అర్జున ఉవాచ :
జ్యాయసీ చేత్కర్మణస్తే
మతా బుద్ధిర్జనార్దన ।
తత్కిం కర్మణి ఘోరే మాం
నియోజయసి కేశవ ॥
జ్యాయసీ, చేత్, కర్మణః, తే, మతా, బుద్ధిః, జనార్దన,
తత్, కిమ్, కర్మణి, ఘోరే, మామ్, నియోజయసి, కేశవ
అర్జునః = అర్జునుడు; ఉవాచ = పలికెను; జనార్దన = కృష్ణా; కర్మణః = కర్మ కంటే; బుద్ధిః = జ్ఞానం; జ్యాయాసీ = శ్రేష్ఠమని; తే = నీకు; మతా చేత్ = అభిమతమైన; కేశవ = కృష్ణ; తత్ కిమ్ = అప్పుడు ఎందుకు; మాం = నన్ను; ఘోరే = హింసాత్మకమైన; కర్మణి = కర్మలో; నియోజయసి = నియోగిస్తున్నావు?
తా ॥ అర్జునుడు పలికెను: ఓ జనార్దనా! కర్మ కంటే జ్ఞానమే శ్రేష్ఠమని నీ అభిప్రాయమైతే, మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధ కర్మలో ఎందుకు ప్రేరేపిస్తున్నావు కేశవా?
వ్యాఖ్య:-
ఇక్కడ ‘బుద్ధి’ అంటే ‘జ్ఞానం’ అని అర్థం. క్రిందటి (రెండవ) అధ్యాయంలో 49, 50, 51 శ్లోకాలలో కృష్ణుడు, “పని (కర్మ) చేయడం కంటే జ్ఞానం (బుద్ధియోగం) చాలా గొప్పది” అని చెప్పినప్పుడే అర్జునుడి మనసులో ఈ సందేహం వచ్చి ఉంటుంది. అర్జునుడు ఇలా అనుకుని ఉండవచ్చు: “ఇదేంటి? కృష్ణుడేమో ఒకపక్క ‘నీకు పని చేయడానికి మాత్రమే హక్కు ఉంది, పని చెయ్యి, యుద్ధం చెయ్యి’ అని చెబుతూనే… మరోపక్కేమో ‘జ్ఞానంతో పోలిస్తే పనులు చేయడం చాలా తక్కువ స్థాయి’ అని అంటున్నారు. ఈ మాటలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి కదా!” నిజానికి ఆ శ్లోకాలు విన్నప్పుడే అర్జునుడు తన సందేహాన్ని కృష్ణుడిని అడగాలనుకున్నాడు. కానీ వెంటనే కృష్ణుడు “నీ బుద్ధి ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో, అప్పుడే నీకు యోగం సిద్ధిస్తుంది” అని చెప్పేసరికి, అర్జునుడి దృష్టి మళ్లింది. నిలకడగా ఉండేవాడి (స్థితప్రజ్ఞుడి) లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి అతనికి కలిగింది. అందుకే తన పాత సందేహాన్ని పక్కన పెట్టి, ముందుగా స్థితప్రజ్ఞుడి గురించి అడిగాడు. కృష్ణుడు ఆ స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి చెప్పడం ఎప్పుడైతే పూర్తి చేశారో, వెంటనే అర్జునుడు తనకు మొదట్లో వచ్చిన సందేహాన్ని ఇప్పుడు బయటపెట్టాడు. ఈ మూడవ అధ్యాయం మొదట్లో ఉన్న రెండు శ్లోకాలు అర్జునుడికి వచ్చిన ఆ సందేహం గురించే ఉంటాయి.