ఉద్బోధన్, మార్చ్ / ఏప్రిల్, 1914
ఒకసారి మా అమ్మను, మాతృదేవి దర్శనానికి తీసుకువెళ్లగోరాను. కానీ ఆ రోజు బాగాలేదని మానుకొన్నారు. ఈ విషయం మాతృదేవికి తెలిపాను. అప్పుడు మాతృదేవి, “నాయనా! తిథివారాలు చూడకుండా తీర్థ స్థలాలకు పోతే, అప్పటికే సముపార్జించిన పుణ్యమంతా హరించుకుపోతుందని చెబుతారు. అదే సమయంలో సత్కార్యాలను వాయిదా వేయరాదని కూడా చెబుతారు” అని చెప్పారు.
మాతృదేవి మాటలు నాకు అర్థం కాలేదు. అందువలన, “అమ్మా! ఇటువంటసందర్భాలలో ఏం చేయాలి?” అని అడిగాను.
మాతృదేవి: అకాల సమయాలలో తీర్థ స్థలాలకు వెళ్లకూడదని కొందరంటారు. కానీ ఒక విషయం గమనించు – వారం వర్జ్యం చూసి సత్కార్యాలు వాయిదా వేయవచ్చు. కాని కాలుడు వారం, వర్జ్యం లెక్కించా వస్తాడు? మరణానికి కచ్చితమైన సమయం లేనట్లే, సత్కార్యానికి కూడా ముహూర్తం నిర్ణయించుకోవడం సబబు కాదు. సందర్భం లభించినప్పుడు మనం వారం, వర్జ్యం చూడకుండా సత్కార్యాలను తక్షణమే నిర్వర్తించాలి.”
జయరాంబాటి, మార్చ్ / ఏప్రిల్ 1916
సాయంత్రం మాతృదేవిని దర్శించుకొనే అవకాశం చిక్కింది.
నేను: అమ్మా! కల్పవృక్షం వద్దకు వెళ్లినా మనకు కావలసింది మనం అడగా లంటున్నారు. కానీ తల్లిని పిల్లలు ఏం అడుగుతారు? వారికి కావలసింది ఏమిటో గ్రహించి తల్లే స్వయంగా చేసిపెడుతుంది కదా!
మాతృదేవి: మనిషి బుద్ధి ఎంత అల్పం! వాడికి కావలసింది ఒకటైతే, ఇంకేదో కోరతాడు. చివరకు శివుణ్ణి చేయబోయి కోతి బొమ్మ రూపొందిన చంద మవుతుంది. భగవంతుణ్ణి శరణుజొచ్చి జీవించడం మంచిది. మనకు ఎప్పుడు ఏది అవసరమే, అప్పుడు దాన్ని ఆయన ప్రసాదిస్తాడు. కానీ భక్తిని ప్రసాదించమనీ, వాంఛారాహిత్యాన్ని ప్రసాదించమనీ వేడుకోవాలి. ఇవన్నీ కోర్కెల క్రిందికి రావు.
నేను: ఇక్కడికి వచ్చేవారికి ఇదే అంతిమ జన్మ అని గురుదేవులు వచించి ఉన్నారు. కానీ సర్వసంగపరిత్యాగులు కాకుంటే ముక్తి లభించదని స్వామీజీ అన్నారు. గృహస్థులకు మార్గాంతరమేమిటి?
మాతృదేవి: గురుదేవులు వచించిందీ నిజమే, స్వామీజీ చెప్పిందీ నిజమే. గృహస్థులు బాహ్యంగా సన్న్యాసం స్వీకరించనక్కరలేదు. వారికి కావలసింది ఆంతరిక సన్న్యాసం. అది కూడా సహజంగా సిద్ధించాలి. కానీ కొందరికి బాహ్యమైన సన్న్యాసం కూడా అవసరమై ఉంటుంది. మీ రెందుకు భయపడాలి? గురుదేవులను శరణుజొచ్చి జీవించండి. గురుదేవులు నీతో ఉంటున్నారనే నిజాన్ని ఎప్పుడూ విస్మరించకు.
జయరాంబాటి – ఒక దృశ్యం