స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ ।
నభశ్చ పృథివీంచైవ తుములోఽభ్యనునాదయన్ ॥ 19
సః, ఘోషః, ధార్త రాష్ట్రాణామ్, హృదయాని, వ్యదారయత్,
నభః, చ, పృథివీమ్, చ, ఏవ, తుములః, అభ్యనునాదయన్.
సః = ఆ; తుములః = సంకులమైన; ఘోషః = శంఖధ్వని; నభః = ఆకాశాన్ని; పృథివీం చ = భూమిని; అభ్యనునాదయన్ = ప్రతిధ్వనింప చేసి; ధార్తరాష్ట్రాణాం = దుర్యోధనాదుల; హృదయాని = హృదయాలను; వ్యదారయత్ = అదరగొట్టెను.
తా ॥ ఆ భీకర శంఖధ్వనులు భూనభోంతరాలలో ప్రతిధ్వనించి దుర్యోధనాదుల హృదయాలను అదరగొట్టాయి.
వ్యాఖ్య:-
శ్రీకృష్ణుడు, అర్జునుడు మొదలైనవారు చేసిన శంఖనాదాలు దుర్యోధనుడు మరియు అతని సైన్యం గుండెలను బద్దలు చేశాయని చెప్పడం ద్వారా—ఆ శబ్దానికే వారి సగం ప్రాణాలు పోయాయని, వారిలోని ఉత్సాహం పూర్తిగా నీరుగారిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది .