వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాండవానాం ధనంజయః ।
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ॥ 37
వృష్ణీనామ్, వాసుదేవః, అస్మి, పాండవానామ్, ధనంజయః,
మునీనామ్, అపి, అహమ్, వ్యాసః, కవీనామ్, ఉశనా, కవిః.
అహమ్ = నేను; వృష్ణీనామ్ = వృష్టి వంశీయులలో (యాదవులలో); వాసుదేవః = కృష్ణుణ్ణి; అస్మి = అయి ఉన్నాను; పాండవానామ్ = పాండవులలో; ధనంజయః = అర్జునుణ్ణి; మునీనామ్ = సర్వపదార్థ జ్ఞానులలో; వ్యాసః = వేదవ్యాసుణ్ణి; కవీనాం అపి = సూక్ష్మార్థ వివేకం గలవారిలో; కవిః ఉశనా = శుక్రుడనే కవిని; అస్మి = అయి ఉన్నాను.
తా ॥ యాదవులలో నేను శ్రీకృష్ణుణ్ణి, పాండవులలో అర్జునుణ్ణి, వేదార్థ మననశీలురు అయిన వారిలో వేదవ్యాసుణ్ణి, సూక్ష్మార్థ వివేకం గలవారిలో శుక్రుణ్ణి.
వ్యాఖ్య:-
పాండవులలో నేను అర్జునుడిని, మునులలో వ్యాసుడిని అని భగవంతుడే స్వయంగా చెప్పాడు. దీనిని బట్టి గీతను విన్న అర్జునుడు, దానిని రాసిన వ్యాసుడు… వీరిద్దరూ సాక్షాత్తు ఆ భగవంతుడి స్వరూపాలే అని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే భగవద్గీతకు అంతటి గొప్పతనం (మహత్యం) లభించింది.
“కవీనాముశనాకవిః’ – ‘కవి’ అంటే గొప్ప జ్ఞానం కలిగినవాడు (జ్ఞాని) అని అర్థం. ‘ఉశనాకవి’ అంటే భృగు మహర్షి కుమారుడైన శుక్రాచార్యుడు.