మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః ।
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ॥ 7
మమ, ఏవ, అంశః, జీవలోకే, జీవభూతః, సనాతనః,
మనః షష్ఠాని, ఇంద్రియాణి, ప్రకృతిస్థాని, కర్షతి.
(ఏమన) సనాతనః = పురాతనమైన; మమ ఏవఅంశః = నా అవయవమే (ఏకదేశం); జీవ లోకే = సంసారంలో; జీవ భూతః = కర్త, భోక్తయని ప్రసిద్ధి చెంది జీవుడైనదీ; ప్రకృతి స్థాని = ప్రకృతియందు అంటే కర్ణశష్కుల్యాది స్థానాలలో వెలయు; మనః షష్ఠాని = మనస్సుతో గలసి ఆరు; ఇంద్రియాణి = ఇంద్రియాలను; కర్షతి = ఆకర్షిస్తుంది.
తా ॥ (తదీయ ధామప్రాప్తి పొందినవారు తిరిగి రారు అని చెప్పబడింది; సుషుప్తి ప్రళయాలలో తత్ప్రాప్తి అందరికీ కలుగుతోందని వినికిడి.* అలాగైతే మరి సంసారి ఎవడు? అని ఆశంకించి సంసారిని చూపుతున్నాడు 🙂 నా అవిద్యా కల్పితాంశమే లోకంలో కర్తయూ భోక్తయూ అయిన జీవుడని ప్రసిద్ధి.* ఇతడే సుషుప్తి ప్రళయ కాలాలలో ప్రకృతియందు లీనములైన ఇంద్రియ పంచకాన్ని, మనస్సును* మళ్ళీ సంసారోప భోగార్థం ఆకర్షిస్తున్నాడు.* [సుషుప్తి, ప్రళయాలలో నా అంశమైన జీవుడు నన్నే పొందుతున్నప్పటికీ, సప్రకృతికుడైన నా యందు లీనుడవుతాడు. ఇటువంటి వారు ‘అవ్యక్తం నుండి మళ్ళీ ప్రభవిస్తున్నారు’ (8-18) అని చెప్పబడింది. కనుక, అవిద్వాంసుడు మళ్ళీ సంసారానికి వెలువడుతూ, ప్రకృతి యందు లీనములై ఉన్న స్వోపాధిభూతములైన ఇంద్రియాలను ఆకర్షిస్తున్నాడు. శుద్ధస్వరూప ప్రాప్తి పొందిన విద్వాంసుడు, బ్రహ్మపద ప్రాప్తియే పునర్జన్మ నాశకమని చెప్పిన రీతిగా, తిరిగి రాడు.]
Mundaka Upanishad 2.1.1 – “సౌమ్యుడా! ఇది నిజం. జ్వాలలు లేస్తున్న మంటనుండి అదే స్వభావం గల వేలాది నిప్పురవ్వలు ఏ విధంగా ఉద్భవిస్తాయో, ఆ విధంగానే అవినాశియైన భగవంతుని నుండి అనేక రకాలైన ప్రాణులు ఉద్భవిస్తున్నాయి. ఆయనలోనే లయమూ అవుతున్నాయి.”
భగవంతుడనే మహోజ్వల జ్యోతినుండి ఉద్భవించిన జ్వాలలం మనం. అంటే మనం దైవాంశసంభూతులం, భగవంతుని సంతానం. దీనికి అర్థం ఏమిటి? ఇది మనకు అందించే సందేశం ఏమిటి? స్వామి వివేకానంద ఇలా అంటున్నారు:
“తాను ఎందుకూ ఉపయోగపడనని రాత్రింబగళ్లు భావించే వ్యక్తి నుండి ఎలాంటి మేలు ఒనగూడదు. ‘నేను వేదనాభరితుడను, నిమ్నుడను, ఎందుకూ పనికిరానివాణ్ణి’ అని రేయింబగళ్లు భావించుకొంటూ ఉంటే, ఆ వ్యక్తి ఎందుకూ పనికిరాని వ్యక్తిగా అవుతాడు. ‘అవును, నేను దేనినైనా సాధిస్తాను’ అని మీరు భావిస్తే, మీరు అలాంటి వారు అవుతారు. అందుకు మారుగా ‘నే నెందుకూ పనికిరాని వాణ్ణి’ అని అహర్నిశలూ ఆ మాటనే జపిస్తూ ఉంటే అట్లే ఎందుకూ పనికిరానివాడవుతారు. మీరు మనస్సులో నిలుపుకోవలసిన నగ్నసత్యం ఇది: ‘మనం సర్వశక్తిమంతుడైన భగవంతుని బిడ్డలం. పరిధులు లేని దివ్యాగ్ని జ్వాలలం మనం, మనం ఎలా సున్నలం అవుతాం? మనమే సమస్తమూ. ఏది చేయడానికైనా మనం సిద్ధంగా ఉన్నాం. మనం దేనినైనా సాధించగలం.’”