మాతృదేవి జయరాంబాటిలో ఉంటున్నారు. మాతృదేవి ఇంట్లో జగద్ధాత్రి పూజ. అందువల్ల హడావిడిగా ఉన్నారు. “దేవీ పూజ ఎలా జరగబోతుందో!” అని అప్పుడప్పుడూ అంటున్నారు. గురుదేవుల నిత్యపూజను ఉదయమే చేసేశారు. అనేక పండ్లు, తీపిపదార్థాలు నైవేద్యంగా అర్పించారు. నైవేద్యం అర్పిస్తున్నప్పుడు గురుదేవులతో, “ఇదిగో చూడండి! ఈ రోజు దేవీపూజ. తొందరగా ఆహారం స్వీకరించండి. అక్కడికి వెళ్లాలి” అన్నారు. తర్వాత హీనస్వరంలో ఏమో చెప్పారు. ఎవరో వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆ తర్వాత పూజ ముగించుకుని జగద్ధాత్రి పూజ జరిగేచోటికెళ్లి కూర్చున్నారు. పూజ సమాప్తమయ్యేదాకా ఆరాధనా పూర్వక దృక్కులతో దేవీవిగ్రహాన్ని చూస్తూ కూర్చున్నారు.
ఒక రోజు కోల్పారా నుండి కొన్ని వస్తువులను, పూజ కోసం పువ్వులను కూడా తీసుకుని జయరాంబాటికి వచ్చాను. నేను రాగానే మాతృదేవి, “నువ్వు వస్తావని ఇప్పుడే అనుకున్నాను. నువ్వు వచ్చిన తర్వాత స్నానానికి వెళ్లాలను కున్నాను” అని చెప్పారు. నేను తీసుకొచ్చిన వస్తువుల నన్నిటినీ తీసుకొని తినడానికి మరమరాలు ఇచ్చారు. తర్వాత స్నానం చేయడానికి గుడ్డలు మార్చుకొని, ఒంటికి చమురు రుద్దుకుంటూ కోల్పారా మఠంలోని మా అందరి గురించీ మాట్లాడారు. తర్వాత స్నానంచేసి, పూజ చేయడానికి వెళ్లారు.
ఒక రోజు సాయం సమయం. నేను ఎలా ఆధ్యాత్మిక సాధనలు చేయాలో అడగడానికి మాతృదేవి వద్దకు వెళ్లాను. అప్పుడామె వసారాలో కూర్చొని జపమాలతో జపం చేసుకుంటున్నారు. నేను వారిని సమీపించినప్పుడు అడుగ దలచుకున్నదంతా మరచిపోయాను. “అమ్మా! నా బాధ్యతను స్వీకరించండి” అని మాత్రం చెప్పగలిగాను. అంతలో ఏడుపు వచ్చేసింది. “ఏడవవద్దు నాయనా! నీ బాధ్యతను ఎప్పుడో నేను తీసుకొన్నానే! గురుదేవులు కూడా ఏనాడో స్వీకరించారు. కలవరమెందుకు?” అంటూ నన్ను ఊరడించారు మాతృదేవి.
“బ్రహ్మచర్యదీక్ష పుచ్చుకో” అంటూ మాతృదేవి నాతో అన్నట్లు నాకు కలవచ్చింది. ఈ విషయం స్వామి తురీయానందగారికి విన్నవించినప్పుడు ఆయన, “ఈ విషయం నువ్వు మాతృదేవితోనే విన్నవించు” అన్నారు. కొన్ని రోజులతర్వాత కోల్పారాలో మాతృదేవితో ఈ విషయం చెప్పాను. మాతృదేవి మృదువుగానవ్వారు. తర్వాత, “అలా అయితే ఉదయం నేను పూజ చేస్తున్నప్పుడు రా. ఒకకొత్తగుడ్డ కూడా తీసుకురా. నువ్వు రావడం ఎవరికీ తెలుపవద్దు” అన్నారు.
మర్నాడు ఉదయం వెళ్లాను. కానీ మాతృదేవి అంతలోపల పూజ ముగించుకొని, అల్పాహారం తీసుకొని, వసారాలో కూర్చొని పొగాకు, బొగ్గుతో పళ్లను శుభ్రంచేసుకుంటున్నారు. నన్ను చూడగానే చటుక్కున నాలుక కరచుకుని, “అరేరే, పూజ అయిపోయిందే. నీ విషయం మరచిపోయాను. ఫరవాలేదు. ముఖం కడుక్కునివస్తాను. నువ్వు వెళ్లి పూజగదిలో కూర్చో” అన్నారు.
కొంత సేపటికి మాతృదేవి పూజగదికి వచ్చి, “తలుపులు మూసెయ్యి.వాళ్లు (స్త్రీలు) ఉన్నారు” అన్నారు. తర్వాత నాతో, “నీ చొక్కా విప్పెయ్యి” అన్నారు.నేను చొక్కా తీసిన తర్వాత, పూజాపాత్ర నుండి తీర్థం తీసుకొని నా ఒంటి మీద చల్లారు. నా నాభి, ఛాతీ, శిరస్సు మీద చేయిపెట్టి ఏదేదో చెప్పారు. కొత్తగుడ్డను చేతులలో తీసుకుని,” ఇదుగో చూడు. గురుదేవులు కూడా ఇక్కడ ఉన్నారు. ‘నా పూర్తి బాధ్యతను ఈ రోజు మీకు సమర్పిస్తున్నాను’ అని చెప్పు” అన్నారు.తర్వాత గుడ్డలు నా కందిస్తూ. “ఈ రోజు నీ ప్రాణానికే సన్న్యాసం ఇచ్చాను” అన్నారు. అప్పుడు నెలకొన్న పారవశ్యంలో మాతృదేవికి ప్రణమిల్లడం కూడామరచిపోయాను. ఈ పారవశ్యం కొన్ని రోజులపాటు అట్లే కొనసాగింది.
మాతృదేవి రాధూతో కోల్పారాలో ఉంటున్నారు. ఆమెకు పిచ్చి పట్టింది.గర్భిణియైన ఆమెకు ప్రసవసమయం దగ్గర పడుతోంది. ఆమె శ్రేయస్సు కోసంమాతృదేవి కొలవని దైవాలు లేవు, చేయని ప్రార్థనలు లేవు.
ఒక రోజు మాతృదేవి నాతో, “ఇదిగో చూడు నాయనా! హనుమాన్ చరితంపుస్తకం చూచి మంచిచెడ్డలు తెలుసుకోవచ్చు అంటున్నారు. నువ్వెందుకు రాధూ విషయం చూడకూడదు?” అన్నారు. నేను ఒక పుస్తకం కొన్నాను. అందులో రంగుల గళ్లు ఉన్నాయి. కళ్లు మూసుకొని వేలు ఉంచిన గడికి తగినట్లు ఫలం చెప్పబడింది. మాతృదేవి తమ వేలు ఉంచారు. నేను ఫలం గురించి చదివాను. అన్నీ సవ్యంగానేజరుగుతాయి అని అందులో వ్రాసివుంది. మాతృదేవి ఎంతో సంతోషంతో, “అలా అయితే రాధూకు తప్పకుండా నయమవుతుంది. ఆంజనేయస్వామి చెప్పారంటే అది తప్పక ఫలిస్తుంది” అన్నారు.
కోల్పారా మఠంలో ఒకసారి అధ్యక్షునికీ ఇతర సాధువులకూ ఏదో విషయంలోభేదాభిప్రాయం ఏర్పడింది. మాతృదేవికి ఇదంతా తెలుసు. ఒక రోజు మాతృదేవితమ్ముని భార్య ఈ విషయం నన్ను అడిగారు. కానీ నేను బదులు చెప్పడానికిముందే మాతృదేవి, “నువ్వు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి?” అంటూ ఆవిషయాన్ని అక్కడే త్రుంచేశారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత నాతో, “ఇదిగో చూడు!అన్ని పరిస్థితులలోనూ సర్దుకుపోవాలి. ‘శ, ష, స – అన్నిటినీ ఓర్చుకోవాలి’ అనేవారు గురుదేవులు. వారు ఉండనే ఉన్నారు” అన్నారు.
మాతృదేవి పాదముద్రలున్న గుడ్డ ఒకటి ఒక భక్తురాలి వద్ద ఉంది. ఒక రోజు అది కనబడకుండాపోయింది. ఆ కారణంగా స్త్రీల మధ్య పెద్ద గందరగోళంచెలరేగింది. అది విన్న మాతృదేవి నవ్వుతూ, “దీని కోసం ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నారు? నేను ఉన్నాను కదా! ఎన్ని ముద్రలు కావాల్సినా తీసుకోండి” అన్నారు. తర్వాత తామే వెళ్లి లక్క అద్దకం రంగు తీసుకొచ్చారు. పాదముద్రలనుతామే తీసి ఇచ్చారు.
ఒక రోజు సాధువు ఒకరు మాతృదేవి వద్దకు వెళ్లారు. ఆయన వద్దకాగితం, కలం ఉన్నాయి. ఆయన మాతృదేవితో “అమ్మా! ప్రస్తుతం మఠంలో ఒకేఒక ఆవు మాత్రమే ఉంది. అది ఇచ్చే పాలు అందరికీ చాలడం లేదు. అందువలన మరొక ఆవును కొనాలనుకొంటున్నాను. మీరు అనుమతిస్తే డబ్బు కోసం ఫలానావారికి ఉత్తరం వ్రాయాలని అనుకుంటున్నాను” అన్నాడు. అందుకు మాతృదేవి, “సరే వ్రాయి! నన్ను సూత్రధారిగా చేసుకొని వ్రాయాలని భావిస్తున్నావు? వ్రాసినవెంటనే డబ్బులు కురుస్తాయి! అంతే కదా!” అన్నారు. ఆ సాధువు వెళ్లిపోయినతర్వాత మాతృదేవి నవ్వుతూ ఇలా అన్నారు: “ఆతడి ఆశ చూడు! ఒకసారి నేనుబాబూరామ్కు కలకండ పానకం ఇచ్చాను. అప్పుడు ఆతనికి కడుపులో బాగాలేదు.గురుదేవులు అది గమనించి ‘నువ్వు బాబూరామ్కు ఏం ఇచ్చావు?’ అని అడిగారు. ‘కలకండ పానకం’ అన్నాను నేను. అందుకు గురుదేవులు, ‘వాళ్లు సన్న్యాసులుకావలసిన వారు. వాళ్లకు ఇవన్నీ అలవాటు చేయకు!’ అన్నారు.”
నేను: నేను ఎలా ఆధ్యాత్మిక సాధనలు చేయాలి?
మాతృదేవి: గురుదేవులను ప్రార్థిస్తే సకలమూ సిద్ధిస్తుంది.
ఈ జవాబుతో నాకు తృప్తి కలగలేదు. అందువలన మళ్లీ అదే ప్రశ్న అడిగాను. మాతృదేవి చిరుకోపంతో గంభీరంగా, “నాయనా! ఇంతకన్నా మరేమీ నాకు తెలియదు. గురుదేవులను ఏది అడిగినా అది లభిస్తుంది” అన్నారు.
ఒక రోజు కోల్పారా మఠంలో ఒక పిచ్చివాడు వచ్చి గందరగోళం సృష్టిస్తు న్నాడు. అది చూసి మాతృదేవి ఇలా అన్నారు:
“ఇదిగోచూడు! ఏదో పిచ్చివాళ్ల మహాసభ లాగుంది. మేము వేంచేశాం కదా! కనుకనే పిచ్చివాళ్లందరూ ఇక్కడికి వస్తున్నారు. రాధూ పిచ్చిది. ఆమె తల్లి పూర్తిగా పిచ్చిది. వీళ్లందరూ కలిసే నా కుటుంబం.”
కొంతసేపు మౌనంగా ఉండి, ఒక పాటలోని కింది చరణాలను వచించారు:
ఇంటికి చండీదేవి వేంచేస్తుంది
ఆమె మహిమలను పాడుదాం
యోగులూ త్యాగులూ జటాధారులూ
ఎంతోమంది వస్తారు.
జగదంబ ఆశ్రమం : కోల్పారా