శ్రీభగవానువాచ :
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ।
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥
ఇదమ్, శరీరమ్, కౌంతేయ, క్షేత్రమ్, ఇతి, అభిధీయతే,
ఏతత్, యః, వేత్తి, తమ్, ప్రాహుః, క్షేత్రజ్ఞః, ఇతి, తద్విదః.
కౌంతేయ = కుంతీపుత్రా; ఇదమ్ = ఈ; శరీరమ్ = భోగాయతనమైన దేహం; క్షేత్రమ్ = క్షేత్రం; ఇతి = అని; అభిధీయతే = చెప్పబడుతుంది; యః = ఎవడు; ఏతత్ = దీనిని; వేత్తి = తెలుసుకొంటున్నాడో; తద్విదః = క్షేత్రక్షేత్రజ్ఞ వేత్తలు; తమ్ = వానిని; క్షేత్రజ్ఞః = క్షేత్రజ్ఞుడు; ఇతి = అని; ప్రాహుః = అంటారు.
తా ॥ [పూర్వం “వారిని నేను మృత్యుసంసారసాగరం నుండి సముద్ధరిస్తాను” (12-7) అని భగవంతుని ప్రతిజ్ఞ. జ్ఞానం లేకుంటే సంసారోద్ధరణం సంభవం కాదు. కాబట్టి, ఈ ప్రకృతి-పురుష వివేకాధ్యాయం ఆరంభించబడుతోంది. ఏడవ అధ్యాయంలో పర-అపరములనే ప్రకృతి ద్వయం పేర్కొనబడింది; దీనిని ఎరుగకపోవడం వల్లే, జీవభావాన్ని పొందిన చిత్-అంశకు సంసృతి ఏర్పడుతోంది. ఈ ప్రకృతుల నుండే జీవభోగార్థం, ఈశ్వరుడు సృష్టి యందు ప్రవర్తిల్లుతున్నాడు. క్షేత్ర-క్షేత్రజ్ఞులనబడే ఆ పరాపర ప్రకృతులు రెండూ వేరు. వాటి తత్త్వాన్ని నిరూపించడానికి-] శ్రీభగవానుడు పలికెను: అర్జునా! భోగాయతనమైన* ఈ శరీరాన్నే (సంసారోత్పత్తి భూమియగుట వల్ల) ‘క్షేత్రం’ అని అంటారు. ఎవడు ఈ శరీరాన్ని* (నేను నాది అని) తెలుసుకుంటున్నాడో, అంటే స్వాభావిక జ్ఞాన విషయంగా గాని ఔపదేశిక జ్ఞాన విషయంగా గాని ఒనర్చుచున్నాడో* , అతనిని (కృషీవలుని వలే ఫలభోక్త అగుటచే) క్షేత్రక్షేత్రజ్ఞ వేత్తలు* ‘క్షేత్రజ్ఞుడు’ అని అంటున్నారు.