తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ॥ 19
తస్మాత్, అసక్తః, సతతమ్, కార్యమ్, కర్మ, సమాచర,
అసక్తః, హి, ఆచరన్, కర్మ, పరమ్, ఆప్నోతి, పూరుషః.
తస్మాత్ = కనుక; అసక్తః = అనాసక్తుడవై; సతతమ్ = సర్వదా; కార్యమ్కర్మ = కర్తవ్యకర్మను; సమాచర = అనుష్ఠించు; హి = ఏమన; పూరుషః = మనుష్యుడు; అసక్తః = నిష్కాముడై; కర్మ ఆచరన్ = కర్మ ఆచరిస్తే; పరమ్ = మోక్షాన్ని; ఆప్నోతి = పొందుతాడు.
తా ॥ (ఆత్మరతియైన జ్ఞాని ఒక్కనికే కర్మల ప్రయోజనం లేదు. తదితరులకు ప్రయోజనం ఉంది.) కనుక, నీవు అనాసక్తుడవై సదా కర్తవ్య కర్మను ఆచరించు. కామనాశూన్యుడై కర్మ ఒనర్చే మనుష్యుడు నిశ్చయంగా ముక్తిని పొందగలడు. (గీత: 6–1 చూ:)
వ్యాఖ్య:-
“తస్మాత్” – ఆత్మజ్ఞానం పొందిన మహనీయులకు “పని చేయాలి” అనే నియమం లేదు. కానీ మిగతా వారందరూ కచ్చితంగా పని చేయాల్సిందే. నువ్వు (అర్జునుడు/సాధకుడు) ఇంకా సాధన దశలోనే ఉన్నావు కాబట్టి, కచ్చితంగా పనిని ఆచరించాలి. అయితే పని చేసేటప్పుడు ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి:
- ఆసక్తి లేకుండా: పని మీద మమకారం, బంధం (Attachment) వదిలేసి చేయాలి.
- శాస్త్రబద్ధంగా: మన ఇష్టం వచ్చినట్లు కాకుండా, శాస్త్రం నిర్ణయించిన బాధ్యతలను మాత్రమే నిర్వర్తించాలి.
ఈ రెండు నియమాలు పాటిస్తే, ఆ కర్మకు ఎలాంటి దోషం అంటుకోదు. పైగా అది మోక్షానికి దారి తీస్తుంది. అందుకే కృష్ణుడు అర్జునుడిని ఎప్పుడూ (సతతం) ఇలాగే నిష్కామ కర్మ చేయమని చెప్పారు. ఒకవేళ పని చేయడం వల్ల బంధాలు చుట్టుకునేట్లయితే, దేవుడు అలా చేయమని ఎందుకు చెబుతాడు?
కర్మ రహస్యం:
- ఫలితం మీద ఆశ, మమకారం వదిలేసి పని చేస్తే -> అది మోక్షానికి (పరమ్) దారి తీస్తుంది.
- ఆశతో పని చేస్తే -> అది బంధానికి, సంసారానికి కారణమవుతుంది.
కర్మయోగంలో దాగి ఉన్న అసలైన రహస్యం ఇదే.
మిగతా మార్గాల ద్వారా (జ్ఞాన, ధ్యాన యోగాలు) మోక్షం ఎలా వస్తుందో, కర్మయోగం ద్వారా కూడా మోక్షం అలాగే లభిస్తుందని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పారు. ఫలితం మీద ఆశ లేకుండా కర్మయోగం (అనాసక్త కర్మ) చేయడం వల్ల మనసు శుద్ధి అవుతుంది. ఆ శుద్ధతే మోక్షానికి దారి తీస్తుంది. ‘మనసు పూర్తిగా నిర్మలంగా మారడమే మోక్షం’ అని పెద్దల మాట. స్వార్థం లేని పనులు (నిష్కామ కర్మలు) చేయడం వల్ల ఆ నిర్మలమైన స్థితి కచ్చితంగా దొరుకుతుంది. సాధారణంగా లోకంలో జ్ఞానమార్గం, ధ్యానమార్గం వంటి కఠినమైన పద్ధతులు పాటించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువమందికి కర్మమార్గం, భక్తిమార్గం అయితేనే సులభంగా ఆచరించడానికి వీలుగా ఉంటాయి. అందుకే భగవంతుడు గీతలో కఠినమైన మార్గాలతో పాటు.. సామాన్యులకు సులభంగా అందుబాటులో ఉండే ఈ రెండు మార్గాలను కూడా బాగా ప్రోత్సహించారు.
పొరుగు ఇంట్లోని ఒక స్త్రీ రోజూ మాతృదేవి శారదా దేవి వద్దకు వచ్చేది. మధ్య వయస్కురాలైన ఆమె ఒక వితంతువు. ఒక రోజు మధ్యాహ్నం వచ్చి మాతృదేవితో తనకుటుంబ సమస్యల నన్నిటినీ ఏకరువుపెట్టింది. “ఏం చేయనమ్మా! కుటుంబం వదలిపెట్టి వెళ్లగలనా ఏమిటి? మీ విషయమే తీసుకోండి. మీరు రాధూను వదలుకోగలరా? వదలి మీరు జీవించగలరా!”
మాతృదేవి ముఖారవిందాన చిరునవ్వు తళుక్కుమంది. ఆమె నవ్వుతూనే, “నావిషయం వదిలిపెట్టు” అన్నారు. మాతృదేవి చిరునమ్వా, ఆమె జవాబు అక్కడ ఉన్నవారిలో ఒక కొత్త బాధను కలిగించింది. ఆ సమయంలో ఎవరూ ఏమీ ప్రస్తావించలేదు. రాత్రి భోజనానంతరం ఈ విషయం ప్రస్తావించినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“వారికి ఏం అర్థమవుతుంది? రాధూను నేను వదలుకోలేనని చెబుతున్నది.పుట్టినింటిని చూచుకోవాలి కదా! అందుకే తల్లితండ్రులు, సోదరీ సోదరులు, భార్య అంటూ ప్రత్యేకించి ప్రతి ఒక్కటీ చేయవలసివుంది! ఎవరికీ ఋణపడకూడదు!లేకపోతే ఈ రాధూ, ఈమె, ఆమె వీళ్లందరూ నా కెవరు? స్వయంగా గురుదేవులే తమ తల్లికి సేవ చేయలేదా! రాంలాల్కు కాళికాలయంలో పని ఇప్పించ లేదా?”
ఒక భక్తురాలు: అలా అయితే నిజంగా మీరు ఎవరిని మీ సొంతంగా భావిస్తారు?
మాతృదేవి: కథామృతంలో “అంతరంగ భక్తులు” అని నువ్వు చదవలేదా? గురుదేవులకు గాని, నాకు గాని నిజమైన సొంతం – భక్తులూ, భక్తురాండ్రే!
భక్తురాలు: అదెలాగమ్మా?
మాతృదేవి: ఏం? అర్థంకాలేదా? (భక్తురాలి హృదయం చూపిస్తూ) ఇక్కడ ఉంటున్నది ఎవరు?
భక్తురాలు: మీరు.
మాతృదేవి: (తమ హృదయం చూపిస్తూ) ఇక్కడ ఉంటున్నది మీరు. ఇదొకరకమైన ఆకర్షణ. కానీ దీన్లో మాయ లేదు. ఈ ఆకర్షణ వల్లనే పదేపదే వచ్చి పోవాల్సి వుంది. అర్థమయిందా?’
భక్తురాలు: అవునమ్మా.
మాతృదేవి: ఇక వెళ్లు! వెళ్లి నిద్రపో! వ్రాసివుంచుకుంటావు కదా!
భక్తురాలు: ఇదిగో! వెళ్లగానే వ్రాసుకుంటాను.
మాతృదేవి: ప్రపంచంలో వేరెవరూ నీకు సొంతమయిన వారు లేరని ఒక రోజు నీకు తెలిసివస్తుంది. నిజానికి ఈ ఆకర్షణ ఏమిటో అప్పుడు నీకు చక్కగా అర్థమవుతుంది.
(మూలం: శ్రీ శారదా దేవి వచనామృతం)