శ్రీభగవానువాచ :
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ ।
యద్ జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః ॥ 1
పరమ్, భూయః, ప్రవక్ష్యామి, జ్ఞానానామ్, జ్ఞానమ్, ఉత్తమమ్,
యత్, జ్ఞాత్వా, మునయః, సర్వే, పరామ్, సిద్ధిమ్, ఇతః, గతాః.
జ్ఞానానామ్ = జ్ఞానాలన్నింటిలో; ఉత్తమమ్ = శ్రేష్ఠమూ; పరమ్ = పరమార్థ విషయమూ అయిన; జ్ఞానమ్ = జ్ఞానాన్ని; యత్ జ్ఞాత్వా = దేనిని గ్రహించి; మునయః = మునులు; సర్వే = అందరూ; ఇతః = ఈ శరీర బంధం నుండి (విడివడి); పరాం సిద్ధిమ్ = మోక్షరూపమైన సిద్ధిని; గతాః = పొందారో (దాన్ని); భూయః = మళ్ళీ; ప్రవక్ష్యామి = చెబుతున్నాను.
తా ॥ [ ‘క్షేత్ర-క్షేత్రజ్ఞుల సంయోగం చేతనే సృష్టి’ (13-26) అని శ్రీభగవానుడు బోధించి ఉన్నాడు. ఈ సృష్టి నిరీశ్వర సాంఖ్యులు చెప్పే విధంగా స్వతంత్రం కాదు; ఈశ్వరేచ్ఛ చేతనే సంభవిస్తోంది అని నిరూపించడానికి పూర్వం ‘సత్ అసత్ –యోని జన్మలకు గుణ సంగమే కారణం’ (13-21) అని చెప్పబడిన సత్త్వాది గుణాలు కూర్చే సృష్టి వైచిత్ర్యాన్ని వివరింపబూని, ఈ విషయాన్నే ప్రశంసిస్తూ] శ్రీభగవానుడు పలికెను: సర్వోత్తమమూ, పరమాత్మ విషయకమూ అయిన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను. ఈ జ్ఞానాన్ని పొందిన మునులు దేహబంధం నుండి విడివడి, పరమసిద్ధి అయిన మోక్షాన్ని పొందారు.