడు. ధర్మాన్ని కాపాడటానికి, లోకాన్ని రక్షించడానికి ఆయన అప్పుడప్పుడు మనిషి రూపంలో ఈ భూమి మీదకు వస్తుంటాడు (అవతరిస్తాడు). అలా సాక్షాత్తు భగవంతుడే మనిషి శరీరం ధరించి మన మధ్యకు వచ్చినప్పుడు, మూర్ఖులు ఆయన్ని గుర్తించలేరు. “ఇతను కూడా మనలాంటి సామాన్య మనిషే కదా” అనుకొని ఆయన్ని అవమానిస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. ఆయనలోని అసలైన దైవశక్తిని వారు అర్థం చేసుకోలేరు. అందుకే కృష్ణుడు వారిని ‘మూఢులు’ (తెలివిలేనివారు) అని పిలిచారు. ఎందుకంటే, కాస్త బుద్ధి ఉన్నవారెవరూ దేవుడిని ద్వేషించరు కదా!
కొంతమంది డబ్బు, అధికారం చూసుకుని గర్వంతో కళ్లు మూసుకుపోతారు. మహాత్ములను, సాధువులను ఎగతాళి చేస్తారు. శిశుపాలుడు, దుర్యోధనుడు లాంటి వాళ్ళు ఈ కోవకే చెందుతారు. అందుకే వాళ్ళు చివరికి నాశనమయ్యారు. భక్తి మార్గంలో ఉన్నవారికి కూడా జీవితంలో ఒక్కోసారి అవమానాలు, నిందలు ఎదురవ్వచ్చు. అప్పుడు చాలా ఓర్పుగా ఉండాలి. ఒకవేళ మనలో నిజంగా తప్పు ఉంటే సరిదిద్దుకోవాలి. తప్పు లేకపోతే, ఆ నిందలకు భయపడకుండా ధైర్యంగా ఉండాలి.
“సాక్షాత్తు శ్రీకృష్ణుడినే ఈ లోకం నిందించింది, ఇక సామాన్యులమైన మనం ఎంత?” అని సరిపెట్టుకోవాలి. కొందరి స్వభావమే ఇతరులను నిందించడం అని గ్రహించి, మనశ్శాంతిని కోల్పోకూడదు. ఎవరినీ ద్వేషించకూడదు. ఎవరైనా దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే, ఆ మాటలను పట్టించుకోకండి. ఆ నాస్తికుల మాటలు నమ్మకుండా, మీ భక్తిని ఇంకా పెంచుకోండి. మీ ప్రవర్తన ద్వారానే వారికి బుద్ధి వచ్చేలా జీవించండి.
అందరూ అర్థం చేసుకోలేరు
కానీ శ్రీ శారదాదేవి దివ్యత్వాన్ని అందరూ అర్థం చేసుకోలేకపోయారు. మాతృదేవితోనే ఒకరు, “అమ్మా! మేము మిమ్మల్ని దేవిగా చూడలేకపోతున్నామే!” అని అన్నారు. అందుకు మాతృదేవి, “నాయనా! అందరూ దానిని గ్రహించగలరా? కొలను మెట్లమీద ఒక రత్నం పడివుంది. స్నానానికి వెళ్లే ప్రతి వ్యక్తి పాదమూ దానిమీద పడింది. అందరూ దానిని మామూలు రాయిగా భావించి పాదాలను తోము కోవడానికే వాడుకున్నారు. చివరకు ఒక రత్నాల వ్యాపారి వచ్చినప్పుడు ఆ రాయిని చూడగానే రత్నం అని తెలుసుకుంటాడు” అన్నారు. దాని నిజాన్ని తెలుసుకున్న వారికీ, తెలుసుకోనివారికీ కూడా అది ఉపయోగపడింది. ఉపయోగ పడిన తీరులోనే భేదమంతా! అదేలా ఎవరికి దివ్యనేత్రాలుంటాయో వారు మాత్రమే దివ్యత్వాన్ని చూడగలరు. కానీ మాతృదేవి తమ దివ్యత్వాన్ని గురించి తెలుసుకున్న వారికీ, తెలుసుకోనివారికీ సొంతంగానే ఉన్నారు. కానీ ఇరుతరఫుల వారు పొందిన ఫలితంలోనే భేదముంది. (Chandogya Upanishad 1.1.10) (Source: శ్రీ శారదాదేవి చరితామృతం)
యోగీన్–మా మాతృదేవికి అతిసన్నిహితురాలే అయినప్పటికీ ఆమెలో ఒక సందర్భంలో మాతృదేవి దివ్యత్వం గురించి సంశయం తలెత్తింది. ఆమె ఇలా అనుకొంది. “మూర్తీభవించిన పరిత్యాగమే శ్రీరామకృష్ణులు. కాని మాతృదేవి తన తమ్ముడు, మరదళ్ళ, మేనగోడళ్ళ వ్యాపకంలో తలమునకలవుతూ ఉన్నారు.” ఇలా అనుకొన్న కొద్ది రోజుల తరువాత ఒక రోజు యోగీన్–మా గంగాతీరంలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక దర్శనంలో శ్రీరామకృష్ణులు కనిపించి ఆమె సంశయ నివృత్తిని ఇలా చేశారు. గంగాజలాలలో మృతదేహాలు సైతం కొట్టుకొని రావడమూ, అయినప్పటికీ గంగను అనేకులు పూజిస్తూ ఉండడమూ చూపి, ‘గంగను ఏదన్నా అపవిత్రం చెయ్యగలదా? ఆమెను (మాతృదేవిని) కూడా అదే విధంగా పరిగణించు. ఎన్నడూ ఆమెను సంశయించవద్దు. ఇదీ (తాము అని అర్థం), ఆమె అభిన్నం’ అని చెప్పారు. (మూలం: సర్వ దేవదేవీ స్వరూపుడు శ్రీరామకృష్ణ)