అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ॥ 14
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ ।
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ॥ 15
అన్నాత్, భవంతి, భూతాని, పర్జన్యాత్, అన్న సంభవః,
యజ్ఞాత్, భవతి, పర్జన్యః, యజ్ఞః, కర్మ, సముద్భవః.
కర్మ, బ్రహ్మోద్భవమ్, విద్ధి, బ్రహ్మ, అక్షర సముద్భవమ్,
తస్మాత్, సర్వగతమ్, బ్రహ్మ, నిత్యమ్, యజ్ఞే, ప్రతిష్ఠితమ్.
అన్నాత్ = అన్నం నుండి; భూతాని = ప్రాణులశరీరాలు; భవంతి = ఉత్పన్నమవుతున్నాయి; పర్జన్యాత్ = వర్షం నుండి; అన్నసంభవః = అన్న సృష్టి; యజ్ఞాత్ = యజ్ఞం వల్ల కలిగే అపూర్వమనబడే అదృష్టఫలం నుండి; పర్జన్యః = వర్షం; భవతి = ఉత్పన్నమవుతోంది; యజ్ఞః = అపూర్వమైన ఈ కర్మఫలం; కర్మసముద్భవః = వైదికహోమాది క్రియల నుండి ఉత్పన్నమవుతోంది.
కర్మ = కర్మను; బ్రహ్మోద్భవమ్ = వేదం నుండి పుట్టినదిగా, వేద ప్రతిపాదితంగా; విద్ధి = గ్రహించు; బ్రహ్మ = వేదం; అక్షరసముద్భవమ్ = పరమాత్మ నుండి పుట్టినది; తస్మాత్ = కనుక; సర్వగతమ్ = సర్వప్రకాశకం; సర్వవ్యాపియైన; బ్రహ్మ = వేదం; నిత్యమ్ = సదా; యజ్ఞే = యజ్ఞంలో; ప్రతిష్ఠితమ్ = ప్రతిష్ఠితమైనది.
తా ॥ అన్నం నుండి ప్రాణుల శరీరం ఉత్పన్నమవుతోంది. అన్నం మేఘం నుండి కలుగుతోంది. మేఘం యజ్ఞం నుండి కలుగుతోంది, యజ్ఞం హోమాది కర్మల వల్ల ఉత్పన్నమవుతోంది.
తా ॥ కర్మ వేదాల నుండి కలుగుతోందని గ్రహించు. వేదం పరమాత్మ నుండి సముద్భూతము. కనుక, సర్వప్రకాశము (సర్వవ్యాపి) అయిన వేదం సర్వదా యజ్ఞమందు ప్రతిష్ఠితమై ఉంది.
వ్యాఖ్య:-
పరబ్రహ్మం (దేవుడు) నుండి వేదాలు వచ్చాయి. వేదాల నుండి సత్కర్మలు (మంచి పనులు) వచ్చాయి. ఆ సత్కర్మల నుండి యజ్ఞం పుట్టింది. ఈ వరుస క్రమాన్ని బట్టి చూస్తే, మనం చేసే యజ్ఞంలో ఆ పరబ్రహ్మం ఎప్పుడూ నిలకొని ఉంటాడని అర్థమవుతోంది. అందుకే యజ్ఞాలు చాలా పవిత్రమైనవి. అవి మనసును శుద్ధి చేసి, మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. (గమనిక: ఇంతకుముందు చెప్పుకున్న వర్షం, అన్నం, శరీరం అనేవి యజ్ఞంలోనే అంతర్భాగం కాబట్టి, వాటిని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు). దైవకార్యాలను (యజ్ఞాలు, పూజలు, సత్కర్మలు) ఏదో మామూలు పనులని తక్కువగా చూడకూడదు. ఎందుకంటే, సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మ వాటిలో స్థిరంగా ఉంటాడని భగవద్గీత ఘోషిస్తోంది. కాబట్టి, అందరూ ఈ సత్కర్మలను ఆచరించాలి. తద్వారా మనసును శుద్ధి చేసుకుని, ఆ భగవంతుడిని దర్శించి (సాక్షాత్కారం పొంది), సంసార బంధాల నుండి విముక్తి పొందాలి.
“యజ్ఞాద్భవతి పర్జన్యః” – యజ్ఞాల వల్లనే వర్షాలు కురుస్తాయని చెప్పబడింది. దీన్ని బట్టి, యజ్ఞాలు వంటి మంచి పనులు చేయకపోవడం వల్లనే కరువు కాటకాలు వస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి, దేశం సుభిక్షంగా ఉండటానికి, మన మనస్సు శుద్ధి కావడానికి ప్రజలందరూ మంచి పనులను (సత్కర్మలను) ఎక్కువగా ఆచరించాలి.