ఒకసారి నేను కడుపునొప్పితో చాలా బాధపడుతున్నాను. కాస్త మగతగా కూడా ఉంది. అప్పుడు ఎవరో నాతో, ‘నీ గురువు పాదతీర్థం పుచ్చుకొంటే నయమవుతుంది’ అని చెప్పినట్లు అనిపించింది. మర్నాడే నేను జయరాంబాటికి వెళ్లి మాతృదేవి పాదతీర్థం సేవించాను. తరువాత మాతృదేవితో, “అమ్మా! మీకు పాదపూజ చేయాలని ఎంతగానో అభిలషిస్తున్నాను. కాని అంతలోపల తీర్థం పుచ్చుకునేశాను” అన్నాను. అందుకు మాతృదేవి, “అందులో తప్పేముంది? లోపలికిరా” అన్నారు.
పాదపూజ చేసిన తరువాత మాతృదేవి పాదపద్మాలను తల మీద పెట్టు కున్నాను.
మాతృదేవి: హా! మూర్ఖుడా! పాదాలను తల మీద పెట్టుకోవచ్చా? తల గురుదేవులు నెలకొనే చోటు.
నేను: అమ్మా: నేను గురుదేవులను చూడలేదే!
మాతృదేవి: గురుదేవులు భగవంతుడే!
నేను: గురుదేవులు భగవంతులయితే మీ రెవరు?
మాతృదేవి: నేను మరెవరిని?
నేను: మీరు తలచుకుంటే నాకు గురుదేవులను చూపగలరు కదా!
మాతృదేవి: గురుదేవులు నరేంద్రుని స్పృశించినప్పుడు ఆతను గావుకేక పెట్టాడు. సాధనలు చేయి, తపస్సు చేయి! అప్పుడు ఆయనను దర్శించగలవు.
నేను: మిమ్మల్నే గురువుగా పొందిన వ్యక్తికి వేరే సాధనలు ఎందుకు?
మాతృదేవి: అది సరే! కానీ ఒక్క విషయం! ఇంట్లో వంటకు కావలసిన సామగ్రి అంతా ఉన్నా, వండితేనే కదా భోజనం చేయగలం! ప్రతి ఒక్కరూ వంట చేసుకొనే భోజనం చేయాలి. సత్వరమే వంటచేసేవాడు శీఘ్రంగా భోజనం చేయవచ్చు. అందువలన కొందరు ఉదయం భోజనం చేస్తారు. కొందరు సాయంత్రం చేస్తారు. కొందరు బద్ధకం కారణంగా పస్తుండిపోవాల్సి వస్తుంది.
నేను: అమ్మా! మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు.
మాతృదేవి: సాధనలూ తపస్సూ ఎవరు ఎంత ఎక్కువగా అనుష్ఠిస్తారో అంత త్వరగా భగవద్దర్శనం పొందుతారు. కాస్తకాస్తగా అభ్యసించినా కూడా ఆయన దివ్యదర్శనం లభించే తీరుతుంది. కానీ అది అవసాన సమయమై ఉంటుంది. ఏమీ చెయ్యకుండా, కేవలం ఆర్భాటం చేసేవారికి ఆలస్యంగానే లభిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలను అనుష్ఠించడానికే నువ్వు సన్న్యాసివైనావు. సదా సాధనలలో లయించ డానికి నీకు సాధ్యం కావడం లేదు. కనుక గురుదేవుల కైంకర్యంగా భావించి పని చేయి. కడుపునొప్పి నిన్ను అప్పడప్పుడు బాధపెట్టడం వల్ల నువ్వు కఠోరమైన తపోమయజీవితం గడపడాన్ని మానుకోవాలి. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండు. ఈ కడుపునొప్పి వ్యక్తిని చంపదు కానీ ఎంతో బాధ కలిగిస్తుంది.
కోల్పారా మఠంలో నేను ఉంటున్నప్పుడు రోజుకు రెండుసార్లు వంటగదిని శుభ్రం చేయడమూ, ఇత్తడి పాత్రలను పరిశుభ్రం చేయడమూ నా పని. ఒకసారి వానాకాలం. ఇత్తడి పాత్రలను తోమి నా చేతులు పుళ్లయినాయి. అందువల్ల ఎంతో బాధపడ్డాను. ఇలావుండగా ఒక రోజు జయరాంబాటికి వెళ్లాను.
మాతృదేవి: బాగున్నావా నాయనా?
నేను: ఏదో ఉన్నాను.
మాతృదేవి: ఏమిటి నాయనా! మళ్లీ కడుపునొప్పి వచ్చిందా?
నేను: లేదమ్మా! కడుపునొప్పి లేదు కానీ చేతులు పుళ్లయినాయి. పాత్రలు తోమడం కష్టంగా ఉంది!
మాతృదేవి: పులుపు పదార్థాలను వదులుకోగోరిన ఒకడు చింతచెట్టు క్రింద ఇల్లు కట్టుకున్న కథలా ఉంది నీ పరిస్థితి. భగవంతుని పవిత్రనామాన్ని జపించేందుకు నువ్వు ప్రపంచాన్ని త్యజించావు. కానీ ఇక్కడ పనులనే పేరిట మరో ప్రపంచాన్ని నిర్మించి అందులో మునిగి పడివున్నావు. కుటుంబాన్నీ, బంధుబాంధవ్యాలనూ వదలుకొని మఠంలో చేరతారు. కానీ దానినే గట్టిగా పట్టుకుని వదలి వెళ్లడానికి ఇష్టపడరు. నీకు ఆరోగ్యం బాగా లేదు. ‘దహర్ కుండ్’ కు వెళ్లు. అక్కడ విద్యార్థులకు చదువు నేర్పు. చేతనయినంత జపధ్యానాలు అనుష్ఠించు.
నేను: అమ్మా! నేను ఏదైనా ఏకాంతస్థలానికి వెళ్లి పూర్తిగా తపోమయ జీవితం గడపాలని అనుకుంటున్నాను. కానీ ఆరోగ్యం బాగుండడంలేదు.
మాతృదేవి: ప్రస్తుతానికి చిన్నచిన్న పనులు చేస్తూవుండు. బలీయమైన ప్రేరణ కలిగినప్పుడు అలాంటి జీవితం గడపవచ్చు.
నేను: జపం తప్పక చేస్తాను. కానీ మనస్సు ఏకాగ్రం చెందడం లేదు.
మాతృదేవి: మనస్సు ఏకాగ్రమైనప్పటికీ, కాకపోయినప్పటికీ నువ్వు మాత్రం జపంచేయడం మానకు. ప్రతిరోజూ నిర్ణీత సంఖ్యలో జపం చేసితీరాలి. ఎంత చేస్తే అంత మంచిది.
నేను: అమ్మా! నాకు గురుదేవుల దివ్యదర్శనం కలగాలని ఆశీర్వదించండి.
మాతృదేవి: నువ్వు స్వప్నంలో చూడనే చూశావు కదా! ప్రత్యక్షంగా కూడా చూస్తావులే!
మరొక రోజు. మాతృదేవికి ఏదైనా సేవ చేయగలిగితే ఎంత ఆనందంగా ఉంటుందో అనుకుంటూ జయరాంబాటికి వెళ్లాను. నేను వెళ్లినప్పుడు మాతృదేవి తమ ఇంటి వసారాలో కాళ్లు చాపుకొని కూర్చొనివున్నారు. కాళ్లకు రాచే నూనె ఒక గిన్నెలో ప్రక్కన ఉంది. నేను వెళ్లి ఆమె కాళ్లకు నూనె రాయసాగాను. “కాళ్లనొప్పి భరించలేకున్నాను. కొద్దిగా ఒత్తి రాయి నాయనా!” అన్నారు మాతృదేవి. దాదాపు 25 నిమిషాలు అలా సేవ చేశాను. అప్పుడు మాతృదేవి, “ఇప్పుడు తృప్తి కలిగింది కదా! ఇక నేను స్నానానికి వెళతాను. పూజ చేయాలి. ఏమైనా తిన్న తరువాతే కదా తిరిగి వెళతావు?” అని అడిగారు.
నేను: లేదమ్మా! వెంటనే వెళ్లాలి! మరో రోజు వస్తాను.
మాతృదేవి: వద్దు. వెంటనే వెళ్లవద్దు. వెంటనే వెళ్లిపోవాలని కేదార్ నిన్ను ఆదేశించినట్లు అనిపిస్తోంది. అంతేనా? నువ్వు నా మాట వింటావా లేక కేదార్ మాట వింటావా? కేదార్ అడిగితే, మాతృదేవియే వద్దన్నారని చెప్పు.