(న్యూయార్క్ ఉపన్యాసం: 26–1–1896)
పిండాండం
సహజంగానే మనిషి హృదయం, వెలుపలికి పోవడానికై, అంటే శరీరాన్ని దాటి ఇంద్రియాల ద్వారా బయటకి పోవడానికై ప్రయత్నిస్తోందేమో అన్నట్లనిపిస్తుంది. కన్ను చూడాలనుకుంటుంది. చెవి వినాలని కోరుతుంది. ఇట్లే ఇంద్రియాలన్నీ బాహ్యప్రపంచాన్ని స్పృశించాలనుకుంటాయి. స్వభావ సిద్ధంగానే ప్రకృతి సౌందర్యాలు, ప్రకృతి మహిమలు, మొదట నరుని దృష్టినాకర్షించాయి. నరుని మనసులో మొట్టమొదట పుట్టిన ప్రశ్న ఈ బాహ్యప్రపంచాన్ని గురించే. దాని రహస్యాన్ని కనుక్కోవడం కోసమే ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, నదులు, పర్వతాలు, సముద్రం – మొదలైన వానిని గూర్చి విమర్శనలు సాగాయి. ఈ జ్ఞాన పిపాసతో, దేవులాడిన మానవ హృదయం, మొదట బాహ్య ప్రపంచమందలి ప్రతి దానిని ఆశ్రయించి, వట్టి ప్రయాసలు పడిన విషయాన్ని అన్ని ప్రాచీన మతాలు, సూచనగా తెల్పుతూనే ఉన్నాయి. నదీదేవత ఒకటి, ఆకాశ దైవమొకటి, మేఘాల దేవుడొకడు, వానల దేవుడొకడు – ఇలా ఎందరో ఉండేవారు. బాహ్యజగత్తులో వున్న ప్రతిదీ – మనమిప్పుడు ప్రకృతి శక్తులంటున్న సర్వమూ – రూపకల్పనం చేయబడి, నరాకృతులను ధరించి, ఇచ్ఛా స్వరూపాలుగానో, దైవతములుగానో, స్వర్గంనుంచి దిగి వచ్చే దేవదూతలు గానో భావించబడినాయి. ఈ అన్వేషణం లోతుకుపోయిన కొలదీ, ఈ బాహ్యమూర్తులు నరుని హృదయాన్ని తృప్తిపరుప లేదు. చివరి కీ విచారణ అంతర్ముఖమైనది. నరుడు తన ఆత్మను గురించే పరిశోధనకు పూనుకున్నాడు. వాని అన్వేషణం బ్రహ్మాండాన్ని వదిలి, పిండాండంపైకి తిరిగింది. వాని అన్వేషణం, బాహ్యప్రకృతిని పరిశీలించడం మాని అభ్యంతర (లోపలి) ప్రకృతిని పరిశీలించడానికి పూనుకొన్నది. నాగరికాభివృద్ధి లభించిన కొద్దీ, ప్రకృతి పరిశోధన గాఢతరమై సాగినకొద్దీ, జ్ఞానం వికసించినకొద్దీ, అభ్యంతర నరుని గూర్చిన విమర్శన ఎక్కువగా నడచింది.
నేడు మనం సాగించే విచారణ నరుని ఆంతర్యాన్ని గూర్చినది. ఈ అభ్యంతర మానవుని గూర్చిన సమస్యలాగా, మరే ప్రశ్నకూడ, నరుని హృదయానికి సన్నిహితంగాని, ప్రియంగాని కాజాలదు. ఎన్ని వేలసారులో, ఎన్నెన్ని దేశాల్లోనో, ఈ సమస్య వెలువడుతూ వచ్చింది. ఋషులు, రాజులు, ధనికులు, దరిద్రులు, పుణ్యాత్ములు, పాపాత్ములు, వీరు, వారనడమెందుకు? ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, పదే పదే పదే ఈ ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. “క్షణభంగురమైన ఈ నర జీవితంలో, శాశ్వతమై నిలిచేది ఏదీ లేదా? ఈ శరీరం మృతినొందే సమయాన మరణించనిదేదీ వుండదా? ఈ శరీరం కూలి, మట్టిలో కలిసేటప్పుడు సజీవమై మిగిలివుండేది ఏమీ లేదా? ఈ దేహాన్ని దహించి భస్మం చేసే అగ్నినుండి తప్పించుకొని, బ్రతికి ఉండేది ఏమైనా వుందా? ఉంటే దాని గతి ఏమి? అదెక్కడికి పోతుంది? మొదట అది దేన్నుండి వచ్చింది?” ఇట్టి ప్రశ్నలు అనేక పర్యాయాలు అడుగబడుతూ వచ్చాయి. ఈ సృష్టి నిలిచి ఉండేంతకాలం, జిజ్ఞాస చేయడానికి నరుని మెదడు ఉన్నంతకాలం ఈ విచారణ సాగుతూనే ఉంటుంది. అయినా సమాధానం ఏమీ రావడం లేదనరాదు. ప్రతి పర్యాయం సమాధానం వస్తూనే ఉంది. కాలం గడిచినకొద్దీ ఈ సమాధానాలకు బలం చేకూరుతూ ఉంటుంది. వేల సంవత్సరాలకు పూర్వమే ఈ ప్రశ్నకు ఒకేసారిగా సమాధానం చెప్పబడింది. ఇంకా, కాలం గడిచేకొద్దీ, అదే సమాధానం తిరిగి తిరిగి చెప్పబడుతూనే ఉంది. కొత్త కొత్త సాదృశ్యాలు చూపబడుతూనే ఉన్నాయి. మన బుద్ధికెప్పటి కప్పుడు నచ్చేలా, యీ విషయం విశదీకరింప బడుతూనే ఉంది. కాబట్టి మనమిప్పుడు చేయవలసిందేమంటే, ఆ సమాధానాన్ని మళ్లీ జ్ఞప్తికి తెచ్చుకోవడమే. సర్వశక్తిమంతములైన ఈ విషయాలను గురించి నూతన విజ్ఞానాన్ని కలిగించగలనని నేను నటించడం లేదు. ప్రాచీనులు కనుగొన్న సత్యాన్నే, ఈ కాలంవారి భాషలో మీ ఎదుట ఉంచుతాను. పూర్వీకుల భావాలను, నవీనుల భాషలో అనువదిస్తాను. తత్త్వవేత్తల భావాలను, సామాన్య ప్రజల మాటలలో చెబుతాను. దేవతల భావాలను, మానవ వచనాలతో మళ్ళీ చెబుతాను. నరునికి తెలియడానికై భగవంతుని భావాలను సామాన్య జనుల వాడుక పదాలలో చెబుతాను. ఈ భావాలు ఎక్కణ్ణుంచి వచ్చాయో, ఆ దివ్యాంశ ప్రతి మనిషిలోనూ వుంది. కాబట్టి ప్రతి వారూ దీన్ని గ్రహింపగలరు.
నేను మీవైపు చూస్తున్నాను. దీనికెన్ని విషయాలు అవసరమో చూడండి. ముందుగా కళ్లుండాలి. తక్కిన అవయవాలలో నా కే కొరతా లేకున్నా, నా కీ కళ్లు లేకుంటే నేను మిమ్మల్ని చూడజాలను. రెండవది నయనేంద్రియాలుండాలి. పైకి కన్పించే ఈ కళ్ళే నయనేంద్రియాలు కావు. అవి చూడటానికి అనుకూలించే ఉపకరణాలు మాత్రమే. వాని వెనుక నిజమైన ఇంద్రియాలుంటాయి. అవి మేధస్సున ఒక కేంద్రంలో ఉంటాయి. ఆ కేంద్రం చెడిపోతే నరునికి ఎంత శక్తిమంతములైన కన్నులుండనీ గాక, ఏమీ కనబడదు. కాబట్టి సత్యమైన నయనేంద్రియమైన ఆ కేంద్రముండటం అవసరం. ఇట్లే మన ఇంద్రియాలన్నింటి విషయంలో గ్రహించాలి. బయట కనిపించే ఈ చెవి, ధ్వని తరంగాలను కేంద్రంలో చేర్చే నిమిత్తమై లోపలికి తీసికొనిపోయే ఒక ఉపకరణం మాత్రమే. కానీ ఇంతటితో అంతా అయిపోలేదు. మీరొక గ్రంథాలయంలో కూర్చుని చాల శ్రద్ధతో ఒక పుస్తకాన్ని చదువుతున్నారనుకోండి అప్పుడు గడియారం కొట్టే గంటలు మీకు వినబడవు. ధ్వనేమో ఉంది. వాయు తరంగాలూ ఉన్నాయి. మీ చెవీ, కేంద్రమూ ఉన్నాయి. ధ్వని తరంగాలు చెవి ద్వారా, కేంద్రానికి చేర్పబడు తూనే ఉంటాయి. అయినా మీకేమీ వినబడదు. ఇందేమి లోపం? మనసక్కడ లేదు. కాబట్టి ఇంకొకటి, మూడవదికూడ అవసరమని తేలుతోంది. మనస్సుకూడ కావాలి. మొదట వెలుపలి ఉపకరణం. తర్వాత, ఈ బాహ్యోపకరణం తీసికొని వచ్చే తరంగాలు చేరే కేంద్రం ఉండాలి. ఈ అంతరింద్రియం, మనస్సుతో అనుసంధించికూడ ఉండాలి. మనస్సు అప్పుడు కర్ణేంద్రియంతో కలిసి వుండకపోతే, ఆ ఇంద్రియం వెలుపలి చెవీ, ధ్వని తరంగములను స్వీకరించినప్పటికీ, ఆ ధ్వనియొక్క అనుభవం మాత్రం కలుగజాలదు. ఈ మనస్సు సైతం ఒక వాహకం మాత్రమే సుమండీ! మనస్సు, ఈ అనుభూత విషయాన్ని ఇంకాకొంత దూరం తీసికొనిపోయి బుద్ధికి నివేదించాలి. ఈ బుద్ధి తనకు చేరిన దాన్ని ఇట్టిదని నిర్ణయించే సమర్ధతను కలిగి వుంటుంది. కాని, అప్పటికీ కార్యం పూర్తికాదు. బుద్ధి ఈ అంశాన్ని తీసికొనిపోయి, శరీరంలో సర్వాధికారై, సింహాసనంలో కూర్చునివున్న జీవాత్మకు నివేదింపవలసి వుంటుంది. ఇట్లే బుద్ధి తన నిర్ణయాన్ని వాని ఎదుట నివేదించినప్పుడు, ఏమి చేయాలో, ఏమి చేయతగదో, తెలిపే ఆజ్ఞ, ఆ జీవాత్మనుండి వెలువడుతుంది. అంతట ఈ ఆజ్ఞ, మళ్ళీ అదే క్రమంలో, మొదట బుద్ధికి, అక్కడనుండి మనస్సుకు, తర్వాత కేంద్రానికి తీసికొని పోబడుతుంది. ఆ తర్వాత కర్మేంద్రియం, దానిని వెలుపలి ఉపకరణానికి చేరుస్తుంది. అప్పుడుగాని ఆ అనుభవం పూర్తి కాజాలదు.
ఈ ఉపకరణాలు, బాహ్య శరీరాన, అనగా స్థూల శరీరాన ఉంటాయి. మనస్సు, బుద్ధి అందులో లేవు. అవి ఆంతర్యంలో ఉంటాయి. హైందవ తాత్త్వికులచేత సూక్ష్మ శరీరమనీ, క్రైస్తవుల పరిభాషలో పారమార్థిక (స్పిరిచ్యుయల్) శరీరమనీ పేర్కొనబడే ఒక శరీరం మనలో ఉంటుంది. ఆ సూక్ష్మశరీరం స్థూలశరీరంకన్న ఎంతో సూక్ష్మమైంది. కాని అదికూడ జీవాత్మ కాదు. జీవుడు, వీనికి అతీతంగా ఉంటాడు. కొన్నేళ్ళకు, ఈ బాహ్య స్థూలశరీరం నశిస్తుంది. ఏ చిన్న ప్రమాదమైనా దీన్ని భిన్నంచేసి, నాశనం కావింపగలదు. సూక్ష్మశరీరం అంత సులభంగా నాశనం పొందేది కాదు. అయినా అది కొన్ని సమయాల్లో వృద్ధి, క్షయములు పొందడం జరుగు తూంటుంది. వృద్ధాప్యంలో మనస్సు ఎలా పటుత్వాన్ని కోల్పోతుందో, శరీరం దృఢంగా వుంటే, అదెలా దృఢంగా వుంటుందో, మందులు, మాకులు దాన్ని ఎలామారుస్తాయో, బాహ్య సంఘటనలవల్ల అది ఎలా చలిస్తుందో, బాహ్య ప్రకృతిలో అది ఎలా పరివర్తనాన్ని కల్పిస్తూ వుంటుందో మనం చూస్తున్నాం. ఈ స్థూల శరీరానికి, వృద్ధి క్షయాలున్నట్లే, మనస్సుకూ వృద్ధి, క్షయం వున్నాయి. కాబట్టి మనస్సు సహితం జీవుడు కాజాలదు. జీవాత్మ వృద్ధినొందేదే కానీ, క్షీణించేది కాదు. “మన కీ సంగతి ఎలా తెలుస్తుంది? మనస్సుకు ఆవల వేరొకటి వుందనేదీ మనకు ఎలా తెలియగలదు?” అంటారేమో? స్వయంప్రకాశమైనట్టిదీ, తెలివికి ఆధారమైనట్టిదీ అయిన విజ్ఞానం, మూఢమై, జడమై ఉండే పదార్థంయొక్క లక్షణం కాజాలదు కదా? విజ్ఞానం తన స్వభావసిద్ధంగా కలిగిన జడపదార్థం ఎన్నడూ కనబడలేదు. మూఢం, జడం అయిన పదార్థరాశి, ఏదీ స్వయంప్రకాశం కాజాలదు. జడ పదార్థాన్ని ప్రకాశింపజేసేది విజ్ఞానమే. ఈ భవనం ఇక్కడ కనబడటం విజ్ఞానం ద్వారానే. ఏదో విజ్ఞానం దీన్ని నిర్మించి వుంటే తప్ప, ఈ మందిరం ఇక్కడ మందిర రూపంలో కనబడజాలదు. ఈ శరీరానికి స్వకీయమైన ప్రకాశం లేదు. ఉంటే ఇది శవంలోకూడా ఉండాలి కదా? మనస్సుగాని పారమార్థిక శరీరంకాని స్వయంప్రకాశాలు కావు. వానిలోకూడ జ్ఞానధర్మం లేదు. స్వయంప్రకాశమయ్యేది నాశం చెందదు. వేరొకదాని తేజస్సును ఎరువు తెచ్చుకొని ప్రకాశించేది, ఒకప్పుడు ప్రకాశించడం, మరొకప్పుడు ప్రకాశించకుండటం జరగొచ్చు. స్వయంప్రకాశి, అయినదని వెలుగును రమ్మనేదికాని, పొమ్మనేదికాని ఏమి ఉండగలదు? దానికి వృద్ధి క్షయాలు చేకూర్ప జాలేదేముంటుంది? సూర్యుని ప్రకాశాన్ని పొంది వెలిగేది కాబట్టి, చంద్రబింబంలో వృద్ధిక్షయాల్ని చూస్తున్నాం. నిప్పులో వేసి ఎర్రగా కాల్చిన ఇనుపముక్క మెరుస్తూ ప్రకాశిస్తుంది. కాని దాని ప్రకాశం ఎరువు సొమ్ము కాబట్టి అది సమసిపోగలదు. ఇట్లు స్వీయధర్మం కాక, ఎరువు తెచ్చుకొనబడిన ప్రకాశంమాత్రం నాశనం నొందగలదు.
ఈ స్థూల శరీరానికి, అంటే, ఈ బాహ్యాకృతికి, స్వీయమైన ప్రకాశం లేదని మనమిప్పుడు గ్రహించాం. ఇది స్వయంప్రకాశి కాదు. కనుక తన్ను తాను తెలిసికోలేదు. మనస్సుకూడా ఇట్లే, తన్ను తాను తెలిసికోలేదు. ఎందువల్ల? అది, వృద్ధి క్షయాలను పొందేదే. అదొకప్పుడు దృఢతరంగానూ, వేరొకప్పుడు శుష్కించీ ఉంటుంది. ప్రతి విషయం దాన్ని చలింప చేయగలదు. కాబట్టి మనస్సు ద్వారా ప్రకాశించే తేజస్సు దాని స్వంతమైనది కాదు. సరే, ఆ ప్రకాశం ఎవరిది? అది దేనికి స్వధర్మమో దానిదనాలి. అటువంటిది శుష్కించడం కాని, నాశనం కావడంకాని, వృద్ధి కావడంకాని, నీరసించడం కానీ సంభవించదు. అది స్వయంప్రకాశియై వెలుగుతుంది. ప్రకాశమే అదై ఉంటుంది. ఆత్మకు తెలిసికొనే శక్తి వుందనరాదు. తెలివే అది. దానికి ఉనికి వుందనరాదు. ఉనికే (అస్తిత్వమే) అది. అది ఆనందాన్ని అనుభవించేది. ఆ ఆనందాన్ని ఎరువు తెచ్చుకొన్న దవుతుంది. జ్ఞానాన్ని అనుభవించేది, ఆ జ్ఞానాన్ని ఎరువు తెచ్చుకొన్నదే అనాలి. మరొక దానితో అనుబంధమైన అస్తిత్వం (ఉనికి) కలదానియొక్క అస్తిత్వం ఆభాసమాత్రమే అవుతుంది. అది అస్తిత్వాన్ని ప్రతిఫలింపజేసే బింబంమాత్రం కాగలదు. ఎక్కడెక్కడ గుణాలు కనబడతాయో, ఆ గుణాలన్నీ, ఒక పదార్థం మీద ప్రతిఫలించినవే సుమండీ! కాన ఆత్మకు, సత్తు, చిత్తు, ఆనందం అనే గుణాలున్నవనీ అనతగదు. ఆత్మే సత్తు, చిత్తు, ఆనందం.
నిస్సందేహంగా దీన్నంతా మనమేల అంగీకరించాలి? అని మీరడగ వచ్చు. “ఆనందం, జ్ఞానం, అస్తిత్వం అనేవి ఆత్మయొక్క స్వధర్మాలని మనమెందుకు అంగీకరించాలి? వానిని, అది, ఇంకొకరినుండి పొందేది కాకూడదా?” అని ప్రశ్నిస్తారేమో? “శరీరం, తన ప్రకాశాన్ని, మనస్సునుండి ఎరువు తీసుకొనే విధంగానే, ఆత్మకూడ, తన ఆనందాన్ని, జ్ఞానాన్ని, అస్తిత్వాన్ని ఎరువు తెచ్చుకుంటుందని ఏల చెప్పరాదు?” అనే వాదానికి దిగుతారేమో? ఇట్టి వాదానికి అంతం ఉండదు. కాబట్టి అది అంగీకరింప దగనిదవుతుంది. దేనినుండి, ఆత్మ, వానిని ఎరువు తెచ్చుకొంటుందని చెప్పగలం? వేరొక ఆధారం వుంటుందంటారా? దాన్ని గూర్చికూడ, మళ్లీ ఇదే ప్రశ్న బయలుదేరుతుంది కదా? కాబట్టి చివరి కేదో స్వయంప్రకాశి అయినదానిని మనం చేరవలసి వుంటుంది. వాదనను తుదముట్టించడానికి, తర్కశాస్త్రానుగుణ్యంగా, పర్యవసానాన్ని తేల్చడానికి, స్వయంప్రకాశమైన ఒకదాన్ని చేరిన తోడనే ఆగవలసి వుంటుంది.
కాబట్టి మనిషికి మొదట బాహ్యావరణమైన ఈ స్థూలశరీరం ఉంది. రెండోది, మనస్సు, బుద్ధి, అహంకారం చేరి ఏర్పడే సూక్ష్మశరీరం. ఈ రెంటికిని వెనుక, సత్యమైన జీవుడుంటాడు. స్థూలశరీరంయొక్క గుణాలు, శక్తులు అన్నీ మనస్సునుండి కలుగుతాయనే (సూక్ష్మ శరీరమైన) మనస్సుయొక్క ప్రకాశం, శక్తులు, అన్నీ జీవుడు లేక ఆత్మ వల్ల ఎరువు తెచ్చుకొనబడుతాయనీ తెలుసుకున్నాం.
ఇప్పుడీ ఆత్మయొక్క స్వభావాన్నిగూర్చి, అనేక ప్రశ్నలు బయలుదేర గలవు. అది స్వయంప్రకాశి అనే వాదంనుండీ సచ్చిదానందాలు, దాని స్వధర్మాలు అను వాదంనుండీ, ఆత్మయొక్క ఉనికి స్థాపింపబడితే, అది సృష్టింపబడినది కాదని సహజంగానే తేలుతుంది. మరే ఇతర శక్తి మీదా ఆధారపడక, స్వయంప్రకాశి అయిన ‘సత్త’ అయిన ఆత్మ వేరొక దానివల్ల పుట్టేది కాజాలదు. ఆత్మ శాశ్వత సత్తాకం. అది లేని కాలమే లేదు. ఆత్మే లేకుంటే కాలమెక్కడినుండి వస్తుంది? కాలమే ఆత్మయందిమిడి వుంది. అంటే, ఆత్మయొక్క ప్రభావం తన మీద ప్రసరించినపుడు మాత్రమే మనస్సుకు చింతనాశక్తి కలుగుతుంది. అప్పుడే కాలభావం కలుగుతుంది. ఆత్మే లేనినాడు, చింత అన్నదే వుండదు. చింతన లేకుంటే, కాలమే ఉండ జాలదు కదా? ఇలా కాలమే, ఆత్మలోనిదై వుండగా, ఆత్మే కాలంలోనిదని చెప్పడం కుదరదు. ఆత్మకు జనన మరణాలు లేవు. కాని యీ వివిధ దశలందు అది ప్రకాశిస్తోంది. అది క్రమేణా నిమ్నదశలలో మొదలుపెట్టి, అత్యుత్తమములైన దశల వరకు, అన్నిటిని ప్రదర్శిస్తోంది. ఆత్మ మనస్సు ద్వారా, బాహ్యశరీరం మీద ప్రసరించి, బాహ్యశరీరం ద్వారా, దృశ్య ప్రపంచాన్ని గ్రహించి, తెలిసికొంటూ, తన మహిమను ప్రదర్శిస్తోంది. అదొక శరీరాన్ని గ్రహించి ఉపయోగించుకొంటుంది. ఆ శరీరం జీర్ణమై నిరుపయోగ మైనప్పుడు, వేరొక శరీరాన్ని గ్రహిస్తుంది. ఇట్లే సదా ప్రవర్తిస్తూ వుంటుంది.
ఈ సందర్భంలో, సామాన్యంగా, జన్మాంతర సిద్ధాంతమని చెప్పబడే, ఒక మనోహర సమస్య బయలుదేరుతోంది. దీని మాట ఎత్తగానే ప్రజలు భయపడటం జరుగుతూంటుంది. ఈ మూఢభయం ఎంత గొప్పదిగా ఉంటుందంటే, జిజ్ఞాసువులైన వారు సైతం తాము శూన్యంనుండి పుట్టినట్లు భావించి, తదనంతరం, చిత్రమైన తర్కవాద సహాయంతో, తాము అలా శూన్యంనుండి ప్రభవించినా, ఇక ముందుమాత్రం శాశ్వతంగా నిలిచి వుంటామనే సిద్ధాంతాన్ని ఏర్పరచాలని ప్రయత్నిస్తూంటారు. శూన్యంనుండి వచ్చే వాళ్లు తప్పక శూన్యంలో అంతరించవలసే వుంటుంది. కాని మీరుగాని, నేనుగాని, మరెవ్వరు కాని, శూన్యంనుండి పుట్టిన వాళ్లం కాము. శూన్యానికి మరలిపోయే వాళ్లమూ కాము. మనం అనంతకాలంనుండి వస్తున్న వాళ్లమే. ఇంక శాశ్వతకాలం ఉండే వాళ్లమే. మన అస్తిత్వాన్ని నాశనం చేసి మనల్ని శూన్యంలో కలపగల శక్తి యీ లోకంలోగాని, పరలోకంలో గాని, మరెక్కడ గాని లేదు. జన్మాంతర సిద్ధాంతం భీతి హేతువు కాకుండడమే కాక, మానవ సంఘంయొక్క నైతిక రక్షణకు ముఖ్యాధారమౌతోంది. జిజ్ఞాసాపరులు తేల్చి చెప్పగల పర్యవసానమిదే. మీరింక శాశ్వతంగా నిలిచి ఉండేవారైతే, ముందు కూడ, శాశ్వతమైన అస్తిత్వం కలవారై వుండాలి. ఇంకో విధంగా కాజాలరు. ఈ సిద్ధాంతాన్ని ఆక్షేపించడానికై సామాన్యంగా చెప్పబడే ఖండన వాదాలు కొన్నిటికి సమాధానం చెబుతాను. అవి కేవలం వెర్రి ఆక్షేపణలని మీలో కొందరన వచ్చు. అయినా మహాజిజ్ఞాసాపరులు సైతం, మిక్కిలి పిచ్చి అభిప్రాయాలనే చెప్పాలని సిద్ధపడుతూంటారు. కాబట్టి వానికి సమాధానం చెప్పడమే మంచిది. తత్త్వవేత్తలు, సమర్థింప జూడని వెర్రిభావన ఒకటి అయినా లేదని, చక్కగా చెప్పబడింది. “మన పూర్వజన్మలు, మన కెందుకు జ్ఞాపకం లేవు?” అన్నది, ఈ ఆక్షేపణలలో మొదటిది. ఈ జన్మలోని గతము నెల్ల జ్ఞప్తి నుంచుకొనగల్గుతున్నామా? చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు మీరేమేమి చేశారో మీలో ఎందరికి జ్ఞాపకముంది? బాల్యావస్థ ఎవరికీ గుర్తుండదు కదా? మీ అస్తిత్వం మీ జ్ఞప్తిపై ఆధారపడి ఉంటుందంటే, మీ రా బాల్యావస్థను ఎన్నడూ గడపలేదని తెలుస్తుంది కదా? కాబట్టి మన అస్తిత్వం మన స్మృతిపై ఆధారపడి వుంటుందనడం కేవలం వివేకహీన భావం. గత జన్మలను మనమేల జ్ఞాపకముంచుకోవాలి? అప్పటి మెదడు అప్పుడే పోయింది. ఛిన్నాభిన్నమైపోయింది. క్రొత్త మెదడొకటి యిప్పుడేర్పడి వుంది. మనస్సే కొత్త శరీరంలో నివసించడానికి వచ్చే సమయంలో, పూర్వ జీవితంలో సంపాదించి, కూర్చిపెట్టుకొని, తనలో తెచ్చుకున్న భావరాశియొక్క ఫలితం మాత్రమేకదా యీ మెదడులో కనిపిస్తుంది?
ఇక్కడ నిలిచివున్న నేను అంతులేని గతకాలంనుండి, నాకంటుకొని వస్తున్న అన్నింటియొక్క ఫలమే మరి. ఆ గతాన్నంతటిని నేను జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరమేముంది? ప్రాచీనకాలపు మహర్షి, లేక ద్రష్ట ఒకడు, అంటే సత్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొన్న ప్రవక్త ఒకడు, ఏమైన చెబితే, ఈకాలం వారు, చెలరేగి వెర్రివాడు, వెర్రివాడు అని అంటారు. కాని హక్స్లీనో, టిండాలో, మరొకరో చెబుతున్నారని ఆ మాటనే తెలిపితే అది పరమసత్యమని అంటారు. నిర్వివాదంగా అంగీకరిస్తారు. ప్రాచీన మూఢభావాల స్థానంలో, వీరు నవీన మూఢభావాలను నిర్మించారు. పురాతన మతాచార్యులస్థానంలో నవీన ప్రకృతి శాస్త్రవేత్తలను తెచ్చి నిలుపుతారు. సరే! స్మృతిని గూర్చిన ఆక్షేపణం అంతగా పటుతరమైనది కాదని గ్రహించాం. జన్మాంతర సిద్ధాంతాన్ని ఖండించడానికై తెచ్చే ముఖ్యవాదన ఇదొక్కటే అనవచ్చు. గతజన్మల స్మృతి ఉండటం మన సిద్ధాంతానికి అంతగా ముఖ్యం కాదని కనుగొన్నాం నిజమే; కానీ అట్టి జ్ఞాపకాన్ని పొందిన వారున్నారని, మనలోని ప్రతివాడు, తాను ముక్తిని సాధించే జన్మలో అటువంటి జ్ఞాపకాన్ని పొందగలడనీ, చెప్పడానికి తగిన ఆధారాలు సైతం వున్నాయి సుమండీ! అప్పు డీ జగత్తు స్వప్నం వంటిదని గట్టిగా తెలిసికోగలుగుతాం. అప్పుడే, ఈ జగత్తు, ఒక నాటక రంగమని, మీరు అందలి నటులని, మీ అంతరాత్మలకు గోచరమైపోతుంది. పిడుగులాంటగొప్పశక్తితో వైరాగ్య చింత మిమ్మావహిస్తుంది. అప్పుడే మీ భోగాసక్తిని, ఈ జీవనాన్ని, ఈ సంసారాన్ని పట్టుకొని ప్రాకులాడాలన్న వాంఛకూడ పూర్తిగా నశిస్తుంది.ఎన్నెన్నిసార్లు ఇలాంటి జన్మలు మీకు కల్గుతాయో, ఎన్ని కోట్ల పర్యాయాలు మీకు తండ్రులు, తల్లులు, కొడుకులు, కూతుళ్లు, భర్తలు, భార్యలు, బంధువులు, స్నేహితులు, సంపదలు, అధికారాలు ప్రాప్తి స్తూండటం జరిగిందో తేటతెల్లంగా మీ మనోనేత్రాలకు గోచరిస్తుంది. అవి ఎప్పుడూ వస్తూ పోతూ వుండేవే. ఎన్నిసార్లో మీరు, గొప్ప ఆశాతరంగాల ఉన్నతాగ్రాలపై నాట్యాలు చేసి వుంటారు. మరెన్నిసార్లో నిరాశలో చిక్కి, అధఃపతితులై పోయారు. ఈ అన్ని విషయాలు మీ స్మృతికి వచ్చినప్పుడు మీరు శూరులై నిలబడి, ఈ జగత్తు మిమ్మల్ని రౌద్రదృక్కులతో బెదిరిస్తున్నా, మందహాసం చేయజాలుదురు. అప్పుడు మాత్రమే మీరు ధీరులై నిలబడి, “ఓ మృత్యువా! నిన్ను సైతం నేను లక్ష్యపెట్టను. నిన్ను చూస్తే నాకేం భయం?” అని ఎలుగెత్తి పలుకగలుగుతారు. ఎప్పుడో ఒకప్పుడు, ఈ సిద్ధి అందరికీ ప్రాప్తించేదే!
“జీవుని పునరావృత్తిని స్థాపించే (మళ్లీ మళ్లీ పుట్టడం, మరణించడం అనేది వుందని ఋజువుపరిచే) ప్రమాణాలుగాని, సహేతుకాలైన నిదర్శనాలు గాని, వున్నాయా?” అని మీరడుగవచ్చు. ఇంత వరకు, ఖండన వాదనలు నిరాధారాలని తెలిపే యుక్తులు మాత్రం చెప్పాను. “ప్రత్యక్ష నిదర్శనాలు ఏమైనా వున్నాయా?” అంటారా – ఉన్నాయంటాను. మంచి గట్టి నిదర్శనాలే ఉన్నాయి. మనిషికీ, మనిషికీ మధ్య జ్ఞాన సముపార్జన శక్తిలో ఎక్కువ తారతమ్యం కనిపిస్తోంది. దానిని విశదీకరించడానికి సమర్థమైనది, ఈ జన్మాంతర సిద్ధాంతానికి మించింది వేరొకటి దొరకదు. జ్ఞానాన్ని సంపాదించుకొనేటప్పుడు, మనం అనుసరించే అనుక్రమణికను మొదట పరిశీలిద్దాం. నేను వీధి లోనికి వెళ్లి ఒక కుక్కను చూచాననుకోండి. అది కుక్క అనే జ్ఞానం, నాకెలా కలుగుతోంది? నా కప్పుడు కనబడేదాన్ని గూర్చి నా మనస్సుతో సంప్రదిస్తాను. అక్కడ రకరకాలుగా ఏర్చి కూర్చి పెట్టిన నా పూర్వానుభవాలు అనేకం ఉంటాయి. కొత్త అనుభవం ఏదైనా కలుగగానే, అదివరకున్న ప్రాతవైన భావ చిహ్నరాశులతో సంప్రదించి, అదివరకు అక్కడ ఉన్నవానిలో, ఈ కొత్త దానితో సమానమైన భావచిహ్నాల రాశిని వెదకి కనుగొని, వెంటనే దీన్ని వానితో చేర్చేస్తాను. అప్పుడు నాకు తృప్తి కలుగుతుంది. అదివరకే పేరివున్న భావగణ చిహ్నాలతో ఇది ఏకీభవించడంచేతనే అది ‘కుక్క’ అని నేను గుర్తింప గలగడం. ఈ నూతనానుభవంతో సజాతీయాలైన అనుభవాలు, నాలో లేకపోతే అసంతృప్తి కలుగుతుంది. ఒక అనుభవం కలిగేటప్పుడు, దానితో సజాతీయమైన అనుభవం మనలో లేకపోతే, అట్టి స్థితిని “తెలియకపోవడం” అంటాం. (మాకు తెలీదు) అలాకాక దానితో సజాతీయాలైన అనుభవాలు మనలో కన్పిస్తే, మనకు తృప్తి కలుగుతుంది. దీన్నే మనం “తెలియడం” (నాకు తెలుసు) అంటాం. రేగుపండు నేలపై రాలడాన్ని మొదట చూసినప్పుడు నరుడు అసంతృప్తి చెందాడు. తర్వాత కాలక్రమాన, అట్టి అనుభవంతో సజాతీయాలైన అనుభవాల రాశిని కనుగొన్నాడు. ఆ అనుభవరాశి అన్ని రేగుపండ్లు నేల రాలుతాయని బోధించింది. అప్పుడు దానికి “గురుత్వాకర్షణ శక్తి” అని పేరు పెట్టి తృప్తి పొందాడు. పూర్వ అనుభవరాశి మనలో ఇదివరకే లేనప్పుడు కొత్త అనుభవాలను గ్రహించడమే అసాధ్యమని పర్యవసానంగా తేలుతోంది. అవి లేనప్పుడు నూతనానుభవాన్ని ఏ గణంతో కూర్చడానికీ వీలు కనిపించదు కదా? బిడ్డ ఈ లోకంలో పుట్టేటప్పుడు, పూర్వానుభవచిహ్న శూన్యుడుగా వుంటాడని (వుంటుందని) యూరపు తత్త్వశాస్త్రవేత్తలు కొందరంటారు. అట్లయితే నూతనానుభవాన్ని చేర్చుకొనగలది ఏదీ తనలో లేని కారణంగా, వాని బుద్ధి వికసింపజాలదు. అంతేకాక జ్ఞానోపార్జన శక్తి వేర్వేరు వ్యక్తులలో, వేర్వేరు దశల్లో ఉంటుంది కదా? అందువల్ల మనలోని ప్రతి వాడూ, వేర్వేరు తరగతుల జ్ఞానరాశితో పుడుతుంటాడని స్పష్టమవు తుంది. జ్ఞానాన్ని సంపాదించడానికిగల మార్గం ఒక్కటే. అనుభవ స్వీకరణమే. మార్గాంతరం లేదు. మనకున్న అనుభవం, ఈ జన్మలో సంపాదించింది కాకపోతే, వెనుకటి జన్మలో సంపాదించిందయి వుండాలి. ఎక్కడ చూచినా మరణభయం కనబడుతోంది. ఎందువల్లో యోచించండి. అప్పుడే గుడ్డునుండి వెలువడిన కోడి పిల్ల, డేగ తనవైపునకు ఎగిరి వస్తే భయపడి తల్లి దగ్గరకు పరుగెత్తుతుంది. ఇందుకు పూర్వసిద్ధమైన సమాధానాభాసం ఒకటి వుంది. అది, దాని “సహజ గుణం” (ఇన్స్టింక్ట్) అని అంటారు. అప్పుడే గుడ్డునుండి వెలువడిన కోడి కూనకు చావు అంటే భయాన్ని కల్గించేది ఏది? అప్పుడే పొదిగిన గుడ్డునుండి పుట్టు, బాతుపిల్ల అయినా నీటి దగ్గరకి వచ్చిన వెంటనే నీటి లోనికి ఉరికి యీదులాడుతుంది. ఎందువల్ల? అదెన్నడు ఈది వుండలేదే? ఇంకొకటి ఈదుతుండగా చూసికూడ ఉండలేదే? దీన్ని సహజ ప్రవృత్తి అంటారు. ఈ శబ్దం మహాగంచీబీరమైనదే. కాని, ఇది మన చిక్కును తీర్చడం లేదు. ఈ “స్వాభావిక ప్రవృత్తి” అనబడే చిత్ర విషయమేమో విచారిద్దాం. ఒక బాలిక హార్మోనియాన్ని వాయించడం సాధన చేస్తున్నదనుకోండి. మొదట తాను వ్రేలు పెట్టే ప్రతి మీటను శ్రద్ధతో గమనించాల్సి వుంటుంది. అలా చేయగా చేయగా కొన్ని నెలలకో, సంవత్సరాలకో ఆమె వ్రేళ్ళ చలనం అప్రయత్నంగా నడవ గలుగుతుంది. అప్పు డా నడక “అంతఃప్రేరణ” ఐనదంటాం. మొదట బుద్ధిపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా జరుపబడిన కార్యం రాను రాను బుద్ధియొక్క ప్రయత్నం అంతగా లేకుండానే అంటే, “సహజాత ధారణగానే” జరుగుతోంది. ఇంతటితోనే అంతా తెలిసిపోవడం లేదు. ఇంకా సగం విషయం మిగిలే ఉంది. “సహజ జ్ఞానాన్ని” బట్టి, ఇప్పుడు జరుగుతుందని చెప్పే కార్యాలు దాదాపుగా, అన్నీ మన యిచ్ఛయొక్క స్వాధీనం లోనికి తీసికొని రాబడగలవు. శరీరంలోని ప్రతి కండరం ఇచ్ఛకు లోబడేలా చేయవచ్చు. ఈ విషయం బాగా తెలిసిందే కదా? ఇప్పు డీ రెండు వైపులా పరిశోధనం చేయడంతో ఋజువు పూర్తవుతోంది. మనం “అంతర్జాత ప్రవృత్తి” (లోపలోవున్న గుణం) అనేది, ఇచ్ఛా కార్యలయొక్క నిమ్నావస్థ అనొచ్చు. ఈ సాదృశ్యాన్ని సృష్టికంతకు అనువర్తింపజేసితే, సృష్టి అంతా ఒకే సూత్రానికి అనుసరణగా జరిగితే, పశువుల్లో, మనుషుల్లోకూడ “సహజ ప్రవృత్తి” అనబడేది యిచ్ఛయొక్క “నిమ్నావస్థయే” అనాలి.
బ్రహ్మాండాన్నంతటిని గూర్చీ విచారించేటప్పుడు ప్రతి ‘సంవృతి’ కి పూర్వం ఒక ‘వివృతి’, ప్రతి ‘వివృతి’ కి పూర్వం ఒక ‘సంవృతి’ ఉంటుందని రుజువు చేసిన సూత్రాన్ని ప్రయోగిస్తే, “సహజ జ్ఞానం” అనేది “సంవృత విచక్షణ శక్తి” (ఇన్వాల్వ్డ్ రీజన్) అని తేలుతుంది. నరులందుకాని, పశువులందుకాని కనిపించు ‘సహజ ప్రవృత్తి’ పూర్వం కావించిన ఐచ్ఛిక కర్మలయొక్క ‘సంవృత దశ’ అంటే వాని నిమ్నావస్థ అనీ, ఆ ఐచ్ఛిక కర్మలుకూడ పూర్వానుభవం లేక జరిగినవి కావనే స్పష్టమవుతుంది. ఆ అనుభవమే ఆ జ్ఞానానికి మూలం. ఆ జ్ఞానమే నిలిచివుంది. మరణ భయం, బాతుపిల్ల నీటిలో దుముకడం, నరునిలో సహజంగా జరిగే అనిచ్ఛాపూర్వక కార్యాలు, పూర్వనుభవ ఫలితాలే. ఇంత వరకు, మన నడక చిక్కులేకుండా సాగింది. ఆధునిక శాస్త్రజ్ఞులుకూడ ప్రాచీన ఋషుల మార్గాన్ని అనువర్తించి మన భావాలను బలపరుస్తూండేవారు. కాని ఇక్కడ చిక్కొకటి వస్తోంది. ప్రతి మనిషీ, ప్రతి జంతుమా కొంత పూర్వానుభవ రాశితో పుట్టుతూ వుండొచ్చనీ, మనస్సులో జరిగే కార్యాలన్నీ, పూర్వానుభవాల ఫలితాలే అనీ వారొప్పుకుంటారు. కానీ, “ఈ అనుభవం ఆత్మకు చెందిందని చెప్పడంవల్ల లాభమేముంది? అది శరీరానికి చెందిందే – కేవలం శరీరానికే చెందింది – అనరాదా? వంశపారంపర్యంగా వచ్చేదనరాదా?” అని వారు ప్రశ్నిస్తారు. ఇది మనం పరిష్కారం చేయవలసిన వానిలో తుది ఆక్షేపం. “నేను జన్మించేటప్పుడు నాలో గల పూర్వానుభవమంతా, నా పూర్వీకులయొక్క గతకాలానుభవ రాశికి ఫలితమని ఎందుకు చెప్పరాదు? చిన్న ఏకకణ జీవియొక్క దశనుండి, మానవ శ్రేష్ఠుడనైన దశ వరకు, నేను పొందిన అనుభవరాశి అంతా నాలో ఉంది కదా? అది పరంపరాగతంగా ఒక శరీరంనుండి, మరొక శరీరానికి సంక్రమిస్తూ వచ్చింది. ఇక కష్టమెక్క డుంది?” ఈ ప్రశ్న చాలా చక్కనిదే. వంశపారంపర్యంగా వచ్చిన ధర్మాన్ని కూడ మనం కొంతవరకు ఒప్పుకుంటూనే ఉన్నాం. ఎంతవరకంటారా? శరీర పదార్థ సంగ్రహణం వరకు మాత్రం. మన పూర్వ కర్మలను అనుసరించి ఒకానొక శరీరంలో, ఒకానొక జన్మనెత్తడానికి అర్హతను పొందుతాం. ఆ శరీరానికి అనువైన పదార్థరాశి ఆ ఆత్మను తమ సంతానంగా పొందడానికి అర్హతను ఆర్జించుకున్న దంపతులవల్ల మాత్రమే లభించగలదు.
జడ పదార్థాల్లో మానసికానుభవాలు ముద్రితాలు కాగలవనీ, జడ పదార్థంలో మానసికానుభవాలు ‘సంవృతి’ పొందుట సాధ్యమని ఊహించడానికి ఏమాత్రం ఆధారం లేదు. కాని ఈ కేవల నిర్హేతుకమైన ఊహే వీరి వంశపారంపర్య వాదానికి ప్రాపు. నేను మీ వంక చూసేటప్పుడు నా మనస్సనే సరస్సులో ఒక తరంగం లేస్తుంది. అది అణిగిపోతుంది కానీ, సూక్ష్మతరాకృతిని దాల్చి, ఒక ‘వాసన’ రూపంలో మనస్సులో నిలిచే వుంటుంది. స్థూలశరీరంలో భౌతికానుభవాలు, ముద్రితమవుతాయంటే మనం గ్రహింపగలం. కాని శరీరం విచ్ఛిన్నమవుతుందని ఒప్పుకొని, మానసికానుభవాలు ఈ శరీరంలో ముద్రితమై నిలిచి వుంటాయనుకోడానికి ఆధారం కన్పించదు. వానిని దహించేదేది? ఒకవేళ ప్రతి మానసికానుభవం శరీరంలో ముద్రితమవుతుందనీ, ఆదిపురుషుడు మొదలు నా తండ్రి వరకు గల అందరి ‘వాసన’ లు నా తండ్రి శరీరానికి సంక్రమించి వున్నాయని ఒప్పుకున్నాకూడ, అవి నాకు సంక్రమించడం ఎలా? శుక్ల బిందువు వల్ల అంటారా? అదెలా సాధ్యం? తండ్రి శరీరం మొత్తంగాకుమారునికి రాదు కదా? ఒకే దంపతులకు అనేకమంది బిడ్డలు పుడతారు. అప్పు డీ వంశ పారంపర్య సంక్రమణ సిద్ధాంతాన్ననుసరించి వాసన, వాసనాత్మక ద్రవ్యం ఒకటే అయితే, ఆ దంపతులు తమ తమ వాసనలలో కొంత కొంత భాగాన్ని ప్రతి కాన్పులోకూడ నష్టపోతూండాలి. అలాగాక తండ్రులు, తమ వాసనలను సంపూర్ణంగా తమ సంతానానికి సంక్రమింప చేస్తారంటే, మొదటి బిడ్డ పుట్టగానే వారి మనస్సులు వట్టిపోయి శూన్యం కావలసి వస్తాయి.
ఇంతేకాకా, ఒక్క శుక్ల బిందువులో అనంతకాలంనుండి వస్తున్న, మితిలేని వాసనల సముదాయం ప్రవేశింపగలిగితే, అది ఎక్కడ వుండింది? ఎలా వుండింది? ఇదెంత మాత్రమూ సమర్థింప నలవికాని వాదన. ఈ పదార్థ విజ్ఞానవాదులు (ఫిజిసిస్ట్స్) ఆ బిందువులో వాసనలు ఎలా వుంటాయో, ఏ భాగంలో నిలుస్తాయో, మానసిక వాసనలు జడ పదార్థకణంలో ప్రవేశించి నిద్రిస్తూ వుంటాయి అనడానికి అర్థమేమో స్పష్టంగా, రుజువు చేసే వరకు, వారి వాదన అంగీకరించబడజాలదు. ఇప్పటికి తేలిందిది – ఈ వాసనలు మనస్సులో వుంటాయి. మనస్సు జనన పునర్జననాలు పొందుతూ, తనకు మిగుల అనుకూలంగా వుండే భౌతిక పదార్థాన్ని (శరీర నిర్మాణంకోసం) వినియోగించుకొంటుంది. ఏ విధమైన శరీరం తనకనుకూలమో, అట్టి శరీర పదార్థం లభించే వరకు అది వేచి వుండాలి. ఇది సులభంగా బోధపడుతోంది. ఆత్మకు సమకూరే శరీర పదార్థవిషయంలో మాత్రమే వంశపారంపర్య సిద్ధాంతం వర్తిస్తుందని దీన్నిబట్టి తేలుతోంది. జీవాత్మ జన్మాంతరాలను పొందుతూ, శరీరం తరువాత శరీరంగా ఎన్నిటినో కల్పించుకొంటూ వుంటుంది. మనస్సులో కలిగే, ప్రతి సంకల్పం, మనం చేసే ప్రతికార్యం, బహుసూక్ష్మరూపాన్ని దాల్చి దానిలో నిలుచుండి, తిరిగి మొలకెత్తడానికి క్రొత్త స్వరూపాన్ని ధరించడానికి సిద్ధంగా ఉంటుంది. నేను, మీ వైపు చూచేటప్పుడు నా మనస్సులో ఒక తరంగం కలుగుతుంది. అది మనస్సులో లోతునకు మునిగిపోయి క్రమేణా సూక్ష్మతరాకృతిని ధరించి పడి వుంటుంది. కాని నాశనం కాదు. తిరిగి అదెన్నడో స్మృతి (జ్ఞప్తి) రూపంతో తలెత్తడానికి సిద్ధంగా ఉంటుంది. ఇలా అనేక భావాలు నా మనస్సులో పేరుకొని వుంటాయి. నేను మరణించేటప్పుడు వీని సమష్టిఫలమైన శక్తి నాపై తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ గదిలో ఒక బంతి ఉన్నదనుకోండి. మనమందరం, తలకొక బల్లచెక్కను తీసికొని అన్ని వైపులనుండి దాన్ని ఇటు, అటు కొడతామనుకోండి, అప్పు డా బంతి యీ గదిలో ఒక చోటనుండి మరొక చోటుకు దొర్లిదొర్లి ద్వారం దగ్గరకి రాగానే వెలుపలికి ఎగిరిపోతుంది కదా? అది అప్పుడు తనతో ఏమి తీసుకొని పోతోంది? మన మందరం కొట్టిన దెబ్బల సమష్టి ఫలాన్నే కదా? ఆ సమష్టి ఫలమే దాని కా త్రోవను చూపింది. అట్లే, ఈ శరీరం నశించేటప్పుడు, జీవునికి త్రోవ చూపేదేమో విచారించండి. ఆ జీవి చేసిన కర్మ లన్నిటియొక్క, సంకల్పించిన సంకల్పాలన్నిటియొక్క సమష్టి ఫలితమే వానికి దారి చూపుతుంది. ఈ సమష్టి ఫలితం భవిష్యదనుభవానికి కావాలసిన ఇంకొక శరీరాన్ని కూర్చుకొనే అవసరాన్ని, కల్పన చేస్తే, ఆ జీవుడు, తనకు తగిన శరీరానికి వాసన ద్రవ్యాన్ని చేకూర్చడానికి సిద్ధంగా ఉండే తల్లితండ్రుల కడకు వెళ్తాడు. ఈ రీతిగా జీవుడు, ఒక శరీరంనుండి, వేరొక శరీరానికి యాత్రలు చేస్తూంటాడు. స్వర్గానికి, భూమికి, సంచారాలు చేస్తాడు. మనుష్య శరీరాలను, పశు శరీరాలను ధరిస్తూ వుంటాడు. ఇలా అతడు, తన అనుభవాన్నంతా పూర్తి చేసికొని, తన సంచార చక్రాన్ని ముగించుకొనేంత వరకు జన్మాంతర యాత్రలు చేస్తూంటాడు. తుదకతడు తన స్వరూపాన్ని తెలిసికొంటాడు. తానెవరో గ్రహిస్తాడు. వాని అజ్ఞానం రూపుమాసిపోతుంది. అతని దివ్యశక్తులు ప్రకాశిస్తాయి. తర్వాత అతడు, పరిపూర్ణుడై వెలుగుతాడు. ఆ జీవునకు ఆ పిమ్మట భౌతిక శరీరాలు ధరించే అవసరంకానీ, సూక్ష్మతర, మానసిక శరీరాలను ధరించే అవసరంకానీ ఉండదు. అతడు స్వయంప్రకాశుడై వెలుగుతాడు. ముక్తుడవుతాడు. ఇంక వానికి జననం లేదు. మరణం ఉండదు.
మనం ఇప్పుడు, ఇంతకుమించిన సూక్ష్మతర వివరణలలోనికి దిగం. జన్మాంతర సిద్ధాంతాన్ని గూర్చి ఇంకొక అంశాన్నికూడ చెబుతాను. అది నరుని ఆత్మ, స్వతంత్రమనే వాదం. మన లోపాలను పరులపై త్రోసే అలవాటును అనుసరించని వాదమిదొక్కటే. మన లోపాలను మనం ఒప్పుకోం. మన కళ్లు తమని తాము చూచుకోలేవు. ఇతరుల కళ్లన్నిటినీ చూడగలవు. తమ దోషాలను ఇతరులపై పడవేసే అవకాశం వున్నంత వరకు మనుషులు, తమ నేరాలను అంగీకరించడంలో ప్రాల్మాలుతారు. తమ సహజ దోషాల్ని వీలైనంత వరకు తోడిమానవుల మీదనో, అలా కాకపోతే, భగవంతుని మీదనో పడవేస్తారు. అదీకాకుంటే, ‘విధివ్రాత’ అనే భూతాన్ని సృష్టిస్తారు. ఈ ‘విధివ్రాత’ ఎక్కడిది? విధాత ఎవరు? మనం నాటిన విత్తనం ఫలాన్నే మనం అనుభవిస్తాం. మన విధివ్రాతకు కర్తలం మనమే. దానికై నిందార్హులైన వారు వేరుగా లేరు. అభినందనలు పొందగలవారూ లేరు. గాలి వీస్తుంది. ఎవరు, తమ పడవల తెరచాపను విప్పిపెట్టుకొంటారో, వారు ముందుకు పోతారు. ఎవరు దాన్ని ముడిచి పెట్టుకుని వుంటారో వా రా గాలి వల్ల లాభాన్ని పొందజాలరు. అలా కావడం గాలి దోషమా? కొందరు సుఖపడటం, కొందరు దుఃఖపడటం – ఇదంతా కరుణామయుడైన జగత్పతియొక్క లోపమా? ఆయన కరుణ తగ్గడం లేదు. మన గతికి మనమే కర్తలం. భగవంతుడు నియమించిన సూర్యుడు, బలవంతులకు బలహీనులకుకూడ వెలుగునిస్తూనే ఉన్నాడు. వానిచే నియమింపబడిన వాయువు, పరమ సాధువుపైనా, పతితునిపైనా ఒక్క తీరుగానే వీస్తోంది. ఆయన విశ్వేశ్వరుడు. జగత్పిత. కరుణాసాగరుడు. నిష్పక్షపాతి. మన జీవన క్షద్ర విషయాలను గూర్చి మనం ఆలోచించే విధంగా, ఆ విరాట్ విశ్వ కర్మకూడ ఆలోచిస్తాడనుకొంటున్నారా? భగవంతుని గూర్చి ఇలా ఆలోచించటం చాలానీచం. ఇక్కడి మన పెనుగులాటలను చావు బ్రదుకులతో సమానంగా తలపోయు కుక్క పిల్లలవంటి మనం, భగవంతుడు వీనిని గొప్ప విషయాలుగా పాటించి, వర్తిస్తూంటాడని అవివేకులమై అనుకొంటాం. ఈ కుక్క పిల్లల చెర్లాటలు ఎంతటివో ఆయనకు తెలుసు. ఆ దేవదేవుని, దండనాధికారిగా, పారితోషిక దాతగా చేసి నేరం ఆయనపై తోయడం మూర్ఖత్వం. ఆయన దండనలు విధించే వాడు కాడు. బహుమతుల్ని ఇచ్చేవాడూ కాడు. ఆ సర్వేశ్వరుని కృప వెల్లివిరసి అనంతంగా, దశదిశల ప్రవహిస్తూ సకల జీవులకు, సమస్త ప్రదేశాలలోను, సర్వకాల సర్వావస్థలలోను, వంకర మార్గంలేక, ఆశాభంగం కావింపక సులభంగా లభిస్తుంది. దాన్ని వినియోగించుకొనే విధానం మనపై ఆధారపడి వుంది. తోడి మానవులనుకాని, భగవంతునిగాని, బ్రహ్మాండంలో మరెవ్వరినిగాని నిందించబోకుడు. మీకేదైనా దుఃఖం కలిగినప్పుడు, మిమ్మల్ని మీరే నిందించుకోండి. ఉత్తమమైన మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నించండి.
మన సమస్యా పరిష్కారానికి ఇదొక్కటే త్రోవ. ఇతరుల నిందించే వారి సంఖ్య దినదినానికి పెరిగిపోతోంది కదా? బుద్ధిహీనులై వారు దుః ఖంతో బాధపడుతున్నారు. తమ పొరపాట్ల వల్లే దుర్గతి పాలయి, వీరు ఇతరులను నిందిస్తారే! ఇట్టి వారి దశ బాగుపడజాలదు. అందువల్ల ఏలాటి లాభం చేకూరబోదు. తమ దోషాలను ఇతరుల నెత్తిపై త్రోసి, పరులను నిందించే ప్రయత్నం వీరిని మరింత బలహీనుల్ని చేస్తుంది సుమండీ! కాబట్టి మీ లోపాలకై, ఎవరినిగాని నిందించకండి. మీ కాళ్ల మీద మీరే నిలువబడి మీ బాధ్యతనంతా, మీరే వహించండి. “నేను అనుభవించే దుఃఖం నా కర్మఫలం. అందువల్ల ఇది, నా చేతనే నివారించబడగలదని ఋజువవుతోంది –” అనండి. నేను సృష్టించిన దాన్ని నేను నాశనం చేయగలుగుతాను. ఇతరులు సృష్టించిన దాన్ని నే నెన్నడు, నాశనం చేయజాలను. కాబట్టి మనం సదా ధైర్యాన్ని బలాన్ని పూని నిలబడాలి. బాధ్యతనంతా మీ మీద పెట్టుకొని, మీ గతికి మీరే కర్తలని అంగీకరించండి. మీకు కావలసిన బలం, సహాయం మీలోనే ఉన్నది సుమండీ! కాబట్టి మీ భవితవ్యాన్ని, మీరే నిర్మించుకోండి. “గతాన్ని గతం పూడ్చిపెట్టుగాక.” అంతులేని భవిష్యత్తుంది. మీ ప్రతివాక్కును ప్రతి సంకల్పమును, ప్రతి చేష్టకూడ, మీకు సంచిత ఫలాన్ని చేకూరుస్తూ వుంటుంది. చెడ్డ తలపులు, చెడ్డ పనులు పెద్దపులులలాగా, పైకి దుముకుతాయని మరువకండి. గొప్ప ఉత్సాహానికీ అవకాశం వుంది. సత్సంకల్పాలు, సత్కార్యాలు, నూర్ల కొలదీ, వేల కొద్దీ దేవతా గణాల మహిమతో మిమ్మల్ని సదా రక్షించగలవను దృఢ విశ్వాసం కలిగి ప్రవర్తింతురు గాక!