విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ ।
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ॥ 13
విధిహీనమ్, అసృష్ట అన్నమ్, మంత్రహీనమ్, అదక్షిణమ్,
శ్రద్ధావిరహితమ్, యజ్ఞమ్, తామసమ్, పరిచక్షతే.
విధిహీనమ్ = శాస్త్రవిధిశూన్యమును; అసృష్ట అన్నమ్ = అన్నదాన రహితమూ; మంత్రహీనమ్ = మంత్రవర్జితమూ; అదక్షిణమ్ = దక్షిణరహితమూ; శ్రద్ధావిరహితమ్ = శ్రద్ధాహీనమూ అయిన; యజ్ఞమ్ = యజ్ఞాన్ని; తామసమ్ = తామసమని; పరిచక్షతే = చెబుతున్నారు.
తా ॥ శాస్త్రవిధి, అన్నదానం, మంత్రం,* దక్షిణ, శ్రద్ధ – ఇవి లేని యజ్ఞాన్ని తామస యజ్ఞం అని చెబుతున్నారు.
వ్యాఖ్య:-
‘అసృష్టాన్నమ్’ – అన్నదానం వేదాంత ఆచరణలో ఒక ముఖ్యమైన భాగం. ప్రతి జివిలో పరమాత్మ ఉన్నాడని నిజంగా అనుభవించినవాడు తప్పకుండా ఇతరులకు ఉపకారం చేస్తాడు — అదే ఆచరణవేదాంతం అన్నమాట. అందుకే పెద్దలు అన్ని పుణ్యకార్యాలలో, శ్రద్ధకార్యాలలో, యజ్ఞాలలో అన్నదానాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేశారు. అన్నదానం ద్వారా “ప్రతీ ప్రాణి మనవలెనే” అన్న భావం మనలో పుట్టుతుంది, ఇది ఒక గొప్ప సాధన. ఇప్పుడీ పవిత్రమైన భాగం లేకుండా జరిగే యజ్ఞం తామస కర్మ అని భగవంతుడు చెప్పారు.
‘అదక్షిణమ్’ అంటే దక్షిణ లేకుండా చేసే యజ్ఞం. ఇది పైన చెప్పిన అన్నదానానికి సమానమే. యజ్ఞంలో లేదా పుణ్యకార్యంలో మన సంపదలో కొంత భాగాన్ని ఋత్విక్కులకు (యజ్ఞాధికారులకు), పేదవారికి, దరిద్రనారాయణులకు దక్షిణగా ఇవ్వాలి. ఇది త్యాగభావానికి సూచకం.
అందువల్ల ఇలాంటి త్యాగం లేకుండా చేసే యజ్ఞం తామస యజ్ఞమని గీతాచార్యుడు చెప్పారు.
‘శ్రద్ధావిరహితమ్’ అంటే శ్రద్ధ లేకుండా చేసే పని. ఏ పని అయినా మనం భక్తితో, శ్రద్ధతో, సంపూర్ణ విశ్వాసంతో చేస్తేనే మంచి ఫలితాన్ని ఇస్తుంది. శ్రద్ధ లేకుండా చేసే పని చేయకపోయినట్లే అని, ఈ అధ్యాయంలో ముందే భగవంతుడు చెప్పబోతున్నారు (“అశ్రద్ధయా హుతం…” అనే శ్లోకంలో). అందుకే మనం తామస (అజ్ఞాన) స్వభావాన్ని వదిలి, శ్రద్ధతోనే అన్ని పనులు చేయాలి. అప్పుడు మాత్రమే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.