యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ 30
యః, మామ్, పశ్యతి, సర్వత్ర, సర్వమ్, చ, మయి, పశ్యతి,
తస్య, అహమ్, న, ప్రణశ్యామి, సః, చ, మే, న, ప్రణశ్యతి.
యః = ఎవడు; సర్వత్ర = సర్వభూతాలలో; మామ్ = నన్ను; పశ్యతి = చూస్తాడో; మయి చ = మరియు, నాలో; సర్వమ్ = జగత్తునంతా, భూతాలన్నిటిని; పశ్యతి = చూస్తాడో; అహమ్ = నేను; తస్య = వానికి; న ప్రణశ్యామి = అదృశ్యుణ్ణి కాను; సః చ = మరియు, అతడు; మే = నాకు; న ప్రణశ్యతి = పరోక్షుడు కాడు. తా ॥ సర్వభూతాలలో నన్ను దర్శించేవాడూ, నాలో సర్వభూతాలనూ చూసేవాడూ అయిన పురుషునికి నేను అదృశ్యుడను కాను; అతడు నాకు అదృశ్యుడు కాడు. (ప్రత్యక్షుడనై కృపాదృష్టితో అతనిని అనుగ్రహిస్తాను)
వ్యాఖ్య:-
శ్రీకృష్ణ భగవంతుడు అందరి జీవులలో ఆత్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి, కిందటి శ్లోకంలో చెప్పిన యోగి (అందరినీ సమానంగా చూసేవాడు) అన్ని ప్రాణులలో కృష్ణుడిని (భగవంతుడిని) చూస్తాడు; అలాగే కృష్ణుడిలో సమస్త ప్రాణులను చూస్తాడు. ఇలా ఎవరైతే అన్ని ప్రాణులను భగవంతుడిలోనూ, భగవంతుడిని అన్ని ప్రాణులలోనూ చూస్తారో… వారికి ఇక దేవుడు కనిపించకుండా ఎలా ఉంటాడు? (ఎప్పుడూ తోడుగానే ఉంటాడు). ఇక్కడ ‘కనిపించడం’ లేదా ‘చూడటం’ అంటే కళ్లతో ఏదో ఒక వస్తువును చూసినట్లు కాదు. దానర్థం ‘సాక్షాత్కారం’ లేదా ‘అనుభూతి’ పొందడం. ఒకసారి జీవుడు పరమాత్మలో లీనమైపోయాక, ఇక వారిద్దరూ వేరు కాదు… ఒకే చైతన్యంగా మారిపోతారు. అలాంటప్పుడు ఇక ఒకరికి ఒకరు తెలియకుండా ఎలా ఉంటారు? (అంటే దేవుడు ఎప్పటికీ అతనికి దూరమవ్వడు ).
భగవంతుడి అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది? అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది. ఎవరైతే సమస్త ప్రాణులలో దేవుడిని, అలాగే దేవుడిలో సమస్త ప్రాణులను చూస్తారో… వాళ్ల మీదే భగవంతుడి పూర్తి దయ ఉంటుంది. ఎందుకంటే ‘అతను నాకు ఎప్పుడూ కనబడకుండా పోడు (నాకు దూరమవ్వడు)’ అని భగవంతుడే స్వయంగా చెప్పాడు. అంటే ఆ భక్తుడు దేవుడి దృష్టిలో పడ్డాడని, దేవుడికి అత్యంత ఇష్టమైనవాడని అర్థం. అందరూ దేవుడి పిల్లలే అయినప్పటికీ, తనను ఆశ్రయించిన వారిని ఆయన ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. వాళ్లే దేవుడి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తారు. నిజంగా వాళ్లు ఎంత అదృష్టవంతులో కదా! వాళ్ల జన్మ ధన్యమైనట్లే. ఈ లోకంలో చిన్న చిన్న అధికారుల మెప్పు కోసం నానా కష్టాలు (అగచాట్లు) పడే బదులు… భక్తి, వైరాగ్యం, ధ్యానం ద్వారా ఆ జగన్నాథుడి దృష్టిలో పడటం ఎంతో మేలు. మరి ఆ దేవుడి కరుణాకటాక్షాలు మనకు ఎలా దొరుకుతాయి? దానికి మార్గం ఒక్కటే: ధ్యానం ద్వారా అన్ని ప్రాణుల్లో పరమాత్మను, పరమాత్మలో అన్ని ప్రాణులను చూసే అనుభవాన్ని సంపాదించుకుంటే చాలు. అప్పుడు భగవంతుడి కృప వాళ్లపై వర్షంలా కురుస్తుంది. అలా కాకుండా మనుషుల మధ్య తేడాలు చూసేవాళ్లకు (భేదబుద్ధి ఉన్నవాళ్లకు) ఆ దయ ఎప్పటికీ దొరకదు.
ఈ శ్లోకంలో ‘యః’ (ఎవరైతే) అనే పదాన్ని వాడటం మనం ప్రత్యేకంగా గమనించాలి. దీని అర్థం ‘ఎవరైనా సరే’ అని. అంటే ఎవరైతే ఈ విధంగా సాధన చేస్తారో, వాళ్లు కచ్చితంగా భగవంతుడి అనుగ్రహం అనే గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ జాతి, మతం, కులం అనే తేడాలు అస్సలు లేవు. ఎవరైనా సరే అర్హులే.